
గుట్టుగా పసికందు విక్రయం
మూడు నెలల పసి బాలుడ్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించిన ఉదంతంపై అధికారులు మంగళవారం
అధికారుల రిస్కీ ఆపరేషన్తో వెలుగు చూసిన వైనం
విచారణ చేపట్టిన పోలీసులు
నాయుడుపేటటౌన్ : మూడు నెలల పసి బాలుడ్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించిన ఉదంతంపై అధికారులు మంగళవారం మండలంలోని కారుమంచివారికండ్రిగలో విచారణ చేపట్టారు. సీడీపీఓ ప్రమీలారాణి తెలిపిన వివరాల మేరకు.. కారుమంచివారికండ్రిగకు చెందిన తీపలపూడి బాబయ్య, కృష్ణమ్మ దంపతుల ఒక్క కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో వారు ఈ నెల 2న నాయుడుపేట నుంచి మూడు నెలల బాలుడ్ని ఎక్కడి నుంచో గ్రామానికి తీసుకొచ్చినట్లుగా అధికారులకు సమాచారం అందింది. విషయం అధికారులకు తెలియడంతో ఐసీడీఎస్ సీడీపీఓ ప్రమీలారాణి, జిల్లాల బాలల సంరక్షణ అధికారి సురేష్, పోలీసుల కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు.
బాలుని తల్లి చిత్తూరు జిల్లాకు చెందిన జూలేఖాగా గుర్తించారు. ఈమె నాయుడుపేటలోని తమ బంధువుల ద్వారా బాలుడ్ని విక్రయించినట్లు నిర్ధారించారు. బాలుని విక్రయ విషయంలో పట్టణానికి చెందిన ముంతాజ్, ఓ ప్రైవేటు వైద్యశాలలో పని చేసే లక్ష్మీకాంతమ్మ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. బాలుడ్ని బాబయ్య దంపతులు రూ.70 వేలకుపైగా నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా వెల్లడైంది. పట్టణంలోని ముంతాజ్ స్వగృహానికి పోలీసులు వెళ్లగా అప్పటికే ఆమె పరారయ్యారు.
ముగ్గురుపై కేసు నమోదు
సీడీపీఓ ప్రమీలారాణి ఫిర్యాదు మేరకు బాబయ్య, కృష్ణమ్మ దంపతులు, బాలుని తల్లి జూలేఖాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడ్ని నెల్లూరులోని ప్రభుత్వ శిశువిహార్కు తరలిస్తున్నామని ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు.