
'నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదే'
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రెండేళ్లలో వ్యవధిలో శోభా నాగిరెడ్డి, ఆమె భర్త మరణించడం కలచివేసిందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
భూమా కుటుంబం పడుతున్న బాధలో పాలుపంచుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో సంతాపం పేరిట వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీని విమర్శించి వివాదస్పదం చేశారని తెలిపారు. తమ పార్టీకి భూమా అందించిన సేవల పట్ల గౌరవం ఉంది కాబట్టే ఏ కుటుంబాన్ని ఆదరించని విధంగా జగన్ ఆదరించారని గుర్తు చేశారు. భూమా కుటుంబానికి మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారని, నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణించినప్పుడు జగన్, వారి కుటుంబం అందరికంటే ఎక్కువ బాధ పడిందని గుర్తు చేశారు.
ఏ సంస్కారంతో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఏ సంస్కారం ఉందని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో జగన్ పై విమర్శలు చేయిస్తున్నారని నిలదీశారు. నైతికత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, టీడీపీకి లేదన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు, స్పీకర్ దగ్గర పోరాటం చేస్తున్నామని తెలిపారు. నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదేనని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.