ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి కృష్ణాజిల్లా నూజివీడు, వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలలో ఉన్న ట్రిపుల్ ఐటీలకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి.
నూజివీడు (కృష్ణా జిల్లా) : ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి కృష్ణాజిల్లా నూజివీడు, వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలలో ఉన్న ట్రిపుల్ ఐటీలకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటికే రెండుచోట్ల కలిపి 20 వేల దరఖాస్తులు అందినట్లు ఆర్జీయూకేటీ వర్గాల ద్వారా తెలిసింది. ట్రిపుల్ ఐటీలలో ఉన్న ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో చేరేందుకు ఈ నెల 13న ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ జారీ చేసి 16 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతి ఈ ఏడాది మార్చిలో రెగ్యులర్గా ఉత్తీర్ణులైనవారు ఆన్లైన్లో యూనివర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ఈ నేపథ్యంలో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు నూజివీడు ట్రిపుల్ఐటీకి 10,067 దరఖాస్తులు రాగా అందులో బాలురు 4809మంది, బాలికలు 5258 మంది ఉన్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీకి 9917మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య 25 వేలు దాటవచ్చని ఆర్జీయూకేటీ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది రెండు ట్రిపుల్ఐటీల్లో 20 వేల దరఖాస్తులు వచ్చాయి.