
అమరావతి: మంత్రి పదవికి టీడీపీ నేత కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేశారు. సీఎంవోకు తన రాజీనామా లేఖను శ్రవణ్ అందజేశారు. సీఎంఓ ద్వారా రాజీనామాను గవర్నర్కు పంపారు. సుమారు 8 నెలల క్రితం మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి తెల్సిందే. హత్య జరిగిన తర్వాత 6 నెలల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడంతో ఉప ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సర్వేశ్వర రావు కుమారుడు శ్రవణ్ కుమార్కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మంత్రి పదవి చేపట్టి 6 గడిచిపోయినా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
నిబంధనలకు లోబడే రాజీనామా: కిడారి
రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేసినట్లు కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. మంత్రిగా ఆరు నెలల పదవీకాలంలో 3 నెలలు ఎన్నికల కోడ్కే పోయిందని చెప్పారు. గిరిజనుడిగా తనకు మంత్రి పదవి దక్కటం సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తనను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారని వాఖ్యానించారు. తన శాఖ ద్వారా గిరిజనుల కోసం ఫుడ్ బాస్కెట్ పథకాన్ని తీసుకురావడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. 6 నెలలే పదవిలో ఉండడంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.