సర్కారు వంచనపై నిరసన భేరి | Maha Dharna on December 5th | Sakshi
Sakshi News home page

సర్కారు వంచనపై నిరసన భేరి

Published Thu, Nov 20 2014 2:24 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - Sakshi

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

మాట తప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా డిసెంబర్ అయిదో తేదీన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి.

5న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
విశాఖలో జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా
 గుంటూరు జిల్లా నేతలతో ఏర్పాట్లపై చర్చించిన వైసీపీ అధినేత
 ఈ ఆందోళనలు విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు
 
 సాక్షి, హైదరాబాద్: మాట తప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా డిసెంబర్ అయిదో తేదీన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో పాల్గొంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన గుంటూరు జిల్లా నాయకుల సమావేశంలో ఐదో తేదీ ధర్నా నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించారు. అధికారంలోకి వస్తే రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు ఆ తరువాత  వారిని మోసం చేశారని, పింఛన్ల, రేషన్‌కార్డుల తొలగింపు, ఊరూరా లెసైన్సు పొందిన మద్యం దుకాణాల ఏర్పాటు వంటి నిర్ణయాలతో టీడీపీ ప్రభుత్వం వంచన పరాకాష్టకు చేరుకుందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఐదు నెలలుగా ప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఈ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 డిసెంబర్ 15 నాటికి కమిటీల ఏర్పాటు పూర్తి
 డిసెంబర్ 15వ తేదీ నాటికల్లా జిల్లా, మండల, పట్టణ, గ్రామ కమిటీల అనుబంధ సంఘాల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని జగన్ జిల్లా నేతలకు సూచించారు. మిగతా జిల్లాల్లో కూడా ఇదే విధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని ఆయా జిల్లాల నేతలకు వర్తమానం పంపాలని సంబంధిత రాష్ట్ర నేతలను ఆదేశించారు. సమావేశానంతరం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ... రైతుల, మహిళల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇపుడు మాట తప్పారని, ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో జిల్లాలోని   17 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు.

 రాజధాని ప్రాంతంలో మళ్లీ పర్యటన
 వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలోని రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఏపీ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో మరో రెండు రోజులపాటు పర్యటిస్తారని పార్టీ పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇప్పటికే అక్కడ కొన్ని గ్రామాల్లో రెండు రోజులపాటు కమిటీ పర్యటించి వచ్చిందని, అక్కడ రైతుల మనోభావాలు ఎలా ఉన్నాయో జగన్‌కు సమావేశంలో వివరించామని తెలిపారు. అన్ని గ్రామాల్లో పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పార్టీ అధ్యక్షుడు తమకు సూచించారని చెప్పారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష కమిటీ సమావేశానికి ఆహ్వానిద్దామని కూడా జగన్ అభిప్రాయ పడ్డారని తెలిపారు.

పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (ప్రకాశం), సామినేని ఉదయభాను (కృష్ణా), కె.ఆగస్టీనాతో సహా పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement