విద్యార్థి నేతల్నిఎమ్మెల్యేలను చేస్తా: కేసీఆర్ | KCR praises Student leaders | Sakshi
Sakshi News home page

విద్యార్థి నేతల్నిఎమ్మెల్యేలను చేస్తా: కేసీఆర్

Published Thu, Mar 13 2014 2:35 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

విద్యార్థి నేతల్నిఎమ్మెల్యేలను చేస్తా: కేసీఆర్ - Sakshi

విద్యార్థి నేతల్నిఎమ్మెల్యేలను చేస్తా: కేసీఆర్

  •  విద్యార్థి నేతలకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హామీ
  •  సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విద్యార్థి నాయకుల్లో ముగ్గురు నలుగురినైనా ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను చేస్తానని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. ఇంకో ముగ్గురు నలుగురిని ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో ఉద్యమశక్తుల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు, బుల్లెట్ల దెబ్బలు తిన్న విద్యార్థుల భాగస్వామ్యం కావాలన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే వై. ఎల్లారెడ్డి, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, వరంగల్ జిల్లా టీడీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ప్రేమలతారెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు బుధవారం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ నేతలు కె.కేశవరావు, జగదీశ్వరరెడ్డి, కడియం శ్రీహరి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ఏమన్నారంటే... 
     
    •  ఎల్లారెడ్డి ఈ దఫా ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన దేవరి మల్లప్పకు పార్టీకి వచ్చే మొదటి అవకాశంలోనే ఎమ్మెల్సీగా చేస్తా. 
    •  విద్యార్థి నాయకుడు పిడమర్తి రవిని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీలో ఉంచుతా. రవి విద్యార్థి టైగర్, ఎక్కడి నుంచి పోటీ చేసినా సులభంగా గెలుపొందగలరు. రవిని పార్టీలోకి రమ్మని నేనే స్వయంగా ఆహ్వానించా. ఉద్యమంలో పాల్గొన్న జిల్లాల్లోని విద్యార్థి నాయకులకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో అవకాశమిస్తా. 
    •  ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్సే. ఉద్యమం చేసి అధికారంలో వచ్చినవారే ఇక్కడి ప్రజల బాధలు తెలుసుకోగలరు. రాష్ట్ర పునర్ నిర్మాణం బ్రహ్మాండంగా చేయగలరు. 
    •   ఈవేళ అనేకపార్టీలు, బహురూపులు, గజకర్ణ గోకర్ణ, టక్కుటమార విద్యలతో ఇక్కడి ప్రజలను గందరగోళ పర్చడానికి వస్తున్నారు. కాబట్టి టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసుకొని ముందుకుపోవాలంటే ఎన్నికలలో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. 
    •   14 ఏళ్ల ఉద్యమకాలంలో నేను ఏనాడూ విరాళాలు అడగలేదు. ఇప్పుడు సాధారణ ఎన్నికలకు పోతున్న టీఆర్‌ఎస్ పార్టీకి విరాళాలివ్వమని ప్రజలను అభ్యర్థిస్తున్నా. పది రూపాయలు, ఆపైన మీ ఇష్టం. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బ్యాంకు ఆఫ్ బరోడా శాఖలో పార్టీ పేరుతో ఉన్న 266- 101- 0000-2075 ఎకౌంట్‌కు పంపండి. 
    •   జిల్లా జడ్జీల కోటాలో హైకోర్టు న్యాయమూర్తులను చేసేందుకు కొలీజియం ఏర్పాటు  చేయబోతున్నట్టు నాకు సమాచారం అందింది. హైదరాబాద్‌లో జిల్లా జడ్జీ హోదా ఉన్నవారు 85 మంది. అందులో 75 మంది ఆంధ్రోళ్లే. తెలంగాణ వారు పది మందే. ఇలాంటి అన్యాయం జరుగుతుందనే తెలంగాణ కోరుకుంటున్నం. అందుకే ఇప్పుడు కొలీజియం నిర్వహించవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతున్నా. అందుకోసం ఆయనకు లేఖ రాస్తా. ఆ లేఖను రాష్ట్రపతికి కూడా పంపుతా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement