
ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుల భూకబ్జా
బెజవాడలో మరో భూకబ్జా భాగోతం తెరమీదకు వచ్చింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు భూకబ్జాకు పాల్పడ్డారు.
విజయవాడ: బెజవాడలో మరో భూకబ్జా భాగోతం తెరమీదకు వచ్చింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు భూకబ్జాకు పాల్పడ్డారు. దుర్గాపురంలో ఎమ్మెల్యే ఉమ పేరుతో కొందరు వ్యక్తులు ఓ ఇంటిని ఆక్రమించుకున్నారు. యజమాని ఇంట్లోకి రాకుండా బోండా అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఆ ఇంటి యజమానురాలు భర్త చనిపోవటంతో కుమార్తెతో కలిసి ఆ ఇంట్లో ఉంటోంది. బుధవారం కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపించారు.
అంతేకాకుండా ఏమైనా మాట్లాడుకోవాలంటే ఎమ్మెల్యే కార్యాలయానికి రావాలని, అక్కడకు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా క్యాన్సర్ తో బాధపడుతున్న తన కూతురుతో రాత్రంతా ఇంటి బయటే జాగారం చేశానని బాధితురాలు అంటోంది. తన కూతురికి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే బోండా బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.