
వచ్చేస్తోంది జీఎస్టీ
► మరో రెండ్రోజుల్లో అమల్లోకి..
♦ తయారీదారుల నుంచి రిటైల్ వ్యాపారుల వరకు అందరిపై పన్ను
♦ సాధారణ చెల్లింపుదారులు నెలనెలా..
♦ కాంపోజిషన్ ట్రేడర్లు మూడు నెలలకోసారి..
♦ వసూలు చేసే పన్నులో కేంద్రం–రాష్ట్రానికి చెరిసగం
♦ సేవా పన్నుతో రాబడి పెరిగే అవకాశం
హైదరాబాద్: హరియాణాలో ఓ కారు తయారైంది. తయారీదారుడి వద్ద ఆ కారు విలువ రూ.10 లక్షలు. జూలై 1 నుంచి అమ ల్లోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రకారం కారు విలువలో 28 శాతం అంటే రూ.2.80 లక్షలు తయారీదారుడు హరియాణా ప్రభుత్వా నికి పన్ను చెల్లించాలి. అయితే కారు ఆ రాష్ట్రం లో అమ్ముకుంటేనే పన్ను హరియాణా ప్రభు త్వానికి వెళ్తుంది. అదే కారును తెలంగాణలో విక్రయిస్తే మాత్రం ఆ పన్ను మొత్తం తెలం గాణ ఖజానాకు చేరుతుంది. వినియోగదారు డికి కారును అమ్మే ఇక్కడి డీలర్లు చెల్లించే పన్ను కూడా తెలంగాణకే చెందుతుంది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోనూ అమల్లోకి రానున్న నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించిన మరికొన్ని అంశాలను ఓసారి చూద్దాం..
♦ జీఎస్టీ పరిధిలోనికి వచ్చే ప్రతి వస్తువుపై విధించే పన్నులో 50 శాతం కేంద్రానికి వెళ్తుంది. ఇది కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ). మరో 50 శాతం రాష్ట్రానికి చెందుతుంది. అది రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ).
♦ ఏదైనా వస్తువు.. తయారైన రాష్ట్రంలోనే వినియోగించినప్పుడే ఈ రెండు పన్నులుంటాయి. అలాకాకుండా వస్తువు ఒక రాష్ట్రంలో తయారై, మరో రాష్ట్రంలో వినియోగిస్తే మాత్రం ఆ పన్ను కేంద్రానికి వెళ్తుంది. దీన్ని ఐజీఎస్టీగా వ్యవహరిస్తారు. అయితే ఆ పన్నును వస్తువు వినియోగం జరిగిన రాష్ట్రానికి కేంద్రం పంపిస్తుంది.
♦ పన్ను చెల్లింపుదారులను రెండు రకాలుగా విభజించారు. మొదటిది.. కాంపోజిషన్ ట్రేడర్లు. రెండవది సాధారణ చెల్లింపుదారులు. కాంపోజిషన్ ట్రేడర్ల వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుంది. వీరు ప్రతి మూడు నెలలకోసారివారి టర్నోవర్లో 1 శాతం మొత్తాన్ని జీఎస్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. అదే తయారీదారులయితే 2 శాతం కట్టాలి.
♦ ఏడాదికి రూ.75 లక్షలకు పైగా టర్నోవర్ ఉంటే సాధారణ చెల్లింపుదారులుగా గుర్తిస్తారు. వీరు జీఎస్టీ కింద ప్రతినెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
♦ తయారీదారుడి నుంచి హోల్సేల్ డీలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైల్ డీలర్ వరకు అందరూ జీఎస్టీ కింద పన్ను చెల్లించాల్సిందే. వీరి నుంచి జీఎస్టీ వసూలు చేసే బాధ్యత సెంట్రల్ ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలపై ఉంటుంది.
♦ పరోక్ష పన్నులన్నింటినీ కలిపి జీఎస్టీ ప్రతిపాదించినందున సర్వీస్ ట్యాక్స్ కింద ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెపుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ దుకాణం యజమాని తాను అమ్మే ఆభరణాలకు మాత్రమే పన్ను చెల్లిస్తున్నాడు. అయితే ఆ దుకాణం ఉన్న భవనానికి నెలకు లక్షల్లో అద్దె చెల్లిస్తుంటే.. ఇకపై ఈ అద్దెకు కూడా సర్వీసు ట్యాక్స్ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ ద్వారానే హైదరాబాద్లోని వాణిజ్య సముదాయాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా.