
సాక్షి,ముంబై: దేశీ ఆటో రంగ దిగ్గజం బజాజ్ ఆటో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని సాధించింది.
క్యూ3 ఫలితాలు
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో ద్విచక్ర తయారీదారు బజాజ్ ఆటో నికర లాభం 16 శాతం పుంజుకుని రూ. 1102 కోట్లను నమోదు చేసింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 7409 కోట్లను తాకింది. గత ఏడాది రెవెన్యూ 6387 కోట్ల రూపాయలుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1246 కోట్లకు చేరగా.. ఇతర ఆదాయం రూ. 209 కోట్ల నుంచి రూ. 470 కోట్లకు ఎగసింది. మార్జిన్లు 19.5 శాతం నుంచి 15.6 శాతానికి బలహీనపడ్డాయి.
తాజా ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకున్నప్పటికీ దలాల స్ట్రీట్ను మెప్పించలేకపోయింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో బజాజ్ ఆటో షేరు దాదాపు 2 శాతం నష్టపోయింది. అయితే మార్జిన్లు క్షీణించడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.