డ్రోన్ సర్వేపై గందరగోళం | Sakshi
Sakshi News home page

డ్రోన్ సర్వేపై గందరగోళం

Published Tue, Feb 2 2016 4:47 AM

డ్రోన్ సర్వేపై గందరగోళం - Sakshi

విజయవాడ : నగర గగనతలంపై డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. నగరంలోని వీధులు మొదలుకొని ఇళ్ల లెక్కింపు వరకు అన్నింటిని డ్రోన్లలో అమర్చిన కెమెరాల్లో నగరపాలక సంస్థ అధికారులు బంధిస్తున్నారు. వాటి ఆధారంగా భారీగా సొమ్ము చేసుకునే యత్నాల్లో ఉన్నారు. దీని కోసం ముందస్తుగా రూ.5.60 కోట్లు ఖర్చు పెట్టడానికి అంగీకారం కుదుర్చుకోవటంఇప్పుడచర్చనీయాంశమైంది. నగర సగటు జీవికి డ్రోన్లపై కనీస అవగాహన లేదు. కానీ నగరపాలక సంస్థ అధికారులు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో దీనిని నిర్వహిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారి ప్రతిపక్షాలు, అధికారుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంద అసెస్‌మెంట్ నంబర్ల నూరు శాతం గుర్తింపే లక్ష్యం...
 విజయవాడ రాష్ట్ర రాజధాని నగరంగా మారింది.ఈ క్రమంలో నగరంలో జనాభా రోజురోజుకీ పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో ఉన్న ఇళ్ల సంఖ్యకు, ఇంటి పన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యకు కొంత వ్యత్యాసం ఉందనేది నగరపాలక సంస్థ అధికారుల అభిప్రాయం. దీంతో అన్ని ఇళ్లను గుర్తించి, అసెస్‌మెంట్లు సమగ్రంగా పరిశీలిస్తే ఇళ్ల సంఖ్య, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరిగే అవకాశముందనేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది.

అనుకున్నదే తడవుగా నగరంలో డ్రోన్ సర్వేకు గత ఏడాది అక్టోబర్‌లో తెర తీశారు. అసెస్‌మెంట్ నంబర్లను నూరు శాతం గుర్తించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దీనిపై అధ్యయనం చేసి డ్రోన్ సర్వే ఫలితాలు తెలుసుకున్న నగర కమిషనర్ వీరపాండియన్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే అంతా సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. సింగపూర్‌కు చెందిన పేజ్ యూఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ చేయటానికి ముందుకొచ్చి రూ.5.60 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు అందించగా, బీవోటీ ప్రాతిపదికన సదరు కంపెనీతో గత ఏడాది నవంబర్ 23న ఒప్పందం చేసుకున్నారు

Advertisement
Advertisement