
ఏలూరు రూరల్ : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లోకి చొరబడి విద్యుత్ వైర్లు కట్ చేయించారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను ఆయన అనుచరులు నోటికొచ్చినట్టు దూషించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలోని మల్కాపురంలో చింతమనేని ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో తన అనుచరులతో తిరుగుతూ ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షుడు తూతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు.
నిరంజన్ ఇంటి వెనుక భాగంలో ప్రహరీగోడకు పశువులను కట్టేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప కొంకాలను పీకించారు. వెనువెంటనే ప్రభాకర్ వెనక భాగం గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించారు. ఇదే సమయంలో ఆయన అనుచరులు ముగ్గురు మూసి ఉన్న ప్రధానద్వారం తలుపులు కొట్టి కేకలు పెడుతూ ఇంటిలో ఉన్న నిరంజన్ భార్యను పిలిచారు. ఆమె తలుపు తీయగానే తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ ఇల్లంతా తిరిగారు.
ఆఖరికి వెనకభాగంలో ఉన్న పంచాయతీ కుళాయిని ప్రభాకర్ గుర్తించారు. తక్షణం కుళాయికి ఏర్పాటు చేసిన మోటార్ విద్యుత్ వైర్లను కట్ చేయమంటూ విద్యుత్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారు వైర్లు కట్ చేశారు. రోడ్డు పక్క పశువులు కట్టి, కుళాయికి మోటార్ బిగిస్తే చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులను ఆదేశిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన స్థానికులు ఖిన్నులయ్యారు. గ్రామంలో 90 శాతం కుళాయిలకు మోటార్లు బిగించి ఉన్నాయని, వాటినన్నీ వదిలేసి వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిలోని మోటార్ వైర్లు తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. వీధి చివర్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్లే చింతమనేని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని పలువురు తెలిపారు.
కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు
అధికార బలంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గం కన్వీనర్ కొఠారు రామచంద్రరావు చింతమనేని ప్రభాకర్ను హెచ్చరించారు. సోమవారం మల్కాపురంలో నిరంజన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.