
అమరావతి సెంటర్లో నిలబడతా...
► దమ్ముంటే బహిరంగ చర్చకు రండి
► సదావర్తి భూములపై న్యాయపోరాటానికి సిద్ధం
► టీడీపీ నేతలకు వైఎస్సార్సీపీ నేత కావటి సవాల్
పట్నంబజారు(గుంటూరు) : అమరావతిలోని సదావర్తి సత్రానికి సంబంధించి ఒక్క అంగుళం భూమి కూడా అక్రమార్కులకు దక్కనివ్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నీతిపరుడని, సచ్ఛీలుడని చెబుతున్న ఆ పార్టీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
తాను అమరావతి దేవస్థానం వద్ద వచ్చి నిలబడి ఉంటానని, దమ్ముంటే చర్చకు రావొచ్చన్నారు. అరండల్పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ భూములను లాక్కునే పరిస్థితి వస్తే యుద్ధం తప్పదని చెప్పారు. కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, కచ్చితంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. సదావర్తి భూముల విషయంలో అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమన్నారు.