ఎర్రదొంగలకు కంచుకోట | red sandle transported to karnataka | Sakshi
Sakshi News home page

ఎర్రదొంగలకు కంచుకోట

Published Wed, Sep 3 2014 2:37 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

red sandle transported to karnataka

పలమనేరు: చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్రచందనం కర్ణాటక రాష్ట్రం లోని హొస్కోట తాలూకా కటికనహళ్లి గ్రామానికి వెళుతోంది. ఈ గ్రామంలో ఆరు ముఠాలు తమ అనుచరులతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాయి. వీరిలో అంతర్జాతీయ డాన్‌లు ఉన్నారు.

ఈ గ్రామానికి కొత్త వ్యక్తులు వెళ్లి తిరిగి రావడం అంత సులభం కాదు. ఒక్కో గ్యాంగ్‌లో వందమంది దాకా ప్రైవేటు సైన్యాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో అన్ని కుటుంబాల వారు ఇదే వృత్తిగా మార్చుకున్నారు. గ్రామ పొలిమేరల్లోని కోళ్ల ఫారాలు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లనే ఎర్రచందనం గోడౌన్లుగా మార్చేసుకున్నారు. మొత్తం మీద ఈ గ్రామం ఎర్రచందనం స్మగ్లర్లకు శత్రుదుర్బేధ్యంగా ఉన్నట్టు చిత్తూరు జిల్లా నుంచి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ అధికారులు, పలమనేరు, గంగవరం పోలీసులు చెబుతున్నారు.
 
కటికనహళ్లిలో అందరిదీ ఇదే వృత్తి..
కటికనహళ్లిలో సుమారు 375 కుటుంబాలున్నాయి. వీటిలో 300 కుటుంబాలు ఎర్రచందనం స్మగ్లింగ్‌నే జీవనోపాధిగా మార్చుకున్నాయి. గ్రామంలో 200 మందికి పైగా డ్రైవర్లున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిన వారు లోడింగ్, అన్‌లోడింగ్ చేయడం, మహిళలు గ్రేడింగ్ వర్క్, మరికొందరు గోడౌన్ వర్క్ ఇలా ఊరందరికీ ఇవే పనులు.
 
గ్రామంలో ఆరు గ్యాంగులు..

ఈ గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ప్రధానమైన గ్యాంగులు ఆరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో రియాజ్‌ఖాన్, అతని తమ్ముడు నాజర్ ఖాన్ ప్రధానమైన అంతర్జాతీయ స్మగ్లర్లు. వీరితో పాటు ముక్తియార్, అల్లాబక్షు, ఆసీఫ్ అలీ, అర్షద్‌ఖాన్ బ్యాచ్‌లు అత్యంత ముఖ్యమైనవి. వీరిలో ఆంధ్ర పోలీసులకు పట్టుబడింది అల్లాబక్షు, అర్షద్‌ఖాన్ మాత్రమే. ప్రైవేటు సైన్యం దాడులతో వారిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
 
కొత్త వాహనాలు వెళితే స్మగ్లర్ల తనిఖీ..
కటికనహళ్లి సమీపంలో హరేహళ్లి, మఠంమాల్‌సం ద్ర గ్రామాలు సైతం స్మగ్లింగ్‌కు పెట్టింది పేరు. ఈ గ్రామాలన్నీ హొస్కోటకు సమీపంలో ఉన్నవే. ప్ర ధాన రహదారి నుంచి ఈ గ్రామాలు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి ఏ వాహనాలు వెళ్లినా ఈ గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తులు ముం దుగానే తనిఖీలు చేస్తారు. చిత్తూరు జిల్లా నుంచి దుంగలు తీసుకెళ్లే డ్రైవర్లు సైతం ఈ గ్రామాలకు 40 కి.మీ దూరంలోనే వాహనాలను ఆపేస్తారు. అక్కడి నుంచి కటికనహళ్లికి చెందిన డ్రైవర్లే తీసుకెళ్తారు.
 
కటికనహళ్లి టూ కేరళ సముద్రతీరం..
కటికనహళ్లిలో గ్రేడింగ్ చేసిన దుంగలను చెన్నై, కేరళ సముద్ర తీరాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్టీమర్ల ద్వా రా దుబాయ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారముంది. మంగళూరు జిల్లా నుంచి కేరళ రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న సముద్ర తీరాల్లో ఈ స్మగ్లింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలున్నట్లు తెలుస్తోంది. అప్పటికే బుక్ చేసిన స్టీమర్లలో దుబాయ్‌కు తరలిస్తారని గతంలో పలమనేరు పోలీసులకు పట్టుబడిన నాజర్‌ఖాన్ తెలిపాడు. ఈ స్మగ్లింగ్‌లో పోర్ట్ సిబ్బందితో పాటు సెంట్రల్, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సిబ్బంది కూడా భాగస్వాములేనని విచారణలో తేలింది.
 
కర్ణాటక పోలీసుల కుమ్మక్కు..

కటికనహళ్లితో పాటు మరో రెండు గ్రామాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా స్మగ్లింగ్ జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోరు. బెంగళూరు రూరల్ జిల్లా హొస్కోట్, సర్జాపూర్ పోలీస్‌స్టేషన్లకు చెందిన పలువురు పోలీసులు స్మగ్లర్లకు అండగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్ర పోలీసులు కటికనహళ్లికి వెళ్లి స్మగ్లర్లను పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement