
ఆగని కోడలి దీక్ష
తిరుపతిక్రైం: ‘మా అత్తామామలకు, భర్తకు ఆస్తులు చూసుకోవడానికి వారసుడు కావాలంటున్నాడు. అవసరమైతే రెండో పెళ్లి చేయడానికైనా సిద్ధపడేలా ఉన్నారు. బుధవారం నుంచి నా భర్తకు ఉన్న మెడికల్ షాప్ను కూడా మూసివేసి కనపడకుండా పంపించివేశారు. నాకు కేసులు అవసరం లేదు. నాకు నాభర్త కావాలి. ఇదంతా నాభర్త కోసమే చేస్తున్నాను. మీరు ప్రచురించే వార్తను చూసైనా నన్ను, నాబిడ్డను దగ్గరకు చేర్చుకుంటాడనే ఆశ ఉంది’. అంటూ ఓ అభాగ్యురాలు మెట్టినింటి వద్ద లోకం పోకడ తెలియని పసిబిడ్డను ఒడిలో ఉంచుకుని గురువారం కూడా దీక్ష కొనసాగించింది.
తిరుపతి భవానీనగర్కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఇంటికి బయలుదేరినా మార్గమధ్యంలోనే అదృశ్యమయ్యాడని వీణ వివరించింది. తనను ఆదరించమని అత్తారింటి ముందు దీక్షకు దిగినట్లు ఆమె స్పష్టం చేసింది.
పార్టీలు సంఘాల మద్దతు
న్యాయం కోసం పోరాటం సాగిస్తున్న వీణకు వివిధ పార్టీలు, మహిళా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఆమెతో పాటు లక్ష్మి (ఐద్వా), టీ.రాజేంద్ర (వైఎస్ఆర్ సీపీ), రాటకొండ విశ్వనాథ్ (బీజేవైఎం) చిన్నం పెంచలయ్య (సీపీఐ)తో పాటు పలువురు నాయకులు బైఠాయించారు.
ఐద్వా మద్దతు
తిరుపతి కల్చరల్: న్యాయం కోసం భర్త ఇంటి ముందు మౌనదీక్ష చేపడుతున్న వీణకు ఐద్వా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వీణను కాపురానికి నిరాకరించడంపై ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.