‘కొత్తపల్లి’ కులంపై సంధ్యారాణి యూటర్న్
హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ
సాలూరు: అరకు ఎంపీ కొత్తపల్లి గీత గిరిజన మహిళ కాదని, గిరిజనులకు కేటాయించిన ఎంపీ స్థానంలో ఆమె తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో పోటీచేసి గెలుపొందారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు దాఖలు చేసిన అప్పటి ఆమె ప్రత్యర్ది, ప్రస్తుత ఎంఎల్సీ గుమ్మడి సంధ్యారాణి తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. రాజకీయ కారణంగా తలెత్తిన ఈ పరిణామంతో గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
గిరిజనులపట్ల తెలుగుదేశం పార్టీకి, ఆ నాయకులకు ఏమాత్రం గౌరవం, ఆదరాభిమానాలు లేవని, అందుకే లాబీయింగ్కే ప్రాధాన్యమిచ్చారనీ విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఎంఎల్సీ సంధ్యారాణిని విలేకరులు ప్రశ్నించగా కేసు వాపసు తీసుకుంటున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నదానికి మాత్రం ఆమె సమాధానం దాటవేశారు.