సాక్షి, సంగారెడ్డి: ‘బ్యాంకు అకౌంట్ లేదా .. కొత్త అకౌంట్ కావాలా ? అయితే, తక్షణమే సమీపంలోని బ్యాంకుకు వెళ్లండి. వ్యయ ప్రయాసలు లేకుండానే కొత్త అకౌంట్ ప్రారంభించండి. అది కూడా ‘జీరో బ్యాలెన్స్’తో...’ అంటూ బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులు జిల్లావ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో వినియోగదారుల అవసరార్థం కొత్త ఖాతాలు తెరవడానికి ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నాయి. గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలతో ఈ మేళాకు వెళితే సరిపోతుంది. దరఖాస్తును వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు. అయితే, కొన్ని రోజుల తర్వాత బ్యాంకు పాసు పుస్తకం, ఏటీఎం కార్డులను పోస్టు ద్వారా ఖాతాదారుల చిరునామాకు పంపిస్తారు.
ఎవరైనా వెళ్లవచ్చు ..
ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాల లబ్ధిదారుల కోసం బ్యాంకు మేళాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఎవరొచ్చినా కొత్త ఖాతాలు తెరుస్తామని లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య ‘సాక్షి’కి తెలిపారు. స్కాలర్షిప్పులు, ఫీజు-రీయింబర్స్మెంట్, వంట గ్యాస్, బంగారుతల్లి, జననీ సురక్షయోజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల లబ్ధిదారులతో పాటు ఇతరులెవరు వచ్చినా దరఖాస్తులు అందించడంతో పాటు పూరించడంలో సైతం సహకరించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖల సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మేళాల ఏర్పాటుకు బ్యాంకర్లను ఒప్పించారు.
కొత్త ఖాతాలకు రండి!
Published Mon, Nov 25 2013 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement