
నేనొక స్నేహితున్ని కోల్పోయాను: మోహన్బాబు
ప్రముఖ రాజకీయ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంపై సినీ నటుడు మోహన్బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'భూమా మరణం నన్ను ఎంతగానో బాధించింది. నేను ఒక మంచి స్నేహితుడిని, మా కుటుంబం మంచి సన్నిహితుడిని కోల్పోయింది. కోయంబత్తూరులో ఉన్న నన్ను భూమా మరణం కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను' అని మోహన్బాబు పేర్కొన్నారు.
భూమా మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం
రాజకీయ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మృతిపై కాంగ్రెస్ నేత, ఎంపీ చిరంజీవి, సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, సంతాపం తెలిపారు. భూమా కుటుంబసభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. నంద్యాల నియోజకవర్గానికి భూమా విశేషమైన సేవలు అందించారని, ఆయన మరణం ఆ నియోజకవర్గానికి తీరని లోటని బాలకృష్ణ పేర్కొన్నారు.