
సాక్షి, న్యూఢిల్లీ : అనంతపురం జిల్లా నేమికల్లు, ఉంతకల్లులో గ్రామాల్లో స్టోన్ క్రషర్లు కారణంగా విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని హీరోజీరావు అనే రైతు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్టోన్ క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము కారణంగా పంట పొలాలకు నష్టం జరుగుతోందని.. ప్రజలు, పశువులు రోగాల బారిన పడుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను మండించడంతో వెలువడే ఉద్గారాల కాలుష్యం ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొటున్నారని తెలిపారు.
కాలుకాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు పాటించకుండా నడుస్తున్న స్టోన్ క్రషర్లు జనావాసాలను సైతం దుమ్మూ ధూళితో కప్పేస్తున్నాయని పేర్కొన్నారు. క్రషర్లు, క్వారీల యజమానులు పీసీబీ నిబంధనలను లెక్క చేయటం లేదన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు చెందిన జాయింట్ కమిటీచే వెంటనే క్రషింగ్ యూనిట్లను తనిఖీ చేసి, చుట్టు ప్రక్కల గ్రామాలను సందర్శించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తనిఖీ బృదానికి అన్ని రకాల సహాయసహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్కు అదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది.