
భూముల విలువనూ పంచేసింది
ఆర్టీసీ ఆస్తుల విభజనపై దుమారం
బట్టబయలైన ప్రైవేట్ కన్సల్టెన్సీ నివేదిక
ఆమోదానికి నేడు ఆర్టీసీ బోర్డు సమావేశం
అగ్గిమీద గుగ్గిలమవుతున్న టీ అధికారులు
నిజాం కాలం నాటి భూముల పంపకమా అని మండిపాటు
హైదరాబాద్: ఆర్టీసీ స్థిరాస్తుల పంపిణీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్లోని ఆర్టీసీ నిర్మాణాలతోపాటు, వాటి భూముల విలువను కూడా లెక్కించి ఇరు రాష్ట్రాలకు పంచుతూ విభజన కమిటీ నియమించిన ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక రూపొం దించింది. ఉమ్మడి ఆర్టీసీకి సం బంధించిన చివరి బోర్డు సమావేశం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూడటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. బోర్డు ఆమో దం తర్వాత ఈ నివేదికను కేంద్రం నియమించిన షీలాబిడే కమిటీకి అందించనున్నారు. అక్కడి నుంచి అది నేరుగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. అయితే నగరంలోని సంస్థ స్థిరాస్తులు పూర్తిగా తెలంగాణకే దక్కాల్సి ఉండగా ప్రైవేట్ కన్సల్టెన్సీ మాత్రం వివాదాస్పదరీతిలో వాటిని మూల్యాంకనం చేయడంతో తెలంగాణ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఆమోదించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నివేదికలో తెలంగాణకు ఏ రకంగా నష్టం జరిగిందో వివరిస్తూ తెలంగాణ ఆర్టీసీ అధికారులు గురువారం సంస్థ ఎండీని కలిసి ఓ వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. మరో ప్రతిని సీఎంవోకు పంపారు. శుక్రవారం జరిగే బోర్డు సమావేశం ఉద్రిక్తంగా మారే అవకాశముంది.
వివాదాస్పద అంశాలివే..
►గత మే 15న ఆర్టీసీ రూపొందించిన విభజన నివేదికలో తెలంగాణ ఆర్టీసీ నష్టాలను రూ.1094 కోట్లుగా చూపారు. డిపోలవారీగా ఉన్న రికార్డుల ప్రకారం దీన్ని రూపొందించారు. షిలాబిడే నియమించిన ప్రైవేటు కన్సల్టెన్సీ జనాభా ఆధారంగా ఉమ్మడి ఆర్టీసీ నష్టాలను పంచి తెలంగాణ వా టాను రూ.1678 కోట్లుగా చూపింది. ఫలితంగా తెలంగాణకు అప్పుల భారం పెరగనుంది.
►ఆర్టీసీ 1956కు పూర్వమే ఏర్పడింది. దీంతో దీని స్థిరాస్తులు తెలంగాణకే చెందుతాయనేది స్థానిక వాదన. కానీ దీనికి విరుద్ధంగా ప్రధాన కార్యాలయం బస్భవన్, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, మియాపూర్లోని బస్ బాడీ వర్క్షాపుల భూముల విలువను కూడా లెక్కించి 58:42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంచారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కు రూ. 240 కోట్లు, తెలంగాణకు రూ. 154 కోట్లు దక్కుతాయని తేల్చారు.
► అనంతపూర్లో ఆర్టీసీ ఆధీనంలోని పవన విద్యుత్తు ప్రాజెక్టు కరెంటును పదేళ్లపాటు పంచుకుని తర్వాత ప్రాజెక్టును ఆంధ్రకు అప్పగించాలని పేర్కొన్నారు. ఈ లెక్కన హైదరాబాద్లోని ఆస్తుల విషయంలో మరోలా వ్యవహరించినట్లు గా తెలంగాణ అధికారులు ఎత్తి చూపుతున్నారు.
► తార్నాక ఆసుపత్రి భవనం ఉన్న భూమికి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ జరగని ఆస్తి విలువను లెక్కించి పంచడం నిబంధనలకు విరుద్ధమన్నది తెలంగాణ వాదన.
► బస్ భవన్లోని నిర్మాణాల విలువను రూ.15 కోట్లు, భూమి విలువ రూ.100 కోట్లుగా చూపా రు. భవనం విలువను మాత్రమే పంచితే సరిపోతుందని తెలంగాణ అధికారుల వాదిస్తున్నారు.