ధాన్యం కోనుగోలుకు సన్నద్ధం | Coronavirus: AP Government Ready Collect Grain In East Godavari District | Sakshi

ధాన్యం కోనుగోలుకు సన్నద్ధం

Published Wed, Apr 8 2020 8:39 AM | Last Updated on Wed, Apr 8 2020 8:39 AM

Coronavirus: AP Government Ready Collect Grain In East Godavari District - Sakshi

మండపేటలో ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కిస్తున్న దృశ్యం

సాక్షి, కాకినాడ: జిల్లాలో ధాన్యం సేకరణకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 272 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలుకు చేయనున్నట్లు జేసీ ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాటు కలి్పంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించడంతో కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో 1,64,882 హెక్టార్లు పంట సాగైంది. 14.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 14.10 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి రాగా.. ఈ ఏడాది సకాలంలో పంటలకు ప్రభుత్వం నీరు అందించడంతో 40 వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా దిగుబడి అందే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఎకరానికి 40 నుంచి 45, 50 బస్తాల వరకు దిగుబడి అందుతుందన్న ఆశాభావం రైతుల నుంచి వ్యక్త మవుతోంది.  

  • జిల్లా పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ నెల 10వ తేదీ నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 272 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 
  • పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 246, డీసీఎంఎస్‌ 6, డ్వాక్రా సంఘాల ద్వారా 20 కొనుగోలు కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కలాల్లోనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిల్లుల యజమానులు సీఎంఆర్‌ ఆడించి ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. రబీ సాగులో 35 శాతం బొండాలు పండించారు. దీంతో అయిదు లక్షల టన్నుల వరకూ బొండాలు రకం ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా వీటన్నింటినీ కొనుగోలు చేయనున్నారు.
  • జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 11,69,549 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.   
  • ఈ ఏడాది సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.1815 ఎంఎస్‌పీ ఉంది. ఏ గ్రేడ్‌ రకానికి రూ.1835గా ప్రకటించారు. 35.03 లక్షల గోనె సంచులను సిద్ధం చేస్తున్నారు. కలాల్లోనే పాత విధానంలోనే ధాన్యం సేకరించనున్నారు. ఈ మేరకు యంత్ర సామగ్రిని కూడా సిద్ధం చేశారు. 
  • నిబంధనలు సడలింపు ‘కోవిడ్‌–19’ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అన్ని రకాల ఉత్పత్తులు, రవాణా సౌకర్యాలు స్తంభించాయి. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించింది. రైతులకు ఎలాంటి నష్టం  వాటిల్లకుండా చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ పనులు, ధాన్యం ఎగుమతులు, దిగుమతులకు, నూరి్పళ్లకు లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కలి్పస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో  రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

రవాణాకు అవరోధం లేకుండా చూస్తాం
ధాన్యం సేకరణకు సన్నద్ధం అవుతున్నాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే సింహభాగం పూర్తి చేశాం. ఈ నెల రెండో వారంలో ప్రక్రియ ప్రారంభిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటాం. ధాన్యం రవాణాలో ఎటువంటి అవరోధం లేకుండా చూస్తాం. వ్యవసాయ పనులు యథావిధిగా జరుపుకునేలా చూస్తున్నాం. అయితే పొలాల్లో సైతం సామాజిక దూరం పాటించాల్సి ఉంది.            – డాక్టర్‌ జి.లక్ష్మీశ, జేసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement