
దేశంలో విస్తరిస్తున్న డిజిటల్ మార్కెటింగ్
రూ.3,575 కోట్లుకు విలువ..
- బెంగళూరు, ఢిల్లీలో సేవలను
- ప్రారంభించిన జెన్వై మీడియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఆన్లైన్ మార్కెటింగ్ రోజురోజుకూ విస్తరిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్లుగా ఉన్న డిజిటల్ మార్కెటింగ్ (డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్).. 2015-16 నాటికి రూ.3,575 కోట్లకు చేరిందని డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్ జెన్వై మీడియం కో-ఫౌండర్, సీఈఓ యశ్వంత్ కుమార్ తెలిపారు. ఏటా ఈ విభాగం 30 శాతం వృద్ధి రేటును కనబరుస్తుందన్నారు. మూడేళ్ల క్రితం సోషల్ మీడియా, కంటెంట్ డెవలప్మెంట్, పే పర్ క్లిక్, ఆన్లైన్ రిప్యూటేషన్ మేనేజ్మెంట్ అనే నాలుగు కేటగిరీల్లో హైదరాబాద్కే పరిమితమైన జెన్వై సేవలు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీలకూ విస్తరించాయి. విద్య, వైద్య రంగంలో డిజిటల్ మార్కెటింగ్ ఎంతగానో ఉపయుక్తమని అందుకే తమ కస్టమర్లలో చాలా మంది ఆ విభాగాల వారే ఉన్నారని కుమార్ ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు. ప్రస్తుతం 20 కంపెనీలు తమ సేవలను వినియోగించుకుంటున్నాయని.. ఇందులో సైమా, జనప్రియ, ఈ-కిన్కేర్ అనే మూడు కంపెనీలు హైదరాబాద్కు చెందినవి ఉన్నాయన్నారు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 150 నగరాల్లో జెన్ వై సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.