వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
Published Wed, Jan 22 2014 3:49 AM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు ఫిబ్రవరి-2న జరగనున్న రాతపరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 168 కేంద్రాలను ఖరారు చేశారు. తొలుత జిల్లావ్యాప్తంగా 186 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. వీటిలో 168 కేంద్రాలను ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమోద ముద్ర లభించింది. పార్వతీపురం డివిజన్లో 71 కేంద్రాలు, విజయనగరం డివిజన్లో 97 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కళాశాల, పాఠశాల ప్రధానోపాధ్యాయులే చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు. జిల్లాను 10 రూట్లుగా విభజించి, రూట్ ఆఫీసర్లుగా తహశీల్దార్, ఎంపీడీఓలను నియమించారు. సిట్టింగ్ స్క్వాడ్లుగా పరీక్షా కేంద్రానికి ఒక డిప్యూటీ తహశీల్దార్ అధికారిని, పర్యవేక్షకులుగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు.
వీరు కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్విహ స్తారు. 15 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను సైతం నియమించారు. విజయనగరం డివిజన్లో ఆర్డీఓ జె.వెంకటరావు, పార్వతీపురం డివిజన్ను సబ్ కలెక్టర్ శ్వేతామహంతి పర్యవేక్షిస్తారు. కన్వీనర్గా జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్ఎస్ వెంకటరావు వ్యవహరిస్తారు. వీఆర్వో పోస్టుకు ఉదయం, వీఆర్ఏ పోస్టులకు మధ్యాహ్నం పరీక్ష జరుగుతుంది. ఈ పోస్టులకు జిల్లా వ్యాప్తంగా 45,655 దరఖాస్తులు అందాయి. వీఆర్వో 90 పోస్టులకు 43647, వీఆర్ఏ 137 పోస్టులకు గానూ 1364 మంది దరఖాస్తు చేసకున్నారు. రెండింటికి 644 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వీటిలో 27 వీఆర్వో పోస్టులకు దరఖాస్తులు అందలేదు. దృష్టిలోపం ఉన్న వారికి కేటాయించిన 13, ఎస్టీ మహిళలకు కేటాయించిన ఆరు ఖాళీలకు, వివిధ కేటగిరీలకు చెందిన మరో ఎనిమిది పోస్టులకు దరఖాస్తులు అందలేదు. అలాగే కొన్ని గ్రామాల్లో వీఆర్ఏలకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి.
Advertisement
Advertisement