డ్వాక్రా వ్యవస్థను నాశనం చేశారు | Chandrababu Naidu destroyed the Dwcra system | Sakshi

డ్వాక్రా వ్యవస్థను నాశనం చేశారు

May 15 2015 4:02 AM | Updated on Jul 25 2018 4:09 PM

‘‘రైతుల వ్యవసాయ రుణాలతోపాటు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారు.

* చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
* నాలుగోరోజు రైతు భరోసా
* యాత్రలో రెండు రైతు కుటుంబాలకు పరామర్శ

 
అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతుల వ్యవసాయ రుణాలతోపాటు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారు. తానలా అనలేదనీ, కేవలం రూ.10 వేలే ఇస్తానని చెప్పానని బుకాయిస్తున్నారు. గోబెల్స్ తరహాలో అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పదివేలు కూడా ముష్టి వేసినట్టు ఏడాదికి రూ.3 వేలచొప్పున మూడు విడతలుగా ఇస్తారంట.
 
అది వడ్డీకి కూడా సరిపోదు. వడ్డీలేని రుణాలు పొందే డ్వాక్రా మహిళలు చంద్రబాబు పుణ్యమా అని ఇప్పుడు రూపాయిన్నర, రెండు రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తోంది. డ్వాక్రా సంఘాల వ్యవస్థను బాబు నాశనం చేశారు’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర నాలుగోరోజైన గురువారం గుంతకల్లు నియోజకవర్గంలో సాగింది. నియోజకవర్గంలోని నల్లదాసరపల్లి, తిమ్మారంలో ఆత్మహత్య చేసుకున్న ఉసేనప్ప, పుల్లయ్య కుటుంబాలకు ఆయున భరోసానిచ్చారు. అక్కడి నుంచి వజ్రకరూరు మీదుగా ఉరవకొండకు చేరుకున్నారు.
 
 ఒక్క హామీ నెరవేర్చలేదు...
 డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పావలావడ్డీకే రుణాలు ఇచ్చి లక్షాధికారులుగా చేయాలని దివంగత నేత వైఎస్‌ఆర్ ఆశిస్తే... ఇప్పుడు చంద్రబాబు రుణవూఫీ చేయకపోవడంవల్ల ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిమ్మాపురం గ్రామంలో మహిళలతో ఏర్పాటు చేసిన మాటామంతీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాము తెచ్చుకున్న డ్వాక్రా రుణా ల్లో బాబు ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని మహిళలు మండిపడ్డారు. ఈ వుహిళల ఆవేదన వినైనా చంద్రబాబుకు ఎన్నికల మందు ఇచ్చిన హామీలు గుర్తుకు రావాలని జగన్ చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే విధంగా ఆందోళనలు చేపడదామని పిలుపునిచ్చారు. ఎన్నికల వుుందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి నిజాయితీగా బతకాలని హితవు పలికారు. లేదంటే అమలుచేయలేని హామీలు ఇచ్చి మోసం చేశానని అంగీకరించాలని జగన్ డిమాండ్ చేశారు.  
 
చంద్రబాబుపై మండిపడ్డ డ్వాక్రా మహిళలు
షలీంబాను: మాది గుంతకల్లు. 5వ వార్డులో ఉంటాను. 5 లక్షల రుణం తీసుకున్నాను. ఇంకా 2.5 లక్షల రుణం ఉంది. తప్పుడు మాటల వల్ల మేం ఆరు నెలలు రుణం కట్టలే. ఇప్పుడు దీనికి వడ్డీ 85 వేలు అయింది. నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు క్షమాపణ చెప్పాలే. ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోవాలె.  
 
జగన్: చంద్రబాబు ఇప్పుడు రూ.10 వేలు  ఇస్తానంటున్నాడుగా?
షలీంబాను: మాకు ఏడాదికి 3 వేలు ఇచ్చేది ఏంది? మేమే కావాలంటే రూ.10 వేలు ఇస్తాము. సరైన సీఎం అయితే మా ముందుకు వచ్చి మాట్లాడాలె.
లక్ష్మీనారాయణమ్మ: మాకు 2 ఎకరాల పొలం ఉంది. దీని కింద రూ.14 వేల రుణం తీసుకున్నాం. ఈ రుణం మాఫీకాలే. డ్వాక్రా రుణం రూ. 5 లక్షలు తీసుకున్నాం. రుణమాఫీ అవుతుందని రుణాలు కట్టలేదు. 3 నెలలు కట్టలేదు. దీనికి రూ.45 వేలు వడ్డీ అయింది.
 
జగన్: రూ.  5లక్షలకు మూడు నెలలు కట్టకపోతే రూ.45 వేల వడ్డీ అయిందా?
లక్ష్మీనారాయణమ్మ: అవును సార్. గ్రూపులో కొద్దివుంది ఈ వడ్డీలు కట్టలేం. యూడి నుంచి తెచ్చి కట్టాలా అని వెళ్లిపోయినారు.

జగన్: గ్రూపు నుంచే వెళ్లిపోయారా?
లక్ష్మీనారాయణమ్మ: అవును  సార్. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పావలావడ్డీ వస్తుండే. అందుకే ఆయన ఫోటో పెట్టుకుని దేవునిలాగా పూజిస్తాం సార్.   
 
జగన్: నీపేరు ఏంటమ్మా? మీది ఏ గ్రూపు, ఎంత రుణం తీసుకున్నావు?
లక్ష్మి: నా పేరు లక్ష్మి. మాది గుంతకల్లు. శ్రీలక్ష్మీ గ్రూపు ద్వారా రూ.3 లక్షలరుణం తీసుకున్నాం. చంద్రబాబు మాటలు నమ్మి కట్టలేదు. తర్వాత లోనుకోసం బ్యాంకుకుపోతే పాసుబుక్కులు పక్కకు పెడుతున్నారు. అందుకే నగ, నట్ర తాకట్టు పెట్టి రుణాలు కట్టాం. అయినా ఇప్పుడు కొత్త లోన్లు ఇవ్వమంటున్నారు. చంద్రబాబు విదేశాల మీద మోజుతో ఇక్కడి ప్రజలను మర్చిపోతున్నారు. అటువంటి ఆయన మనకు అవసరమా?  
 
జగన్: ఏమ్మా నీ పేరు ఏంటి?
లీలావతి: నా పేరు లీలావతి అన్నా. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు అబద్దాలు చెప్పినాడు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పినాడు. ఎవరికైనా ఒక్క రూపాయైనా మాఫీ చేసినాడా? గొలుసులు కుదవ బెట్టుకుని నల్లదారాలు వేసుకుని ఉంటున్నాము. మేము ఏం తిని బతకాలి? ఉద్యోగం రాలేదని నా కొడుకు ఇంటిమొకం రాకుండా ఉన్నాడు.
 
జగన్: ఎంత లోను తీసుకున్నావమ్మా?
లీలావతి: లక్షరూపాయలు తీసుకున్నాను. రూ.30 వేలు కట్టినాము. ఇంకా బంగారం లోను రూ. 70 వేలు ఉంది. మాఫీకాలేదు.
 
జగన్: డ్వాక్రా సంఘంలో ఏమైనా లోను తీసుకున్నావా తల్లీ?
లీలావతి: 3 లక్షలు తీసుకునింటిమి. చంద్రబాబు బాధ తాళలేక కట్టేసినాం.
 
రూపాయి కూడా మాఫీ కాలేదు..!
రెండో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం గుంతకల్లు మండలంలోని నల్లదాసరిపల్లిలో కురుబ మశేనప్ప, ఎన్.తిమ్మాపురంలో కసాపురం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. 3.67 ఎకరాల భూమిలో బోర్లకు, వ్యవసాయానికి రూ.4 లక్షలు అప్పుచేశామని, రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. అప్పుల బాధ భరించలేకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని, ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు. ఇద్దరికీ చెరో రూ.50వేలు సాయం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement