
'పట్టువిడుపులతో ముందుకెళదాం'
హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు సంబంధించి వివాదాస్పదమైన విద్యార్థుల ఫీజు చెల్లింపులు, నదీజలాల పంపకం తదితర అంశాలపై పట్టువిడుపులతో వ్యవహరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నిర్ణయించారు. ఉద్యోగుల విభజనపై సమస్యలు ఎప్పుడు తలెత్తినా ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకోవాలని అంగీకారానికి వచ్చారు. ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
ఫీజు రీయింబర్స్ విషయంలో సమస్యలు తలెత్తినప్పుడు ఆయా రాష్ట్రప్రభుత్వాలు చొరవతీసుకుని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. గవర్నర్ సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 12.10 నుంచి 12.40 వరకూ సమావేశమయ్యారు. వీరిద్దరితో గవర్నర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. 12.45 నుంచి శాసనసభ స్పీకర్లు, రెండు రాష్ట్రాల కార్యదర్శులు, శాసనమండలి ఛైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు.