ప్రజాప్రతినిధులు రాజీనామా డ్రామాలాడవద్దని, రాజకీయ సంక్షోభం సృష్టించ డం ద్వారానే రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని
రాజీనామా డ్రామాలొద్దు
Published Fri, Oct 25 2013 2:42 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM
ముమ్మిడివరం, న్యూస్లైన్: ప్రజాప్రతినిధులు రాజీనామా డ్రామాలాడవద్దని, రాజకీయ సంక్షోభం సృష్టించ డం ద్వారానే రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని జిల్లా న్యాయవాదుల సదస్సు అభిప్రాయ పడింది. ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కల్యాణ మంటపంలో గురువారం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బి.గోఖుల్కృష్ణ అధ్యక్షతన సదస్సు జరిగింది. సీనియర్ న్యాయవాది కూచిమంచి మల్లపరాజు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.
కేంద్ర ఆదాయ వనరులైన గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులను, గుజరాత్ సంస్థ గ్యాస్ రవాణాను అడ్డుకోవడం ద్వారా ఉద్యమ లక్ష్యాన్ని కేంద్రానికి తెలియజేయాలని సదస్సులో తీర్మానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీమాంధ్ర జిల్లాల న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి ప్రజల మనోభావాలకనుగుణంగా ఉద్యమంలోకి రావాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బి.గోఖుల్కృష్ణ మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా డ్రామాలాడవద్దని హెచ్చరించారు.
రాష్ట్ర బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు మద్దూరి శివ సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు న్యాయ పరమైన అడ్డంకులున్నాయన్నారు. రామచంద్రపురం న్యాయవాదులు ఆలపించిన సమైక్యాంధ్ర బుర్రకథ అలరించింది. సదస్సులో ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణమూర్తి, సీనియర్ న్యాయవాదులు జవహర్ అలీ, డీబీ లోక్, బీవీఆర్దొర, వివిధ ప్రాంతాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఆర్ షణ్ముగ రెడ్డి, నల్లా ప్రభాకరరావు, పీఎల్ఎన్ప్రసాద్, ముషిణి రామకృష్ణారావు, గుత్తాల సింహాద్రి, బొక్కా సత్యనారాయణ, తటవర్తి నాగ రాజారావు, కోన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement