
టీటీడీ ఈవో..ఉత్తరాది ఐఏఎస్ సింఘాల్
టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఉత్తరాది అధికారికి అవకాశం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాది వ్యక్తి ఈవోగా నియమితులైనట్లయింది. సింఘాల్తో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పటి వరకు తెలుగువారినే టీటీడీ ఈవోగా నియమించే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది.
ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని తోసిరాజని ఉత్తరాదికి చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సింఘాల్ను టీటీడీ ఈవోగా నియమించారు. దీంతో ఈ వ్యవహారం సీనియర్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పేషీ అధికారి, ఢిల్లీలోని కేంద్ర మంత్రి చేసిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, టీటీడీ ఈవోగా ఉన్న డి.సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమించింది.