
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. అమరావతి కోసం రూ.లక్షా 9 వేల కోట్లు గత ప్రభుత్వంలో ప్రాథమిక అంచనా వేశారని గుర్తుచేశారు. స్థానిక రైతులకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిదని, ఎలాంటి ఆందోళనకు పాల్పడవద్దని మంత్రి భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ఆదాయం మేరకే ప్రభుత్వం ఖర్చు చేయాలని, రాజధానికి ఇప్పటి వరకు కేంద్రం కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించారు. రాజధానిని పూర్తిగా నిర్మిస్తామని విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రియల్ఎస్టేట్ వ్యాపారం చేశారని బొత్స మండిపడ్డారు. ఏపీ ప్రజలపై ప్రేమ ఉంటే చంద్రబాబు హైదరాబాద్లో ఎందుకు ఇళ్లు కట్టుకున్నారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment