
సాక్షి, చిత్తూరు : జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో అధికారులు.. సర్కార్ బడి పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు. బడికి వెళ్లి శ్రద్ధగా చదువుకోవాల్సిన వాళ్లను ఎండలో తిప్పుతూ జన్మభూమి ప్లెక్సీలు కట్టిస్తున్నారు. తరగతి గదిలో ఉండాల్సిన వాళ్లతో బండచాకిరీ చేయిస్తూ.. జన్మభూమి కూలీలుగా, టీడీపీ కార్యకర్తలుగా మారుస్తున్న వైనం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలో ఆరో జన్మభూమి కార్యక్రమం నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ఉపాధ్యాయులు జన్మభూమి కార్యక్రమ పనులు చేయించారు. వారితో పలుచోట్ల ప్లెక్సీలు కట్టించారు. ముఖ్యమంత్రి మెప్పుపొందడానికి బడిపిల్లలను ఇబ్బందులకు గురిచేయడం పలువురిని విస్మయం పరుస్తోంది.
సీఎం చంద్రబాబు ఒకవైపు బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి.. అంటుంటే, ఆయన అధికారులు మాత్రం బడిపిల్లలతో అధికార కార్యక్రమాల్లో చాకిరీ చేయిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment