ఎయిర్‌టెల్‌ లాభం 72 శాతం డౌన్‌ | Airtel profit down 72 per cent | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ లాభం 72 శాతం డౌన్‌

Published Fri, Feb 1 2019 4:43 AM | Last Updated on Fri, Feb 1 2019 8:34 AM

Airtel profit down 72 per cent - Sakshi

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 72% తగ్గింది. గత క్యూ3లో రూ.306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లుగా నమోదైందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. భారత్‌లో టెలికం వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండటమే ఈ భారీ క్షీణతకు కారణమని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ(ఇండియా, దక్షిణాసియా) గోపాల్‌ విఠల్‌ తెలిపారు.  ఆదాయం రూ.20,319 కోట్ల నుంచి 1 శాతం పెరిగి రూ.20,519 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఎబిటా 17 శాతం తగ్గి రూ.6,307 కోట్లకు చేరిందని వివరించారు. గత క్యూ3లో రూ.123గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ)ఈ క్యూ3లో 16 శాతం తగ్గి రూ.104కు చేరిందని తెలిపారు. గత క్యూ3లో రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్న నికర రుణభారం ఈ క్యూ3లో రూ.6,837 కోట్లు క్షీణించి రూ.1.06 లక్షల కోట్లకు తగ్గిందని వివరించారు.

ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకే లాభాలు...
ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కారణంగా రూ.1,017 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని విఠల్‌ తెలిపారు.. దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే, భారత కార్యకలాపాల నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.972 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని టెలికం వ్యాపారాల్లో ఒక్క ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా టెలికం వ్యాపారంలో మాత్రమే నికర లాభం వృద్ధి చెందిందని తెలిపారు. గత క్యూ3లో రూ.394 కోట్లుగా ఉన్న ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నికరలాభం ఈ క్యూ3లో 40 శాతం ఎగసి రూ.552 కోట్లకు పెరిగిందని వివరించారు. ఈ విభాగం మొత్తం ఆదాయం రూ.5,284 కోట్ల నుంచి 11% పెరిగి రూ.5,904 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. డేటా వృద్ధి జోరుగా ఉండటం, ఎయిర్‌టెల్‌మనీ లావాదేవీల విలువ పెరగడం వల్ల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది.

40.4 కోట్లకు ఖాతాదారులు....
గత క్యూ3లో 39.4 కోట్లుగా ఉన్న మొత్తం  ఖాతాదారుల సంఖ్య ఈ క్యూ3లో 40.4 కోట్లకు పెరిగిందని విఠల్‌ పేర్కొన్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాల్లో నికర వినియోగదారుల సంఖ్య పెరగడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. భారత కార్యకలాపాల ఆదాయం 2 శాతం తగ్గి రూ.14,768 కోట్లకు చేరిందని, తీవ్రమైన పోటీ కారణంగా భారత మొబైల్‌ వ్యాపారం 4 శాతం క్షీణించిందని వివరించారు.  కాగా, ట్రాయ్‌ గణాంకాల ప్రకారం నవంబర్‌లో దేశీయంగా ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య 34.1 కోట్లు. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం డిసెంబర్‌లో వినియోగదారుల సంఖ్య 28.42 కోట్లు. అంటే ఒక నెలలో ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య 5.7 కోట్లు తగ్గింది.

మూడు రెట్లు పెరిగిన డేటా..: భారత్‌లో వినియోగదారుల సంఖ్య తగ్గినా, డేటా వినియోగం మాత్రం జోరుగా ఉందని విఠల్‌ వివరించారు.. గత క్యూ3లో 1,106 బిలియన్‌ ఎమ్‌బీగా ఉన్న డేటా వినియోగం ఈ క్యూ3లో దాదాపు మూడు రెట్ల వృద్ధితో 3,217 బిలియన్‌ ఎమ్‌బీలకు పెరిగిందని పేర్కొన్నారు. మొబైల్‌ 4జీ డేటా వినియోగదారులు 112 శాతం వృద్ధితో 7.71 కోట్లకు పెరిగారని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement