
సాక్షి, పశ్చిమగోదావరి: కరోనా (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో.. పెనుగొండలో మరో పాజిటివ్ కేసు నమోదుకావడంతో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగానాధరాజు అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన మంగళవారం జిల్లాలోని పెనుమంట్ర మండలంలోని ఎస్ ఇల్లింద్రపర్రు, ఆలమూరు, నెలమూరు, ఓడూరు, పొలమూరు గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో పారిశుధ్యం, వైద్య సదుపాయాలను ఆయన పరివేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రజలంతా స్వీయ గృహ నిర్భంధంలోనే ఉండాలని తెలిపారు. అదేవిధంగా అనవసరంగా బయట తిరగవద్దని మంత్రి సూచించారు. (రెడ్ జోన్గా ప్రకాశం )
పంటలు చేతికి వస్తున్న తరుణంలో రైతులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను శ్రీరంగానాధరాజు ఆదేశించారు. ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు, జగనన్న రూ.1000 ఆర్థిక సాయం గురించి వాలంటీర్లను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రజలెవ్వరు అధైర్య పడవద్దని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. (పేద కుటుంబానికి ఉచిత రేషన్)