
ఎయిర్ ఇండియాకు 5,500 కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి కింద రూ.5,500 కోట్లను ఎయిర్ ఇండియా పొందనుంది. ఆర్థిక మంత్రి పి.చిదంబరం సోమవారం పార్లమెంటుకు సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో ఈ విషయం వెల్లడించారు. దీంతో పౌర విమానయాన శాఖ ప్రణాళిక కేటాయింపులు రూ.5,720 కోట్లకు చేరాయి. ప్రణాళికేతర వ్యయం రూ.657.98 కోట్లుగా అంచనా.
- ఏడు కొత్త విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నట్టు చిదంబరం చెప్పారు.
- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ)కు బడ్జెటరీ మద్దతు కింద రూ.74.7 కోట్లు కేటాయించారు. ఇందులో సిక్కింలోని పాక్యోంగ్ పర్వత ప్రాంతంలో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయం కూడా ఉంది.
- శిక్షణ ప్రాజెక్టులు, ఐటీ, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులతోసహా పలు పథకాలను కొనసాగించేందుకు వీలుగా డెరైక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు రూ.50 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. డీజీసీఏ భవన్ నిర్మాణం, సంయుక్త శిక్షణ అకాడెమీ నిర్మాణం కూడా ఇందులో ఉన్నాయి.
- బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కోసం రూ.40 కోట్ల నిధుల కేటాయింపు.
- సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలిలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ కోసం రూ.5.10 కోట్లు కేటాయింపు.
సీబీఐకి రూ.520 కోట్లు
మధ్యంతర బడ్జెట్లో సీబీఐకి ప్రభుత్వం రూ. 520.56కోట్లు కేటాయించింది. ఇది గత ఆర్థికసంవత్సరంతో పోల్చుకుంటే 17 శాతం అధికం. 2013-14 బడ్జెట్లో రూ.443 కోట్లు కేటాయించగా ఈ సారి రూ.520 కోట్లకు పెంచారు. ఈ-గవర్నెన్స్, శిక్షణ కేంద్రాల ఆధునీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్ విభాగాలను పటిష్టం చేసేందుకు సీబీఐ ఈ నిధులను వినియోగించనుంది.