ధర్మవరంఅర్బన్, న్యూస్లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం 60 రోజులుగా ఉధృతంగా జరుగుతున్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా డ్రామాలు అడుతున్నారని, వారికి సమైక్యాంధ్ర గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు.
ఆదివారం ఆయన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విధంగా జేఏసీ నాయకులు సమైక్య రాష్ట్రం కోసం లేఖ తెస్తే తొలి సంతకం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదే విధంగా సంతకం చేయాలని డిమాండ్ చేశారు.ఇకనైనా సమైక్య రాష్ట్రం కోసం లేఖ ఇచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
సమైక్య ఉద్యమాన్ని ముందుకు నడిపిద్దాం కనగానపల్లి, న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గ సమన్వకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం నియోజకవర్గంలోని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో వారు పర్యటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. కనగానపల్లిలో శంకరనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతం మేరకు అక్టోబర్ 2నుంచి నవంబర్ 1 వరకు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశామన్నారు.
అక్టోబర్ 2 నుంచి ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ నిరాహార దీక్షలతో పాటు ధర్నాలు, బైకు ర్యాలీలు చేపడతామన్నారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కమిటీ సభ్యుడు అంకెలక్ష్మన్న, యూత్ కన్వీనర్ ముకుందనాయుడు, కనగానపల్లి సొసైటీ అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి, మండల కన్వీనర్ నాగముని, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రపై మాట్లాడే అర్హత టీడీపీ నాయకులకు లేదు
Published Mon, Sep 30 2013 3:13 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement