
సాక్షి, కాకినాడ : ఏదైనా పరిశ్రమ పరిధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైతే ఆ పరిశ్రమను తక్షణమే మూసివేస్తామని జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి అన్నారు. శనివారం ప్రమాదకర పదార్ధాలు కలిగిన పరిశ్రమల భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, కోరమాండల్, ఎన్ఎప్సీయల్, తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జిల్లాలో ప్రమాదకర పదార్ధాలు కలిగిన 21 పరిశ్రమలు ఉన్నట్లు గుర్తించాము. వారంలోగా ఈ పరిశ్రమలు సేప్టీ ఆడిట్పై నివేదిక ఇవ్వాలి. మాక్ డ్రిల్స్ను నిర్వహించి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఉండే ప్రజలు ఎలా రక్షణ పొందాలనేదానిపై అవగాహన కల్పించాలి. ప్రమాద సమయాలలో వినియోగించే సైరన్ పని చేస్తుందో లేదో తనిఖీ చేయాలి. ప్రమాదాల నుండి బయట పడే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా సహకారం తీసుకోండి. ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం )
ప్రతి పరిశ్రమలో ఉన్న అన్ని యూనిట్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలి. అవి నిరంతరం పని చేయాలి. ఏదైనా ప్రమాదం వాటిల్లితే.. ప్రస్తుత లాక్డౌన్ పరిస్ధితుల వల్ల ఇతర ప్రాంతాల నుండి నిపుణులు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అందువల్ల మనమే ప్రమాదాన్ని త్వరగా నివారించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పరిశ్రమలలో పని చేసే కార్మికులకు పూర్తి భద్రత కల్పించాలి. సోషల్ డిస్టన్స్ పాటించేలా చర్యలు తీసుకోండ’’ని ఆదేశించారు.