- కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆర్చిలకు అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలు
- వాహన సేవ ఉండడంతో వద్దని వారించిన గ్రామస్తులు, భక్తులు
- వెనుదిరిగి గంట తర్వాత ధర్నాకు దిగిన టీడీపీ
తిరుపతి రూరల్, న్యూస్లైన్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన దేవుని ఆర్చిలు, కటౌట్లకు అడ్డంగా టీడీపీ నాయకులు పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. తుమ్మలగుంట తెలుగుతల్లి కూడలి వద్ద టీడీపీ నాయకులు రాత్రి 7గంటల సమయంలో ఆ పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, భక్తులు దేవుని కటౌట్లకు అడ్డంగా ఫ్లెక్సీలు తొలగించాలని టీడీపీ నాయకులను కోరారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కూడా టీడీపీ నాయకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మరోగంటలో గరుడవాహన సేవ ఉందని, రాత్రి పదిగంటల తర్వాత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోండని గ్రామస్తులు చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం నిర్వహణ కోసం రెండు రోజుల క్రితమే అన్ని పార్టీల ఫ్లెక్సీలు తొలగించామని చెప్పారు. అడ్డంగా వచ్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మంచిది కాదని గ్రామస్తులు పేర్కొన్నారు.
వెనుదిరిగిన టీడీపీ నేతలు
అరగంటపాటు సర్దిచెప్పడంతో ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నాయకులు ఒప్పుకున్నారు. గ్రామస్తులు, టీడీపీ నాయకులు కలసి ఫ్లెక్సీలను తొలగించారు. ఆటోలో తీసుకెళ్లిన టీడీపీ నాయకులు గంట తర్వాత తిరిగివచ్చి శ్రీచాముండేశ్వరి ఆలయం కూడలి వద్ద ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఫ్లెక్సీలు తొలగించారని ధర్నా చేశారు. గంట తర్వాత తిరిగి వచ్చి ధర్నా చేయడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ఉత్సవాన్ని కూడా రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని, ఫ్లెక్సీల తొలగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని గ్రామపెద్దలు పేర్కొన్నారు.
గంటతర్వాత ఎందుకొచ్చారు
ఫ్లెక్సీలు తొలగించాలని సర్దిచెప్పడంతో వెనుదిరిగిన టీడీపీ నాయకులు గంట తర్వాత తిరి గివచ్చి ధర్నా చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై రాజకీయ ఆరోపణలు చేస్తుండడంతో ఈ పని కూడా ఆ నాయకుడిదేనని గ్రామస్తులు మండిపడ్డారు.
టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి
గ్రామంలో దేవుడి ఉత్సవం జరిగేటప్పుడు టీడీపీ నాయకులు కావాలనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గొడవకు లాగే ప్రయత్నం చేశారు. దేవుడితో పెట్టుకుంటే ఎలాంటి వారైనా ఫలితం అనుభవిస్తారు. గ్రామంలో దేవుడి ఉత్సవం జరుగుతుంటే అడ్డంగా పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మంచిది కాదు. లక్షల రూపాయలు వెచ్చించి దేవుడి ఆర్చిలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశాం. వాటికి అడ్డంగా పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయూలనుకున్నవారికి పాపం చుట్టుకుంటుంది. రాజకీయ కారణాలతో ముద్డుకృష్ణమనాయుడు టీడీపీవారిని గొడవలకు పంపుతున్నారు. అన్నీ దేవుడే చూస్తున్నాడు. కచ్చితంగా ఫలితం అనుభవిస్తారు.
-గోవిందరెడ్డి, ఉప సర్పంచ్, తుమ్మలగుంట