
ఐ క్లిక్ కేంద్రాలపై ఐజీ సమీక్ష
- ఎస్పీ, ఇతర అధికారులతో సమావేశం
ఒంగోలు క్రైం : గుంటూరు పోలీస్ రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ ఆన్లైన్ ఫిర్యాదుల కేంద్రాలైన ఐ క్లిక్పై శుక్రవారం సమీక్షించారు. జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్తో కలిసి ఎస్పీ చాంబర్లో ఇతర పోలీస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ ఏడాది మే నెల 28న డీజీపీ రాముడు ఒంగోలులో రెండు ఐ క్లిక్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐజీ సంజయ్ ఐ క్లిక్ కేంద్రాల పనితీరుపై సమీక్ష చేశారు. ఇప్పటి వరకు రెండు కేంద్రాల ద్వారా ఎన్ని ఆన్లైన్ ఫిర్యాదులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని దర్యాప్తులో ఉన్నాయి.. అన్న అంశాలను ఎస్పీ శ్రీకాంత్ను అడిగి తెలుసుకున్నారు. ఐ క్లిక్ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై కూడా లోతుగా సమీక్షించారు.
ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంలో 169 ఫిర్యాదులు, నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం కేంద్రంలోని ఐ క్లిక్లో 102 ఫిర్యాదులు వచ్చాయని ఐజీ దృష్టికి ఎస్పీ తీసుకెళ్లారు. వాటిలో కొన్ని పరిష్కారం అయ్యాయని, మరికొన్ని ఫిర్యాదులు దర్యాప్తులో ఉన్నట్లు వివరించారు. సమీక్షలో ఏఎస్పీ బి.రామానాయక్, ఏఆర్ ఏఎస్పీ జె.కృష్ణయ్య, ఎస్బీ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ బి.మరియదాసు, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీలు కేవీ రత్నం, బాలసుందరం, ట్రాఫిక్ డీఎస్పీ జె.రాంబాబు, సీఐ వి.సూర్యనారాయణ ఉన్నారు.