Integrated Child Development Services (ICDS)
-
అక్షరాభ్యాసం చేయుంచిన మహిళా మంత్రి
సాక్షి, కొవ్వూరు: ఐసీడీఏస్ కొవ్వూరులోని లిటరి క్లబ్లో పోషక పదార్థాలు కలిగిన తినుబండారాల స్టాల్ను నిర్వహించింది. ఓఎన్జీసీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ స్టాల్లో ఐసీడీఎస్ వివిధ రకాల పోషకాహర పదార్థాలను ఏర్పాటు చేసింది. గర్భిణి స్ర్తీలకు, పిల్లలకు పోషక పదార్థాలు అందేలా చూసి, వారికి అవగాహన కల్పించడంమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మంత్రి తానేటి వనిత స్టాల్స్ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడి విద్యార్థులకు తన చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించి ఆనంతరం ఆమె పిల్లలకు స్కూల్ బ్యాగ్లను, పలకలను పంపిణీ చేశారు. -
అందినంతా తిన్నారు!
మంకమ్మతోట(కరీంనగర్): ఐసీడీఎస్లో అక్రమాల పర్వం బట్టబయలైంది. గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసే పౌష్టికాహారం మాయమైంది. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం, న్యూట్రీషియన్ పౌడర్ సరఫరా చేయకుండానే బిల్లులు కాజేశారు అధికారులు. దాదాపు 60 బిల్లుల్లో కోట్లాది రూపాయలు మింగేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతల కోసం పౌష్టికాహారం అందజేస్తున్నారు. అయితే వీటిని కేంద్రాలకు సరఫరా చేయకుండానే బిల్లులు కాజేసినట్లు ఐసీడీఎస్ కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆడిట్ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆడిట్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ప్రాజెక్టులకు గతంలో కరీంనగర్ నుంచే పౌష్టికాహారం, న్యూట్రిషీయన్ పౌడర్ సరఫరా చేసేవారు. ఈ వ్యవహారం అంతా జిల్లా పీడీ, సీడీపీవోల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరాలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో కరీంనగర్లోని పీడీ కార్యాలయంలో ఆడిట్ అధికారులు రికార్టులు పరిశీలించారు. 2011 నుంచి 2015 వరకు లోకల్ఫుడ్, 2015 నుంచి 2018 వరకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం సరఫరాలోజగిత్యాల, మెట్పల్లి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ సమయంలో ఉమ్మడి జిల్లా పీడీలుగా రాములు, మోహన్రెడ్డి వ్యవహరించారు. 60 బిల్లులు రూ.2.15కోట్లు రాములు, మోహన్రెడ్డి పీడీలుగా ఉన్న సమయంలో ఆరోగ్యలక్ష్మి పథకానికి సంబంధించిన మొత్తం 85 బిల్లులు చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి పౌష్టికాహారం సరఫరా చేయకుండానే రూ.2.15కోట్లు చెల్లించినట్లు 60 బిల్లులు చేశారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందగా.. గతంలోనే విచారణ చేసిన అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. దీంతో నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో ఆడిట్ నిర్వహిస్తున్నారు. గతంలో కరీంనగర్రూరల్, సుల్తానాబాద్, పెద్దపల్లి, భీమదేరవరపల్లి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిని సీరియస్గా తీసుకున్న అధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ప్రాజెక్టుల రికార్డులను కరీంనగర్ పీడీ కార్యాలయంలో పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా గతంలో వచ్చిన ఫిర్యాదులు నిర్ధారణవడంతో అన్ని ప్రాజెక్టుల రికార్డులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎన్పీలోనూ.. ప్రభుత్వం సరఫరా చేసే ఆహార పదార్థాలతోపాటు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఎస్ఎన్పీ (స్పెషల్ న్యూట్రీషియన్ ఫుడ్) సరఫరా చేస్తుంటారు. వీటి సరఫరాలోనూ పీడీ, సీడీపీవోలతోపాటు పైస్థాయి అధికారులు దాదాపు రూ.5కోట్ల బిల్లులు కాజేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయంపై 2014లోనే ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి. వీటిపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ చర్చించారు. ప్రస్తుతం వీటిపై కూడా ఆడిట్ చేస్తున్నారు. మెట్పల్లిలో బూడిదైన రికార్డులు మెట్పల్లి ప్రాజెక్టులో 2009–2012 కాలంలో పౌష్టికాహారం సరఫరా వివరాలు ఇవ్వాలని సమాచారహక్కు చట్టం కింద పలువురు దరఖాస్తు చేసుకున్నారు. సరఫరా చేయకుండానే బిల్లులు కాజేయడంతో వివరాలు ఇస్తే దొరికిపోతామనే భయంతోనే రికార్డులు కాల్చి బూడిద చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే కార్యాలయంలో రికార్డులు లభించకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతుంది. అధికారులు అండదండలతోనే కింది స్థాయి సిబ్బంది రికార్డులను కాల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఆ పాలు తాగలేం బాబూ!
సాక్షి, హైదరాబాద్: ‘కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది’అన్నట్లుగా ఉంది అంగన్వాడీ సెంటర్ల తీరు. గతంలో పాలు పల్చగా ఉంటున్నాయి, లబ్ధిదారులకు అందకుండా పక్కదారి పడుతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం విజయ ప్యాకెట్ పాలు పంపిణీ చేస్తుండగా, వాటిని తాగడానికి చాలా మంది ఇష్టపడటం లేదని ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైంది. సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ద్వారా గర్భిణులకు, పిల్లలకు అందించే పాలు పక్కదారి పట్టకుండా, కల్తీ కాకుండా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెట్రా ప్యాకెట్లలో పాలను అందిస్తోంది. అయితే ప్రస్తుతం అమలవుతున్న ఈ విధానం సైతం విమర్శల పాలవుతోంది. ఆ పాలను పిల్లలతో పాటు బాలింతలు తాగలేకపోతున్నారు. ఈ ప్యాకెట్ పాల నుంచి వాసనరావడం, తొందరగా పాడవుతుండటం, రుచి లేకపోవడంతో తాగడానికి విముఖత చూపుతున్నారు. దీంతో వృథాను, సిబ్బంది చేతివాటాన్ని అరికట్టడానికి తీసుకున్న ఈ నిర్ణయంతో ఫలితం లేకుండా పోయిందనే విమర్శలొస్తున్నాయి. పోషకాహార మాసంలో వెలువడిన ఒక సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో చాలా మంది గర్భిణులు రక్తహీనతతో, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఒక పూట పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్వాడీలు సంపూర్ణ ఆహారం అందించడంలో విఫలమవుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్యాకెట్లతోనే తంటా.. ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా ఒక్కో ప్యాకెట్ పాలు 500 మి.లీ.పరిమాణంలో ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే ఒక్కొక్కరికి 200 మి.లీ. పరిమాణంలో అందించాల్సి ఉండటంతో, ప్యాకెట్ను చించి ఇద్దరికి సరఫరా చేయాల్సి వస్తోంది. ఒక్కసారి ప్యాకెట్ తెరిచిన తరువాత గంట వ్యవధిలోనే పాలు పాడవుతున్నాయి. ఒక్కో కార్టన్ డబ్బాలో పదిలీటర్ల వరకు పాలప్యాకెట్లు రాగా ఒక్కోసారి పాలన్నీ పాడవుతున్నాయి. దీంతో సిబ్బంది ముందుగానే గుర్తించి పారబోస్తున్నారు. రసాయనాలు మొదలైన వాటితో తయారవుతాయనే ఉద్దేశంతో ప్యాకెట్ పాలు తాగడానికి విముఖత చూపుతూ కొంతమంది అసలు పాలప్యాకెట్లనే తీసుకోవడం లేదు. దీంతో స్త్రీ, శిశు పోషణకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నీరుగారిపోతోంది. రెండు మూడు విడతలుగా మేలు నిర్ణీత ప్రమాణాలతో ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసిన పాలే అయినప్పటికీ ఎక్కువకాలం నిల్వ ఉండటం లేదు. నెలలో అవసరమైన అన్ని ప్యాకెట్లను ఒకేసారి కేంద్రాలకు తరలించడం వల్ల ఆ పాలు మాసాంతం ఉండటం లేదు. అలాకాకుండా నెలలో రెండు మూడు విడతలుగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తే ప్రయోజనం ఉంటుందని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. పాలు తీసుకునేందుకు ఇష్టపడటంలేదు ఒక్కోసారి పాలన్నీ చెడిపోతున్నాయి. దీంతో చేసేదేంలేక వాటిని బాలింతలకు పంపిణీ చేయకముందే పారబోస్తున్నాం. కొంత మంది వీటిని తీసుకోవడానికి అయిష్టత చూపుతున్నారు. నెలకు కావల్సిన ప్యాకెట్లన్నీ ఒకేసారి కాకుండా విడతలవారీగా అందజేస్తే బాగుంటుంది. – కె.వింధ్యారాణి, అంగన్వాడీ కార్యకర్త ‘హాకా’ ద్వారా పంపిణీ చేయాలనుకుంటున్నాం పాలను ప్యాకెట్ల ద్వారా అందించడం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న విధానం. అన్ని ప్రమాణాలతో పూర్తిగా ప్రాసెస్ అయ్యి ధ్రువీకరించిన తర్వాతే పంపిణీ చేస్తారు. పాలు పాడైతే రీప్లేస్ చేస్తాం. విజయడెయిరీ టెట్రా ప్యాకెట్ పాలు బాలింతలు, పిల్లలు తాగడం లేదని అంగన్వాడీల ద్వారా మా దృష్టికి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం హాకా అనే నోడల్ ఏజెన్సీ ద్వారా పాలు సరఫరా చేసే ఆలోచనలో ఉంది. అయితే ఫినోప్యాక్స్ ద్వారా సరఫరా చేయడంకంటే బ్రిక్ ప్యాక్స్ ద్వారా పంపిణీ చేయాలనుకుంటున్నాం. ఈ విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – విజయేందిర బోయి, ఐసీడీఎస్ సంచాలకులు బిల్లులు రావు.. ఈ చిత్రంలోని అంగన్వాడీ కేంద్రం మానుకోట మండలం పత్తిపాక గ్రామంలోని అద్దె భవనంలో నడుస్తోంది. దీన్ని నెలకు రూ.500తో అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. గత ఆరునెలలుగా బకాయిలు రాకపోవడంతో అంగన్వాడీ టీచర్లే తమ సొంత జీతంలో నుంచి కడుతున్నారు. పాలు వాసన వస్తున్నాయి అంగన్వాడీ కేంద్రంలో ప్యాకెట్లో వచ్చే పాలను వేడి చేసి ఇస్తున్నారు. కానీ అవి ఎర్రగా, తాగుతుంటే వాసన వస్తున్నాయి. ఒకసారి ఆ పాలను ఇంటికి తీసుకెళ్లి తాగుదామనుకునేలోపు ప్యాకెట్ పగిలిపోయి భరించలేని దుర్వాసన వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం టెట్రా ప్యాకెట్ పాలకు బదులు వేరే పాలు ఇవ్వాలి. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం ప్యాకెట్లు ఇవ్వడం లేదు. కోడిగుడ్లు కూడా నెలకు ఎనిమిది మాత్రమే ఇస్తున్నారు. –బండారి శ్యామల, నెల్లికుదురు, మహబూబాబాద్ -
పెళ్లి వేడుకపై ప్రతిష్టంభన
కర్నూలు, తుగ్గలి: మండలంలోని బొందిమడుగుల గ్రామంలో శుక్రవారం జరుగనున్న పెళ్లిపై ప్రతిష్టంభన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొందిమడుగుల గ్రామానికి చెందిన దళితుడు రాజుకు తుగ్గలికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి కుమార్తెకు వయసు లేదంటూ తహసీల్దార్ రామకృష్ణకు కొందరు సమాచారమివ్వడంతో ఆయన ఐసీడీఎస్ అధికారులను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో గురువారం పెళ్లి కూతురు వయసుపై తుగ్గలి పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి విచారణ చేపట్టారు. పెళ్లి కుమార్తె ఆధార్ కార్డు ప్రకారం అమ్మాయి వయసు తక్కువగా ఉందన్నారు. కాగా పెళ్లి కూతురు హైదరాబాద్లో 10వ తరగతి పూర్తి చేసిందని, అందుకు సంబంధించి పత్రాలను వారి కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు. ఆధార్కార్డు, స్టడీకి సంబం«ధించిన పత్రాలో పెళ్లి కూతరు వయసు వ్యత్యాసం ఉండడంతో జిల్లా చైల్డ్లైన్ ఆఫీసర్ విచారణ చేసి నిర్ణయం చెబుతారని ఐసీడీఎస్ సూపర్వైజర్ తెలిపారు. అధికారులు వధువు వయసును నిర్ధారించాల్సి ఉంది. పెళ్లిపై ప్రతిష్టంభన కొనసాగడంతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెళ్లి వేడుక సమస్యాత్మకంగా మారుతుందని పసిగట్టిన పోలీసులు బొందిమడుగుల గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డోన్ డీఎస్పీ ఖాదర్బాషా ఆధ్వర్యంలో పత్తికొండ, బేతంచెర్ల సీఐలు భాస్కరరెడ్డి, కంబగిరి రాముడు, తుగ్గలి, జొన్నగిరి, పత్తికొండ, దేవనకొండ ఎస్ఐలు పులిశేఖర్, సతీష్కుమార్, మారుతి, శ్రీనివాసులు, గంగయ్యయాదవ్తో పాటు 50మందికి పైగా బందోబస్తు చర్యలు చేపట్టారు. -
కవలల్ని విడదీసిన తల్లిదండ్రులు
ఇబ్రహీంపట్నం : ఆడబిడ్డను సాకలేమని 13 రోజుల శిశువును తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మంచాల మండలం వెంకటేశ్వర తండాకు చెందిన ఆ శిశువు తల్లిదండ్రులకు (పేర్లు వెల్లడించేందుకు నిరాకరణ) అంతకు ముందు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. మూడో కాన్పుల్లో అడ, మగ కవల పిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది. కవలల్లో మగ పిల్లాడిని ఉంచుకొని, ఆడపిల్లను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. నలుగురిని సాకే ఆర్థిక స్థోమత తమకు లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆడ శిశువును ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి శాంతిశ్రీకి అప్పగించారు. ఆ శిశువును నగరంలోని శిశువిహార్కు తరలించినట్లు శాంతిశ్రీ తెలిపారు. తమ వివరాలు వెల్లడించవద్దని ఆ కుటుంబసభ్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 1 -
ఐసీడీఎస్ కార్యాలయంలో పేలిన సెల్ఫోన్
వీరఘట్టం విజయనగరం : అంగన్వాడీ కేంద్రాల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం అందించిన స్మార్ట్ఫోన్ పేలిపోయింది. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైన అంగన్వాడీ కార్యకర్తలు ఉరుకులు పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో సమావేశం ఉండటంతో అంగన్వాడీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సూపర్ వైజర్ రాకపోవడంతో చేబియ్యంవలస అంగన్వాడీ కార్యకర్త ఎం.వెంకటమ్మ ప్రభుత్వం అందించిన స్మార్ట్ఫోన్లో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సమయంలో ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పొగలు రావడంతో వెంటనే విసిరేశారు. తర్వాత పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయిందని ఆమె తెలిపారు. దూరంగా విసిరేయడంతో ప్రమాదం తప్పిందని వివరించారు. ఆరు నెలల కిందట వీరఘట్టం ప్రాజెక్టు పరిధిలోని 143మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం కార్బన్ స్మార్ట్ఫోన్లను అందజేసింది. వీటిలో అంగన్వాడీ కేంద్రాల సమాచారం, కేంద్రాల పరిధిలో ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలతో పాటు కేంద్రంలో ఉన్న స్టాకు వివరాలు మొబైల్లో నమోదు చేయాలి. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఈ ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో సంఘటన జరగడంతో ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లు ఉపయోగించేందుకు మిగిలిన అంగన్వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు. -
బతికేదెలా?
చిన్నారుల ఆలనా.. పాలనా చూసే అంగన్వాడీ కేంద్రాల సక్రమ నిర్వహణను పర్యవేక్షించే లింక్ సూపర్వైజర్లను ప్రభుత్వం ఇంటికి పంపింది. బాబు వస్తే జాబు వస్తుందని.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ తీరా గద్దెనెక్కాక ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడంతో వారు నిశ్చేష్టులయ్యారు. ఇకపై తమ జీవనం సాగెదెలా అని మదనపడ్డారు. తమ బాధలు చెప్పుకోవడానికి కలెక్టరేట్కు తరలివచ్చారు. చిత్తూరురూరల్: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడిచే అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే లింక్ సూపర్వైజర్లను తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు గురువారం జిల్లా అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో 21 ప్రాజెక్టుల కింద మొత్తం 4, 768 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 3,640, మినీ కేంద్రాలుగా 1,128 నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 1,23,517 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 72,087 మంది వరకు లబ్ధి పొందుతున్నారు. అలాగే బాలింతలు, గర్భిణులు 42,763 మంది అంగన్వాడీల ద్వారా అమలయ్యే పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, కార్యకలపాలు, పథకాలు సక్రమంగా అమలువుతున్నాయా..లేదా పర్యవేక్షించడానికి ప్రాజెక్టుల వారీగా సూపర్వైజర్లు అవసరం. అయితే జిల్లా వ్యాప్తంగా 75 సూపర్వైజర్ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోలేదు. సిబ్బంది కొరత కారణంగా కేంద్రం నిర్వహణలో లోపాలు అధికమయ్యాయి. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం లింక్ సూపర్వైజర్ల పోస్టులకు ఆహ్వానం పలికింది. ఈ బాధ్యతలను అంగన్వాడీ కార్యకర్తలకు అప్పగిస్తేనే సమస్యలను సత్వరం పరిష్కరించగలమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు 2017 ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు డిగ్రీ విద్యార్హత కలిగివుండి, పదేళ్లు కార్యకర్తగా పనిచేసిన వారు అర్హులుగా పేర్కొంది. ఈ పోస్టుకు పోటీలు పడి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి 60 మందిని లింక్ సూపర్ వైజర్లుగా భర్తీ చేసుకున్నారు. వెట్టి చాకిరీ.. లింక్ సూపర్ వైజర్లు అంగన్వాడీ నిర్వహణతో పాటు సూచించిన ప్రాజెక్టుల్లో నిత్యం పర్యవేక్షించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం రూ.2,500 అదనపు వేతనంగా నిర్ణయించింది. దీంతో పాటు ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్(ఎఫ్టీఏ), డీఏలు కూడా అందిస్తామని ప్రకటించింది. అయితే ఏడాదికి గాను ఇంత వరకు లింక్ సూపర్వైజర్లకు ఒక్క పైసా ఇవ్వలేదు. నిత్యం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించేందుకు సూపర్ వైజర్లే ఖర్చు మొత్తం భరించారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఆన్లైన్ పనులను పూర్తి చేసి, అపై సూపర్వైజర్ వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. ఈ వృత్తిలో కొనసాగితే భవిష్యత్లో పై పోస్టులకు ప్రాధాన్యత ఉంటుందని భావించి పని ఒత్తిడి ఉన్నా చేస్తూ వచ్చారు. తొలగింపు ఉత్తర్వులు.. లింక్ సూపర్ వైజర్లను అర్ధాంతరంగా తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడంపై వారు భగ్గుమంటున్నారు. కనీసం ఏడాది పాటుగా విధులు నిర్వహించినందుకు అదనపు వేతనం ఇవ్వకుండానే తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం టీఏ, డీఏలు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 60 మంది సూపర్వైజర్లు గురువారం సాయంత్రం జిల్లా అధికారులను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇవ్వాల్సిన అదనపు బకాయిలను వెంటనే చెల్లించాలని, రెగ్యులర్ సూపర్వైజర్ల పోస్టుల భర్తీలో వయస్సు సడలింపునకు మొదటి ప్రాధన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఐసీడీఎస్కు ప్రాజెక్ట్ డైరెక్టర్ కావలెను
నెల్లూరు (వేదాయపాళెం): మహిళా శిశు సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆశాఖకు జిల్లాలో ప్రాజెక్ట్ డైరెక్టర్ నియామకం రెండేళ్ల నుంచి జరుపకపోవటంతో ఇన్చార్జిలే దిక్కుగా మారుతోంది. ఫలితంగా ఆశాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. వరుసగా ఇతర మాతృశాఖల అధికారులను ఐసీడీఎస్కు ఇన్చార్జిలుగా నియమించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఇన్చార్జిల పాలనతో ఐసీడీఎస్కు గ్రహణం పట్టినట్లైంది. మాతృశాఖల పర్యవేక్షణలకు వారు ప్రాధాన్యత నివ్వటంతో ఎంతో కీలకమైన ఐసీడీఎస్ను పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఆయా సందర్భాల్లో ఇన్చార్జిలుగా కొనసాగుతూ వస్తున్న అధికారులు మొక్కుబడిగా విధులకు పరిమితమవుతున్నారు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పూర్వప్రాథమిక విద్యను విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో లక్ష్యాలను చేరుకోలేకుంది. అశాఖలోని వివిధ పథకాల అమలు సజావుగా సాగే పరిస్థితి కానరావటంలేదు. మహిళా శిశు సంక్షేమానికి రూ.కోట్లు విడుదల అవుతున్నప్పటికీ వాటి సద్వినియోగం ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 3,454 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 320 మిని అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 17 ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో మూడేళ్ల లోపు పిల్లలు 89,856 మంది, 3 నుంచి ఆరేళ్ల పిల్లలు 82,736 మంది ఉన్నారు. అలాగే బాలింతలు 17,786 మంది, గర్భిణీలు 18,943 మంది ఉన్నారు.వీరికి ప్రభుత్వ పరంగా లబ్ధి చేకుర్చే విషయంలో పర్యవేక్షణ ఎంతో కీలకం. ఇన్చార్జిల పరంపర రెండేళ్ల క్రితం రెగ్యులర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యావతి బదిలీ అనంతరం అప్పటి డ్వామా పీడీ ఇప్పటి నెల్లూరు ఆర్డీఓ డి,హరితను ఇన్చార్జిగా నియమించారు. ఆమె ఆరు నెలల పాటు ఇన్చార్జిగా కొనసాగారు. ఆనంతరం మంత్రి నారాయణ జోక్యంతో తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్గా, అలాగే ఐసీడీఎస్ ఇన్చార్జిగా ఏకకాలంలో నియమించారు. ఆమె ఎడాదికిపైగా ఇన్చార్జిగా కొనసాగారు. గత నెల చివరి వారంలో అనంతపురంకు బదిలీ అయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న కమలకుమారిని నెల్లూరు జేసీ–2గా పదోన్నతి కల్పిస్తూ నియమించారు. అలాగే ఐసీడీఎస్కు ఇన్చార్జిగా నియమించారు. ఈమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఐదు రోజుల తరువాత మొక్కుబడిగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ట్ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి కాసేపు అందరిని పలకరించి సమీపంలో ఉన్న శిశుగృహాన్ని సందర్శించి వెళ్లారు. అప్పటి నుంచి కార్యాలయానికి వచ్చిన దాఖలాలులేవు. ఐసీడీఎస్ కార్యాలయం ఫైల్స్ను కార్యాలయ అధికారులను జేసీ–2 చాంబర్కు తెప్పించుకుని నామమాత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయకపోగా సీడీపీఓలతో సమావేశం ఏర్పాటు చేయలేదు. కమలకుమారికి ఐసీడీఎస్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టడంపై తొలి నుంచి నిరాసక్తతగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల తనను ఐసీడీఎస్ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా మంత్రి నారాయణను కమలకుమారి కోరినట్లు సమాచారం. అధిక పని ఒత్తిడి బాధ్యత ఉన్న ఐసీడీఎస్కు శాశ్వత పీడీని నియమించటంలో ఉన్నతాధికారులు ఎందుకు మీనమేషలు లెక్కిస్తున్నారనేది ఆశాఖ అధికారులలో చర్యనీయంశంగా మారింది. ఐసీడీఎస్ని గాడిలో పెట్టేందుకు శాశ్వత ప్రాజెక్టు డైరెక్టర్ను నియమించాల్సి అవసరం ఎంతైనా ఉంది. -
అద్దె మోత
మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. నిధుల విడుదల ఎలా ఉన్నప్పటికీ పాలకులకు, ఆ శాఖ అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఐసీడీఎస్ను భవనాల కొరత వెంటాడుతోంది. ఏళ్ల తరబడి అంగన్వాడీ కేంద్రాలు, సీడీపీఓల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నెలకు లక్షలాది రూపాయలు ఆ శాఖ ద్వారా అద్దెలకు కేటాయించడం పరిపాటిగా మారుతోంది. నెల్లూరు(వేదాయపాళెం): ఐసీడీఎస్ భవనాల కోసం స్థలసేకరణ విషయంలో ప్రతిపాదనలకు, హామీలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మంజూరైన అరకొర భవనాల నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో అవి అసంపూర్తిగా ఉంటున్నాయి. జిల్లాలోని 17 ప్రాజెక్టుల్లో 3454 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 320 మినీ అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో 3 ఏళ్ల లోపు చిన్నారులు 89,856 మంది, 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 82,736 మంది ఉన్నారు. వీరికి పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పౌష్టికాహారం అందించాల్సిఉంది. వీరితోపాటు గర్భిణులు 18,943 మంది, బాలింతలు 17,786 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు 1311 సొంత భవనాలు ఉండగా 1272 కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో అధికంగా అద్దె భవనాల్లోనే కేంద్రాల నిర్వహణ జరుగుతోంది. నెల్లూరు అర్బన్ ప్రాజెక్టులో పూర్తిగా అద్దె భవనాల్లోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఒక్కో కేంద్రానికి రూ.3 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.700 అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సీడీపీఓ కార్యాలయాలకు రూ.6600 చొప్పున చిల్లిస్తున్నారు. నెలల తరబడి అద్దె బకాయిలు జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు నెలల తరబడి అద్దె బకాయిలు పెరిగిపోతుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో భవనాల యాజమానులు అద్దె చెల్లింపుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తుండడంతో కార్యకర్తలు అప్పులు చేసి మరీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల కేంద్రాలను ఖాళీ చేయాల్సిందిగా యాజమానుల నుంచి కార్యకర్తలకు ఒత్తిళ్లు కూడా ఎదురవుతున్నాయి. అసంపూర్తి పరంపర 2017వ సంవత్సరానికి ముందు నాబార్డు నిధులతో 102 భవనాలు మంజూరు కాగా అందులో 31 భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. 2017–18కి గాను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో అంగన్వాడీ కేంద్రం భవనానికి రూ.7.50 లక్షల అంచనా వ్యయంతో 371 భవనాలు మంజూరయ్యాయి. 188 భవనాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, హౌసింగ్ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 2016–17 ఏడాదికి గానూ సీడీపీఓల కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మహిళా శిశు సంక్షేమశాఖ నిధులతో ఒక్కో భవనానికి రూ.53 లక్షల అంచనా వ్యయంతో పనులను చేపట్టారు. రెండేళ్ల నుంచి కొన్ని భవనాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. నెల్లూరుఅర్బన్, నాయుడుపేట, పొదలకూరు, బుచ్చి, ఆత్మకూరు, వింజమూరు, సీడీపీఓల కార్యాలయాల భవనాలు పూర్తి దశకు చేరుకోలేకున్నాయి. నెరవేరని మంత్రి హమీ అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా చేస్తామని చెబుతున్న మంత్రి నారాయణ హామీ నెరవేరలేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనాలు నిర్మించేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం ముందుకు సాగడం లేదు. కనీసం స్థల సేకరణ జరిపిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. కార్యకర్తలకు ఆర్థిక ఇబ్బందులు అద్దెల చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది. గృహాల యాజమానుల ఒత్తిళ్లను భరించాల్సివస్తోంది. శాశ్వత భవనాల నిర్మాణాల విషయంలో ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు. పాలకులు అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – షేక్ మస్తాన్బీ, నెల్లూరు అర్బన్ ప్రాజెక్ట్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి -
బాలికకు వివాహం చేసే ప్రయత్నం
చిల్లకూరు: పదో తరగతి చదువుతున్న కుమార్తెకు తల్లిదండ్రులు వివాహం చేసే ప్రయత్నం చేయగా సదరు బాలిక విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మనగారిపాళెం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ కుమార్తెను గూడూరు రూరల్ పరిధిలోని చెంబడిపాళెంకి చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బాలికకు వివాహం ఇష్టం లేకపోవడంతో స్థానికంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తను కలుసుకుని సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం సూపర్వైజర్ క్రిష్ణమ్మ సిబ్బందితో కలసి గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడింది. తర్వాత వారిని ఎస్సై శ్రీనివాసరావు వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, జార్ఖండ్లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్లైన్లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, జార్ఖండ్లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్లైన్లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
చట్టవిరుద్ధంగా బాలుడి స్వీకరణ
కనిగిరి: ఏడేళ్లుగా పిల్లలు లేక తిరుగుతున్న ఓ నిరక్షరాస్య జంట.. బిడ్డను వదలించుకోవాలనే ఓ బాధ్యత రహిత్యం గల తల్లి.. వెరసి ఓ బాలుడిని చట్టవిరుద్ధ దత్తత శ్రీకారానికి దారితీసింది. వాస్తవానికి ఆ బాలుడు దత్తతస్వీకర్తల వద్ద అల్లారుముద్దుగా పెరుగుతున్నా.. ఆ నోట ఈనోట విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి చేరింది. ఐసీడీఎస్ అధికారులు బాలుడిని దత్తత తీసుకున్న దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం కనిగిరిలో వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసుస్టేషన్లో ఐసీడీఎస్ అధికారులు బాలుడిని స్వాధీనం చేసుకుని ఒంగోలు డీసీపీఓకు అప్పగించారు. వివరాలు.. హెచ్ఎంపాడు మండలం వేములపాడుకు చెందిన ధనలక్ష్మి, చెన్నకేశవులు దంపతులకు పెళ్లి జరిగి ఏడేళ్లయినా సంతానం లేరు. కూలీనాలి చేసుకుని జీవించే వీరు పిల్లల కోసం ఆస్పత్రిల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వేములపాడుకు చెందిన లారీ డ్రైవర్ అంకయ్య.. వేరే ప్రాంతం నుంచి వెన్నపూస ధనలక్ష్మిని (రెండో భార్యగా, వివాహం లేదు) తెచ్చుకుని సహజీవనం చేస్తున్నాడు. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. ఈ క్రమంలో కొద్దికాలం నుంచి అంకయ్యకు, వెన్నపూస ధనలక్ష్మికి మనస్పర్థలు వచ్చి రోజూ గోడవపడి కొట్టుకుంటున్నారు. ధనలక్ష్మి కూలి పనులకు వెళ్లే మహిళలతో తన బిడ్డను ఎవరికైనా ఇస్తానని చెబుతోంది. పిల్లలు లేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ధనలక్ష్మి అత్త తిరుపాలమ్మకు కొందరు విషయం చేరవేశారు. ధనలక్ష్మి కూడా తిరుపాలమ్మకు ఫోన్ చేసింది. ఈ నెల 11న కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్లో చెట్టు వద్ద వెన్నపూసల ధనలక్ష్మి తన బిడ్డను ఇష్టపూర్వకంగా ఇస్తున్నానని.. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మూడు నెలల బాలుడిని అప్పగించింది. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం వేములపాడులో సెక్టార్ సమావేశానికి వెళ్లిన సీడీపీఐ లక్ష్మీప్రసన్న దృష్టికి బాలుడి దత్తత విషయం వెళ్లింది. ఆమె విచారణ చేపట్టి వారి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది నిరక్ష్యరాస్యులైన తిరుపాలమ్మ, కొడలు ధనలక్ష్మిలు జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు. నగదు ఇచ్చి బాలుడిని చట్టవిరుద్ధ దత్తతగా(కొనుగోలు చేయడం) నేరంగా తెలిపి పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ మేరకు పోలీసుస్టేషన్లో మూడు నెలల బాలుడిని సీడీపీఓకు అప్పగించారు. బాలల సంరక్షణ కార్యాలయానికి సమాచారం అందించారు. డీసీపీఓ జిల్లా అధికారి జ్యోతి సుప్రియకు బాలుడిని అప్పగించినట్లు సీడీపీఓ లక్ష్మీప్రసన్న విలేకరులకు తెలిపారు. అత్త, కొడలిపై కేసు రూ.20 వేలు ఇచ్చి అత్త, కొడలు తిరుపాలమ్మ, ధనలక్ష్మిలు చట్టవిరుద్ధంగా బాలుడిని కొనుగోలు చేశారని ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీడీపీఓ ఫిర్యాదు మేరకు అత్త, కోడలిపై సెక్షన్ 81 బాలల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. -
భయం పెట్టాలని చేతులు కాల్చింది
నెల్లూరు,నాయుడుపేటటౌన్: కొడుక్కి భయం పెట్టాలని ఓ తల్లి ఏడేళ్ల కొడుకు చేతులపై వాతలపెట్టిన ఘటన పట్టణంలోని మునిరత్నంనగర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని గుంటూరువారితోటకు చెందిన బోంతపూడి ధనలక్ష్మి పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన సురేష్ను ప్రేమవివాహం చేసుకుంది. వీరికి 5వ తరగతి చదువుతున్న పవన్, రెండో తరగతి చదువుతున్న ప్రభాకర్, ఒకటో తరగతి చదువుతున్న రోజా అనే ముగ్గురు పిల్లలున్నారు. సురేష్ నాయుడుపేట పట్టణంలో నివాసముంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ భార్యాపిల్లలను పోషించేవాడు. రెండునెలల క్రితం భార్యాభర్తల మధ్య కలహాలు చెలరేగి సురేష్ ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో ధనలక్ష్మి కూలి పనులకు వెళుతూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో వారంరోజుల క్రితం ప్రభాకర్ తరచూ ఇంటిపక్కన ఉన్న పిల్లలతో గొడవకు దిగడమే కాకుండా మలవిసర్జనను పక్క ఇళ్లలో పడవేస్తున్నట్లుగా పొరుగింటి వారు వివాదానికి దిగారు. దీంతో కొడుక్కి భయపెట్టాలని ధనలక్ష్మి అట్లకాడను కాల్చి ప్రభాకర్ రెండు చేతులపై వాతలు పెట్టింది. అయితే చేతులకు పెద్దఎత్తున బొబ్బలు లేసి చీముపట్టి ఉండటాన్ని స్థానికులు బుధవారం గుర్తించి విచారించారు. అంతేకాకుండా బాలుడికి సరైన వైద్యచికిత్స సైతం అందించకుండా ఇంటి వద్ద వదిలేసి ధనలక్ష్మి ఉదయం వెళ్లి సాయంత్రం వస్తుండటంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై అక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త సూపర్వైజర్ ఉమామహేశ్వరికి విషయం తెలియజేసింది. ఆమె మునిరత్నంనగర్కు వెళ్లి ప్రభాకర్ పరిస్థితి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లితో పాటు బాలుడిని పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. కుమారుడికి భయం పెట్టేందుకే కాల్చానని ఇంత గాయమవుతుందని తెలియదని ధనలక్ష్మి వాపోయింది. తన కోపం కారణంగానే భర్త కూడా వెళ్లిపోయాడని చెప్పడంతో వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బాలుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. -
‘ఐసీడీఎస్లో సూపర్వైజర్ అర్హత డిగ్రీనే’
సాక్షి, హైదరాబాద్: సమ గ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో సూపర్వైజర్ (గ్రేడ్–2) పోస్టులను పూర్తిస్థాయిలో పదోన్నతుల ద్వారానే ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు సోమవారం ఆ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో అంగన్వాడీ టీచర్ల అర్హతల నిబంధనల్లో కాస్త ఊరట కలగనుంది. అంగన్వాడీ టీచర్లలో అనుభవజ్ఞులు, అర్హత కలిగిన వారినే సూపర్వైజర్లు (గ్రేడ్–2)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ..వారి విద్యార్హత కనీసం డిగ్రీ ఉండాల్సిందిగా పేర్కొంది. క్షేత్రస్థాయిలో డిగ్రీ చదివిన వారు అతి తక్కువ మంది ఉండటంతో ప్రభుత్వానికి పలు వినతులు అందాయి. డిగ్రీ అర్హత కాకుండా పదోతరగతిని ప్రామాణికంగా తీసుకోవాలని మెజార్టీ టీచర్లు కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పదోతరగతి అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని కానీ, ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. -
ఆడబిడ్డను సాకలేం.. తీసుకోండి
ఇబ్రహీంపట్నం : ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆడబిడ్డను సాకలేమని తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ ఆధికారులను సోమవారం ఆశ్రయించారు. కూలీ పని చేసుకుని జీవించే మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన పత్లోత్ శోభ, పాండు దంపతులకు మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించింది. అప్పటికే ఉన్న ఇద్దరు ఆడబిడ్డలతోపాటు మరో బిడ్డ పుట్టడంతో సాకలేమని భావించిన ఆ తల్లిదండ్రులు స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. -
శోభరాణి ఆత్మహత్యకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ఆందోళన
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లో సూపర్వైజర్గా పనిచేస్తున్న శోభారాణి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన భార్య ఆత్మహత్యకు సంక్షేమ శాఖ సీపీడీఓ పద్మావతి కారకురాలని మృతురాలి భర్త ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోగ్యం బాగలేకపోయినా తీవ్ర పని ఒత్తిడికి గురిచేశారని ఆయన ఆరోపించాడు. మెమోలు ఇచ్చి మనోవేదనకు గురిచేయడం వల్లే శోభారాణి బలవన్మరణం చెందిందని తెలిపాడు. కాగా, శోభారాణిని మానసిక వేదనకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఐసీడీఎస్ (అంగన్వాడీ) ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాయి. శోభారాణి కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియాగా చెల్లించాలని, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
కర్నూలు జిల్లాలో దారుణం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని ఆళ్లగడ్డలో శోభారాణి అనే మహిళ స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు డీఆర్సీ మీటింగ్ ఉండటంతో ఆమె కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. మీటింగ్ జరుగుతుండగానే శోభారాణి భవనంపైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై ఆస్పత్రికి తరలించే లోపలే శోభారాణి మృతి చెందింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహ్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మనోవేదనకు గురి చేశారు తన భార్య శోభారాణి ఆత్మహత్యకు సంక్షేమ శాఖ సీపీడీఓ పద్మావతి కారకురాలని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. ఆరోగ్యం బాగలేకపోయినా.. మెమోలు ఇచ్చి మనోవేదనకు గురి చేశారన్నారు. వేధింపులు తట్టుకోలేక ఆమె బలవన్మరణం చెందిందన్నారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అతను డిమాండ్ చేశాడు. -
కంపకళ్లితో ముగిసిన తిరునాళ్ల
చిన్నగొల్లపల్లి (హనుమంతునిపాడు): మండలంలోని చిన్నగొల్లపల్లిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి తిరునాళ్లలో భాగంగా కంపకళ్లిని బుధవారం పోలీసులు, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఆరు నుంచి పది అడుగుల ఎత్తున పేర్చిన ముళ్ల కంపపై నుంచి చిన్న పిల్లలను కిందకు దొర్లించడం వినేందుకే భయంగా ఉన్నా ఈ ప్రాంత భక్తులు దాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. కంపకళ్లిపై దొర్లిన బిడ్డకు ఎలాంటి రోగాలు దరి చేరవని భక్తుల అపార నమ్మకం. తరతరాలుగా ముళ్లకంపపై చిన్నారులను దొర్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలను కంపకళ్లిపై దొర్లించడం చట్టరీత్య నేరమని అధికారులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఐసీడీఎస్, పోలీసు అధికారులు చిన్న పిల్లలను ముళ్లకంపై దొర్లించకుండా అడ్డుకున్నారు. సుదూర ప్రాంతల నుంచి వచ్చిన పెద్దలు మాత్రమే దొర్లి పిల్లలను కంపకళ్లి తాకించుకుని తీసకెళ్లారు. భక్తులు అర్ధనగ్నంగా ముళ్లకంపపై దొర్లుతూ గోవింద..అంటూ తమ భక్తి చాటుకున్నారు. పాలెగాళ్లు కొనతాళ్లను ఎత్తుకుని పోతురాజుతో కంపకల్లి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చెన్నకేశవస్వామి తిరునాళ్ల కంపకల్లి కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. ఐసీడీఎస్ వెలిగండ్ల ప్రాజెక్టు అధికారి లక్ష్మీప్రసన్న, కనిగిరి సీఐ సుబ్బారావుతో పాటు పలువురు పోలీసు అధికారులు దగ్గరుండి కంపకళ్లి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
అరకులోయ : సమస్యలు పరిష్కారం కోసం విశాఖలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసిన సంఘటనకు నిరసనగా అరకులోయ పట్టణంలో సీఐటీయూ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇక్కడి నాలుగురోడ్ల జంక్షన్లో రాస్తారోకో చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, మహిళలపై పోలీసు ల లాఠిచార్జీ సంఘటనను అన్ని వర్గాల ప్రజ లు ఖండించాలని నినదించారు. సీఐటీయూ నేత ఉమామహేశ్వరరావు, సంఘ నేతలు మణి, పి.విమల, నిర్మల, భాను, జానకి పాల్గొన్నారు. -
అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు సిగ్గుగా లేదా?
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో వేతనాలను పెంచనందుకు సిగ్గుగా లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విజయనగరంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ వర్కర్లపై లాఠీచార్జి చేయడాన్ని మంగళవారం వైఎస్ జగన్ ట్వీటర్లో తీవ్రంగా ఖండించారు. ‘తమ హక్కుల సాధన కోసం విజయనగరంలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై జరిగిన పాశవికమైన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబూ.. మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. మళ్లీ వారిపై తీవ్ర అణచివేత చర్యలకు ఒడిగడతారు. తెలంగాణలో మాదిరిగా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు మీకు సిగ్గుగా లేదా?’అని జగన్ ట్వీటర్లో పేర్కొన్నారు. Strongly condemn brutal lathi charge on Anganwadi workers agitating for their rights at Vizianagram. @ncbn, you speak of women empowerment, yet you resort to oppressive measures against them. Aren't you ashamed of failing to provide them with enhanced wages, as done in Telangana? — YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2018 -
మహిళలపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
-
లైంగిక వేధింపులు..ఐసీడీఎస్ పీడీపై వేటు
అనంతపురం : జిల్లాకు చెందిన ఐసీడీఎస్ పీడీ వెంకటేశంపై వేటు పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, వెంకటేశంను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఓ మహిళా ఉద్యోగిపై గతంలో పీడీ వెంకటేశం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ రమామణి విచారణలో ఆరోపణలు రుజువు కావటంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. -
లైంగిక వేధింపులు: బుక్కైన స్త్రీ సంక్షేమ శాఖ అధికారి
-
నా కోరిక తీర్చు.. లేకపోతే అంతే
సాక్షి, అనంతపురం : అది స్త్రీ సంక్షేమ శాఖ. అంటే మహిళలు, యువతుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ. కానీ అందులో పనిచేసే ఉద్యోగునులకే భద్రత లేకుండా పోయింది. తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ ప్రతిరోజు వేధింపులే. పైఅధికారుల తీరుతో విరక్తి చెందిన ఓ మహిళా ఉద్యోగి, తన ఉన్నతాధికారికి తగిన రీతిలో బుద్ది చెప్పింది. అధికారి భాగోతాన్ని బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం ఐసీడీఎస్ పీడీ వెంకటేశం ఓ మహిళా ఉద్యోగిపట్ల గత కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు వెంకటేశం ఫోన్లో సదరు మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడు. అయితే అధికారి ఫోన్కాల్స్ అన్నింటిని మహిళా ఉద్యోగి రికార్డు చేసి తండ్రికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉద్యోగి తండ్రి వెంకటేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే ఆడియో టేపులను బయటపెడతామని హెచ్చరించారు. దీంతో దారికి వచ్చిన వెంకటేశం తన బాగాతాన్ని బయటపెట్టొద్దని, తన ఉద్యోగం పోతుందంటూ ఫోన్లోనే క్షమాపణ కోరాడు. దీంతో విషయం కొద్ది మేర సద్దుమణిగింది. గతంలోనే వెంకటేశంపై పలు ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవెంకటేశంను సస్పెండ్ చేయాలంటూ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు సావిత్రి డిమాండ్ చేశారు. -
ఐసీడీఎస్లో వసూళ్ల దందా
నెల్లూరు (వేదాయపాళెం): అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఖాతాలలో బిల్లులు జమ కావడంతోనే వారివద్దనుంచి నిర్దేశిత పర్సంటేజీలలో కొందరు సీడీపీఓలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా సెక్టార్లలో అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తూ సెక్టార్ల లీడర్లుగా కొనసాగేవారే తోటి అంగన్వాడీ కార్యకర్తల నుంచి బలవంతపు వసూళ్లు సాగిస్తూ కీలకంగా మారుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి వసూలు చేసిన పర్సంటేజీల నగదును గుట్టుచప్పుడు కాకుండా సూపర్వైజర్లకు అందజేస్తుంటారు. సూపర్వైజర్లు సీడీపీఓలకు చెల్లించాల్సిన స్థాయి మొత్తాన్ని గోప్యంగా వారికి చేరుస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్ల పరిధిలో నెలవారీ మామూళ్లు రూ.లక్షలు సీడీపీఓలు, సూపర్వైజర్ల పరమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. వసూళ్ల పరంపర ఇలా.. టీఏ బిల్లులలో 10 శాతం వసూలు చేస్తున్నారు. అదేమిటంటే ట్రెజరీలో మూడు శాతం సమర్పించుకోవాలని, మిగతాది వేరే ఖర్చులు అంటూ అక్రమ వసూళ్లను సమర్థించుకుంటున్నారు. గ్యాస్ బిల్లులు, అంగన్వాడీ కేంద్రం అద్దె బిల్లులు విషయంలో ఐదు శాతం వసూలు చేస్తున్నారు. ఇచ్చే నెల వారీ గ్యాస్ బిల్లులు అంతంత మాత్రంగా ఉండగా పర్సంటేజ్లు వసూలు చేస్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై ఆర్థికభారం పడుతోంది. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అధికంగా ఉన్నా రూ.3వేలు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. అద్దె బిల్లులు విషయంలో కూడా సూపర్వైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోతలు విధిస్తున్నారు. నెల వారీ ఇంటి అద్దెలు సక్రమంగా పడకున్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలే ఇంటి యజమానులకు నచ్చజెప్పకోవడమో లేదా తామే ఆర్థిక భారాన్ని భరించటమో చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్లులు పడినప్పడు తమ పర్సంటేజ్లు తమకు ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడటం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లలోనూ కమీషన్లే.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి అధికారులు నెలవారీ మామూళ్లకు పాల్పడుతున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ కమీషన్ దండుకుంటున్నారు. అక్రమ వసూళ్ల కారణంగా కోడిగుడ్ల సరఫరాలో లోపాలున్నప్పటికీ సీడీపీఓలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కనీస గుడ్డు బరువు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా తక్కువ బరువు కలిగిన గుడ్డులు సరఫరా చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు కోడిగుడ్ల విషయం సూపర్వైజర్లు, సీడీపీఓలకు చెబుతున్నప్పటికీ పట్టించుకోవటంలేదు. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోవాలంటూ సూపర్వైజర్లు, సీడిపీఓలు అంగన్వాడీ కార్యకర్తలకు సర్దిచెబుతున్నారు. కమీషన్లే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశాల్లో బెదిరింపులు ప్రాజెక్ట్, సెక్టార్ మీటింగ్లలో పర్సంటేజీలు చెల్లించని అంగన్వాడీ కార్యకర్తలను సీడీపీఓలు, సూపర్వైజర్లు బెదరిస్తున్నారు. విధి నిర్వహణలో రికార్డులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ సమావేశంలో నిలబెట్టి దూషిస్తున్నారు. పర్సంటేజీలు ఇవ్వకపోవడమే ఇందకు కారణమని సమాచారం. జిల్లా అధికారులు దృష్టి సారించి ఐసీడీఎస్లో ఉన్న అవినీతిని ప్రక్షాలన చేయాల్సిన అవసరం ఉంది. ట్రెజరీలో పర్సంటేజీల మోత ప్రతిబిల్లు విషయంలో జిల్లాలోని 17 ప్రాజెక్ట్లలో అంగన్వాడీ కార్యకర్తల నుంచి పర్సంటేజీలు వసూలు చేస్తున్న మాట వాస్తవమే. టీఏ బిల్లులు, గ్యాస్, ఇంటి అద్దె బిల్లులు విషయంలో సీడీపీఓలు బలవంత వసూళ్లకు పాల్పడుతున్నారు. –వై.సుజాతమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఫిర్యాదు చేస్తే చర్చలు తీసుకుంటాం ఐసీడీఎస్ ప్రాజెక్ట్లలో బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే పరిస్థితిని చక్కదిద్దుతాం. –పి.ప్రశాంతి, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ -
దొరికాడు..
అడ్డతీగల (రంపచోడవరం): అడ్డతీగల ఐసీడీఎస్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం దాడి చేసి రూ.11 వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణను అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు కథనం ప్రకారం.. కార్యాలయంలో డ్రైవర్గా పనిచేస్తున్న జి.నాగేశ్వరరావు ఇక్కడ జీపు లేకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం ఐసీడీఎస్ కార్యాలయంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. జీతభత్యాలన్నీ అడ్డతీగల కార్యాలయం నుంచే పొందుతున్నారు. తన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో తన జీపీఎఫ్ ఖాతాలో నిల్వ ఉన్న రూ.1.29 లక్షలు, సరెండర్ లీవు ఎన్క్యాష్మెంట్ కింద రూ.56,940 పొందడానికి జూనియర్ అసిస్టెంట్ని ఖజానా శాఖకు బిల్లు పెట్టమని కోరాడు. తనతో పాటు ఖజానా శాఖలో సిబ్బందికి కలిపి రూ.15 వేలు లంచం ఇస్తే బిల్లు పెడతానని డ్రైవర్ నాగేశ్వరరావును జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాను ఉన్న పరిస్థితుల్లో అంత సొమ్ము ఇచ్చుకోలేనని రూ.11 వేల నగదు అయితే ఇస్తానని చెప్పాడు. బిల్లు మంజూరు అయ్యాక ఇవ్వమని చెప్పడంతో ఆ సొమ్ము డ్రైవర్ నాగేశ్వర్రావు ఖాతాలో పడగా లంచం సొమ్ము కోసం జూనియర్ అసిస్టెంట్ నుంచి వేధింపులు ఎక్కువకావడంతో బాధితుడు నాగేశ్వరరావు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకుని గురువారం జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణకి డ్రైవర్ నాగేశ్వరరావు లంచం సొమ్ము రూ.11 వేలు ఇస్తుండగా వల పన్ని పట్టుకున్నామని డీఎస్పీ సుధాకర్రావు తెలిపారు. రూ.11 వేలు నగదు స్వాధీనపర్చుకుని బద్దపు సత్యనారాయణ వద్ద వాంగ్మూలం నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడిని శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఖజానాశాఖలోని సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో సీఐలు పుల్లారావు, మోహనరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్యానికి మూడుముళ్లు
బాల్యవివాహాలను అరికట్టేందుకు అధికారులు చర్యలెన్ని చేపడుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా.. తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా చాటుమాటుగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 50 రోజుల వ్యవధిలో ఆరు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మరికొన్ని చాటుమాటుగా జరిగినట్లు తెలుస్తోంది. అభద్రత, నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. సాక్షి, యాదాద్రి : ప్రజల అజ్ఞానం, నిరక్షరాస్యత, బాలికలపై అభద్రతాభావంతో బాల్య వివాహాలు జిల్లాలో జరుగుతున్నాయి. 13, 14 ఏళ్ల వయసులోనే బాలికల వివాహం చేసి అత్తింటికి పంపిస్తున్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల కుటుంబాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తోంది. అధికారులకు అందిన సమాచారం మేరకు కొంత మేరకు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేక పోతున్నారు. జిల్లాలోని 16మండలాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. హైదరాబాద్ శివారులో గల అభివృద్ధి చెందుతున్న భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం, తుర్కపలి లాంటి మండలాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల కాలంలో పలు ఘటనలు బీబీనగర్ మండలంలోని రెండేళ్ల కాలంలో నాలుగు బాల్య వివాహాలను అధికారులు నిలిపివేయించారు. 2016లో జియాపల్లి తండా, 2017లో రుద్రవెళ్లి, కొండమడుగు, యాపగానితండాలో, మోత్కూరు మండలంలో తొమ్మది బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మోత్కూరు మండలం కొండగడప, దాచారంలో ఒక్కటి, అడ్డగూడూర్ మండలం కంచనపల్లిలో మూడు, అడ్డగూడూర్, హజీంపేట, మంగమ్మగూడెం, గట్టుసింగారం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున అడ్డుకుని వారి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే రాజాపేట మండలం నెమిలో ఒకటి, సంస్థాన్ నారాయణపురం మండలంలో మూడు జరిగాయి. వీటిలో బాల్యవివాహాలలో రెండు ఘటనలు తండాల్లో జరిగినవి కాగా, ఒకటి ఉన్నత వర్గానికి చెందినది. వీటిని రెవెన్యూ, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, చైల్డ్కేర్ ప్రతినిధులు బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అడ్డుకట్ట పడడం లేదు. గడిచిన 45 రోజుల్లో జిల్లాలో ఆరు బాల్య వివాహాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కల్యాణలక్ష్మికి దూరం ఆడ పిల్ల పెళ్లి కోసం పభుత్వం కల్యాణ లక్ష్మి పథ కం కింద ఆర్థిక సాయం అందజేస్తోంది. బాల్య వి వాహాలు చేస్తే ఈ పథకానికి అర్హులు కారు. అయి తే కొందరు అధికారులు కల్యాణలక్ష్మి పథకాన్ని బాల్య వివాహం చేసుకున్న వారికి కూడా వర్తింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు(ఎం) మండలంలో బాల్య వివాహం జరిగిన బాలిక కుటుంబానికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేశారు. ఈవిషయంలో అధికారులు విచారణ కూడా చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, 21 ఏళ్లు నిండిన యువకుడితో వివాహం జరిగితే కల్యాణ లక్ష్మి పథకంలో అర్హత సాధిస్తారని అధికారులు చెబుతున్నారు. నిరక్ష్యరాస్యత, పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరిగేందుకు నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థిక భారం, ఆడపిల్లంటే అభద్రతాభావం ప్రధాన కారణాలని తెలుస్తోంది. కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెకు వివాహం చేయడానికి ఆర్థిక స్థోమత ఎక్కడ అడ్డువస్తుందోన ని చిన్న వయస్సులోనే పెళ్లి చేస్తున్నారు.ఆడపిల్ల ఏ దో ఒక రోజు బయటకు వెళ్లాల్సిందేనని, అదేదో వచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవా లని అని కూడా బాల్య వివాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి 19 వరకు వెలుగుచూసినవి.. ఫిబ్రవరి 1న : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి పంచాయతీ కిమ్యాతండా ఫిబ్రవరి 27న : తుర్కపల్లి మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలో రామోజీనాయక్ తండాలో మార్చి 2న : వలిగొండ మండలం పహిల్వానర్పురంలో మార్చి 10న : సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో మార్చి 12 : తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలో మార్చి 19 : భువనగిరి మండలం పచ్చబొర్లతండాలో 18వివాహాలు అడ్డుకున్నాం జిల్లాలో 18 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. జిల్లా ఆవిర్భావం తర్వాత ఆలేరు, మోత్కూర్, భువనగిరి, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో జరిగిన బాల్య వివాహాలపై స్పందించాం. వెంటనే అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాలను అడ్డుకున్నాం. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలు అందవు. చట్టపరంగా శిక్షలు ఉంటాయి. –జిల్లా మహిళా సంక్షేమాధికారి శారద -
ఊరిస్తున్న ఉద్యోగాలు
సాక్షి, జనగామ: ఐసీడీఎస్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీకి గ్రహణం పట్టింది. నాలుగు నెలల క్రితమే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పిన అధికారులు చివరకు ఆగిపోయారు. దీంతో అంగన్వాడీ పోస్టుల కోసం జిల్లాలోని నిరుద్యోగ మహిళలు ఎదురు చూస్తున్నారు. 1977లో మాతాశిశు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పి గర్భిణులు, బాలింతలు, ఆరు ఏళ్లలోపు చిన్నారులకు సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల ప్రాజెక్టుల పరిధిలో 732 కేంద్రాలున్నాయి. కేజీ టు పీజీ పథకానికి తొలిమెట్టు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కేజీ టు పీజీ ఉచిత విద్య పథకానికి అంగన్వాడీ కేంద్రాలను తొలిమెట్టుగా భావిస్తున్నారు. అర్హత ఉన్న అంగన్వాడీ టీచర్లకు ఉపాధ్యాయ శిక్షణను ఇప్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేజీ టు పీజీ విద్య పథకం విజయవంతం కావాలంటే అంగన్వాడీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యం పెరిగింది. ఇన్చార్జిలతోనే.. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి 2017 నవంబర్ నెలలో సన్నాహాలను ప్రారంభించారు. నాలుగేళ్ల తర్వాత ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, నోటిఫికేషన్ ఇప్పటివరకు జారీ చేయలేదు. జనగామ ప్రాజెక్టు పరిధిలో 16 మంది అంగన్వాడీ టీచర్లు, 9 మినీ అంగన్వాడీ టీచర్లు, 24 ఆయా పోస్టుల చొప్పున ఖాళీ ఉన్నాయి. స్టేషన్ఘన్పూర్ ప్రాజెక్టు పరిధిలో 10 అంగన్వాడీ టీచర్లు, 7 మినీ అంగన్వాడీ టీచర్లు, 14 ఆయా పోస్టులు, కొడకండ్ల ప్రాజెక్టు పరిధిలో 13 అంగన్వాడీ టీచర్లు, 9 మినీ టీచర్లు, 21 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ నెలలో ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి వచ్చినప్పటికి వాటి ఊసే లేకుండా పోయింది. ఇన్చార్జిలతోనే నెట్టుకు వస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపాం.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నవంబర్ నెలలో గుర్తించాం. ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తాం. మాకున్న సమాచారం మేరకు త్వరలోనే పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. పద్మజారమణ, జిల్లా మహిళా సంక్షేమ అధికారి -
నవ కిశోరం
హుస్నాబాద్రూరల్: బాలికల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కిశోర బాలికలు ఎంత మంది ఉన్నారు? ఎంత వరకు చదువుకున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? చదువు ఎందుకు మానేశారు? కుటుంబ నేపథ్యం, ఆరోగ్య సమాచారంపై సర్వే చేస్తున్నారు. బాలికలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి.. పురుషులకు సమానంగా నిలిపేలా చర్యలు తీసుకుంటున్నారు. బాలికలకు మహిళా సంక్షేమం, హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 57,615 మంది కిషోర బాలికలు సిద్దిపేట జిల్లాలోని 399 గ్రామాల్లో 57,615 మంది కిశోర బాలికలు ఉన్నట్టు ఐసీడీఎస్ అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 25 మంది బాలికలను ఎంపిక చేసి.. వీరికి కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక ప్రాజెక్టులో బాలికలు శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో బాలికలు, స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చేలా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే సమన్వయకర్తలను నియమించనున్నారు. పల్లెకు చేరి కిశోర బాలికలకు మహిళల హక్కులపై అవగాహన కల్పించడం, మహిళా సంక్షేమ పథకాలు, దగా పడ్డ మహిళలకు న్యాయ సలహాలు ఎక్కడ అందుతాయి? అనే విషయాలపై అవగహన కల్పించేలా సమన్వయకర్తలు పనిచేయనున్నారు. కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణ సరైన వసతులు లేక గ్రామీణ ప్రాంతాలకు చెందిన కిశోర బాలికలు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. అంతేకాదు కూలి పనులు సైతం చేస్తున్నారు. కాగా, అభద్రతా భావంతో కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెలను దూర ప్రాంతాల్లో చదువుకునేందుకు పంపించడం లేదు. ఫలితంగా చాలమంది బాలికల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఇంటర్మీడియట్ చేయడం లేదు. అదే ఇంటర్ చేసిన వారు డిగ్రీలో చేరడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కిశోర బాలికల సర్వే చేసి.. వారికి జీవన నైపుణ్యాల కల్పన చేపట్టనుంది. జీవన నైపుణ్యాల కల్పన ప్రభుత్వ ఆదేశాల మేరకు కిశోర బాలికల సర్వే చేపట్టి.. వారి వివరాలను అన్లైన్లో నమోదు చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చదువులు మానేసిన బాలికలను చేరదీసి.. వారికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం గజ్వేల్, సిద్దిపేటలో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాం. త్వరలో హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల ఐసీడీఎస్ పరిధిలోని బాలికలకు కంప్యూటర్ శిక్షణ ఇస్తాం. చదువు మానేసిన బాలికలను గుర్తించి.. వారికి మహిళా హక్కులపై అవగాహన కల్పిస్తాం. అంతేకాదు బాలికల ఆరోగ్య పరిరక్షణకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. – జరీనాబేగం, ఐసీడీఎస్ పీడీ త్వరలో కంప్యూటర్ శిక్షణ గ్రామీణ బాలికలకు స్వయం ఉపాధి కోసం కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో కిశోర బాలికలపై సర్వే పూర్తి చేశాం. ప్రాజెక్టు పరిధిలో 6,450 మంది కిశోర బాలికలు ఉన్నారు. 20 మందికి కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు బ్యాచ్ తయారు చేశాం. త్వరలో హుస్నాబాద్లో ప్రారంభిస్తాం. మహిళల హక్కులపై అవగహన కల్పించి.. బాలికలను శక్తిగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్నాం. – ఫ్లోరెన్స్, సీడీపీఓ, హుస్నాబాద్ -
గుడ్డలు కుక్కి... చేతులు విరిచి
ఖమ్మం క్రైం: అనారోగ్యంతో తల్లి చనిపోవటంతో పసిబిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారు.. తల్లి లాంటి అమ్మమ్మ వారిని సముదాయించాల్సింది పోయి.. మద్యం మత్తులో వారిని చితకబాదింది. ఏడాదిన్నర బిడ్డ తల్లి కోసం ఏడుస్తుండటంతో ఆ చిన్నారి చేతులను విరిచేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ ప్రాంతంలోని కాల్వొడ్డుకు చెందిన షేక్ సోందు కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. భార్య సైదాబీ తన ముగ్గురు ఆడపిల్లలు హుస్సేన్బీ(6), ఆసియా(3), జైనా(ఏడాదిన్నర), తల్లి కాశీంబీతో కలసి వెంకటగిరి ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లతో నివాసం ఏర్పాటు చేసుకొని.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో సైదాబీ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మృతి చెందింది. ఈ విషయం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లికోసం ఏడుస్తుండటంతో.. మద్యం మత్తులో ఉన్న అమ్మమ్మ కాశీంబీ వారిని తీవ్రంగా కొట్టింది. భయపడిన చిన్నారి ఆసియా ఏడుపు ఆపింది. మరో చిన్నారి జైనా ఏడుపు ఆపకపోవటంతో చితక్కొట్టింది. పక్కనున్న వారి గద్దించడంతో కొట్టడం ఆపేసింది. చుట్టుపక్కల వారు పడుకున్న తర్వాత కాశీంబీ తల్లిపాల కోసం ఏడుస్తున్న జైనా నోట్లో గుడ్డలు కుక్కి.. దారుణంగా చేతులు విరిచేసింది. భయంతో ఆసియా ఓ మూలన నక్కి పడుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సైదాబీ మృతదేహం చూసేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు వేలాడుతున్న చిన్నారి చేతులను చూసి కాశీంబీని గద్దించారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా.. ఆశియా తన చెల్లెలిని రాత్రి నుంచి కొడుతూనే ఉందని చెప్పింది. స్థానికులు స్వచ్ఛంద సంస్థ అన్నం ఫౌండేషన్కు ఫోన్ చేయడంతో ఆ సంస్థ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావుతో పాటుగా వన్టౌన్ సీఐ రమేశ్ వచ్చి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. చింతకాని హాస్టల్లో ఉంటోన్న పెద్ద కుమార్తె హుస్సేన్బీని తీసుకొచ్చి గంజేషాహిద్ మసీద్ కమిటీ వారు సైదాబీకి అంత్యక్రియలు నిర్వహించారు. జైనా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, హుస్సేన్బీ.. ఆసియాలను అన్నం ఫౌండేషన్ చేరదీసింది. వారు ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడి.. ఆ చిన్నారులను బాలసదన్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ పారిపోయింది. -
అనారోగ్యలక్ష్మి
ఆదిలాబాద్ టౌన్ : గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ జిల్లాలో పథకం అనారోగ్యలక్ష్మీగా మారింది. పలు అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో పథకానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో పాలు, నూనె, పప్పు సరఫరా కావడంలేదు. కోడిగుడ్లు సరఫరా అవుతున్నప్పటికీ కొన్ని సెంటర్లలో వాటిని సక్రమంగా పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 5 ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,256 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 987 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 269 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 21,685 మంది, 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 30,503 మంది, గర్భిణీ, బాలింతలు 10,520 మంది ఉన్నారు. కాగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతిరోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తి స్థాయి భోజనం వండిపెట్టాలి. కానీ జిల్లాలో ఏ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ప్రస్తుతం చాలా కేంద్రాల్లో పాలు, నూనె, పప్పులు లేవు. ఉడికించిన కొడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా ఉడికించకుండానే కార్యకర్తలు వాటిని ఇంటికి ఇస్తున్నారు. లోపించిన పర్యవేక్షణ.. ఐసీడీఎస్లో రెగ్యూలర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టుకు గత ఐదారు సంవత్సరాలుగా ఇన్చార్జి అధికారులతో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో చాలా అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించడంలేదు. దీంతో కొంత మంది అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన గుడ్లు, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపనలు ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టులో డిసెంబర్ 20 నుంచి పాల సరఫరా లేదు. ఉట్నూర్, బోథ్ ప్రాజెక్టులో కూడా అదే పరిస్థితి. పాలసరఫరా నిలిచి నెలరోజులు దాటినా అధికారులు పట్టించుకోవడంలేదని అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పాలకోసం టెండర్ వేస్తాం.. గత కొన్ని రోజులుగా పాల సరఫరా నిలిచిపోయింది. త్వరలో కొత్త టెండర్లు వేస్తాం. పప్పు, నూనె, సరుకులు ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు మెనూ ప్రకారం భోజనం వండిపెట్టాలి. సమయానికి కేంద్రాలను తెరవాలి. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి -
అద్దె చెల్లించలేదని..అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
-
కలెక్టర్ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం ఉన్న ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయం కోసం వాడుకుంటూ.. రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని, అద్దె బకాయిలు రూ.3 లక్షల చెల్లించాలని నోటీసులు జారీచేసినా కలెక్టర్ స్పందించలేదని పేర్కొంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి.. జిల్లా కలెక్టర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్కు వచ్చారు. -
అమ్మో..ఆడపిల్ల.. మాకొద్దు !
ఆడపిల్ల ఉంటే.. ఆ ఇంటికి వెలుగు.. ఈ నినాదం.. ప్రసంగాలకే పరిమితమవుతుందా.. వరుసగా మూడు, నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే.. ఆమ్మో..ఆడపిల్ల అని బావురుమంటున్నారు.. ఈ ‘బరువు’ మోయలేమని చేతులెత్తేస్తున్నారు.. ఒకవైపు..కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరోవైపు అవగాహనలోపం.. కారణం ఏదైనా ఆడపిల్ల అంటే అరిష్టం అనుకుంటున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన తల్లిదండ్రులు మూడు, నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే తాము సాకలేమని ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తున్నారు..ఇలాంటి ఘటనే శుక్రవారం చోటుచేసుకుంది. చందంపేట మండలంలో నాలుగు జంటలు తమకు పుట్టిన ఆడపిల్లలను సాకలేమంటూ తెగేసి చెప్పారు. వారికి ఐసీడీఎస్ అధికారులు, జెడ్పీచైర్మన్ స్వయంగా కౌన్సిలింగ్ ఇవ్వగా, రెండు జంటలు తమ పిల్లలను తిరిగి తీసుకోగ, మరో రెండు జంటలు ఆరునెలల వరకు సాకి ఆ తర్వాత శిశుగృహకు అప్పగిస్తామని చెప్పారు. – చందంపేట చందంపేట (దేవరకొండ) : సృష్టికి మూలం అమ్మ... ఆ తల్లిదండ్రులకు జన్మచ్చింది కూడా ఓ మాతృమూర్తే... అలాంటిది నవమాసాలు మోసి కన్నాక ఆడపిల్ల అని తెలియడంతో సాకలేమని సాకులు చెబుతున్నారు.. నన్ను కన్న నా తల్లి కూడా ఆడదే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడ పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీ పాఠశాలల నుంచి పాలు, గుడ్డు, పౌష్టికాహారం కూడా అందిస్తోంది. అదే విధంగా ఆడ పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కూడా పథకాలు అమలవుతున్నాయి. అయినా చందంపేట మండల ప్రజల ధో రణిలో మార్పు రావడం లేదు. తాజాగా ఒకే రోజు నలు గురు తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలను సాకలేమని ఐసీ డీఎస్ అధికారులకు అప్పగించేందుకు ముందుకొచ్చారు. ఆడశిశువులు వద్దనుకున్న ఆ నలుగురు.. ♦ నేరెడుగొమ్ము మండలం పీర్లచావిడి గ్రామానికి చెందిన నేనావత్ సరస్వతి, లక్ష్మణ్ దంపతులకు మొదట మగ సంతానం కలుగగా, 2,3,4వ కాన్పుల్లో ఆడ పిల్లలు జన్మించారు. దీంతో 4వ కాన్పులో జన్మించిన ఆడపిల్లను వదిలించుకునేందుకు ఆ తల్లిదండ్రి సిద్ధమయ్యారు. ఇదే విషయమై ఐసీడీఎస్ అధికారులు చందంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ బాలునాయక్ దృష్టికి విషయాన్ని తీసుకురావడంతో స్పందించిన ఆయన దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకునేలా చూస్తానని హామీనిచ్చారు. దీంతో దంపతులు శిశువును సాధుకుంటామని చెప్పడంతో వారిని ‘మన ఇంటి లక్ష్మి’ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్మన్ సన్మానించారు. ♦ నేరెడుగొమ్ము మండల పరిధిలోని పందిరిగుండుతండాకు చెందిన జ్యోతి, లాలు దంపతులకు 1,2,3 కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించడంతో 3వ సంతానాన్ని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా పీడీ పుష్పలత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు తాగించాలని సూచించారు. అనంతరం ఆడ పిల్లను వదులుకోవాలనుకుంటే ముందుకు రావా లని అన్నారు. అప్పటి దాకా శిశువుకు ఎలాంటి హాని తలపెట్టొద్దని రాతపూర్వకంగా పత్రం తీసుకున్నారు. ♦ చందంపేట మండలం తెల్దేవర్పల్లి పరిధిలోని బాపన్మోట్తండాకు చెందిన నేనావత్ సుశీల, గోపాల్ దంపతులకు 1,2 కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించారు. దీంతో 2వ కాన్పులో పుట్టిన ఆడ శిశువును శిశుగృహకు అప్పగిస్తామని అనడంతో ఐసీడీఎస్ అధికారులు కౌన్సి లింగ్ నిర్వహించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రుణ సదుపాయం కల్పిస్తే తమ శిశువును కాపాడుకుంటామని పేర్కొన్నారు. పీడీ పుష్పలత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థికసాయానికి హామీఇవ్వడంతో వారు శిశువును వదులకునే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ♦ చందంపేట మండలం యల్మలమంద గ్రామపంచాయతీ బిచ్చితండాకు చెందిన బాణావత్ లక్ష్మి, బిచ్చు దంపతులకు వరుసగా మూడు కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించారు. దీంతో 3వ కాన్పులో జన్మించిన ఆడ శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు ఆ పాపకు ఆరు నెలలు తల్లిపాలు అందించాలని సూచించారు. -
పేగుబంధం తెంచుకున్న కన్నతల్లి
-
అమ్మా.. అప్పుడే పెళ్లొద్దమ్మా..!
వెలిగండ్ల: జిల్లాలో బాల్య వివాహాలు ఏదోఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఐసీడీఎస్, పోలీసు అధికారులు కొన్ని బాల్య వివాహాలను అడ్డుకుంటున్నా.. ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. కొన్నిచోట్ల రాత్రికి రాత్రే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. రాష్ట్రంలో బాల్య వివాహాలు నమోదు విషయంలో జిల్లా చెప్పుకోదగ్గ స్థానంలోనే ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. బాల్య వివాహాల గణాంకాలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. పేదరికం, నిరక్ష్యరాస్యత, చైతన్యం లేకపోవడం ప్రధాన కారణం. బాల్య వివాహాలను నిరోధించేందుకు నిరంతర ప్రచారం అవసరం. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి. మతాల పెద్దలు, తల్లిదండ్రులకు బాల్య వివాహాలతో కలిగే నష్టాలు, వాటి చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గణాంకాలు ఇలా.. జిల్లాలో 2014 నుంచి 2017 డిసెంబర్ వరకు 804 బాల్య వివాహాలను అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అడ్డుకున్నారు. 2014లో 237, 2015లో 274, 2016లో 249, 2017లో నేటి వరకు 44 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది వెలిగండ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల్లో బాల్య వివాహాలను ఐసీడీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. వెలిగండ్ల మండలం కంకణంపాడులో అక్టోబర్లో బాల్యవివాహం జరుగుతోందని సమాచారం తెలియడంతో సీడీపీఓ బి.లక్ష్మీప్రసన్న, ఎస్ఐ పి.చౌడయ్యలు రాత్రి వేళ ఆ గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ నెల 19వ తేదీన మండలంలోని కొట్టాలపల్లిలో బాల్య వివాహం చేస్తున్నారని స్వయంగా ఓ మైనర్ 100 నంబర్కు కాల్ చేసి వివాహాన్ని ఆపాలని కోరడం విశేషం. స్పందించిన సీడీపీఓ బి. లక్ష్మీప్రసన్న, ఎస్ఐ పి.చౌడయ్యలు జరగబోయే బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ మైనర్ను ఒంగోలు బాలసదన్కు తరలించారు. ఈ ఏడాది సీఎస్పురం మండలం కె.అగ్రహారంలో ఒకే రోజు రెండు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. హనుమంతునిపాడు హాజీపురంలో జరగబోయే బాల్య వివాహాన్ని నిలువరించగలిగారు. ఇవిగో..అనర్థాలు ♦ బాల్య వివాహాలు చేస్తే ముఖ్యంగా బాలికల విషయంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ♦ చిన్న వయసులోనే గర్భిణులు కావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦ నెలలు నిండకముందే ప్రసవించే ప్రమాదం ఉంటుంది. ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి.. ♦వైకల్యంతో కూడిన శిశు జననాలు, మరణాలు జరగవచ్చు. ♦మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦శారీరక ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. ♦భయంతో, సిగ్గుతో చదువు మధ్యలో నిలిపేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిరక్ష్యరాస్యతే కారణం బాల్య వివాహాలు జరిగేందుకు ముఖ్యకారణం నిరక్ష్యరాస్యత. కుటుంబ పరిస్థితులను ఆధారం చేసుకొని బాల్యవివాహాలు చేయడం పరిపాటైంది. తల్లిదండ్రుల్లో అభద్రతా భావాన్ని పోగొట్టాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి బాల్యవివాహాలను నిరోధించేందుకు తగు చర్యలు చేపడుతున్నాం. – బి.లక్ష్మీప్రసన్న, సీడీపీఓ, వెలిగండ్ల -
అంగన్వాడీలకు ‘ఆన్లైన్’లో సరుకులు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్తగా సప్లై చైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు చేరవేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్యాబ్లు, బార్కోడింగ్ విధానాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇదే నమూనాను జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బార్కోడ్ ద్వారానే పంపిణీ.. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 22.28 లక్షల మంది బాలింతలు, గర్భిణులు, శిశువులకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. పోషకాహార పంపిణీకి ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తుండగా... కొన్నిచోట్ల ఈ సరుకులు పక్కదారి పడుతుండడంతో లక్ష్యం గాడితప్పుతోంది. దీంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ఉపక్రమించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు పరిధిలో ఒకటి చొప్పున 149 గోదాములున్నాయి. వీటి ద్వారా పప్పులు, వంటనూనె, మురుకులు, బాలామృతం ప్యాకెట్లను అంగన్వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల నుంచి జారీ అయ్యే ప్రొసీడింగ్ల ద్వారా కేంద్రాలకు సరుకులను సరఫరా చేస్తుండగా... ఇకనుంచి బార్కోడ్ పద్ధతిని అమలు చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రం స్థాయిలో అవసరమైన కోటా వివరాలను ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ముందుగా చేరవేయాల్సి ఉంటుంది. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు ఆయా కేంద్రాలకు అవసరమైన కోటా విడుదల చేస్తూ.. సరుకుల వారీగా బార్కోడ్ను ఆన్లైన్లో కేంద్రం నిర్వాహకులకు జారీ చేస్తారు. అలాగే సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టరు సదరు కోటాను అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లినప్పుడు అంగన్వాడీ టీచర్ వేలిముద్రలు నమోదు చేస్తేనే కోటా పంపిణీకి సంబంధించిన ఫైలు తెరుచుకుంటుంది. అనంతరం బార్కోడ్ ద్వారా సరుకులను పొందాల్సి ఉంటుంది. వేలిముద్రల నమోదుకు కాంట్రాక్టరు వద్ద ట్యాబ్ ఉంటుంది. అదేవిధంగా బార్కోడ్ వివరాలు, సరుకుల పంపిణీ సమాచారం ట్యాబ్లో నిక్షిప్తం కావడంతో పంపిణీ చేసిన వెంటనే ఆ సమాచారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్కు చేరుతుంది. దీంతో కాంట్రాక్టరు రూటుమ్యాపు సైతం తెలుస్తుందని, సరుకులు దారితప్పే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో బార్కోడ్ విధానాన్ని మూడు నెలల క్రితం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ కార్యక్రమం అక్కడ సత్ఫలితాలిచ్చింది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. -
నారాయణ.. నారాయణ!
ఓ సీనియర్ అసిస్టెంట్ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.50కోట్లు. జీవితాంతం కష్టపడినా నాలుగు రాళ్లు మిగుల్చుకునేందుకు చిరుద్యోగుల ఎన్నో లెక్కలు వేసుకుంటారు. అలాంటిది.. కోట్లాది రూపాయలు కూడబెట్టిన నారాయణరెడ్డి ఇప్పుడు ఆ స్థాయి ఉద్యోగులతో పాటు జిల్లా అధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారారు. అసలు ఎవరీయన? ఈ స్థాయికి ఎలా ఎదిగారు? మూలాల్లోకి వెళితే.. వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కదిరి: ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఐసీడీఎస్ సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి పేరు జిల్లా వ్యాప్తంగా మార్మోగుతోంది. ధర్మవరం–బత్తలపల్లి మార్గమ««ధ్యంలోని వేల్పుమడుగు ఇతని స్వగ్రామం. పిల్లల పోషణలో భాగంగా 1980లో అనంతపురానికి మకాం మారింది. తపోవనం ప్రాంతంలో నివాసం ఉంటూ సైకిల్పై ఇంటింటికీ వెళ్లి పాలమ్మేవాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో కాపురం ఉంటున్న అప్పటి ఐసీడీఎస్ పీడీ భగీరథమ్మ(ప్రముఖ రచయిత కొలకనూరి ఇనాక్ సతీమణి) ఇంటికీ పాలు పోస్తుండేవాడు. ఆ సందర్భంలో ‘మేడం.. ఇల్లు జరగటం కష్టంగా ఉంది. పిల్లలను బాగా చదివించాలని అనంతపురానికి చేరుకున్నా. సాయం చేయాలని ప్రతిరోజూ ప్రా«ధేయపడేవాడు. జాలిపడిన ఆమె.. ఐసీడీఎస్ శాఖకు అనుబంధంగా ఉన్న సేవాసదన్లో గుంతలు తీసి మొక్కలు నాటేందుకు ఎన్ఎంఆర్గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఆ తర్వాత అటెండర్గా.. జూనియర్ అసిస్టెంట్గా.. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఇప్పటికీ ఇతను జిల్లా కేంద్రంలోని కొవూరునగర్, తపోవనం ప్రాంతాల్లో పాలనారాయణరెడ్డిగానే చిరపరిచుతులు. ఒకప్పుడు ఇక్కడే పాలమ్మేవాడు.. రూ.కోట్లు ఎలా సంపాదించాడని స్థానికులు ఆశ్యర్యపోతున్నారు. ఆ ఫైల్ను మాయం చేశారట.. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసే టెండర్కు సంబంధించిన టెండర్ బాక్స్ను పై అధికారులకు తెలియకుండా నారాయణరెడ్డి గోల్మాల్ చేస్తున్నట్లు గ్రహించిన అప్పటి ఏజేసీ చెన్నకేశవరావు ఇతన్ని సస్పెండ్ చేశారు. విచారణ చేపట్టాలని అప్పట్లో ఆదేశించారు. ఆ బాధ్యతలను అప్పటి బీసీ కార్పొరేషన్ ఈడీ, ప్రస్తుత ఐసీడీఎస్ పీడీ అయిన వెంకటేశంకు ఆ ఫైల్ను అప్పగించండని అప్పటి పీడీ విజయలక్ష్మిని ఆదేశించారు. అయితే నారాయణరెడ్డి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫైల్ వెంకటేశంకు చేరకుండా జాగ్రత్త పడ్డారు. తనకున్న పలుకుబడితో మళ్లీ మూడు రోజుల్లోనే సస్పెన్షన్ను ఎత్తివేయించుకున్నట్లు తెలిసింది. అలాగే తనపై ఆ రోజు ఏజేసీ విచారణకు ఆదేశించిన ఫైల్నే మాయం చేశారనే చర్చ జరుగుతోంది. పెద్ద మోసగానివే! నారాయణరెడ్డి ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తూ పెద్ద మెసగానివే అని ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీ జయరామరాజు అన్నట్లు తెలుస్తోంది. ఆ మాట ఎందుకన్నారంటే.. జీసెస్ నగర్లో ఓ దళిత మహిళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని ఆమెకు సంబంధించిన రూ.22.50 లక్షల విలువ చేసే 3 సెంట్ల స్థలాన్ని కేవలం రూ.10 లక్షలు ఇచ్చి తన పేరిట రాయించుకున్నట్లు సమాచారం. అయితే అగ్రిమెంట్ పత్రాల్లో మాత్రం రూ.22.50 లక్షలని కనబర్చినట్లు తెలిసింది. కాకపాతే.. ఆ తర్వాత స్థలం విలువ కేవలం రూ.5 లక్షలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. అగ్రిమెంట్లో అలా.. రిజిస్ట్రేషన్లో ఇలా.. అంటూ పెద్ద మెసగానివే.. అని డీఎస్పీ అన్నట్లు విశ్వసనీయ సమాచారం. బెయిల్కు సన్నాహాలు ఏసీబీకి పట్టుబడిన నారాయణరెడ్డి అప్పుడే ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నారాయణరెడ్డి రూ.2.30 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నాడని చూపారని, ఇప్పటికే ఆయన ఆ డబ్బుకు లెక్కాచారాలు సిద్ధం చేసినట్లు సమాచారం. తాను అక్రమంగా సంపాదించలేదని, తనది సక్రమ సంపాదనేనని.. బెయిల్ మంజూరు చేయాలని శుక్రవారం ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరనున్నట్లు తెలిసింది. -
పిల్లలను దత్తత తీసుకుంటున్నారా..అయితే !
► చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు ► అవగాహన లేమితో అనర్థాలు చిత్తూరు : పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకుంటూ ఉంటారు. దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం విధించిన విధి విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కొందరు వాటికి కట్టుబడకుండా అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఇలా చేయడం తప్పు అని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదని పేర్కొంటున్నారు. అవగాహన లేమితో అనర్థాలు కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసుకున్న ఒప్పందం కొంతకాలం తరువాత బయటపడుతుండడంతో జన్మనిచ్చిన తల్లులే కాకుండా పెంచుకున్న తల్లులు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అభం, శుభం తెలియని చిన్నారులు ఏ తల్లి ఒడికీ చేరక శిశు గృహాలకే చేరుకుంటున్నారు. దత్తత తీసుకోవాలంటే.. పిల్లలు లేని దంపతులకు ఆ లోటు ఉండకూడనే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ దత్తత పక్రియను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విభాగం కూడా ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో శిశు గృహాలను ఏర్పాటు చేశారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆ లోటును పూడ్చేందుకు, అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చేందుకు ఐసీడీఎస్ పని చేస్తోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలను దత్తతకు అర్హులు. దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు వారి అర్హత ఆధారంగా పిల్లలను ఇస్తారు. పిల్లలను దత్తత తీసుకోవాలనే వారు ఆన్లైన్లో దరఖాస్తును పూరించాలి. భార్యాభర్తల ప్రస్తుత ఫొటో, వారి వయస్సు, ఇంటి చిరునామా, నివాస, ఆధార్ కార్డులు, ఆదాయ (రూ.లక్షకు పైగా ఉండాలి), వేతనం, వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు పాన్ కార్డు నమోదు చేయాల్సి ఉంటుంది. ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. దత్తత తీసుకునే తల్లిదండ్రులు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకుని ఫిట్నెస్ సర్టిపికెట్లను అధికారులకు అందజేయాలి. భవిష్యత్తులో ఇబ్బందులు అక్రమ పద్ధతిలో దత్తత తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అర్హులు పిల్లలను దత్తత తీసుకోవచ్చు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. – లక్ష్మీ, ఐసీడీఎస్, పీడీ -
సారథి లేక.. జీతాలు రాక..!
– నెల రోజులుగా సెలవులో ఐసీడీఎస్ పీడీ – తాజాగా రెండు నెలల గడువు పొడిగింపు – ఉద్యోగులకు అందని జూలై వేతనాలు అనంతపురం టౌన్: మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు ప్రారంభమై ఐదు రోజులు దాటినా ఇంకా వేతనాలు పడని పరిస్థితి. అసలు వేతనాలు పడుతాయా లేక మరోరెండు నెలలపాటు వేచి ఉండాల్సి వస్తుందా అన్నదిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. జిల్లాలో 17 సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టులుండగా అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగుల జీతాల బిల్లులపై ఆయా ప్రాజెక్టుల్లోని సీడీపీఓ (డ్రాయింగ్ ఆఫీసర్లు)లే సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లోని ఉద్యోగులకు ఎలాంటి సమస్య లేదు. అయితే అనంతపురంలోని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు మంజూరు కావాలంటే డ్రాయింగ్ ఆఫీసర్గా ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ సంతకం తప్పనిసరి. ఇక్కడ పీడీగా ఉన్న జుబేదాబేగం రెండు నెలల క్రితం కర్నూలుకు బదిలీపై వెళ్లారు. దీంతో ఏపీడీగా ఉన్న ఉషాఫణికర్కు పీడీగా ఎఫ్ఏసీ ఇచ్చారు. నెల క్రితం ఆమె సైతం సెలవు పెట్టారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉన్న కారణంగా సెలవులో వెళ్లిన ఆమె తాజాగా మరో రెండు నెలల పాటు సెలవు పొడిగించుకున్నారు. ఇప్పటికే అనంతపురం అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓగా ఉన్న కృష్ణకుమారికి తాత్కాలిక ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈమెకు చెక్పవర్ లేని కారణంగా ప్రస్తుతం తన ప్రాజెక్టులో మినహా ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగుల జీతాల బిల్లులపై సంతకం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కార్యాలయంలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్ట్, ఒక వాచ్మన్, ఇద్దరు అటెండర్లు, ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. ప్రతి నెలా వీరి జీతాల కోసం రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. పీడీ లేని పక్షంలో ఏపీడీ ఉన్నా జీతాల మంజూరుకు వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఇద్దరూ లేకపోవడంతో ఉద్యోగులకు జీతాల వెతలు తప్పేలా లేదు. పీడీగా ఉన్న ఉషాఫణికర్ కూడా సెలవు పొడిగించుకున్న నేపథ్యంలో అన్ని రోజులు వేతనాల కోసం ఎదురుచూడాలా అన్న సందేహం ఉద్యోగుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ పీడీగా వెంకటేశం వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ప్రస్తుతం వెంకటేశం జిల్లా యువజన సంక్షేమ అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వీరపాండియన్ ప్రత్యేక దృష్టి సారిస్తే అటు ఉద్యోగుల సమస్యలతో పాటు అంగన్వాడీల బలోపేతం జరిగే అవకాశం ఉంది. -
అనారోగ్యలక్ష్మి..!
► ఆరోగ్యలక్ష్మి పథకానికి సరుకుల కొరత ► అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు నోచుకోని మెనూ ► నిలిచిన భోజనం ► గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందని పౌష్టికాహారం ► ఐదు నెలలుగా సరఫరా కాని నూనె ► పర్యవేక్షణ లోపం ఆదిలాబాద్టౌన్: గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో పథకం అమలులో ఆటంకం ఎదురవుతోంది. ఫలితంగా జిల్లాలో ఆరోగ్యలక్షి పథకం అనారోగ్యలక్ష్మిగా మారింది. జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం, పాలు, కంది పప్పు, నూనె సరఫరా కావడం లేదు. కోడి గుడ్ల సరఫరా పూర్తిస్థాయిలో జరగడం లేదు. మురుకులు కూడా లేకపోవడంతో కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. దీంతో ఐసీడీఎస్ అస్తవ్యస్తంగా మారుతోంది. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉన్నప్పటికీ కనీసం పప్పు అన్నం కూడా పెట్టడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సరకులు లేకపోవడంతో చాలా కేంద్రాల్లో వంట చేయడం లేదు. సమయానికి కేంద్రాలు తెరవడం లేదు. పిల్లల సంఖ్య ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ ఉండడం లేదు. కొన్ని సెంటర్లలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వండిన భోజనం టిఫిన్ బాక్స్ల్లో పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. జిల్లాలో అంగన్వాడీ పోస్టుల, సూపర్వైజర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఐసీడీఎస్ గాడితప్పింది. రెగ్యులర్ అధికారులు లేక పోవడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లాలో.. జిల్లాలోని 18 మండలాల్లో 5 ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 987 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 269 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 31,471 మంది, 3 సంవత్సరాల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 22,053 మంది, గర్భిణులు, బాలింతలు 13,357 మంది ఉన్నారు. కాగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తి స్థాయి భోజనం వండిపెట్టాలి. కానీ జిల్లాలో ఏ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలా కేంద్రాల్లో ప్రస్తుతం నూనె, కందిపప్పు, బియ్యం సరుకులు లేవు. నాణ్యమైన భోజనం వండిపెట్టకపోవడంతో లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా ఉడికించకుండానే కార్యకర్తలు వాటిని ఇంటికి ఇస్తున్నారు. అయితే ఈ నెలకు సంబంధించి ఇంకా కోడి గుడ్లు కేంద్రాలకు సరఫరా చేయలేదని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. లోపించిన పర్యవేక్షణ.. ఐసీడీఎస్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు చాలామంది సమయపాలన పాటించడంలేదు. సక్రమంగా కేంద్రాలను తెరవడంలేదు. దీంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. కేంద్రాలు తెరిచిన వారిలో చాలామంది అంగన్వాడీలు భోజనం సక్రమంగా వండి పెట్టడం లేదు. సరుకులు ఉన్న కేంద్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పర్యవేక్షించాల్సిన కొంతమంది సూపర్వైజర్లు కార్యాయానికి పరిమితం అవుతున్నారు. దీంతో కొందరు అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన గుడ్లు, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరో పణలు ఉన్నాయి. కాగా ఆదిలాబాద్, ఉట్నూర్ ప్రాజెక్టుల సీడీపీవోలు డిప్యూటేషన్లో ఉండడంతో సూపర్వైజర్లు ఇన్చార్టీలుగా వ్యవహరిస్తున్నారు. 51 మంది సూపర్వైజర్లకు గాను 29 మంది మాత్రమే పని చేస్తున్నారు. 26 పోస్టులు ఖాళీగా దీంతో కేంద్రాల పర్యవేక్షణ లోపించి ఆరోగ్యలక్ష్మి అనారోగ్యలక్ష్మిగా మా రుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ పథకంలో భాగంగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కానీ ఏ కేం ద్రంలో మెనూ పాటించడం లేదు. ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు జాడలేదు. పప్పునీళ్లు, ఉడికించిన గుడ్డును మాత్రమే ఇస్తున్నారు. దొడ్డు బియ్యంతో భోజనం పెట్టడంతో చాలా మంది తినడానికి కేంద్రాలకు రావడం లేదు. వారం ఇవ్వాల్సిన భోజనం సోమవారం అన్నం, కూరగాయలతో సాంబారు, గుడ్డు కూర, పాలు మంగళవారం అన్నం, పప్పు, ఆకు కూరలు, గుడ్డు, పాలు బుధవారం అన్నం, ఆకు కూరలతో పప్పు, గుడ్డుకూర, గుడ్డు, పాలు గురువారం అన్నం,కూరగాయలతో సాంబారు, పెరుగు,గుడ్డుకూర, పాలు శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూరలతో కూర, గుడ్డు, పాలు శనివారం ఆకుకూరలతో పప్పు, పెరుగు, గుడ్డు, పాలు నూనె సరఫరా లేదు.. గత కొన్ని నెలలుగా నూనె సరఫరా కావడం లేదు. పాలు, గుడ్లు, బియ్యం, కంది పప్పు సరుకులు కేంద్రాల్లో ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. ప్రతి రోజు కేంద్రాలను తెరవాలి. – ఉమారాణి, ఇన్చార్జి సంక్షేమాధికారి, ఆదిలాబాద్ -
ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీగా ఉషాఫణికర్
అనంతపురం టౌన్ : మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ఇన్చార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉషాఫణికర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పీడీగా ఉన్న జుబేదాబేగం ఇటీవల కర్నూలుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రెగ్యులర్గా ఎవరినీ నియమించలేదు. అసిస్టెంట్ పీడీగా ఉన్న ఉషాఫణికర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. పీడీ జుబేదాబేగం రిలీవ్ అయ్యారు. -
ఐసీడీఎస్లో బినామీ కాంట్రాక్టర్!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు ఓ బినామీ కాంట్రాక్టర్కు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిచ్పల్లి మండలంలోని ఓ ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు వేరే వ్యక్తి పేరుపై అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు రవాణా చేసే టెండరును దక్కించుకున్నాడని తెలిసినా.. అధికారులు తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాగా ప్రస్తుతం బినామీ కాంట్రాక్టర్గా ఉన్న శ్రావణ్ సరుకులు సరఫరా చేస్తుండగా, ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు పలుమార్లు ప్రాజెక్టు కార్యాలయానికి వచ్చి దగ్గరుండి సరుకులను రవాణా చేయించినా అధికారులు ఆయన ఎవరనేది కూడా పట్టించుకోకపోవడం వెనుక అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు ప్రతినెలా ముడుపులు కూడా అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నాలుగు నెలల క్రితం నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 258 అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం, పప్పులు, నూనెలు, బాలామృతం ఇతర సరుకులను సరఫరా చేయడానికి జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన టెండర్లు జరిగాయి. అయితే అప్పటికే డిచ్పల్లి ప్రాజెక్టుకు టెండర్ దక్కించుకున్న సదరు ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో కూడా సరుకులు రవాణా చేయడానికి పాలువు కదిపాడు. తాను ఇది వరకే ఓ ప్రాజెక్టులో టెండరు దక్కించుకున్న నేపథ్యంలో వేరే ప్రాజెక్టులో టెండరు వేయడానికి వీలు పడదని శ్రావణ్ అనే వ్యక్తి పేరుపై అర్బన్ ప్రాజెక్టుకు టెండరు వేసి కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలిసింది. పేరు, బిల్లులను శ్రావణ్ పేరుపైనే అధికారులు చేస్తున్నా.. డబ్బులు మాత్రం సదరు ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడికే ముడుతున్నట్లు సమాచారం. అయితే కమిషన్ మట్టుకే టెండరు దక్కించుకున్న శ్రావణ్ పని చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసినా పట్టింపులేదు.. బినామీ కాంట్రాక్టర్గా శ్రావణ్ కొనసాగుతున్నాడనే దానికి ఆయనే గతంలో ఒప్పుకున్నట్లు సాక్ష్యాలు ప్రాజెక్టు కార్యాలయంలోని ఓ అధికారికి తెలిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయం సీడీపీవో వరకు వెళ్లినప్పటికీ శ్రావణ్తో మిలాఖత్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బినామీ పేరుపై శ్రావణ్ కాంట్రాక్టర్గా చలామణి అవుతున్నాడని.. ఈ విషయంపై ప్రాజెక్టు అధికారులను వివరణ కోరగా తమకేమీ తెలియదని మాట దాటవేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్ శ్రావణ్ను వివరణ కోరగా వేరే వ్యక్తుల ప్రమేయం లేదని, తానే కాంట్రాక్ట్ను దక్కించుకుని సరుకులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రొసీడింగ్లో శ్రావణ్ పేరే ఉంది జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన టెండర్లు జరిగా యి. జేసీ ఇచ్చిన ప్రొసీడింగ్లో మాత్రం కాంట్రాక్ట్ను శ్రావణ్ దక్కించుకున్నట్లు ఉంది. ఓ ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు శ్రావణ్ను బినామీగా పెట్టుకుని కాంట్రాక్టర్గా పని చేస్తున్న విషయం నాదృషికి రాలేదు. – డెబోరా, సీడీపీవో, నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు -
ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం బదిలీ
అనంతపురం టౌన్ : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జుబేదాబేగంను కర్నూలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి అపర్ణ ఉపాధ్యాయ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులో పీడీ పోస్టు ఖాళీగా ఉండడంతో మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జుబేదాబేగం గతంలో వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, హైదరాబాద్లో పనిచేశారు. తాజాగా ఈమెను కర్నూలుకు బదిలీ చేసిన ప్రభుత్వం ఇక్కడికి మాత్రం ఎవరినీ నియమించలేదు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న ఉషాఫణికర్కు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
అమ్మా థ్యాంక్స్ !
నన్ను చంపనందుకు.. ‘అమ్మా.. నీకు ఏ కష్టమొచ్చిందో తెలియదు.. పెళ్లి కాకుండానే నన్ను కన్నావో.. కఠినాత్ముడైన నాన్నను పరిచయం చేయలేకనో.. ఆడపిల్లననే కారణమో.. మరో సమస్యనో తెలియదు.. కన్న పేగు బంధాన్ని తెంచుకోవాలనుకున్నావు. బొడ్డు పేగు కూడా ఆరకుండానే నన్ను వదిలించుకున్నావు. కొందరు తల్లులా ప్రాణం తీయకుండా అందరికీ కనిపించేలా ముళ్ల కంపల మధ్య వదిలేసి వెళ్లావు. థ్యాంక్స్ అమ్మా.. ఈ లోకాన్ని చూపినందుకు.. నన్ను చంపనందుకు. నేను ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నాను.. నీవు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను’. అంటూ ఓ నవజాత శిశువు ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆదోని పట్టణంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మిగనూరు బైసాప్ రోడ్డులో ముళ్ల కంపల మధ్య అప్పుడే కళ్లు తెరిచిన పసికందను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న తులసి అనే మహిళ పసికందు ఏడుపు వినిపించి దగ్గరికి వెళ్లి చూసింది. స్థానికులకు సమాచారం అందించడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ సఫర్నిసా బేగం, సూపర్వైజర్లు అంజినమ్మ, ఆశీర్వాదమ్మ ఆసుపత్రికి వెళ్లి పసికందు పరిస్థితిని తెలుసుకున్నారు. ఆడపిల్ల కావడంతోనే ముళ్ల కంపల్లో పారవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు చిన్నారికి చికిత్సలు చేయడంతో ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీడీపీఓ తెలిపారు. కర్నూలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. - ఆదోని అగ్రికల్చర్ -
పౌష్టికాహారంపై నిర్లక్ష్యం తగదు
– సాక్షి ఎఫెక్ట్ కనగానపల్లి (రాప్తాడు) : అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు నాణ్యత లేకపోవడంపై ‘సాక్షి’లో శనివారం ‘ఉడికించు చూడ రబ్బరు గుడ్డు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. మండల కేంద్రం కనగానపల్లిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. నాసిరకం గుడ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో గుర్తించాలని సీడీపీఓ వనజాక్షిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన పీడీ నాసిరకం గుడ్లు బయటపడిన కనగానపల్లి మండలం కుర్లపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే గుడ్లను వినియోగించుకోవాలని సూచించారు. -
బాలిక నిశ్చితార్థాన్ని ఆపిన అధికారులు
చండూరు(నల్గొండ) : ఓ మైనర్ బాలిక కు నిశ్చితార్థాన్ని ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన గుండ్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కస్తాల గ్రామానికి చెందిన ఓ బాలిక చండూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లి కొంతకాలం కింద చనిపోయింది. దీంతో తండ్రి వెంకన్న ఆమె ఆలనాపాలన చూస్తున్నాడు. ఈ క్రమంలో గుండ్రపల్లికి చెందిన బాలిక మేనమామ శంకర్ మర్రిగూడ మండలం ఒట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో పెళ్లి చేసేందుకు నిర్ణయించాడు. రెండు రోజుల్లో నిశ్చితార్ధం పెట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ జయమ్మ ఏఎస్ఐ శంకరయ్యతో కలిసి గ్రామానికి చేరుకుని బాలిక బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేయమని కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. -
ఐసీడీఎస్ అధికారులపై విచారణ
ప్రొద్దుటూరు: ఐసీడీఎస్ ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు అధికారిణిపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి మంగళవారం కర్నూలు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శారదాదేవి అంగన్వాడీలను విచారణ చేశారు. ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలను హాజరు పరిచారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళి పత్రాన్ని ఇచ్చి సంతకాలు చేసి నింపాలని కోరారు. ఇందులో ‘సీడీపీఓ రాజేశ్వరిదేవి, సూపర్వైజర్ సావిత్రి ప్రతి విషయానికి ఇబ్బంది పెట్టి, భయపెట్టి, డబ్బు ఇవ్వకపోతే మీపై అధికారులకు రిపోర్టు చేస్తామని మిమ్మల్ని బెదిరిస్తున్నారన్నది వాస్తవమా కాదా?, సీనియర్ అసిస్టెంట్ బాషా పనితీరు సరిగా లేదని ఆరోపణలు చేయడం జరిగింది. వివరాలు తెలపగలరు?, ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి అంగన్వాడీ కార్యకర్త రూ.1000 అందించాలని సీడీపీఓతోపాటు సూపర్వైజర్లు మిమ్మల్ని ఆదేశించారా లేదా?, ఆరోపణ నిజమైనచో మీరు ఎంత మొత్తం, ఎవరికి చెల్లించారో తెలపగలరు?, సీడీపీఓ ట్రైనింగ్ పేరిట మీతో సంతకాలు తీసుకుని మీకు డబ్బు చెల్లించలేదన్న ఆరోపణ నిజమా కాదా? నిజమైనచో ఆ ట్రైనింగ్ వివరాలు, తేదీలతోపాటు హాజరయ్యారో లేదో తెలపగలరు?, ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ను ఏర్పాటు చేశామని ప్రతి నెల రూ.6 వేలు మీ వద్ద నుంచి వసూలు చేయడం జరిగిందా లేదా? మీరు ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారో తెలపగలరు?, అర్బన్ ప్రాజెక్టులోని మురికి వాడల్లో ఉన్న ఎస్సీ అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ సావిత్రి నోటికి వచ్చినట్లు కులం పేరుతో దూషించడం జరిగిందన్న ఆరోపణలపై మీరు వివరణ ఇవ్వడంతోపాటు ఎవరిని దూషించారో తెలపగలరు?’ తదితర ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు రాసిన అనంతరం పత్రాలను తీసుకున్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఫిర్యాదు సమావేశం అనంతరం కొంత మంది అంగన్వాడీలు ఆర్డీడీని కలిశారు. సీడీపీఓ తాము చెప్పినట్లు వినలేదనే కారణంతో యూనియన్ నేతలు కొంత మంది ఉద్దేశ పూర్వకంగానే ఈ విధంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదు చేసిన వారిని ఆమె పిలిపించారు. యూనియన్ నేతల ఒత్తిడి వల్లే తాము ఫిర్యాదు చేశామని వారు కూడా ఆర్డీడీకి వివరించారు. అనంతరం యూని యన్ నేతలను పిలిపించి మాట్లాడారు. తర్వాత లెటర్ హెడ్పై ఫిర్యాదు చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డిని కలిశారు. అలాగే అధికారులను విచారణ చేశారు. ఆర్డీడీ వెంట ఆర్డీడీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరమ్మ, సూపరింటెండెంట్ పద్మిని ఉన్నారు. -
లక్కిరెడ్డిపల్లె సీడీపీఓ అరుణశ్రీ సస్పెన్షన్
లక్కిరెడ్డిపల్లె: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న లక్కిరెడ్డిపల్లె సీడీపీఓ అరుణశ్రీని కమిషనర్ చక్రపాణి శుక్రవారం సస్పెండ్ చేశారు. శనివారం జిల్లా అధికారులు సస్పెన్షన్ ఆర్డర్ను ఇవ్వడానికి లక్కిరెడ్డిపల్లె ఐసీడిఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించారు. స్పందించకపోవడంతో చివరకు ఆమె ఉంటున్న ఇంటి బయట గోడకు అతికించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అరుణశ్రీ లక్కిరెడ్డిపల్లెలో విధులు చేపట్టాక అంగన్వాడీ వర్కర్ల నుంచి ఆయాల వరకు బెదిరింపు ధోరణితో వ్యవహరించేవారు. అంగన్వాడీ కేంద్రాలకు అందాల్సిన పౌష్టికాహారాన్ని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు పీడీ కూడా ఆమెకు తలొగ్గి పని చేసే నేపథ్యంలో ఇక్కడి అవినీతి భాగోతాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకురాలు ప్రభావతమ్మ తెలిపారు. కడప ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీడీపీఓగా పనిచేస్తున్న రెడ్డి రమణమ్మ కమిషనర్ ఉత్తర్వుల మేరకు లక్కిరెడ్డిపల్లె ఇన్ఛార్జ్ సీడీపీఓగా భాధ్యతలు చేపట్టారు. -
మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..
⇒పసికందును చంపేందుకు కసాయిగా మారిన కన్నతండ్రి ⇒కుటుంబసభ్యులు బతిమలాడినా కరగని మనసు ⇒పోలీసులకు, ఐసీడీఎస్కు సమాచారం ఇచ్చిన 108 సిబ్బంది ⇒తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి స్టేట్మెంటు రాసుకున్న పోలీసులు ⇒పలమనేరులో సంచనలం రేపిన ఘటన పలమనేరు: రెండో బిడ్డకూడా ఆడపిల్లే పుట్టిందని చంపేందుకు సిద్ధమయ్యాడో కసాయి తండ్రి. భార్య, కుటుంబసభ్యులు ఎంత వారించినా మనసు కరగలేదు. విషయం పోలీసులు, స్త్రీ–మహిళాసంక్షేమశాఖకు చేరడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చి బిడ్డకు హాని తలపెట్టనంటూ వాంగ్మూలం తీసుకున్నారు. ఈసంఘటన శుక్రవారం పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన శంకరప్ప(30), నాగమ్మ(24)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల ఆడపిల్ల ఉంది. శంకరప్ప తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగమ్మ మళ్లీ గర్భం దాల్చింది. రెండోబిడ్డ అయినా మగబిడ్డే కావాలని శంకరప్ప కలలుగన్నాడు. ఈనెల14న నాగమ్మకు ప్రసవనొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండో కాన్సులోనూ ఆడపిల్ల జన్మించింది. దీన్ని తట్టుకోలేని తండ్రి అప్పుడే శిశువు గొంతు నులిమి చంపేందుకు యత్నించా డు. దీంతో భార్య అడ్డుకుంది. ఈ విషయం తెలిసిన నాగమ్మ తండ్రి బిడ్డను తాను సంరక్షిస్తానని ముందుకొచ్చాడు. అయినా ఖాతరుచేయని తండ్రి తాను బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా బతిమలాడారు. అయినా అతని మనసు కరగలేదు. గురువారం ఆమెను ఆస్పత్రినుంచి డిశ్చార్చి చేయగా నాగమ్మ ఇంటికెళ్లలేదు. ఇంటికెళితే తనభర్త అన్నంత పనిచేస్తాడంటూ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఈ విష యం తెలుసుకున్న 108 సిబ్బంది కిశోర్, బాబా జాన్ స్థానిక ఉమెన్ అండ్ జువనైల్వింగ్కు సమాచారం ఇచ్చారు. సీడీపీవో రాజేశ్వరి, గ్రామ అంగ న్ వాడీ వర్కర్ సరసమ్మ, మహిళా పోలీస్స్టేషన్ ఏఎస్ఐ కీరీమున్నీసా సిబ్బందితో కలసి ఆస్పత్రికి చేరుకున్నారు. శంకరప్పకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బిడ్డ ప్రాణానికి ఏం జరిగినా బాధ్యత తండ్రిదేనని వాగ్మూలం తీసుకున్నారు. అంగన్వాడీ వర్కర్ పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. వీరి వెంట సూపర్వైజర్ ప్రసన్న, షీ టీం సిబ్బంది కవిత తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
కర్నూలు(హాస్పిటల్): దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామంలో త్వరలో జరగబోయే బాల్యవివాహాలను స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలో 15 సంవత్సరాలు, 17 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు వారి తల్లిదండ్రులు మార్చి 2, 3వ తేదీల్లో వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న వెంటనే ఐసీపీఎస్ డీపీసీవో శారద, ఐసీడీఎస్ పత్తికొండ సీడీపీవో టి. విద్య గ్రామానికి వెళ్లి బాలికల తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి, చట్టం గురించి వివరించారు. బాలికలకు మైనార్టీ(18 సంవత్సరాలు వచ్చేంత వరకు) తీరేంత వరకు పెళ్లి చేయబోమని వారితో అంగీకార పత్రాలు తీసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజనమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుచరిత, చైల్డ్లైన్ టీమ్ మెంబర్ అనిత ఉన్నారు. -
మాతాశిశు మరణాలను తగ్గించమే లక్ష్యం
ఎమ్మిగనూరురూరల్: మాతా శిశు మరణాలను తగ్గించటమే ఐసీడీఎస్ లక్ష్యమని వరల్డ్ బ్యాంక్ స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో ఎస్సీకాలనీలో 44 వ అంగ్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రా పనితీరును తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇస్నిప్ సంస్థ అంగన్వాడీ కేంద్రాల్లో సామాజిక వేడుకలను ఏవిధంగా నిర్వహించాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే అంశాలపై అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా గర్భిణులు ఆరోగ్య పరిక్షలు చేయించుకుంటున్నారా? లేదా, వారు తీసుకొవాల్సిన పోషక విలువలు, బిడ్డకు తల్లిపాల ఆవశ్యకతపై సెక్టారు సమావేశాల్లో సూపర్వైజర్లు వర్కర్లకు వివరించాలని సూచించారు. సమావేశంలో సీడీపీఓ నాగమణి పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాలు తగ్గించాలి
అనంతపురం టౌన్ : మాతాశిశు మరణాలు తగ్గించడానికి కృషి చేయాలని జేసీ–2 ఖాజామొహిద్దీన్ సూచించారు. మంగళవారం నగర శివారులోని మహిళా ప్రాంగణంలో ఐసీడీఎస్ 17 ప్రాజెక్టులకు సంబంధించిన జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అనంతరం వరల్డ్ బ్యాంక్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కృష్ణ వివిధ పథకాలను వివరించారు. రాష్ట్ర రిసోర్స్ గ్రూప్ సభ్యులు శ్రీదేవి, నాగమల్లీశ్వరి, పద్మావతి, విజయకుమారి, నాగమణి, సుధాకర్, ఐసీడీఎస్ ఏపీడీ ఉషాఫణికర్, పీఓడీటీటీ సుజాత, డీపీహెచ్ఎన్ఓ రాణి, ప్రాంగణం మేనేజర్ నాగమణి పాల్గొన్నారు. -
మహిళా శక్తి... మాటలకేనా?
ఈ ఫేస్బుక్, వాట్సాప్ యుగంలో మెజారిటీ జనం సూక్తులు చెప్పేవారే!!. సమాజ వికాసం ఆడపిల్లలతోను, మహిళలతోనే మొదలవుతుందని జైట్లీ కూడా చెప్పారు. మరి వారికోసం ఏం చేశారు? 14 లక్షల ఐసీడీఎస్ అంగన్వాడీలలో మహిళా శక్తి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామంటూ దానికి రూ.500 కోట్లిచ్చారు. ఒకో కేంద్రానికి రూ.4వేలకన్నా తక్కువే. దీంతో మహిళల సాధికారత, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్ఠికాహారం అన్నీ సాధ్యమవుతాయట!! గర్భిణీ స్త్రీలకు రూ.6 వేలిచ్చే పథకానికి అధికారిక ట్యాగ్ వేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 48 శాతంగా ఉన్న మహిళల భాగస్వామ్యం ఇపుడు 55కు చేరిందట. దీన్ని పురోగతిగా అనొచ్చా? దేశంలో మహిళలు : 58.6 కోట్లు (2011జనాభా లెక్కల ప్రకారం) -
సంక్షేమం నాస్తి.. సంపాదన జాస్తి!
– అవినీతి నిలయాలుగా ఐసీడీఎస్ ప్రాజెక్టులు – చిన్నారుల పొట్టకొట్టి దర్జాగా వసూళ్లు – అన్నింట్లోనూ సీడీపీఓల చేతివాటం – సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బందికీ వాటాలు ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ఏర్పాటు చేసిన సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) అక్రమాలకు నిలయంగా మారింది. ఈ పథకానికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను కొందరు అవినీతి అధికారిణులు స్వాహా చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలను నివారించాల్సిన సీడీపీఓలు, జిల్లా ఉన్నతాధికారులే అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తల నుంచి వసూళ్లకు పాల్పడడం.. కాదూ కూడదంటే వేధింపులకు గురిచేయడం రివాజుగా మారింది. అధికారుల ఇళ్లలో ఎలాంటి శుభకార్యం జరిగినా ఆ ఆర్థిక భారాన్ని కార్యకర్తలపై మోపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,286 మెయిన్, 840 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 4,082 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. ఈ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సూపర్వైజర్లు, అసిస్టెంట్ సీడీపీఓలు, సీడీపీఓలు, అసిస్టెంట్ పీడీ, ప్రాజెక్ట్ డైరెక్టర్పై ఉంటుంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. అవినీతికి అలవాటుపడిన పలువురు పర్యవేక్షణాధికారులు సరుకులను దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల వద్ద పర్సెంటేజీలకు కక్కుర్తి పడి బిల్లులు చేస్తున్నారు. కొందరైతే అంగన్వాడీ కార్యకర్తలనూ మామూళ్ల కోసం పీడిస్తున్నారు. వారి నుంచి బహుమతులు, పట్టుచీరలు లాంటివి తీసుకోవడమే కాకుండా చివరకు ఇళ్లలో పనులు చేసేందుకు కూడా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను వినియోగించుకుంటున్నారు. సెక్టార్ లీడర్ల స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరి వాటాలు వారికి ఉండడంతో అక్రమాలు సాఫీగా సాగిపోతున్నాయి. – శింగనమల ప్రాజెక్ట్ పరిధిలోని ఓ అధికారి చేతివాటానికి హద్దేలేకుండా పోతోంది. తన పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల నుంచి నెలవారీగా సరుకులు ఇవ్వకపోతే ఇంక అంతే సంగతి. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ అంగన్వాడీ కార్యకర్త ఏకంగా సదరు అధికారి ఇంట్లో పనులు చేసేందుకే పరిమితమవుతోంది. ఓ స్కూల్లో మధ్యాహ్న భోజనం వండిపెడితే ఆ ఆహారాన్ని సెంటర్లోని పిల్లలకు పెడుతూ సరుకులను అమ్ముకుంటున్న పరిస్థితి. – గతంలో కదిరిలోని ఓ ప్రాజెక్ట్లో పని చేసిన అధికారి అక్కడ అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగేళ్ల క్రితం జరిగిన నియామకాల్లోనూ పెద్దఎత్తున వసూలు చేశారు. ఈ విషయం తెలియడంతో ఇక ఇంటికి పంపించేస్తారని భావించి అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఓ ప్రాజెక్ట్కు బదిలీ చేయించుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన ఓ నాయకుడి అనుచరుల అండతో అక్రమాలు కొనసాగిస్తున్నారు. వసూళ్ల కోసమే ప్రత్యేకంగా ఇద్దరు ఉద్యోగులను నియమించుకున్నట్లు విమర్శలున్నాయి. – చెన్నేకొత్తపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని అధికారి ఏకంగా సరుకులను బహిరంగ మార్కెట్కు తరలిస్తున్నారు. ఓ అంగన్వాడీ కేంద్రాన్ని నడుతున్న మహిళ కొడుకు గతంలో అనంతపురంలో ఓళిగ సెంటర్ నిర్వహించేవాడు. ఇప్పుడు ధర్మవరంలో ఉంటున్నాడు. ఇక్కడి కేంద్రాల నుంచి సదరు ఓళిగ సెంటర్కు సరుకులు తరలిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కీలక టీడీపీ ప్రజాప్రతినిధి అండ ఉండడంతో పాటు తమకూ వాటా వస్తుండడంతో పట్టించుకోవడం లేదు. – ధర్మవరం ప్రాజెక్ట్లోని ఓ అధికారి ఏకంగా ‘పచ్చ’కండువా వేసుకుని పని చేస్తున్నారు. బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తను తన వెంటబెట్టుకుని ‘రాజకీయం’ చేయడం.. వసూళ్లకు పాల్పడడం చేస్తున్నారు. పైగా గతంలో కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ సైతం నిత్యం ప్రాజెక్ట్ కార్యాలయంలోనే తిష్టవేసి ఉంటాడు. – మడకశిర ప్రాజెక్ట్లో బియ్యం, నూనె, కందిబేడలు సరి‘హద్దు’ దాటుతున్నాయి. ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తుండగా, ముగ్గురు సూపర్వైజర్లు ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్నారు. గతంలోనూ పోస్టుల భర్తీకి సంబంధించి సదరు అధికారి కీలకంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. – హిందూపురం ప్రాజెక్ట్లోని ఓ అధికారి భర్త ఇక్కడ హల్చల్ చేస్తుంటాడు. టీడీపీ ప్రజాప్రతినిధి తర్వాత ‘సర్వం తానే’ అనుకుంటున్న వ్యక్తికి ఇతడు స్నేహితుడు కావడం.. ఈ విషయం అందరికీ తెలియడంతో అంగన్వాడీ కార్యకర్తలు కూడా అతను ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే! – కదిరిలోని ఓ ప్రాజెక్ట్ పరిధిలో ఽస్కూల్ సమీపంలోని అంగన్వాడీ సెంటర్లో పిల్లలెవరూ లేకున్నా ప్రతినెలా సరుకులు మాత్రం సరఫరా అవుతున్నాయి. ఓ సూపర్వైజర్ మధ్యవర్తిత్వంతో వసూళ్ల పర్వం సాగుతోంది. – గుత్తి ప్రాజెక్ట్ పరిధిలో కార్యాలయ ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోడిగుడ్ల సరఫరాలో కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారన్న విమర్శలున్నాయి. – రాయదుర్గం ప్రాజెక్ట్లో ఓ సూపర్వైజర్దే పైచేయి. ఇక్కడ అమృత హస్తం అమలవుతుండడంతో పా‘పాల’కు పాల్పడుతున్నారు. టీడీపీ నాయకుడి అండదండలు ఉండడంతో ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో ఉన్నారు. – కంబదూరు ప్రాజెక్ట్లో కార్యాలయ ఉద్యోగి ఒకరు ‘లోగుట్టు’ వ్యవహారం నడిపిస్తున్నారు. సెక్టార్ సమావేశాలు జరిగినప్పుడు పిల్లల సంక్షేమం గురించి కాకుండా వాటాలపైనే చర్చిస్తుండడం గమనార్హం. -
సీన్ రివర్స్
ఒంగోలు టౌన్ : ఐసీడీఎస్ ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులో అంగన్వాడీ కేంద్రాల మెర్జ్కు అద్దె రూపంలో బ్రేకులు పడుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో కాన్వెంట్ విద్య అందించాలన్న ఉద్దేశంతో మూడు కేంద్రాలను ఒకేచోటకు తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ తరలింపు ప్రక్రియకు అనూహ్య రీతిలో అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటివరకు తమ ఇళ్లలో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించినందున బకాయిలు చెల్లించిన తర్వాతే కదలనిస్తామంటూ అనేకమంది ఇంటి యజమానులు చెబుతుండటంతో అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒంగోలు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 137 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి నెలకు 3 వేల రూపాయల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల విలీన ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి అద్దె దెబ్బ అంగన్వాడీలను వేధిస్తోంది. ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులోనే 13 నెలల నుంచి అద్దె బకాయిలు ఉండటంతో అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో అంగన్వాడీలు కొట్టుమిట్టాడుతున్నారు. అడకత్తెరలో పోకచెక్కలా... ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తాము సూచించిన విధంగా అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని కేంద్రంలో మెర్జ్ చేయాలని సూపర్వైజర్ మొదలుకుని సీడీపీఓ వరకు ఆదేశాల మీద ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఆ కేంద్రాలను వారు సూచించిన చోటకు మార్చేందుకు ప్రయత్నిస్తే అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే కేంద్రాలను కదలనిస్తామంటూ అనేకమంది ఇంటి యజమానులు గట్టిగా చెబుతుండటంతో అంగన్వాడీల పరిస్థితి అయోమయంగా మారింది. ఒకవైపు కేంద్రాలను మార్చలేదంటూ అధికారుల నుంచి వేధింపులు, ఇంకోవైపు కేంద్రాలను కదలనీయమంటూ యజమానులు భీష్మించుకుని కూర్చుండటంతో అనేకమంది అంగన్వాడీలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మెర్జ్ చేయాలంటూ ఒత్తిళ్లు ఎక్కువగా వస్తుండటంతో కొంతమంది అంగన్వాడీలు వడ్డీకి తీసుకువచ్చి కడుతుంటే, ఇంకొంతమంది అంగన్వాడీలు ఇంట్లో ఉన్న అరకొర బంగారాన్ని తాకట్టు పెట్టి కేంద్రాల అద్దె బకాయిలు చెల్లిస్తున్నారు. బకాయిలు ఎప్పుడు వస్తాయో... ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులో అద్దె బకాయిలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని మిగిలిన 20 ప్రాజెక్టుల్లో నెలల తరబడి అద్దె సమస్య లేదు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ వచ్చిన వెంటనే బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నారు. అయితే ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్ ఉన్నప్పటికీ అద్దె బిల్లులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనేక మంది అంగన్వాడీలు ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్ వచ్చినప్పటికీ బిల్లులు చెల్లించని విషయాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కొంతమంది సమాయత్తం అవుతున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తా : ప్రాజెక్టు డైరెక్టర్ ఒంగోలు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జీ విశాలాక్షి ’సాక్షి’కి తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లుల చెల్లింపులో సమస్య తలెత్తిందన్నారు. దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. -
ఐసీడీఎస్కు బాలుడి అప్పగింత
మహానంది: తప్పిపోయిన మహానందిలో తిరుగుతున్న బాలుడిని మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు ఆదివారం ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. అయితే మహానందిలో ఉంటున్న లక్ష్మిదేవి ఆదివారం రాత్రి పోలీస్స్టేషన్కు చేరుకుని..బాలుడు తన మనవడని తెలిపినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆళ్లగడ్డకు చెందిన ఈ బాలుడు.. మరొక పిల్లవాడితో కలిసి నాలుగు రోజుల క్రితం మహానందికి వచ్చినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పెద్దయ్యనాయుడు అంగన్వాడీ కార్యకర్త పుష్పకళకు సమాచారం అందజేసి ఐసీడీఎస్ అధికారులకు బాలుడిని అప్పగించారు. పూర్తి వివరాలతో తల్లితో పాటు వస్తే బాలుడిని అప్పగిస్తామని అవ్వ లక్ష్మిదేవికి ఆయన తెలిపారు. -
ఐసీడీఎస్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు కేటగిరిల్లో ఇచ్చే అవార్డులకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు జి. అనురాధమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ అవార్డులు అందజేస్తారన్నారు. మహిళలు, చిన్నారులు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వారికి ఒక కేటగిరి, మహిళలు, పిల్లలు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి రెండో కేటగిరి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ మహిళలకు సంబంధించి విషయాలపై పనిచేసిన వారిని మూడో కేటగిరిగా పరిగణించి అవార్డులు ప్రకటిస్తారన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 28వ తేదిలోపు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు సీల్డ్కవర్లో అందజేయాలన్నారు. -
కోడి గుడ్ల స్కాంపై పీడీ విచారణ
కదిరి టౌన్ : ఐసీడీఎస్ శాఖలో కోడిగుడ్ల సరఫరాలో జరిగిన అవినీతి తంతుపై ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జుబేదాబేగం మంగళవారం విచారణ నిర్వహించారు. ఐసీడీఎస్ పడమర ప్రాజెక్టులో గతంలో కోడిగుడ్ల సరఫరాలో రూ.అరకోటి నిధుల స్వాహాపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి విచారణ బాధ్యతను కదిరి ఆర్డీఓ వెంకటేశును అప్పగించారు. ఆయన విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పీడీ స్థానిక ఐసీడీఎస్ పడమర ప్రాజెక్టు కార్యాలయాన్ని తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుపరిధిలోని పట్టణంతోపాటు వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు ఏ మేర సరఫరా జరిగాయి. ఎంత మేర నిధులు డ్రా అయ్యాయి. సంబంధిత కాంట్రాక్టరు, అధికారుల ద్వారా జరిగిన అవినీతి అక్రమాలపై రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ విలేకరులతో మాట్లాడుతూ ఇదివరకే ఆర్డీఓ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికను అందించారన్నారు. ప్రస్తుతం తుది విచారణ చేస్తున్నామన్నారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
– జేసీ–2 రామస్వామి – ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు కర్నూలు(అర్బన్): బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి మాట్లాడుతూ.. బాల బాలికలు విద్య, ఆరోగ్యం, ఆహార విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో సమగ్ర బాలల సంరక్షణ కేంద్రాలు పని చేస్తున్నాయని, అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి వయో వృద్ధుల వరకు అన్ని రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని ఐసీడీఎస్ ఆర్జేడీ శారద చెప్పారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా యోగా కేంద్రాలకు వెళ్లి ఏకాగ్రతను పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది నాగలక్ష్మిదేవి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని డిప్యూటీ డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీపీ ఈశ్వరమ్మ, సర్పంచును సన్మానించారు. వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. బాలికా సంరక్షణ పథకం కింద మంజూరైన ఇన్సూరెన్స్ బాండ్లను 40 మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు జేసీ–2 అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏపీడీ అరుణ, 1098 పీడీ మోహన్రావు, జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు పాల సరఫరా
సారవకోట : జిల్లాలో అన్నా అమృత హస్తం అమలు జరుగుతున్న ఐసీడీఎస్ ప్రాజెక్టులకు మంగళవారం పాల ప్యాకెట్లు సరఫరా అయ్యారుు. జిల్లాలో ఇచ్ఛాపురం, మందస, సారవకోట, కొత్తూరు, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం ప్రాజెక్టులలో ఈ అన్నా అమృత హస్తం పథకం అమలు జరుగుతంది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీ లీటర్ల పాలను అందించేందుకు వీలుగా పాలు సరఫరా అయ్యారుు. వీటిని ఆయా ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ప్రతీ రోజు 200 మిల్లీ లీటర్ల పాలను కేంద్రాలలో అందించాలి. ప్రస్తుతం కేంద్రాలకు ఒక లీటర్ ప్యాకెట్లు మంజూరయ్యారుు. ఇది వరకు స్వయంశక్తి సంఘాల ద్వారా పాలను కొనుగోలు చేసి అంగన్వాడీ కేంద్రాలకు అందించే వారు. ఈ పద్ధతి సక్రమంగా నడవక పోవడంతో ప్రభుత్వం నేరుగా కాంట్రాక్టర్ల ద్వారా కేంద్రాలకు అందజేస్తున్నారు. -
ఐసీడీఎస్లో ‘ఎగ్’ యాప్
ఎగ్ యాప్ ,ఐసీడీఎస్ , అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలకు పారదర్శకంగా గుడ్ల పంపిణీ అవకతవకలకు కళ్లెం వేసేలా సాంకేతిక పరిజ్ఞానం డిమాండ్, సరఫరాపై నిరంతర నిఘా కొత్త టెక్నాలజీ ఈ నెల నుంచే వినియోగంలోకి.. సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరాపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిఘా కట్టుదిట్టం చేసింది. పిల్లలకిచ్చే గుడ్లు కొన్నిచోట్ల దారిమళ్లుతున్నాయని భావించిన ఆ శాఖ... ప్రతి గుడ్డుకు లెక్కగట్టాలని నిర్ణరుుంచింది. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా తీరుతెన్నులను నిరంతరం పరిశీలించేలా సరికొత్తగా ‘ఎగ్’యాప్ను రూపొందించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో నిల్వల పరిస్థితి ఎప్పటికప్పుడు స్పష్టమవడంతో పాటు గుడ్ల డిమాండ్ సైతం తెరపై కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించిన యంత్రాంగం... తాజాగా సరఫరాదారులకు సైతం శిక్షణ ఇచ్చింది. కేంద్రాలకు గుడ్ల సరఫరా ఇలా... అంగన్వాడీ కేంద్రాల వారీగా పిల్లల సంఖ్య ఇప్పటికే ఆన్లైన్లో అప్డేట్ చేశారు. అంతేకాకుండా ఆయా సెంటర్ల పరిధిలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద పౌష్టికాహార పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. దీంతో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి గుడ్ల డిమాండ్ ఎప్పటికప్పుడు యాప్లో స్పష్టమవుతుంది. ఈ మేరకు సరఫరాదారులు గుడ్ల స్టాకును తన పరిధిలోని కేంద్రాలకు చేరవేయాలి. స్టాకును అంగన్వాడీ కేంద్రంలో అప్పగించిన వెంటనే సంబంధిత అంగన్వాడీ కార్యకర్త నుంచి ఒన్టైమ్ పాస్వర్డ్(ఓటీపీ)ను యాప్లో అప్లోడ్ చేయాలి. ఇందుకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్త మొబైల్ ఫోన్కు ఓటీపీని కేంద్ర సర్వర్ నుంచి సంక్షిప్త సమాచారం ద్వారా పంపిస్తారు. అలా ఓటీపీ నమోదు చేసిన వెంటనే స్టాకు సరఫరా చేసినట్లు యాప్లో తెలుస్తుంది. ఈ వివరాలన్నీ రాష్ట్ర కార్యాలయంతో పాటు సీడీపీవోలకు సైతం అందుతాయి. సరఫరాను బట్టి డీలర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు ప్రొసీడింగ్లు తయారు చేస్తారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, సీడీపీవోలు, కాంట్రాక్టర్ల సెల్ఫోన్లలో ఇప్పటికే యాప్ను ఇన్స్టాల్ చేశారు. సరికొత్తగా యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల గుడ్ల సరఫరాలో కొంత జాప్యం జరిగింది. మెజార్టీ కేంద్రాల్లో గతనెలకు సంబంధించి గుడ్ల నిల్వలుండటంతో వాటిని సర్దుబాటు చేశారు. -
విశాఖజిల్లాలో దారుణం
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యలమంచిలి నెహ్రూనగర్లో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించి ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తు తెలియని వ్యక్తుల చెట్లపొదల్లో వదిలి వెళ్లారని స్థానికులు పోలీసులకు తెలిపారు. -
ప్రసవంలోనే విరిగిన ఎముకలు
- ఆడ శిశువుకు అరుదైన జబ్బు – ఆసుపత్రిలోనే వదిలివెళ్లిన తల్లిదండ్రులు – శిశు కేంద్రంలో సంరక్షణ కర్నూలు(హాస్పిటల్): ప్రసవంలోనే విరిగిన ఎముకలతో ఓ ఆడ శిశువు ఈలోకంలోకి అడుగిడింది. అలాంటి శిశువును పెంచే స్థోమత లేదని భావించిన తల్లిదండ్రులు కష్టమైనా సరే పాపను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. చికిత్స అనంతరం పాపను వైద్యులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో గత నెల 26వ తేదీన ఓ ఆడ శిశువు అనాథగా కనిపించింది. ఆసుపత్రి సిబ్బంది తల్లిదండ్రుల కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పాపను చిన్నపిల్లల వార్డులోని ఎన్ఐసీయూలో చేర్పించి చికిత్స చేయించారు. పాప కాళ్లు, చేతులు ఒంపులు తిరిగి, వాపుతో ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు వైద్యపరీక్షలు చేయించగా 'ఆస్టియో జెనెసిస్ ఇన్ఫరెఫెక్టా' అనే ఎముకల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వ్యాధి ఉన్న వారి ప్రసవ సమయంలో ఎముకలు విరిగిపోతాయని వారు నిర్ధారించారు. 15 రోజుల పాటు పాపకు వైద్యం అందించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా వారు స్థానిక సి.క్యాంపులోని శిశు కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం పాప ఆలనపాలనను శిశు కేంద్రంలోని ఆయాలే చూస్తున్నారు. కుటుంబసభ్యులు తగిన ఆధారాలతో వస్తే పాపను అప్పగిస్తామని ప్రకటించారు. బాధ్యులపై కేసు నమోదుకు ఎస్పీ ఆదేశం ఎస్పీ ఆకె రవికృష్ణ శుక్రవారం శిశుకేంద్రానికి వెళ్లి ఆయాల సంరక్షణలోని శిశువు పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించే విషయమై వైద్యులతో మాట్లాడారు. పాపను అనాథగా వదిలివెళ్లిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని త్రీటౌన్ సీఐ మధుసూదన్రావును ఆదేశించారు. ఎవరైనా బాలికలను పెంచలేనిస్థితిలో ఉంటే దగ్గరలోని పోలీస్స్టేషన్, ఐసీడీఎస్, ప్రభుత్వ శిశు విహార్కు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టప్రకారం బాద్యులైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రమణమూర్తి, శిశు గృహ మేనేజర్ మెహతాజ్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద ఉన్నారు. -
త్వరలో అంగన్వాడీ పోస్టుల భర్తీ
రాయదుర్గం రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 200 హెల్పర్, 25 అంగన్వాడీ వర్కర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జుబేదాబేగం వెల్లడించారు. మండలపరిషత్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 5,126 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 1200 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఉపాధి హామీ నిధులతో 881 కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని తలపెట్టగా 419 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 100 సూపర్ వైజర్ల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉందన్నారు. చిన్నసైజులోని కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయని విలేకరులు ప్రశ్నించగా.. వచ్చే నెల నుంచి పౌల్ట్రీ ఫాం నుంచి నేరుగా నిర్ణీత పరిమాణం గల కోడిగుడ్లు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. జూలై నుంచి పిల్లలకు, బాలింతలకు పాలు అందడం లేదని ప్రస్తావించగా.. ఏజెన్సీవారు పాల సరఫరా నిలిపివేసిన కారణంగా ఇవ్వలేకపోయామన్నారు. త్వరలోనే పాల సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ సరోజమ్మ, ఎంపీడీఓ శ్రీనివాసులు, సూపర్వైజర్ లీలాపద్మావతి పాల్గొన్నారు. -
భ్రూణహత్యల నివారణకు కృషి చేయాలి
బద్వేలు అర్బన్: భ్రూణహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అపుడే సమాజంలో ఆడపిల్లల నిష్పత్తిని పెంచేందుకు సాధ్యమవుతుందని ఐసీడీఎస్ పీడీ రాఘవరావు, ఐసీపీఎస్ పీడీ శివక్రిష్ణ అన్నారు. శనివారం స్థానిక ఎన్జీవోహోంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీబచావో– బేటీ పడావో కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు లింగనిర్ధారణ పరీక్షలు చేయించకుండా మహిళలను చైతన్య పరచాలన్నారు. అలాగే బాల్య వివాహాల వలన కూడా లేనిపోని సమస్యలు , ఇబ్బందులు తలెత్తుతాయని దీనిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి బాల్య వివాహాలను నిరోధించాలన్నారు.అలాగే ఆడ పిల్లలను చదివించాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సోమేసుల పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళల సంక్షేమం కోసం అనేక రకాల చట్టాలు ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నప్పుడే మహిళలు సమాజంలో రాణించగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ రాజమ్మ , సూపర్వైజర్లు సరళాదేవి, వెంకటసుబ్బమ్మ, సుభద్ర, అంగన్వాడీ వర్కర్లు్ల పాల్గొన్నారు. -
‘ఐసీడీఎస్’ తరలిస్తే ధర్నాకు దిగుతా
- ఎమ్మెల్యే సున్నం రాజయ్య దుమ్ముగూడెం దుమ్మగూడెం మండలం ములకపాడులోగల ఐసీడీఎస్ కార్యాలయాన్ని భద్రాచలంలో విలీనం చేస్తే ఊరుకునేది లేదని, దీనిని అడ్డుకునేందుకు ధర్నాకు దిగుతానని ఎమ్మెల్యే సున్నం రాజయ్య హెచ్చరించారు. ములకపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని తరలించేందుకుగాను ఫర్నీచర్ను తీసుకెళుతున్నారని తెలుసుకున్న రాజయ్య.. గురువారం హైదరాబాద్లో ఐసీడీఎస్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచే డైరెక్టర్తో మాట్లాడారు. గతంలో భద్రాచలంలో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలన్ని పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా దుమ్ముగూడెం మండలంలోని ములకపాడుకు మార్చారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో 95 పెద్ద కేంద్రాలు, 40 చిన్న కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటి ద్వారా 40వేల మందికి పౌష్టికాహారం అందుతోందని చెప్పారు. ఇంతమందికి ఉపయోగపడుతున్న ప్రాజెక్టును భద్రాచలం తరలించడం సరికాదన్నారు. ‘‘జిల్లాల పునర్విభజన పేరుతో పాలనను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. మీరేమో ఐసీడీఎస్ కార్యాలయాన్ని ప్రజలకు దూరంగా తరలించడం ఎంతమాత్రం సరికాదు’’ అని వాదించారు. దీనిపై కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని డైరెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, కలెక్టర్తో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. ఐసీడీఎస్ జేడీ రాములును కలిసి వివరాలు తెలిపారు. వినతిప్రతం ఇచ్చారు. ఐసీడీఎస్ కార్యాలయాన్ని తరలిస్తే.. కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ఆయన వెంట సీఐటీయూ కార్యదర్శి బ్రహ్మాచారి, మండల కార్యదర్శి సిహెచ్.మిత్ర, సీఐటీయూ నాయకురాలు రాధాకుమారి తదితరులు ఉన్నారు. ఈ వివరాలన్నిటినీ ‘సాక్షి’కి ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి ఫోన్లో వెల్లడించారు. -
ఐసీడీఎస్కు యువతి అప్పగింత
రైల్వేగేట్ : నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్ జీఆర్పీ పోలీసులు ముస్లిం యువతిని ఐసీడీఎస్కు అప్పగించారు. సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ రైల్వేస్టేషన్లో సల్మాబేగం(25) అనే యువతి మంగళవారం ఏడుస్తుండగా ప్రయివేటు సానిటేషన్ వర్కర్ మహాలక్ష్మి జీఆర్పీ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు సల్మాబేగంను స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ఆమె వివరాలు అడగగా తమది వరంగల్ అని, తన తల్లిదండ్రులు తనను చిన్నప్పుడే జైపూర్కు తీసుకెళ్లారని తాను రైలులో ఇక్కడికి వచ్చినట్లు చెప్పింది. అలాగే కొన్ని విషయాల్లో పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు తనకు ఈ పోలీస్టేషన్లో ఉద్యోగం ఇప్పించాలని, ఉపాధి కావాలని అన్నట్లు పోలీసులు తెలిపారు. సల్మాబేగం మానసిక స్థితి బాగాలేకనే ఇలా మాట్లాడుతున్నట్లు గమనించి ఐసీడీఎస్ అర్బన్-2 సీడీపీఓ మధురిమకు యువతిని అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ మురళి తదితరులున్నారు. -
అమ్మకానికి ఆడపిల్లలు..?
* పోలీసుల అదుపులో తండ్రి * ఐసీడీఎస్కు బాలికల అప్పగింత ఆదిలాబాద్ క్రైం: ఓ తండ్రి తన ఇద్దరు ఆడపిల్లలను అమ్మకానికి పెట్టాడనే అనుమానంతో పోలీసులు ఆ తండ్రిని పోలీస్స్టేషన్కు తరలించడంతో పాటు బాలికలను ఐసీడీఎస్కు అప్పగించారు. ఈ ఉదంతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. మహారాష్ట్రలోని కిన్వట్కు చెందిన దశరథ్, శోభా దంపతులు కొంతకాలంగా ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీలో ఉంటూ కూలి పని చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 7వ, 5వ తరగతి చదువుతున్నారు. మంగళవారం దశరథ్ తన ఇద్దరు కూతుళ్లతో కలసి పట్టణంలోని రైల్వేస్టేషన్లో రాజ స్తాన్కు చెందిన యువకుడు లతీఫ్తో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అతని గ్రామానికే చెందిన రవికాంత్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి రాగా, రవికాంత్ వెళ్లి దశరథ్ బాలికలను అమ్ముతున్నాడని చెప్పాడు. గతంలోనూ దశరథ్ ఇంకో కూతురిని విక్రయించాడని, తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటున్నాడని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు వారందరినీ టూటౌన్కు తరలించారు. లతీఫ్ తనకు పాత పరిచయమని, మహాలక్ష్మీవాడ కాలనీలో ఉంటున్న బంధువుల వద్దకు రాగా రైల్వేస్టేషన్లో కలిశాడని దశరథ్ చెప్పాడు. తమ పిల్లలను ఎందుకు అమ్ముకుంటామని, అనవసరంగా తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు. ఇదే విషయమై లతీఫ్తో ‘సాక్షి’ మాట్లాడగా.. తన బంధువుల ఇంటికి వచ్చానని, ఎప్పటి నుంచో దశరథ్తో పరిచయం ఉందని తెలిపాడు. ట్రాక్టర్ కొనుగోలు విషయమై రైల్వేస్టేషన్లో మాట్లాడాడని చెబుతున్నాడు. కాగా, తాను వెళ్లేసరికి విషయూన్ని పక్కదోవ పట్టించారంటూ రవికాంత్ తెలిపాడు. ఇద్దరు చిన్నారులను పోలీసులు ఐసీడీఎస్కు తరలించారు. వీరందరినీ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని, అప్పటి వరకు చిన్నారులు ఐసీడీఎస్లో ఉంటారని ఎస్సై రాజన్న వివరించారు. -
సంరక్షణ గృహానికి చిన్నారులు
కడప కార్పొరేషన్: కడప నగరంలో భిక్షమెత్తుతున్న ఇద్దరు బాలలను స్త్రీ, శిశు అభివృద్ది సంస్థ(ఐసీడీఎస్) అధికారులు రక్షించారు. వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి సంరక్షణ గృహానికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి...చిన్న వెంకట సుబ్బయ్య(50) అనే వ్యక్తికి తిరుపతిలో మతిస్థిమితం లేని ఓ మహిళ తారసపడింది. ఆమె మాట్లాడలేదు. ఆమెను లొంగదీసుకున్న అతను చిన్నారులు ఆంజనేయులు(6), లక్ష్మి(1)లను కూడా తన ఆధీనంలో ఉంచుకొని భిక్షమెత్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండు వద్ద చిన్నారి లక్ష్మిని ఎత్తుకొని దీనంగా భిక్షమెత్తుతున్న ఆంజనేయులును ఐసీడీఎస్ అధికారులు గుర్తించారు. వారిచే ఎవరైనా ఈ పనిచేయిస్తున్నారేమోనని అనుమానంతో ఆ పిల్లలకు భిక్షం వేయవద్దని వారించసాగారు. తాపీగా చెట్టుకింద పడుకొని ఇదంతా చూసిన చిన్నవెంకట సుబ్బయ్య ఐసీడీఎస్ అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారు పోలీసుల ద్వారా ఆ నలుగురిని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవరావు దగ్గరికి తీసుకొచ్చారు. పీడీ పిల్లలిద్దరినీ సీడబ్లు్యసీ ఎదుట హాజరుపరిచి వారి అనుమతితో సంరక్షణశాలకు తరలించారు. అనంతరం రాఘవరావు మాట్లాడుతూ ఆ పిల్లలిద్దరూ అతనికి పుట్టినవారు కాదని, అందుకే ఆ పిల్లవాణ్ని కొడుతూ భిక్షమెత్తిస్తున్నాడని తెలిపారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ప్రొద్దుటూరు: మైనర్ బాలిక నిశ్చితార్థాన్ని ఐసీడీఎస్ అధికారులు శనివారం అడ్డుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గోకుల్ నగర్కు చెందిన 16 ఏళ్ల బాలిక తనకు వివాహం చేసేందుకు తల్లి ఏర్పాట్లు చేస్తోందని... త్వరలో ఖాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్తో నిశ్చితార్థం చేయబోతోందని టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఉదయాన్నే ఫోన్ చేసింది. వెంటనే టూటౌన్ ఎస్ఐ ఆంజనేయులు, అర్బన్ ఐసీడీఎస్ సీడీపీఓ రాజేశ్వరిదేవి, సూపర్వైజర్ సావిత్రమ్మ ఆ బాలిక ఇంటికి వెళ్లారు. అనంతరం ఆ బాలిక, తల్లిని టూటౌన్ పోలీస్స్టేషన్కు పిలిపించి ఐసీడీఎస్ అధికారుల చేత ఫిర్యాదు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ తన తల్లి తనకు బలవంతంగా వివాహం చేస్తోందని, ఆరు నెలల క్రితం కూడా ఫిర్యాదు చేయడంతో అప్పుడు కూడా పోలీస్స్టేషన్కు పిలిపించి చర్చించామన్నారు. ప్రస్తుతం మరో మారు ఈ బాలిక ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ భ్రమరాంభతోపాటు ఆమె భర్త పోలీస్స్టేషన్కు వచ్చి బాలిక తల్లికి మద్దతుగా వకాల్తా పుచ్చుకోగా ఎస్ఐ డీఎస్పీ నీలం పూజిత వద్దకు పంపారు. డీఎస్పీ అధికారులపై ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేయొద్దని, వారు పై అధికారుల ఆదేశాల ప్రకారం పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు ఐసీడీఎస్ అధికారులు కడపలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శారదాతో చర్చించి బాలసదనంలో చేర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, ఎల్.సుబ్బమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. -
పసికందును ‘అమ్మే’శారు
చేరదీసిన ఐసీడీఎస్ అధికారులు నెల్లూరు(అర్బన్) : వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల గిరిజనకాలనీలో వారం క్రితం 5 నెలల పసి కందును అమ్మిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ బిడ్డను ఐసీడీఎస్ విభాగం ఐసీపీఎస్ అధికారులు చేరదీశారు. గిరిజనకాలనీకి చెందిన సుబ్బాల మస్తానయ్య,చెంచులక్ష్మి దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఆ పేద దంపతులు బిడ్డను పోషించలేక ఐదు నెలల మగబిడ్డను సమీపంలోని బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన బొడ్డు సుమతి, ప్రభుదాస్ దంపతులకు రూ.15 వేలకు అమ్మేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కలెక్టర్ ముత్యాలరాజుకు ఫోన్లో సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. ఇంతలోనే బిడ్డ తండ్రి మస్తానయ్య తమ బిడ్డ తనకు కావాలని అడిగారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంకటాచలం తహసీల్దార్ కూడా విచారించారు. ఐసీడీఎస్ అధికారులు బిడ్డను అమ్మిన దంపతులపై వెంకటాచలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పసిబిడ్డను పెద్దాస్పత్రిలోని చిన్న పిల్లల విభాగానికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిసింది. -
ఐసీడీఎస్ చెంతకు చిన్నారులు
కడప రూరల్ : ముద్దనూరుకు చెందిన లక్ష్మిదేవి ఈ ఏడాది ఉగాది రోజున కొన్ని కారణాల వల్ల కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ప్రైవేటు జీపు డ్రైవర్గా పని చేస్తున్న ఆమె భర్త శంకర్ మానసిక వేదనతో ఇటీవల మృతి చెందాడు. ఫలితంగా ఆ దంపతుల పెద్ద కుమార్తె వైశాలి (7), చిన్న కుమార్తె గౌరీప్రియ (3) అనాథలుగా మారారు. వీరిపై ‘సాక్షి’లో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. ముద్దనూరుకు చెందిన సూపర్వైజర్ లక్ష్మిప్రియ, కార్యకర్త విజయదుర్గ ఆ చిన్నారులను శుక్రవారం కడప ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవరావుకు అప్పగించారు. బంధువుల రంగప్రవేశం అయితే ఆ చిన్నారుల బంధువులు తాము పోషిస్తామంటూ ముందుకు వచ్చారు. ఆ మేరకు ప్రాజెక్టు డైరెక్టర్ వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. తమ బాలసదన్లో ఈ చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. అయినా వారు వినలేదు. ఈ చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగిస్తామని, వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని పీడీ తెలిపారు. -
అంగన్వాడీలకు త్వరలో టాబ్లు
మార్టేరు (పెనుమంట్ర) : పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్తలకు త్వరలోనే టాబ్లు అందించనున్నట్టు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ తెలిపారు. మార్టేరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. అలాగే కంప్యూటర్ టాబ్లు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. కాగా ప్రతి కార్యకర్తకు వీటి వినియోగంపై తగిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. తద్వారా కార్యకర్తలకు ప్రస్తుతానికి రికార్డుల పనిభారం తగ్గుతుందన్నారు. భవిష్యత్ కాలంలో కాగితరహితంగా కేంద్రాల నిర్వహణ సాగనుందన్నారు. ఉద్యోగుల వేలిముద్రల నిర్వహణలో రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త, ఆయా సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తప్పనిపరిగా వేలిముద్రలు వేయాలని ఆయన సూచించారు. అందుకు సహకరించని గ్రామ పంచాయతీలపై తమ సిబ్బంది ఫిర్యాదు చేస్తే తాము వెంటనే జిల్లా కలెక్టర్కు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రూ.7.5 లక్షల వ్యయంతో జిల్లావ్యాప్తంగా 324 అంగన్వాడీ కేంద్రాలను నూతనంగా నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే రెండేళ్లుగా పెండింగ్లో మాతృత్వ సంయోజన పథకం అమలుకు రూ.23 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర ప్రాజెక్టు అధికారిణి టి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ పీడీగా గిరిజ
మంకమ్మతోట : స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ పీడీగా గిరిజ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జి పీడీ రాధమ్మ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఐసీడీఎస్ కమిషనరేట్లో సీడీపీవో స్థాయి అధికారిగా ఆమె విధులు నిర్వస్తున్నారు. పీడీగా పదోన్నతి పొంది బదిలీపై వచ్చారు. -
రెండు జిల్లాల పరిధిలోకి రూరల్ ఐసీడీఎస్
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్లోని హన్మకొండ రూరల్ ఐసీడీఎస్ కార్యాలయం పరిస్థితి అయోమయంగా ఉంది. ఈ కార్యాలయ పరిధిలో మెుత్తం 310 అంగన్వాడీ కేంద్రా లు, ఏడుగురు సూపర్వైజర్లు ఉన్నారు. పేరుకు రూరల్ కార్యాలయమైనా అర్బన్లోని విలీన గ్రామాల్లో సుమారు వంద అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. హన్మకొండ, వరంగల్, ఆత్మకూరు, గీసుకొండ, హసన్పర్తి మండలాల పరిధిలో అంగన్వాడీ కేంద్రా లు ఉన్నాయి. ప్ర స్తుతం విభజనతో ఐనవోలు, కాజీపేట, ఖిలావరంగల్ మండలాల్లోకి కొన్ని అంగన్వాడీ కేంద్రాలు చేరుతున్నాయి. ఇక హన్మకొండ జిల్లా పరిధిలోకి హన్మకొండ, ఐనవోలు, కాజీపేట మండలాల్లోని 59, వరంగల్ జిల్లా పరిధిలోకి వరంగల్, ఆత్మకూరు, గీసుకొండ, ఖిలావరంగల్ మండలాల్లోని 251 అంగన్వాడీ కేంద్రాలు వస్తున్నా యి. ఐసీడీఎస్ పీడీ కార్యాలయ పరిధిలో పనిచేస్తుంది. అయితే ఇప్పుడు రెండు జిల్లాల పరిధిలోకి కేంద్రాలు వస్తున్నందున అధికారులు విభజన విషయంలో తలలు పట్టుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పను లు పూర్తి చేసి తుది నివేదిక అధికారులకు అందజేస్తామని సీడీపీవో శైలజ తెలిపారు. వరంగల్ జిల్లాలోని 251 కేంద్రాలు వెళ్తుండటం తో మిగిలేది 59 అంగన్వాడీ కేం ద్రాలు మాత్రమే కావడంతో కార్యాలయం భవితవ్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. -
అయ్యో.. పాపం!
→ కలహాలతో విడిపోయిన దంపతులు? → అనాథగా మారిన ఏడాదిన్నర చిన్నారి → శిశుసదన్కు తరలించిన ఐసీడీఎస్ అధికారులు కనగానపల్లి : రెండేళ్ల చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో.. ఏ పాపం ఎరుగని ఆ చిన్నా రి అనాథగా మారింది. అమ్మానాన్న మధ్య తలెత్తిన మనస్పర్ధలు ఆ చిన్నారిని ఒంటరి చేశాయి. ఏడాదిన్నర వయస్సు కలిగిన ఆ పాపను కనగానపల్లి మండ లం బద్దలాపురం ఎస్సీ కాలనీ సమీపంలో కన్నవారు శుక్రవారం ఉదయం ఒంటరిగా వదిలివెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఏడుస్తూ కనిపించిన పాపను స్థా నికులు గమనించి చేరదీశా రు. చుట్టుపక్కల వారిని విచారించారు. విష యం తెలుసుకున్న అంగన్వాడీ వర్క ర్లు ఐసీడీఎస్ అధికారుSకు సమాచా రం అందించారు. సీడీపీఓ వనజాక్షి, సూపర్వైజర్ మీనాక్షమ్మ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పాప ను అనంతపురంలోని బాలశిశుసదన్కు తరలించారు. అయితే బద్దలాపురానికి చెందిన ఓ యువతి, యువకు డు రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారని గ్రామస్తుల ద్వారా తెలి సింది. కొద్ది రోజులు వారి సంసారం సాఫీగా సాగినా ఆ తరువాత కుటుం బ కలహాల తో విడిపోయారని సమాచారం. అప్పటికే వారికి ఓ పాపం పుట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం వారి ద్దరూ వేర్వేరుగా ఉంటుండగా, పాప పోషణ భారం కావడంతో బిడ్డను అనాథను చేసినట్లు తెలుస్తోంది. -
ఐసీడీఎస్లో మెరుగైన సేవలకు కృషి
తడికలపూడి (కామవరపుకోట) : జిల్లాలోని పద్దెనిమిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేసేందుకుSకృషి చేస్తున్నట్టు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఇందుకు స్ట్రెన్తనింగ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 18 ఐసీడీఎస్ప్రాజెక్టులను నాలుగు డివిజన్లుగా విభజించి సూపర్వైజర్లకు తడికలపూడి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ’అనుబంధ పోషకాహారం– ఆహారంలో వైవిధ్యత’(మాడ్యూల్ 9)అనే అంశంపై 23 నుంచి 27 వరకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు డివిజన్లోని సూపర్వైజర్లకు మంగళవారం ఒక రోజు శిక్షణ ఇచ్చామన్నారు. ఐఎస్ఎస్ఎన్ఐపీ కన్సల్టెంట్ సుధాకర్, ప్రాంగణం అధికారిణి ఎం.ఉమాదేవి పాల్గొన్నారు. -
ఐసీడీఎస్కు ఆడశిశువు అప్పగింత
మహబూబ్నగర్ క్రైం : ఓ రైలులో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది నెలల ఆడశిశువును వదిలిపెట్టి వెళ్లారు. రైల్వే ఎస్ఐ రాఘవేందర్గౌడ్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుంటూరు నుంచి కాచిగూడ వరకు వెళుతున్న ఫ్యాసింజర్ రైలు మహబూబ్నగర్ స్టేషన్లో ఆగింది. అదే సమయంలో తొమ్మిది నెలల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. కొద్దిసేపటికి అక్కడి ప్రయాణికులు గమనించి వెంటనే రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ముస్తాక్, షర్మిల పాల్గొన్నారు.