
సాక్షి, కాకినాడ: ఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్యంగా పెరిగిన ధరల భారం నుంచి సామాన్యుడిని కాపాడేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. సబ్సిడీతో తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు.
‘ఈ నెల 14,15 తేదీల్లో టర్కీ, ఈజిప్టు నుండి కేంద్రం పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి చేసుకుంటుంది. మన రాష్ట్రానికి 22,147 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు అవసరం. మనం అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేసి తక్కువ ధరలకు వినియోగదారునికి ఇస్తున్న రాష్ట్రాలలో మనదే మొదటిది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ధరకు ఉల్లిపాయలు అందజేస్తున్నాం. తెలంగాణలో ఉల్లి కిలో రూ.40-45కి మార్కెటింగ్ శాఖ ద్వారా విక్రయిస్తున్నారు. రోజుకు 200 మెట్రిక్ టన్నులు ఉల్లిని కొనుగోలు చేస్తున్నాం. అక్కడక్కడ కొంత మంది వ్యాపారులు ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామ’ని మంత్రి వెంకటరమణ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment