Merchants
-
'గూగుల్ పే' సౌండ్పాడ్ వచ్చేస్తోంది..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో గూగుల్ సంస్థ గత ఏడాది కాలం నుంచి 'గూగుల్ పే' సౌండ్పాడ్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది ఎట్టకేలకు పూర్తి కావొస్తోంది. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది. వ్యాపారులు చెక్అవుట్ సమయాన్ని తగ్గించడానికి గూగుల్ పే సెప్టెంబరు 2017లోనే భారత్లో ఆవిష్కరించింది. ఇది సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను జరుపుకోడానికి అనుమతిస్తుందని గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ 'అంబరీష్ కెంఘే' ఫిబ్రవరి 22న ఒక బ్లాగ్ పోస్ట్లో రాశారు. గూగుల్ పే సౌండ్పాడ్ ఎలా పనిచేస్తుందంటే.. సౌండ్పాడ్ అనేది ఆడియో పరికరం, ఇది చెల్లింపు స్వీకరించబడినప్పుడు ఆడియో ద్వారా వెల్లడిస్తుంది. దీంతో వ్యాపారాలు ప్రత్యేకంగా అమౌంట్ వచ్చిందా? లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపు చేసే కస్టమర్ తప్పకుండా.. వ్యాపారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అమౌంట్ పంపిన వెంటనే సౌండ్పాడ్ సౌండ్ చేస్తుంది. ఇప్పటికే మనదేశంలో పేటీఎం, ఫోన్ పే వంటివి అందించే బాక్సులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పేటీఎం సంక్షోభంలో ఉన్న కారణంగా కస్టమర్లు గూగుల్ పే దిశగా అడుగులు వేస్తున్నారు. -
రేజర్పే, క్యాష్ఫ్రీ కంపెనీలకు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ: పేమెంట్ గేట్వే సేవలు అందిస్తున్న రేజర్పే, క్యాష్ఫ్రీ పేమెంట్స్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. పేమెంట్ ప్రాసెసింగ్ వ్యాపారంలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘పేమెంట్ అగ్రిగేటర్, పేమెంట్ గేట్వే లైసెన్స్ కోసం ఆర్బీఐ నుంచి జూలైలో సూత్రప్రాయ ఆమోదం లభించింది. తుది లైసెన్స్ కోసం ఆర్బీఐకి కంపెనీ అదనపు సమాచారం అందించాల్సి ఉంది. అంత వరకు కొత్త ఆన్లైన్ వ్యాపారులను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ కోరింది’ అని రేజర్పే తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రభావం ప్రస్తుత వ్యాపారాలపై ఉండబోదని కంపెనీ వెల్లడించింది. చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
‘చకచకా చేయి’..యూరప్లోనూ యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూరప్కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. యూరప్ లో భారతీయులు.. వరల్డ్లైన్కు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్స్ పీవోఎస్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేయడానికి వీలవుతుంది. అలాగే, రూపే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతోనూ యూరోప్లో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయులు అంతర్జాతీయ కార్డ్ నెట్వర్క్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకోనున్నట్టు ఎన్ఐపీఎల్ తెలిపింది. వరల్డ్లైన్ క్యూఆర్ ద్వారా యూరప్లోని మరిన్ని దేశాల్లోకి యూపీఐని విస్తరించనున్నట్టు తెలిపింది. జీ20 దేశాలకు యూపీఐ, ఆధార్! కాగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా.. జీ 20 దేశాలు యూపీఐ, ఆధార్ వంటి ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి, అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్ అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, ఆవిష్కరణ, స్థిరత్వం అన్నవి నూతనతరం ఆర్థిక వృద్ధి చోదకాలుగా పేర్కొన్నారు. భారత్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్లు అయిన కోవిన్, ఆధార్, యూపీఐ ఇంటర్ఫేస్ తదితర వాటిని సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో జైన్ మాట్లాడుతూ. ఈ తరహా ఓపెన్ సోర్స్ (మార్పులకు వీలైన), పలు వ్యవస్థల మధ్య పనిచేసే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని సూచించారు. -
బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!
ప్రముఖ మర్చంట్స్ పేమెంట్స్ ఫ్లాట్ ఫారం భారత్ పే తమ మర్చంట్ భాగస్వాములకు శుభవార్త చెప్పింది. తమ మర్చంట్ భాగస్వాములకు బంగారు రుణాలను అందించనున్నట్లు పేర్కొంది. కంపెనీ ఇంతకు ముందు అసురక్షిత రుణాల కేటగిరీలోని కొలాటరల్ ఫ్రీ రుణాలను అందజేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సుహైల్ సమీర్ నేతృత్వంలోని ఈ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆమోదం గల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(ఎన్బీఎఫ్సీ)తో చేసుకున్న భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా రూ.20 లక్షల వరకు బంగారు రుణాలను అందించనున్నట్లు తెలిపింది. భారత్ పే కంపెనీ ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో వ్యాపారులకు బంగారు రుణాలను అందిస్తున్నట్లు ప్రారంభించింది. 2022 చివరి నాటికి 20 నగరాలకు విస్తరించాలని భావిస్తుంది. 2022 చివరి నాటికి ₹500 కోట్ల రుణాలను నెలకు 0.39% వడ్డీరేటుతో అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని, అసెస్ మెంట్ ప్రక్రియ పూర్తయిన 30 నిమిషాల్లోనే రుణం మంజూరు చేయనున్నట్లు భారత్ పే ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ పే యాప్లో సులభంగా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ భాగస్వామ్యంతో సంస్థ డోర్ స్టెప్, బ్రాంచ్ కలెక్షన్ సేవలు రెండింటినీ అందిస్తోంది. వ్యాపారులు ఆరు, తొమ్మిది, 12 నెలల పాటు రుణాలు తీసుకోవచ్చు. ఈజీ డైలీ ఇన్స్టాల్ మెంట్(ఈడిఐ) ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే ఆప్షన్ కూడా వారికి ఉంది. కంపెనీ త్వరలో ఈక్వేటెడ్ నెలవారీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) చెల్లింపును ప్రారంభించనుంది. భారత్ పేను 2018లో షష్వత్ నక్రానీ, భావిక్ కొలదియా కలిసి స్థాపించారు. (చదవండి: ఎయిర్ ఇండియా నూతన చైర్మన్గా చంద్రశేఖరన్ నియామకం..!) -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపారుల మాయాజాలం
-
‘చాయ్ తాగి పో’, ‘ఊకో కాక’.. ఇవన్నీ షాపుల పేర్లండి బాబోయ్!
సాక్షి, కరీంనగర్: ‘అరేయ్.. ఎక్కడున్నవ్’.. ‘చాయ్ తాగి పో’.. ‘ఊకో కాక’.. ‘కమాన్ ఫ్రెండ్’.. రాకేన్ రోల్.. ‘చాయ్ వాలా’.. ఇవీ మనం రోజువారీ సంభాషణలో మాట్లాడుకునే పదాలు. ఇప్పుడు ఇవే పదాలు కరీంనగర్లోని వ్యాపార కూడళ్లలో హోర్డింగ్లపై దర్శనమిస్తున్నాయి. మారిన ట్రెండ్కు అనుగుణంగా వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. వాడుక భాష పదాలనే పేర్లుగా పెడుతున్నారు. గతంలో వ్యాపారాలకు దేవుళ్ల పేర్లు, ఇంటిలోనిపిల్లల పేర్లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు పెట్టేవారు. ఇంకొందరు పేరు బలం చూసి, సంఖ్య, శాస్త్రప్రకారంగా పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మన మాటలు.. వాడే ఊత పదాలు, వంటకాల పేర్లు, కూరగాయలు, పిండి వంటల పేర్లు హోర్డింగ్లకు ఎక్కుతున్నాయి. వెరైటీ పేర్లు ఇటు కస్టమర్లనూ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ యాసలో.. తెలంగాణ యాసలో చాయ్ బాబు చాయ్, మిర్చి, చాయ్, అమ్మ కర్రిపాయింట్, జస్ట్ ఫర్ యూ వంటి క్యాచీ పేర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారాలు నిర్వహించే వారు వాడుకభాషలో పేర్లు పెడుతున్నారు. అందరి నోళ్లలో నానిన పదాలతో పేర్లు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ.. కరీంనగర్లో ఏదైన షాప్ ప్రజల్లోకి వెళ్లాలాంటే పబ్లిసిటి తప్పని సరి. షాపులు, హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలు యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టి ప్రచారం చేయాలి. వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రారంభోత్సవాలు చేయించాలి. వ్యాపారం జోరుగా సాగాలంటే కూడా అదే స్థాయిలో ప్రచారం ఉండాలి. అవేవి లేకుండా కొత్త ట్రెండ్లో పేర్లు పెడుతూ రెట్టింపు పబ్లిసిటీ పొందుతున్నారు. జనం వాడుక భాషనే ప్రధానంగా చేసుకుని పేర్లు పెడుతున్నారు. పుల్గా ఉండాలని.. పెద్ద పెద్ద పేర్లు, నోరు తిరగని పేర్లు ఉండడం వల్ల జనానికి ఎక్కువగా గుర్తు ఉండదు. అందుకే సింపుల్గా అందరికీ అనువుగా గుర్తుండేలా కాస్త కొత్తగా ఉండేలా ‘తారక’ అనే పేరుపెట్టాం. పలకడానికి, వినడానికి కూడా బాగుండడంతో అందరి నుంచి స్పందన బాగుంది. – తోట కోటేశ్వర్, తారక రెస్టారెంట్, బస్టాండ్ రోడ్, కరీంనగర్ ఫ్రెండ్లీగా ఉండాలని.. అందరికీ సన్నితంగా, ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో చాయ్ తాగి పో.. పేరుతో వివిధ ఫ్లెవర్లలో టీ, స్నాక్స్ అందించే సెంటర్ను రెండు నెలల క్రితం ప్రారంభించా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పేరు కొత్తగా ఉండడంతో ప్రతిఒక్కరూ ఆసక్తిగా వస్తూ ఆదరిస్తున్నారు. – తాటికొండ రాజు, శివ థియేటర్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ ఆంధ్రాలో చూసి.. 12 ఏళ్ల కిత్రం కరీంనగర్లో రెడ్డి గారి వంటిల్లు పేరున మెస్ ప్రారంభించాం. ప్రజల ఆదరణ లభించింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి పేర్లు ఉండడం గమనించా. ఇక్కడ మెస్ ప్రారంభించే సమయంలో అదే ఆలోచనతో రెడ్డి గారి వంటిల్లు అని పేరు పెట్టా. అందరి ఆదరణ లభించి వ్యాపారం సాఫీగా సాగుతోంది. – బారాజు రామిరెడ్డి, డీఐజీ బిల్డింగ్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ -
వ్యాపారులకు పేటిఎమ్ బంపర్ ఆఫర్.. ఉచితంగా సౌండ్బాక్స్
భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ పేటిఎమ్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఉచితంగా పేటిఎమ్ సౌండ్బాక్స్ సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. పేటీఎం ఫర్ బిజినెస్(పీ4బి) యాప్ను ద్వారా 40% తగ్గింపుతో రూ.299కు లభిస్తున్న పేటీఎం సౌండ్బాక్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాపారులు పేటిఎమ్ ద్వారా ఒక నెలలో 50 కంటే ఎక్కువ లావాదేవీల చేస్తే వ్యాపారులు ప్రతి నెలా 60 రూపాయల క్యాష్బ్యాక్ పొందుతారు. ఇలా మీరు గనుక ఐదు నెలల పాటు 50 కంటే ఎక్కువ లావాదేవీలు పేటీఎం ద్వారా చేస్తే మీకు 300 రూపాయలు క్యాష్బ్యాక్ లభిస్తాయి. ఇలా మీరు దీనిని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు చేసే విధంగా ప్రోత్సహించినట్లు అవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు అందుబాటులో ఉంది. వ్యాపారులలో పేటిఎమ్ సౌండ్బాక్స్ అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడంలో వారికి సహాయపడుతుంది. నకిలీ స్క్రీన్లు, తప్పుడు నిర్ధారణలను చూపించే కస్టమర్లచే మోసపోకుండా వారిని కాపాడుతుంది. ఈ పరికరం అనేక ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది. ఇది వారి మాతృభాషలో లావాదేవీ నిర్ధారణను పొందడానికి సహాయపడుతుంది. -
కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం
సాక్షి, కర్ణాటక : కోళ్లఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య గొడవల్లో కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. చిక్క తాలూకా పరిధిలోని రంగస్థళ, కణితహళ్లి అటవీ ప్రాంతాలలో ఫారం కోడిపిల్లలను వేలాదిగా వదిలి వెళ్లగా పట్టుకోవడానికి ప్రజలు పరుగులు తీశారు. వివరాలు.. చిక్క పరిసరాల్లోని కోళ్ల ఫారాలకు బడా కంపెనీలు కోడి పిల్లలను అందజేస్తాయి. అవి పెద్దయ్యాక వచ్చి తీసుకెళ్తారు. ఇందుకుగాను ఫారం యజమానులకు కోడికి ఇంత అని డబ్బు చెల్లిస్తాయి. అయితే ఇటీవల కంపెనీ సిబ్బంది లేనిపోని కిరికిరి చేయడం షురూ చేశారు. సరైన తూకం లేవని పెద్దసంఖ్యలో కోళ్లను, కోడిగుడ్లను తీసుకోకుండా మొండికేస్తున్నారు. దీంతో పెంపకందారులు కంపెనీల మాట వినేది లేదంటూ వారు ఇచ్చిన పిల్లలను శుక్ర, శనివారాల్లో సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. ఇది తెలిసిన ప్రజలు బ్యాగులు, పెట్టెలు తీసుకెళ్లి కోడిపిల్లలను పట్టుకెళ్లారు. -
నష్టపోయిన పరిశ్రమలకు సీఎం రిలీఫ్ ఫండ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధిని నగరంలో నష్టపోయిన చిన్న పరిశ్రమలకు కూడా అందిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీని హైదరాబాద్కి తీసుకొచ్చామని, హైదరాబాద్తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయన బుధవారం లోయర్ ట్యాంక్ బండ్లోని మారియెట్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ‘హుషార్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కోవిడ్ ప్రభావం అన్ని రంగలమీద పడిందని, నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చదవండి: (హైదరాబాద్నూ అమ్మేస్తారు : కేటీఆర్) కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ పధకం కింద ఎంత మందిని ఆదుకుందో తెలియదని ఎద్దేవా చేశారు. డీమానిటైజేషన్ వల్ల చిరు వ్యాపారులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. గతంలో పవర్ లేక చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారని, కరెంట్ కోసం ధర్నాలు కూడా చేశారని కానీ ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా మార్చామన్నారు. తెలంగాణ వచ్చాక 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సిటీలో తన చిన్నతనంలో నెలకోసారి అల్లర్లు జరిగేవని, స్కూల్స్, పరిశ్రమలు బంద్ చేయించేవారన్నారు. దాని వల్ల విద్యార్థులతో పాటు వ్యాపారులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ఇప్పుడు సిటీలో అల్లర్లు చెలరేగకుండా చూస్తున్నామని, శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని చెప్పారు. హైదరాబాద్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నామని, సిటీ శివారుల్లో కొత్తగా వస్తున్న టౌన్షిప్లకు రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీ ని హైదరాబాద్కి తీసుకొచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నగరంలో అందుతున్న వైద్యం, విద్య, ఉద్యోగోవకాశాలను జిల్లాల్లోనూ కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లోనూ ఇన్వెస్ట్ చెయ్యాలని వ్యాపారవేత్తలను కోరుతున్నామని, ఆగ్రో ప్రొస్సేసింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉందన్నారు. పాడీ పరిశ్రమల్లో మనం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, వరి, పప్పు ధాన్యాలు బాగా పండుతున్నాయన్నారు. వివిధ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను నెలకొల్పేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంపత్ కుమార్ గుప్తా, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. -
వ్యాపారుల కోసం భారత్పే డిజిటల్ గోల్డ్
న్యూఢిల్లీ: మర్చంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ భారత్పే వ్యాపారుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ బంగారం అమ్మకాన్ని ప్రారంభించింది.ఇందుకోసం సేఫ్గోల్డ్తో ఒప్పందం కుదుర్చుకుంది. సేఫ్గోల్డ్ డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా వినియోగదారులు అతి తక్కువ పరిణామంలో 24 గంటలూ బంగారాన్ని కొనేందుకు, అమ్మేందుకు, డెలివరీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. భారత్పేలో డిజిటల్ బంగారాన్ని ప్రారంభించడం ద్వారా వ్యాపారులకు అన్ని రకాల ఆర్థిక ఉత్పత్తులు పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లు భారత్పే గ్రూప్ ప్రెసిడెంట్ సుహైల్ సమీర్ చెప్పారు. డిజిటల్ బంగారాన్ని ప్రారంభించాల్సిందిగా వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారని, ప్రారంభించిన తొలిరోజే 200 గ్రాముల బంగారం విక్రయం జరిగిందని తెలిపారు.ముందు ముందు డిజిటల్ బంగారానికి డిమాండ్ పెరుగుతుందని ఈ ఆర్థిక సంవత్సరం 30 కిలోల బంగారం విక్రయించాలని, దీపావళి నాటికి కనీసం 6 కిలోలు బంగారం అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాపారులు భారత్పే యాప్ను ఉపయోగించడం ద్వారా 99.5 శాతం స్వచ్ఛత, 24 క్యారెట్ల బంగారాన్ని రోజులో ఏ సమయంలోనైనా, ఎక్కడి నుండైనా రూపాయి లేదా గ్రాములలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. వ్యాపారులు కొనుగోలు చేసిన బంగారం రక్షణకు సేఫ్గోల్డ్ ఐడిబిఐ ట్రస్టీషిప్ సేవలను వినియోగించుకుంటోంది.కొనుగోలు చేసిన బంగారాన్ని నూరు శాతం బీమాతో లాకర్లలో సురక్షితంగా ఉంచుతుంది.అంతర్జాతీయ మార్కెట్తో ముడిపడి ఉన్న బంగారం ధరల గురించి వ్యాపారులకు రియల్టైం వ్యూ అందుతుందని వారు కొనుగోలు చేసే బంగారానికి జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ కూడా లభిస్తుందని సమీర్ వివరించారు. -
వ్యాపారుల మాయాజాలం..
వ్యాపారం ఓ నమ్మకం.. వినియోగదారుడే దేవుడు. ఈ సూత్రాన్ని కొందరు వ్యాపారులు విస్మరిస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా మోసాలకు పాల్పడుతున్నారు. తూకాల్లో తేడాలు అధికమయ్యాయి. కాటాలతో దగా చేస్తున్న కొందరు వ్యాపారుల చేతివాటానికి నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులు సైతం మోసపోతున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర సరుకులు కొనుగోలు చేసినప్పుడు కొసరు, మెగ్గు అని గతంలో వ్యాపారులు కాస్తంత ఎక్కువ తూకం ఇచ్చేవారు. ప్రస్తుతం తక్కెడలు పోయి వాటి స్థానంలో డిటిజల్ ఎల్రక్టానిక్ కాటాలు వచ్చాయి. దీంతో పక్కాగా తూకం వేస్తున్నారు. ప్రతిదీ బంగారంలా భావిస్తున్నారు. రాళ్ల కాటాలతో హెచ్చు తగ్గులు ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ ఎల్రక్టానిక్ కాటాల్లో కూడా వినియోగదారులను ఎక్కువగా మోసం చేయవచ్చని కొందరు వ్యాపారులు నిరూపిస్తున్నారు. ఎల్రక్టానిక్ కాటాలతో మోసం ఇలా.... సాధారణంగా ఘన పదార్థాలను కిలో గ్రాముల్లో, ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తుంటారు. ఘన పదార్థాల కొనుగోలుకు వెళితే.. ఎల్రక్టానిక్ కాటాల్లో ద్రవ పదార్థాల తూకం మోడ్లో ఉంచి తూకం వేస్తున్నారు. కాటా స్క్రీన్పై (ఎల్) అనే అక్షరం మాత్రం స్టిక్కర్ అతికిస్తున్నారు. వాస్తవానికి కిలో ఘన పదార్థం బరువు 1,000 గ్రాములు ఉండగా ద్రవ పదార్థం బరువు 850 గ్రాములు మాత్రమే వస్తుంది. దీంతో కాటాలో ఆప్షన్ను లీటర్ మోడ్లోకి మార్చి ఘన పదార్థాల తూకం వేస్తున్నారు. దీంతో స్క్రీన్పై కనిపించేది లీటర్ల తూకమైన కొనుగోలు దారులకు కిలోలుగా చూపించి మోసం చేస్తున్నారు. స్క్రీన్పై ఎల్ అనే అక్షరం కనపడకుండా స్టిక్కర్ వేయడమో..రంగు పూయడమో చేస్తున్నారు. దీంతో వినియోగదారుడు కిలోకు 100 నుంచి 150 గ్రాముల వరకు నష్టపోతున్నారు. చిల్లర దుకాణాలు, చికెన్ షాపులు కూరగాయల మార్కెట్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడింది. దీంతో వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు తూకాలు వేసి వినియోగదారులను దోచుకుంటున్నారు. తూకంలో తేడా ఉందని వినియోగదారులకు అనుమానం వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని దుకాణాల్లో సీల్ లేకుండానే ఎల్రక్టానిక్ కాటాలను వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల అరిగిపోయిన రాళ్లు, మొద్దు కాటాలు వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు చిల్లర దుకాణాల్లో కొద్ది మేర మాత్రమే వ్యత్యాసం వస్తుండగా చికెన్ దుకాణాల్లో మాత్రం భారీ తేడాలు ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు.నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వినియోగదారుల్లో ప్రశ్నించే తత్వం రావాలి వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి. అప్పుడే వ్యాపారుల్లో మోసపూరిత ధోరణులు మారతాయి. ఏదేని వస్తువు కొనుగోలు చేసే సమయంలో తూకాలను నిశితంగా గమనించాలి. మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే 93981 49374 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి పేరు గోప్యంగా ఉంచుతాం. మోసాలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీరాముడు, తూనికల కొలతల శాఖ కంట్రోలర్ -
లోగ్రేడ్.. లో రేట్
కందుకూరు: అసలే ప్రకృతి వైపరీత్యాలతో పొగాకు నాణ్యత తగ్గింది. దానికి తోడు కరోనా వైరస్ పుణ్యమా అంటూ 50 రోజులకు పైగా వేలం నిలిచిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న నాణ్యత కాస్త వేలం విరామంతో మరికాస్త దిగజారింది. రంగు మారి బ్రైట్గ్రేడ్ రకం కూడా లోగ్రేడ్ రకంలోకి మారిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఏడాది రైతుల వద్ద లోగ్రేడ్ ఉత్పత్తులే అధికంగా ఉన్నాయి. కానీ వీటిని అమ్ముకోవాలంటే రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన లోగ్రేడ్ పొగాకు బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేయరు. ఒకవేళ కొనుగోలు చేసినా ధర రాదు. ఇదీ ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 91.78 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. దాంట్లో ఇప్పటి వరకు 31.5 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. లోగ్రేడ్ రకం కొనుగోలు చేయని వ్యాపారులు: ఈ ఏడాది వేలం ప్రారంభంలోనే పొగాకు నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బ్రైట్గ్రేడ్ కేవలం 40 శాతం మాత్రమే వచ్చిందనేది బోర్డు అధికారుల అంచనా. డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పొగాకు నాణ్యత దెబ్బతిని క్యూరింగ్లో మీడియం, లోగ్రేడ్ రకం ఉత్పత్తులు అధికంగా వచ్చాయి. దాదాపు 50 శాతం వరకు లోగ్రేడ్ ఉత్పత్తులు వచ్చాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేలంలో లోగ్రేడ్ రకం ఉత్పత్తులకు సరైన ధర దక్కితేనే రైతులు నష్టాల నుంచి బయటపడగలరు. కానీ పొగాకు వేలంలో పరిస్థితి పూర్తి భిన్నంగా నడుస్తోంది. బ్రైట్గ్రేడ్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారే తప్పా లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వేలం కేంద్రంలో రోజూ వందల సంఖ్యలో లోగ్రేడ్ బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉదాహరణకు కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో శనివారం 784 బేళ్లను వేలానికి ఉంచితే 634 కొనుగోలు చేయగా 150 బేళ్లను తిరస్కరించారు. అలాగే రెండవ వేలం కేంద్రంలో 719 బేళ్లను గాను 609 కొనుగోలు చేయగా 110 బేళ్లను తిరస్కరించారు. ప్రతి రోజు ఇదే తీరుగా వందల సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీని వల్ల రైతులకు అదనపు భారంగా మారుతోంది. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం ఒకెత్తు అయితే తిరిగి తమ క్లస్టర్ వంతు వచ్చే వరకు వేచిచూడాల్సిన వస్తోంది. ఒక క్లస్టర్ వంతు తిరిగి వేలానికి రావాలంటే కనీసం నెల రోజులకుపైగానే పడుతోంది. ఇలా బేళ్లను ఇంటిలోనే ఉంచుకోవడం వల్ల ఆ ఉత్పత్తుల నాణ్యత మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ధర విషయం మరీ దారుణంగా ఉంది. లోగ్రేడ్ ఉత్పత్తుల విషయంలో సిండికేట్గా మారి న వ్యాపారులు గిరిగీసినట్లు ఒక రేటును దాటడం లేదు. కేవలం రూ.80 మాత్రమే చెల్లిస్తున్నారు. గత నెల రోజుల వేలం ప్రక్రియలో లోగ్రేడ్ రకం పొగాకుకు ఇదే ధర లభిస్తోంది. ఒక్క రూపాయి పెరగడం లేదు, తగ్గడం లేదు. అదీ లేకపోతే వేలంలో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీంతో ఈ ఏడాది అధికంగా ఉన్న లోగ్రేడ్ ఉత్పత్తులను అమ్ముకోవడం రైతులకు గగనంగా మారుతోంది. అమ్ముకున్నా వ్యాపారులు చెప్పిన రేటుకు ఇచ్చేయాల్సిందే. వేలం ఆలస్యంతో మరింత నష్టం: కరోనా వైరస్ లేకుంటే ఇప్పటికే వేలం ప్రక్రియ చివరి దశలో ఉండేది. కానీ ఈ ఏడాది ఇంకా మరో రెండు నెలలకు వేలం ముగిసినా ముగిసినట్టే. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఉత్పత్తులు ఇంకా మిగిలిన ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో 8.4 మిలియన్లు, రెండవ వేలం కేంద్రంలో 7.2 మిలియన్ల వరకు అధికారిక కొనుగోళ్లు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేశారు. ఇవిపోను అనధికారిక ఉత్పత్తులు కూడా ఉంటాయి. అంటే ఇంకెంత సమయం పడుతుందో ఊహించవచ్చు. దీని వల్ల ఉత్పత్తుల రంగు మారి అంతిమంగా రైతులకు నష్టం చేకూరుతుంది. అసలే లోగ్రేడ్ కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఇష్టపడడం లేదు. ఈ పరిణామం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బ్రైట్ గ్రేడ్ రూ.200లకు కొనుగోలు చేస్తున్నా, లోగ్రేడ్ రూ.80లు దాటడం లేదు. దీంతో సరాసరి రేట్లు కూడా రూ.140లు మించి రావడం లేదు. ప్రత్యక్ష వేలంలోకి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు వేలంలో మార్క్ఫెడ్ ద్వారా ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 1వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ప్రధానంగా వ్యాపారులు కూటమిగా మారి ధరలు పెంచకపోవడం, లోగ్రేడ్ ఉత్పత్తులను తిరస్కరిస్తుండడంతో ప్రభుత్వం వేలంలోకి అడుగు పెడుతోంది. రేట్లు రాని ఉత్పత్తులను రైతులకు మద్దతు ధర వచ్చేలా వేలంలో మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుంది. అంటే లోగ్రేడ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల వ్యాపారులు కూడా కచ్చితంగా లోగ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బోర్డు పరిధిలో రిజిస్టర్ అయి వేలంలో పాల్గొనని వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో వేలంలో పాల్గొనే వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలా మొత్తం మీద ప్రభుత్వమే స్వయంగా పొగాకు వేలంలోకి రావడం వల్ల ధరలు పెరుతాయనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ వ్యాపారులు ధరలు పెంచేందుకు ముందుకు రాకపోయినా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. దీని వల్ల ఇక రైతులు నష్టపోయే అవకాశం లేకుండా ఉంటుంది. అన్ని రకాల ఉత్పత్తులను మద్దతు ధరలకు వేలం కేంద్రాల్లోనే నేరుగా అమ్ముకునే అవకాశం వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కరోనాతో వ్యాపారి మృతి.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ : అసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా ఢిల్లీలోని అజాద్పూర్ మండిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మండి వ్యాపారి కరోనాతో మరణించడంతో మార్కెట్ వ్యాపారులంతా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండిలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తేలడంతో మార్కెట్ను వెంటనే మూసివేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అజాద్పూర్ మండికి చెందిన బోలా దత్త్ (57) అనే బఠానీ వ్యాపారి జ్వరం కారణంగా ఏప్రిల్ 19న ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం ఆదివారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వగా.. మంగళవారం ఆ వ్యక్తి మరణించాడు. అజాద్పూర్ మార్కెట్లో తొలి మరణం చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.గత కొంత కాలంగా వ్యాపారిని సంప్రందించిన వారి వివరాలను సేకరిస్తన్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ షిండే తెలిపారు. (క్యారెట్ కేక్ చేసిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై ) ఈ క్రమంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ.. క్వారంటైన్కి పంపించాల్సిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదని, మృతుడితో సంప్రదింపులు జరిపిన మండి వ్యాపారులు, అతని కుటుంబానికి చెందిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మృతుడికి వ్యాపారంలో భాగస్వామి ఉన్నట్లు తెలిసిందని, అతనిని కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మండిలో ఇది తొలి కేసు కాదని ఇంతకముందు షాలిమార్ బాగ్కు చెందిన ఓ వ్యక్తితోపాటు మరో వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలిందని ఓ ఉన్నతాధికారి పేర్నొనడం గమనార్హం. (జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్: ఆ పోలీసును అరెస్టు చేయండి ) అజాద్పూర్ మండి వ్యాపారి బోలా దత్ మృతి చెందడదంతో వ్యాపారి దుకాణం ఉన్న బ్లాక్ను అధికారులు సీజ్ చేశారు. అయితే మార్కెట్ను పూర్తిగా మూసేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిపై మార్కెట్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతానికి మార్కెట్ను మూసివేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని వ్యాపారులు తెలిపారు. జపనీస్ పార్క్ లేదా ఇతర విశాల ప్రదేశాలలో సామాజిక దూరం పాటిస్తూ నిబంధనలకు కట్టుబడి వ్యాపారం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని వ్యాపారులు వెల్లడించారు. (మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్! ) కాగా అజాద్పూర్ మార్కెట్లో నిత్యం కూరగాయాలు, పండ్లు అమ్మకం జరుపుతుంటారు. 78 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్కెట్లో లాక్డౌన్ కాలంలోనూ క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది ఈ మార్కెట్ను సందర్శిస్తారు. అయితే మార్కెట్లోవ్యాపారులు, కార్మికులు, సిబ్బంది అంతా కలిపి ఇంచుమించు 50 వేల మంది ఉన్నట్లు తేలింది. (ఇమ్రాన్ ఖాన్ను కలిసిన వ్యక్తికి పాజిటివ్ ) -
అసహాయులకు ఆపన్న హస్తం
వారంతా చిరువ్యాపారులు.. టీ కొట్టు, పానీపూరి, బజ్జీలు, కూరగాయలు, వాచ్ రిపేర్, మెడికల్ ల్యాబ్ వంటి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటు న్నారు. తమకు ఉన్నంతలో ఇతరులకు సేవ చేయాలన్న సత్సంకల్పంతో ప్రతి నెలా రెండువందల రూపాయల చొప్పున జమ చేసుకుని పేదలకు ‘ఆపన్నహస్తం అంది స్తుంటారు. కిడ్నీబాధితులు, కేన్సర్ పేషెంట్లు, ఇళ్లు లేని నిస్సహాయులు, అనా«థలు ఇలా ఎవరైనా కష్టాలతో బాధపడుతుంటే మేమున్నామంటూ ముందుకు వచ్చి వారికి అండగా నిలుస్తారు ఈ ‘ఆపన్నహస్త మిత్ర బృందం’. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన బాలస్వామి, శ్రీనివాస్, శ్యాంప్రసాద్, రాజు, స్వామిలు చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే నిస్సహాయుల కథనాలు చదివి చలించిపోయేవారు. వారి ఆలోచనలు ఉన్నతమైనవే కానీ, ఆదుకోడానికి వారి దగ్గర ఆర్థికంగా అంత స్థోమత లేదు. అందుకే వారంతా కలిసి 2017 నుంచి బృందంగా ఏర్పడి నిస్సహాయులకు ‘ఆపన్న హస్తం’ అందిస్తున్నారు. ఐదుగురితో మొదలైన ఆ బృందంలో ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు చెందిన 112 సభ్యులు ఉన్నారు. ఇందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరారు. వీరు మొట్టమొదటిగా మెదక్ జిల్లా నర్సాపూర్లోని అంధుల పాఠశాలలో బోరు మోటార్ లేక అక్కడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కథనాన్ని పత్రికల్లో చదివి అక్కడికి వెళ్లి వారికి మోటార్ ఇప్పించారు. అప్పుడు వారు అనుకున్న దానికంటే ఎక్కువగా నగదు అవసరం కావడంతో అప్పటినుంచి వారు మరికొంత మంది సభ్యులతో కలిసి ఆపన్నహస్తం మిత్ర బృందం ప్రారంభించి ప్రతీనెలా రెండువందల చొప్పున నగదు జమచేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. సేవా కార్యక్రమాల్లో కొన్ని.. ►జనగామ జిల్లాలోని కళ్లెం గ్రామానికి చెందిన అంధ విద్యార్థిని సుకన్య ఉన్నత చదువుల కోసం రూ.22,000 సాయం ►సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన తల్లీతండ్రిలేని ఒక పాప పేరుతో బ్యాంకులో రూ. 10,000లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ►వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కిడ్నీ బాధితురాలికి రూ.10,000 వైద్యసాయం కోసం అందించారు ►సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన చిన్నారి వర్ష కేన్సర్తో బాధపడుతుండటంతో రూ. 20,000 లు ఆర్థిక సాయం అందించారు. ►గజ్వేల్ పట్టణంలో మతిస్థిమితం లేక రోడ్లపై సంచరిస్తున్న ముగ్గురిని చేరదీసి వారిని యాదాద్రి జిల్లాలోని అమ్మనాన్న ఆశ్రమంలో చేర్పించి వారి ఖర్చుల నిమిత్తం 26,800 అందించారు. ►నల్గొండ జిల్లాకు చెందిన శివప్రసాద్ కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యసేవలకోసం వారికి రూ.20,000 లు అందించారు. ►కేరళలోని వరద బాధితుల సాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.15,200 – తాటికొండ రవి, సాక్షి మెదక్ డెస్క్ సేవతో సంతృíప్తి నేను వాచ్ రిపేర్ సెంటర్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. మేము చేసేది చిరువ్యాపారం.. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అయినా ఉన్నంతలో ఇతరులకు సేవ చేస్తూ తృప్తి చెందుతున్నాం. ప్రతి నెలా ఒక్కో సభ్యుడి దగ్గర రూ. 200 చొప్పున వసూలు చేసి జమ చేసుకుంటాం. మా బృందంలో రాజకీయ నాయకులను చేర్చుకోము. – బాలచంద్రం, అధ్యక్షుడు చలించిపోయాను నేను గజ్వేల్లో మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తుంటాను. పత్రికల్లో వచ్చే కథనాలు చూసి చలించిపోయాను. మా వంతుగా ఏదైనా సాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మమ్మల్ని చూసి చాలామంది సేవా బృందాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. – కటుకం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆపన్నహస్తం ►జనగామ జిల్లా కు చెందిన యువతి నిహారిక కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఈ విషయం చెప్పకుండానే ఆమెకు పెళ్లి చేశారు. కొద్ది రోజుల తరువాత విషయం తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. ఈ కథనం సాక్షి పత్రికలో రావడంతో ఆమె వైద్యానికి రూ.10,000 బ్యాంకులో డిపాజిట్ చేశాము. తరువాత సాక్షి పత్రికలో మనసున్న మహారాజులు అంటూ కథనం రావడంతో అది చూసి చాలా మంది స్పందించి ఆ యువతికి సాయం చేశారు. -
మద్యం వ్యాపారుల తర్జన భర్జన!
సాక్షి, కడప : టీడీపీ ప్రభుత్వం పాలసీలతో ఏర్పాటు కాబడిన మద్యంషాపుల గడువు ఈనెలాఖరుతో ముగియనున్నది. కొత్త మద్యం పాలసీ అమలుకావడానికి ఆలస్యం కానుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మద్యంషాపును సెప్టెంబరు 30 వరకు నిర్వహించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే మళ్లీ షాపులను కొనసాగించడానికి లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే విషయంలో వ్యాపారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయంలో ముందుకు వెళ్లడమా? వ్యాపారం విరమించుకోవడమా అనే అంశంపై మద్యం వ్యాపారులు తలమునకలవుతున్నారు. షాపులు తగ్గుముఖం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ఏటా 20శా తం మద్యం దుకాణాలు తగ్గిస్తామని సీఏం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మ ద్యంషాపులు తగ్గుముఖం పట్టనున్నాయి. మద్యం షాపుల తగ్గింపుపై సీఎం వైఎస్ జగన్ ప్రకటనను ప్రజా, మహిళాసంఘాలు అభినందిస్తున్నాయి. దశలవారీ మద్యనిషేధం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నది. ఈమేరకు కసరత్తు చేస్తోంది. దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ఏటా మద్యంషాపులు తగ్గించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అక్టోబరు1 నుంచి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రిటైల్ మద్యంషాపులు నిర్వహిస్తామని ఆశాఖ ప్రత్యేక కార్యదర్శి సాంబశివరావు మంగళవారం వెల్లడించారు. లైసెన్స్ రెన్యూవల్ అదనంగా మూడునెలలు మద్యం విక్రయాలు నిర్వహించడానికి మద్యం దుకాణాల యజమానులు లైసెన్స్ ఫీజుతోపాటు, పర్మిట్రూం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు శ్లాబుల్లో మద్యం దుకాణాల నుంచి లైసెన్స్, పర్మిట్ రూమ్ ఫీజులు వసూలు చేయనున్నది. రెన్యూవల్కు వెనుకడుగు.. జిల్లాలో 210కిపైగా మద్యంషాపులు, 20బార్లు ఉన్నాయి. మద్యం సరఫరా చేసే డిపోలు రెండు ఉన్నాయి. నెలకు రూ.10 నుంచి రూ.15కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ అమ్మకాల వల్ల ప్రభుత్వానికి 50శాతం ఆదాయం వస్తోంది. షాపుల కొనసాగింపు చేపట్టిన క్రమంలో మద్యంషాపుల నిర్వాహకులు ఎమ్మార్పీ ఉల్లంఘించినా, నిర్ణీతవేళకు మించి మద్యం విక్రయించినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోనున్నది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నిబంధనలు అతిక్రమించి ధనార్జనకు అలవాటుపడిన మద్యంషాపుల నిర్వహకులపై ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడునెలల రెన్యూవల్కు అవకాశం కల్పించినా నిర్వాహకులు ముందుకు రావడానికి జంకుతున్నారు. ససేమిరా ప్రభుత్వం బెల్టుషాపుల నిర్వహణకు ససేమిరా అంటుండడంతో అనధికార ఆదాయానికి అలవాటుపడిన వారు లైసెన్స్ రెన్యూవల్స్ చేయిం చుకుంటే తమ ఆటలు సాగవనే అభిప్రాయంలో ఉన్నారు. కాగా దశలవారీ మద్యనిషేధంలో భాగంగా బెల్టుషాపుల సమూల నిర్మూలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెల్టుషాపులకు మద్యం రవాణా చేసే షాపుల లైసెన్స్లను సైతం రద్దు చేసి కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో ఎక్సైజ్శాఖ బెల్టుషాపుల నిర్మూలనకు నడుంబిగించింది. అక్టోబరునెలకంతా బెల్టుషాపుల వాసన ఉండకూడదని కలెక్టర్లు, ఎస్పీలకు సైతం సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సౌకర్యాలకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జిల్లాలో దూసుకువస్తున్న స్థిరాస్తి వెంచర్లలో వ్యాపారులు ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరుకు రహదారులు, కాలుష్యం, ఇతర అసౌక్యాలకు నిలయంగా ఉన్న నగర జీవితాన్ని మరిచిపోయేలా మదిని మైమరిపించే అనేక అత్యాధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందమైన ప్రకృతిని వెంచర్లలో నెలకొల్పి కలల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. 40 అడుగుల రోడ్లు, ఫైవ్ స్టార్ సౌకర్యాలు, అందమైన ఆర్కిటెక్చర్ డిజైన్లకు ప్రాధాన్యం ఇచ్చేలా వెలుస్తున్న ఈ వెంచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థలం ఎంపిక నుంచి లే అవుట్ డిజైన్, మౌలిక వసతుల రూపకల్పన, పర్యావరణానికి నేడు అందరూ ప్రాధాన్యం ఇస్తుండటంతో స్థిరాస్తి వ్యాపారులు కూడా ఆ మేరకు కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త వెంచర్లను వేస్తున్నారు. ఖర్చు చేసే ప్రతి రూపాయికి అధిక విలువ తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పచ్చని మొక్కలతో.. నగర జీవితమంటే ప్రధానంగా కాలుష్యం చెంతనే అనేది నానుడి. జగమెరిగిన ఈ సత్యాన్ని కలలో సైతం రానీయకుండా నగర శివారు ప్రాంతాల్లో కాలుష్యానికి చెక్ పెడుతూ సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన రోడ్లపై ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచటమే కాకుండా వాటి పర్యవేక్షణకు సంస్థలే ప్రాధాన్యం ఇస్తున్నాయి. పచ్చని పార్కులు ఆపై అందమైన డిజైన్లతో కొనుగోలుదారులకు సౌకర్యాల కల్పనలో పోటీపడుతున్నాయి. అతి తక్కువ ధరలో వాయిదాల పద్ధతిలో సైతం ఇళ్ల స్థలాలు లభ్యం కావటంతో మధ్య తరగతి కుటుంబాలు సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. వెంచర్ల ఏర్పాటులో రక్షణకు కూడా సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆకర్షణీయమైన ముఖ ద్వారంతో స్వాగతం పలుకుతూ 60, 40, 40 ఫీట్ల రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ ఇబ్బంది లేకుండా భూగర్భ కేబుల్స్ వేయటంతో పాటూ కొన్ని సంస్థలు ప్రహారీ గోడ మీద సౌర విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తున్నాయి. 24 గంటల పాటు సెక్యూరిటీ ఏర్పాటుతో కొనుగోలుదారులు ప్రశంసలు పొందుతున్నారు. స్టార్ హోటల్ వసతులు.. నేటి యువత అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇంటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగ ఒత్తిడి నుంచి సాంత్వన పొందే ఇంటి నిర్మాణాలపై ఆసక్తి చూపిస్తోంది నేటి యువత. దీనికి తగ్గట్టుగానే కొంత మంది వ్యక్తిగత గృహాలు ఇష్టపడుతుంటే, మరికొంత మంది అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గ ట్టుగానే వ్యాపారులు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. త్రిబుల్ బెడ్కు డిమాండ్ వ్యక్తిగత గృహాలైనా సరే త్రిబుల్ బెడ్రూమ్ నిర్మాణం వైపు నేటి యువత ఆసక్తి చూపిస్తుంది. పార్కింగ్, పచ్చని ఆవరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు 300–500 చదరపు గజాల విస్తీర్ణమున్న ప్లాట్లను వేస్తున్నారు. అందమైన డిజైన్లతో విల్లాలతో పోటీ పడే ఇటువంటి నిర్మాణాలు నేటి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఉడెన్ ఫ్లోరింగ్ అందానికి, హోదాకి చిహ్నం ఉడెన్ ఫ్లోరింగ్. దీని నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదు. దుమ్ము, ధూళి, ఇసుక, మట్టి వంటివి ఉడెన్ ఫ్లోర్కు శత్రువులు. ఇవి గీతలను సృష్టించడమే కాకుండా కాంతి విహీనం చేస్తాయి. అందుకే అవి దరిచేరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచుగా మెత్తటి గుడ్డతో శుభ్రం చేస్తుండాలి. ఫ్లోర్ను వ్యాక్స్, వార్నిష్, పాలియుథరిన్తో ఫినిషింగ్ చేయించుకుంటే.. ఆ నేల మీద ఆహారపదార్థాలు, ద్రవాలు పడకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే గచ్చు కాంతి మాయం అవుతుంది. పొరపాటున సిరా లేదా నీళ్లు ఒలికితే ముందుగా ఉడెన్ ఫ్లోర్ క్లీనర్తో శుభ్రం చేయాలి. తర్వాత వెనిగర్ కలిపిన నీటిలో ముంచిన మెత్తటి గుడ్డతో తుడిచేయాలి. అనంతరం పొడి బట్టతో తుడిస్తే సరిపోతుంది. -
అడుగు జాడలు
బాలానగర్ పోలీసు స్టేషన్.మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. అప్పుడే స్టేషన్లో అడుగు పెడ్తున్న ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్కు తన టేబుల్ మీదున్న ఫోన్ రింగవడం వినబడింది. గబగబా వెళ్ళి ఫోన్ ఎత్తాడు. ‘‘హల్లో.. అయాం ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్’’ అన్నాడు కుర్చీలో కూర్చుంటూ..‘‘హల్లో సార్.. నేను పంకజ్ సేఠ్గారి వంట మనిషిని మాట్లాడుతున్నాను. మా అయ్యగారు నేల మీద పడి ఉన్నారు సార్. పిలిస్తే పలకడం లేదు. చనిపోయినట్టు అనుమానంగా ఉంది సార్’’ అంటూ భయం భయంగా చెప్పాడు అవతలి వ్యక్తి.పంకజ్ సేఠ్ అంటే బాలానగర్ పరిసరాల్లో తెలియని వారు అరుదు. అతడు లైసెన్స్ కలిగిన వడ్డీ వ్యాపారి. నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు వడ్డీకిస్తూ ఉంటాడు. ‘‘నీ పేరు’’ అడిగాడు రంజిత్కుమార్. ‘‘మస్తాన్ సార్..’’ ‘‘పదినిముషాల్లో అక్కడ ఉంటాను. ఎవరూ శవాన్ని గాని, అక్కడి వస్తువులు గాని ముట్టుకోవద్దు..’’ అంటూ హెచ్చరికలు చేస్తూ.. ఫోన్ పెట్టేశాడు.వెంటనే తనవాళ్లతో హుటాహుటిన పంకజ్ సేఠ్ ఇంటికి పోలీసు వ్యానులో బయలుదేరాడు. క్లూస్ టీమ్ తమకు కావలసిన ఫోటోలు వేలిముద్రలు సేకరించసాగింది. ఇంతలో ప్రైవేటు డిటెక్టివ్ శ్రీకర్ తన అసిస్టెంట్ హరితో ‘పిలవని పేరంటానికి వచ్చినట్టు’ రావడం చూసి కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు ముఖం పెట్టాడు రంజిత్కుమార్. బహుశః మస్తానే ఫోన్ చేసి ఉంటాడనుకున్నాడు. ‘‘హల్లో .. గుడీవినింగ్ రంజిత్..’’ అంటూ శ్రీకర్ కరచాలనం చేశాడు. శ్రీకర్ వెనకాలే నిలబడ్డ హరి కూడా అభివాదం చేశాడు. ఎవరి సాయం లేకుండా కేసు పరిశోధించి నేరస్తుణ్ణి పట్టుకోవాలనుకున్న రంజిత్కుమార్... స్పందించక తప్పలేదు.పంకజ్ సేఠ్ శవాన్ని పరిశీలనగా చూడసాగాడు శ్రీకర్. లాకర్ పక్కనే వెల్లకిలా పడి ఉంది శవం.. తల కింద రక్తపు మడుగు. లాకర్ కీస్ దానికే ఉన్నాయి. క్లూస్ టీమ్కు మరికొన్ని సూచనలిచ్చి వారిని మేడ పైకి పంపాడు. రంజిత్కుమార్తో కాసేపు చర్చించాడు. ఇంట్లో మస్తాన్ తప్ప ఎవరూ లేనట్లుగా వుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ.. హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంటూ.. మస్తాన్ను పిలిచారు.మస్తాన్ రెండు చేతులా దండం పెట్టుకుంటూ.. వచ్చి వారి ముందు నిలబడ్డాడు. ‘‘ఇంట్లో ఎవరెవరుంటారు’’ అడిగాడు రంజిత్కుమార్. ‘‘సేఠ్గారితో బాటు చిన్నమ్మగారు శైలజ, చిన్న సేఠ్ ప్రవీణ్, వాచ్మన్ శీను, నేను...’’ ‘‘చిన్నమ్మ అంటున్నావు.. పెద్దమ్మ లేదా..? ’’‘‘లేదు సార్. ఆమె కొడుకే ప్రవీణ్ చిన్న సేఠ్. ప్రవీణ్ తల్లి గారు చనిపోతే సేఠ్ గారు శైలజమ్మ గారిని రెండవ పెండ్లి చేసుకున్నాడు’’ ‘‘ప్రవీణ్ సేఠ్ ఎక్కడికెళ్లాడు?’’ అడిగాడు శ్రీకర్. ‘‘డబ్బులు కలెక్ట్ చెయ్యడానికై ఊర్లు తిరుగుతూ ఉంటాడు సార్. ఏ ఊరెళ్ళాడో తెలీదు. అతని సెల్లుకు ఫోన్ చేసి చెప్పాను. వస్తున్నా..’’ అన్నాడు. ‘‘మరి చిన్నమ్మగారు’’ ‘‘అమ్మగారు పుట్టింటికి ఉప్పల్ వెళ్లారు సార్. వాళ్ళు కూడా కారులో బయల్దేరామన్నారు’’ ‘‘మరి శీను..!’’ అడిగాడు రంజిత్కుమార్. ‘‘నేను కూరగాయలకని వెళ్ళాను సార్. వచ్చేసరికి అయ్యగారు అలా పడి ఉన్నారు. శీను కనిపించడం లేదు సార్’’ ‘‘అయితే వాడే హత్య చేసి ఉంటాడు’’ ఠక్కున అన్నాడు అసిస్టెంట్ హరి తన బాస్ను చూసుకుంటూ.. నోరు మూసుకో అన్నట్టు కళ్ళు పెద్దవిగా చేసుకొని హరి వంక ఉరిమి చూశాడు శ్రీకర్. హరి తల వంచుకుని నేల చూపులు చూడసాగాడు.‘‘ఇంటిగుట్టు తెలిసినవాని పనే ఇది’’ అన్నాడు రంజిత్కుమార్. కావచ్చు అన్నట్టుగా తలాడించాడు శ్రీకర్. మరో గంటలో.. అంతా వచ్చారు.శైలజ, వాళ్ల తమ్ముడు అమ్మానాన్నలతో కారు దిగుతూనే.. గుండెలు బాదుకుంటూ.. పరుగెత్తుకొచ్చింది. శవమున్న గదికి రెడ్ టేప్ వేసి ఎవరూ దగ్గరికి వెళ్ళకుండా పోలీసు కాపలా ఉండే సరికి గది బయటనే నిలబడి తల కొట్టుకోసాగింది.‘ఎంత ఘోరం జరిగిపోయిందీ’ అన్నట్టుగా ఆమె వెంట వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. ఆమె తమ్ముడు నిశ్చేష్టులై కంట నీరు పెట్టుకుంటూ శైలజను ఊరడించసాగారు.. ప్రవీణ్ తన తండ్రి శవాన్ని చూస్తూనే రెండు చేతులా తల పట్టుకుని కుప్పలా కూలిపోయాడు.. ‘‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సాధ్యమైనంత త్వరలో హంతకుణ్ణి పట్టుకుంటాను’’ అంటూ రంజిత్కుమార్ ఉపశమన వాక్యాలు పలుకుతూ.. శవాన్ని పోస్ట్మార్టం కోసం తరలించే ప్రయత్నాలలో మునిగాడు. శ్రీకర్, హరి సహకరించసాగారు. శ్రీకర్ను చూడగానే ప్రవీణ్కు భరోసా కలిగింది. ఆయనకు పోలీసుల మీద కంటే ప్రైవేటు డిటెక్టివ్ల మీద నమ్మకం ఎక్కువ. మర్నాడు హాల్లో అందరినీ సమావేశ పర్చాడు శ్రీకర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని చెప్పాడు. తలకు బలమైన గాయంతో బాటు విషవాయువు పీల్చడం మూలాన పంకజ్ సేఠ్ ప్రాణాలు పోయాయని వివరించాడు. అంతా ఒక్క సారిగా కొయ్యబారి పోయారు.‘‘మీనాన్నకు శత్రువులెవరైనా ఉన్నారా?’’ అంటూ ముందుగా ప్రవీణ్ను అడిగాడు శ్రీకర్.‘‘నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు సార్ ’’ ‘‘శీను మీద ఏమైనా అనుమానముందా.. ?’’ ‘‘శీను చాలా మంచివాడు సార్.. సున్నితపు మనస్తత్వం కూడానూ..’’ శైలజ గారితో ఏకాంతంగా మాట్లాడుతానని శ్రీకర్ అనగానే.. అంతా హాలు ఖాళీ చేశారు. ‘‘శైలజ గారూ.. మీరంతా నాకు సహకరిస్తేనే నేను హంతకుణ్ణి పట్టుకోగలను. నాకు కొన్ని నిజాలు తెలియాలి’’ అంటూ శైలజ ముఖ కవళికలు చదవసాగాడు. శైలజ నిజమే అన్నట్లుగా తలూపింది. ‘‘పంకజ్ సేఠ్ గారితో వివాహం మీ ఇష్టప్రకారమే జరిగిందా?’’ ‘‘మా పేదరికం నా తల వంచుకుని తాళి కట్టించుకునేలా చేసింది సార్’’ అటుంటే ఆమె కళ్లలో నీళ్లు సుళ్లు తిరగాయి. కడకొంగుతో కన్నీరు ఒత్తుకుంటూ.. ‘‘మా నాన్న ప్రభుత్వ సంస్థలో గుమాస్తా.. చాలీ చాలని జీతం. మా అక్కయ్య పెళ్లితో మా నాన్న సంపాదనంతా తుడిచిపెట్టుకు పోయింది. ఇంటి మీద అప్పులు మిగిలాయి. నాకొక తమ్ముడు.. వాడికి చదువు అబ్బలేదు. పదో తరగతి తప్పాడు.మాకందరికీ అండగా ఉంటానని భరోసా కలిగించి సేఠ్ నన్ను పెళ్ళి చేసుకున్నాడు’’ అంటూ మౌనంగా ఉండిపోయింది.ఇంతలో శ్రీకర్ అసిస్టెంటు హరి వచ్చాడు. చెప్పిన పని ఏమైంది?.. అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకర్. ‘‘సర్.. శీను భువనగిరిలో తన అక్కయ్య వద్ద వున్నాడని తెలిసింది. ఎస్సై రంజిత్కుమార్ గారికి చెప్పాను. వెంటనే పోలీసులను పంపారు. పోలీసులకు శీను దొరికాడట, నేరుగా పోలీసు స్టేషన్కు తీసుకు వస్తున్నారట. మనల్ని కూడా అక్కడికే రమ్మన్నారు’’ చెప్పాడు హరి. ‘‘వెరీ గుడ్..’’ అంటూ హరిని మెచ్చుకున్నాడు శ్రీకర్. హరి ముఖం వెలిగిపోయింది.ఆ ముఖాన్ని మరింత వెలిగించాలని.. హరికి మరో పని అప్పగించాడు శ్రీకర్. బాసుకు తన మీద నమ్మకం పెరుగుతూండటంతో తబ్బిబ్బయ్యాడు హరి. వెటనే శ్రీకర్ పురమాయించిన పనిని చక్కబెట్టాలని సెలవు తీసుకున్నాడు. శ్రీకర్ పోలీసు స్టేషన్కు బయలుదేరాడు.అప్పుడే రంజిత్కుమార్ శీనుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.శీను చెప్పసాగాడు.‘‘సార్! ఆరోజు మా అబ్బాయికి ఫీజు కట్టడానికని.. నేను అయ్యగారిని పదివేల రూపాయలు అడిగి తీసుకుంటూండగా.. రమేష్ అనే అతను వచ్చాడు. తాను గోల్డ్ మెడలిస్టునని, తనకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు డిపాజిట్ కింద పాతికవేలు కావాలంటున్నారని, అందువల్ల తన మెడల్ను తాకట్టు పెడుతున్నానని అన్నాడు. అయ్యగారు దానిని చూసి పరీక్షించి పదిహేనువేల కంటే ఎక్కువ రాదన్నారు. రమేష్ కాళ్లా వేళ్లా పడ్డాడు తన జీవితానికి సంబంధించిన సమస్య అని, మొదటి జీతంతోనే మొత్తం బాకీ తీరుస్తానని కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో నన్ను వెళ్లిపొమ్మన్నట్లుగా అయ్యగారు చేతితో సైగ జేశారు. నేను మా ఊరికి వెళ్ళి పోయాను. ఆ తరువాత ఏమైందో.. నాకు తెలియదు సార్..’’ అంటూ బిక్కమొహం వేశాడు శీను.‘‘రంజిత్.. నేను వస్తూ.. వస్తూ.. రమేష్ను తీసుకొని వచ్చాను’’ అన్నాడు శ్రీకర్. ఎలా.. అన్నట్టుగా చూశాడు రంజిత్కుమార్. ఆశ్చర్యపోతూ..‘‘ఇంతకుముందు పంకజ్ సేఠ్ ఇంటికి వెళ్ళినప్పుడు.. తాకట్టు పెట్టుకునే రిజిస్టర్ నుండి రమేష్ చిరునామా తీసుకున్నాను. చివరిసారిగా డబ్బు తీసుకున్నది అతనే..’’ అంటూ రమేష్ను లోనికి రమ్మని పిలిచాడు.‘‘రమేష్.. పంకజ్ సేఠ్ను చివరిసారిగా కలుసుకున్నది నువ్వే.. ఆ రోజు ఏం జరిగింది?’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. ‘‘సార్ నాకు డబ్బు చాలా అవసరం. సేఠ్ బీరువాలోంచి డబ్బుకట్ట తీసి, పదిహేనువేలిచ్చి, మిగతాది లోపల పెట్టబోతుంటే.. సేఠ్ చేతిలోంచి డబ్బు లాక్కొని పోయాను. సేఠ్ వెల్లకిలా పడిపోవడం గమనించాను. నేను వెనకా ముందు ఆలోచించకుండా బయటకు పరుగెత్తాను. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు సార్..’’ అంటూ కన్నీరు పెట్టుకోసాగాడు. ‘‘ఆ.. అన్నట్టు గుర్తొచ్చింది సార్.. ఎవరో ఒకతను నాకెదురయ్యాడు.. సార్ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. నా మీద కేసు లేకుండా చూడండి’’ అంటూ రంజిత్కుమార్ కాళ్లు పట్టుకున్నాడు రమేశ్.. ‘‘సరే.. సరే.. గాని అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా..’’ అంటూ అడిగాడు రంజిత్కుమార్. రమేష్ తల అడ్డంగా ఊపాడు గుర్తుపట్టలేను అన్నట్లుగా..‘‘రంజిత్... శీనును, రమేష్ను మీ కస్టడీలోనే ఉంచండి.. సాయంత్రానికల్లా మరింత సమాచారం లభిస్తుంది.. రేపటికల్లా కేసు తేలిపోతుంది’’ అంటూ భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు శ్రీకర్. రంజిత్కుమార్ దీర్ఘాలోచనలో పడ్డాడు.మరుసటి రోజు శ్రీకర్, రంజిత్కుమార్ల సూచనల మేరకు హరి మీడియాను ఆహ్వానించాడు. అంతా పంకజ్ సేఠ్ ఇంట్లో సమావేశమయ్యారు. శ్రీకర్ తన అసిస్టెంటు హరి సాయంతో కేసు పరిశోధనాంశాలని వివరించసాగాడు. ప్రతి మనిషికీ డబ్బు అవసరమే.. కాని కొందరు దొడ్డి దారిలో మానవత్వాన్ని మరిచి డబ్బు సంపాదిస్తూంటారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడరు. ఆ రోజు అదే జరిగింది. రమేష్ ఒక నిరుద్యోగి. డబ్బు అవసరం. కాని అనుకున్నంత డబ్బు తన వస్తువుకు రాలేదు. ఎలాగైనా జీవితంలో స్థిరపడాలని.. ఆవేశంగా డబ్బు లాక్కొని పారిపోయాడు. అప్పుడు అతనికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతనొక వీడియో గ్రాఫర్గా ఒక షాపులో పార్ట్ టైంజాబ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిస. తన బావ బలహీనతను ఆసరాగా తీసుకొని, అతని ప్రైవేట్ ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపిస్తూ.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఆరోజు కూడా అతను అలాగే వచ్చాడు. పంకజ్ సేఠ్ పడిపోవడం చూశాడు. అప్పటికి సేఠ్ స్పృహ మాత్రమే కోల్పోయాడు. ఇప్పుడు తనేం చేసినా ఆ నేరం అప్పుడు పరుగెత్తే రమేష్ పైన పడుతుందని దుర్భుధ్ధి పుట్టింది. వెంటనే పక్కన వున్న దోమలమందును పంకజ్ సేఠ్ ముక్కులో స్ప్రే చేశాడు. పంకజ్ సేఠ్ ప్రాణాలు క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. నిందితుడు చేతి ముద్రలు పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంత ఆరితేరిన నేరస్తుడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికి పోతుంటాడు. ఇక్కడా అదే జరిగింది. అనే సరికి అంతా శ్వాస బిగబట్టి వినసాగారు. శ్రీకర్ తిరిగి చెప్పసాగాడు. ‘‘డబ్బు తీసుకొని పరుగెత్త బోయిన నిందితునికి గేటు తీసిన చప్పుడు వినబడింది. ఎవరో వస్తున్నారని గబగబా మెట్లెక్కి మొదటి అంతస్తుకు వెళ్ళాడు. అప్పుడు వచ్చిన వ్యక్తి మస్తాన్.ఈ ఇంటికి మరో మార్గం మేడపై నుంచి వుంది. ఇంటి వాళ్ళ రాక పోకల కోసం. గేటు చప్పుడు కాగానే ఆగంతకుడు శబ్దం రాకుండా ఉండాలని చెప్పులు విప్పి మేడ పైకి వెళ్ళాడు. అతనికి తెలిసిన మార్గమే కాబట్టి మెల్లగా జారుకున్నాడు. అతని అడుగు జాడలే అతణ్ణి పట్టించాయి. ‘‘ఇంతకూ ఆగంతకుడెవరు సార్..’’ అంటూ మీడియా ఆతృతగా అడిగింది. ‘‘అతను మన మధ్యలోనూ ఉన్నాడు’’ అనగానే అంతా అవాక్కయ్యారు. ఇంతలో శైలజ తమ్ముడు కిశోర్ లేచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే రంజిత్కుమార్ వెళ్ళి అదుపులోకి తీసుకున్నాడు. ‘‘కిశోర్ అని ఎలా తెలిసింది సార్’’ అంటూ మరింత ఆశ్చర్యంగా అడిగాడు రంజిత్కుమార్ కిశోర్ చేతికి బేడీలు వేయిస్తూ..‘‘రంజిత్.. మనం ముందే అనుకున్నాం. ఇది తెలిసిన వారి పనే అని. నేను రాగానే ఇంటికి రెండుదారులు ఉండడం.. అనుమానించాను. క్లూస్ టీమ్ను మేడ మీది పాద ముద్రలను కూడా ఫోటో తీయాలని కోరాను. ఇక హరిని ఉప్పల్ పంపించాను. కిశోర్ ప్రవర్తన అతని స్నేహితులతో.. తెలుసుకున్నాను. దాంతో సగం నమ్మకం కలిగింది. కిశోర్ అడుగులు.. మేడ మీది అడుగు జాడలతో సరిపోయే సరికి నిర్థారించుకున్నాను. ఏమంటావ్ కిశోర్..?’’ అంటూ తీక్షణంగా చూశాడు శ్రీకర్. కిశోర్ తల దించుకున్నాడు. ఇంత సులువుగా హత్య కేసు పరిష్కారమైనందుకు.. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు రంజిత్కుమార్. శ్రీకర్ను, హరిని అభినందించాడు. యు.విజయశేఖర రెడ్డి -
పాదుషా ప్రశ్నలు
ఒక పాదుషా గారుండేవారు. ఆయనకు అబద్ధాలంటే గిట్టదు. ఎవరైనా తన రాజ్యంలో అబద్దం చెబుతూ పట్టుబడితే, ఐదు దీనార్ల జరిమానా విధిస్తానని దండోరా వేయించాడు. దాంతో ఆ రాజ్యంలోని ప్రజలంతా అబద్ధాలాడేందుకు జంకేవారు. ఒకరోజు పాదుషా గారు మారువేషంలో గస్తీ తిరుగుతుండగా భోరున వర్షం కురిసింది. తలదాచుకునేందుకు ఒక వ్యాపారి దగ్గర ఆగారు. ఆ వ్యాపారి పాదుషా గారికి సపర్యలు చేశాడు. మాటల మధ్యలో వ్యాపారిని ‘‘నీ వయస్సెంత?’’ అని అడిగాడు. ‘‘ఇరవై సంవత్సరాలు?’’ అని చెప్పాడు వ్యాపారి. ‘‘నీ దగ్గర ఎంత డబ్బుంది?’’ అన్నాడు. ‘‘70వేల దిర్హములున్నాయి’’ అన్నాడు. ‘‘ఎంతమంది సంతానం?’’ అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాచ్చాడు. వర్షం తెరపిచ్చాక పాదుషా వెళ్లిపోయాడు. వ్యాపారి చెప్పినవి నిజాలో కావోనని తెలుసుకోవడానికి దస్తావేజులను తెప్పించారు. వ్యాపారి చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో పాదుషా గారికి చిర్రెత్తుకొచ్చింది. పాదుషా ఆజ్ఞతో వ్యాపారి ప్రత్యక్షమయ్యాడు. పాదుషా గారు తిరిగి అవే మూడు ప్రశ్నలు అడిగారు. వాటికి వ్యాపారి కూడా తిరిగి అవే జవాబులిచ్చాడు. వ్యాపారి మళ్లీ అబద్ధాలాడుతున్నాడని 15 దీనార్ల జరిమానా వసూలు చేసి ధనాగారంలో జమ చేయాలని మంత్రిని ఆదేశించారు. ప్రభుత్వ దస్తావేజుల్లో అతని వయస్సు 35 ఏళ్లని, అతని వద్ద 70వేల దీనార్లకంటే ఎక్కువ రొక్కముందని, ఐదుగురు సంతానమని ఉంది. అప్పుడు వ్యాపారి ‘‘నా జీవిత ఆయుష్షులోని 20 ఏళ్లు మాత్రమే సత్కార్యాల్లో, నిజాయితీగా గడిపాను కనుక ఆ ఇరవై ఏళ్లనే నా వయస్సుగా పరిగణిస్తాను. జీవితంలో 70 వేల దీనార్లను ఒక అనాథాశ్రమం నిర్మించేందుకు ఖర్చుపెట్టాను కనుక అదే నా ఆస్తిగా భావిస్తాను. నలుగురు పిల్లలు చెడు సావాసాలతో, వ్యసనపరులుగా మారారు. ఒక్కడు మాత్రమే సన్మార్గంలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నాడు కనుక ఆ ఒక్కడే నా సంతానంగా చెప్పుకుంటాను.’’ అని వివరణ ఇచ్చాడు. పాదుషా గారు సంతోషించి జరిమానాను ఉపసంహరించారు. జీవితంలో మంచిపనుల్లో గడిపిన కాలం, వ్యయపర్చిన సొమ్ము, ఉత్తమ సంతానమే పరలోక జీవితానికి సోపానాలని చెప్తోంది ఈ కథ. – ముహమ్మద్ ముజాహిద్ -
విస్మయపరుస్తున్న ఎంపీ ఎస్పీవై వ్యవహారం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మార్కెట్లో షాపుల నిర్వాహకులెవరూ పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, అంతా తామే చెల్లిస్తామని గంభీరపు ప్రకటనలిచ్చి.. నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడాది దాటినప్పటికీ వేలం సొమ్ము మాత్రం మునిసిపాలిటీ ఖజానాకు చేరలేదు. పైగా మార్కెట్ వేలం మొత్తం సొమ్ము చెల్లించాలంటూ నోటీసులు జారీచేస్తే.. చెల్లని చెక్కులు ఇచ్చిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వ్యవహారం ఆశ్చర్యం గొలుపుతోంది. వేలంపాట రూ.76.12 లక్షలతో పాటు అగ్రిమెంట్, వడ్డీ రూ.15 లక్షలు, సర్వీస్ చార్జీ రూ.13.70 లక్షలతో కలిపి.. మొత్తం రూ.కోటి నాలుగులక్షల 82వేలు చెల్లించాల్సి ఉండగా.. టెండరు వేసే సమయంలో డిపాజిట్ కింద రూ.16 లక్షలు చెల్లించారు. డిపాజిట్ తీసివేస్తే రూ.88.82 లక్షలు చెల్లించాలి. అయితే, రూ.60 లక్షల విలువ చేసే చెక్కులు కాస్తా బౌన్స్ అయినప్పటికీ కేసులు పెట్టకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల ముందు వ్యాపారస్తులపై ప్రేమ కురిపించిన అధికారపార్టీ నేతలు తర్వాత మొహం చాటేశారు. ఇదే తరుణంలో మార్కెట్ వ్యాపారస్తుల నుంచి అద్దెల వసూలుకు మునిసిపల్ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏమి జరిగిందంటే.. నంద్యాలలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్, నూనెపల్లె, మూలసాగరం మార్కెట్లో ఉన్న షాపులను అద్దెకు ఇవ్వడంతో పాటు వాహనాల రాకపోకలు, పార్కింగ్ ఫీజు వసూలు మొదలైన వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరానికి నంద్యాల మునిసిపాలిటీ టెండర్లను ఆహ్వానించింది. అయితే, ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలారెడ్డి పేరు మీద టెండర్లు దాఖలు చేశారు. వ్యాపారస్తుల నుంచి వసూలు చేయవద్దని, ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ టెండర్ దక్కించుకున్నారు. టెండర్లో పాల్గొనేందుకు చెల్లించిన రూ.16 లక్షల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) మినహా ఇంత వరకు పైసా కూడా మునిసిపాలిటీకి చెల్లించలేదు. వాస్తవానికి టెండర్ గడువు కూడా ఈ ఏడాది మార్చితో ముగిసింది. అయినప్పటికీ పైసా ఇవ్వలేదు. ఇంతటితో కథ ఆగిపోలేదు. టెండర్ సొమ్ము చెల్లించాలంటూ మునిసిపల్ అధికారులు గత ఏడాదిలోనే నోటీసులు జారీచేశారు. ఆ నోటీసుల నేపథ్యంలో రూ.60 లక్షల విలువ చేసే ఐదు చెక్కులను మునిసిపాలిటీకి ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె అందజేశారు. అయితే.. సదరు చెక్కులు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో సొమ్ములే లేవని, దీంతో చెక్కులు చెల్లవని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు.ఏకంగా రూ.60 లక్షల మొత్తానికి చెల్లని చెక్కులు ఇచ్చిన వారిపై కనీసం కేసు పెట్టేందుకు కూడా అప్పట్లో మునిసిపాలిటీ అధికారులు ప్రయత్నించలేదు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలోనే అధికారులు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు సాహసించలేదని తెలుస్తోంది. వ్యాపారస్తుల మెడపై కత్తి! టెండర్లో పాల్గొని సొమ్ము చెల్లించకపోవడంతో అధికారులు కాస్తా వ్యాపారస్తుల నుంచి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే తమను చెల్లించమంటే చెల్లించేవారమని, ఈ విధంగా చేతులెత్తేయడం ఏమిటని కొందరు మండిపడుతున్నారు. పైగా అధికారులు ఎప్పుడు తమపై పడతారోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీ నేతల వ్యవహారం ‘ఏరుదాటే వరకు ఏటి మల్లన్న.. దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న చందంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
లారీల సమ్మెతో దళారీల దందా!
సాక్షి, అమరావతి: వారం రోజుల నుంచి జరుగుతున్న లారీల సమ్మె సెగ పరిశ్రమలతోపాటు సామాన్యులను తాకుతోంది. లారీల సమ్మె దీర్ఘకాలం జరిగే సూచనలు కనపడుతుండటంతో హోల్సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం ప్రారంభిం చారు. కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకుల ధరలను పెంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేవాటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇదే సమయంలో స్థానికంగా పండే కూరగాయల ధరలు తగ్గడం గమనార్హం. ఉల్లిపాయలు, క్యాప్సికం, టమోటా, క్యాబేజీ లాంటి కూరగాయల ధరలు పెరగ్గా.. వంకాయలు, బెండ, దొండ లాంటిస్థానికంగా పండేవాటి ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవటంతో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా, మామిడి రైతుల ఆక్రందన లారీల సమ్మె ప్రభావం ఆక్వా, మామిడపండ్ల ఎగుమతిపై బాగా కనిపిస్తోంది. ధరలు బాగున్నా సమ్మె కారణంగా చెరువుల్లో చేపలు, రొయ్యల సేకరణను నిలిపివేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఆక్వా రైతు ఒకరు వాపోయారు. ప్రస్తుత సీజన్లో నీలం, చిత్తూరు మామిడి రకాన్ని ఎగుమతి చేస్తామని సమ్మె కారణంగా కాయలు కోయకుండా చెట్లకే వదిలేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. రేటు బాగున్నా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని, వర్షాలు పడితే చేతికి వచ్చిన పంట దక్కదని చిత్తూరు జిల్లా రైతులు వాపోతున్నారు. బోసిపోయిన బెజవాడ వన్టౌన్ మార్కెట్ నిత్యం రూ. వందల కోట్ల టర్నోవర్తో కళకళలాడే విజయవాడ వన్టౌన్ హోల్సేల్ మార్కెట్ లారీల సమ్మె కారణంగా వెలవెలపోతోంది. సాధారణంగా ఆషాడమాసంలో వ్యాపారం తక్కువగా ఉంటుంది. సమ్మె మరో వారం రోజులపాటు జరిగితే శ్రావణమాసం వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వస్త్రలత వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లారీలు ఆగిపోవడంతో సుమారు 10,000 మంది హమాలీలు కూలీ దొరక్క పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ విక్రయిస్తున్న వాహన డీలర్లు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మకాలపై మాత్రం సమ్మె ప్రభావం అంతగా కనిపించడం లేదు. జీఎస్టీలో చాలా వస్తువులు రేట్లు తగ్గడంతో పాత సరుకును విక్రయించాలనే ఉద్దేశంతో కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం లేదని ఎలక్ట్రానిక్ గూడ్స్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. తాము సాధారణంగా నెల రోజుల స్టాక్ నిర్వహిస్తామని, దీంతో ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఆటోమొబైల్ రంగంపై లేదని కార్లు, ద్విచక్రవాహనాల డీలర్లు తెలిపారు. సమ్మె మరో వారం రోజులు కొనసాగితే మాత్రం వాహన కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సర్కారుకు సోమవారం వరకు గడువు పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, టోల్ గేట్ చార్జీల తగ్గింపు తదితర డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇచ్చినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుంటే సమ్మెను ఉధృతం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు చెప్పారు. అప్పటివరకు సామాన్యులకు ఇబ్బంది లేకుండా సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. సోమవారం దాకా నిత్యావసర సరుకులు, పెట్రోల్ లాంటి వాటికి మినహాయింపు కొనసాగుతుందన్నారు. లారీల సమ్మెకు సంఘీభావంగా పెట్రోలియం ట్యాంకర్లు కూడా సమ్మె చేస్తున్నారని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పెట్రోలియం డీలర్ల ఫెడరేషన్ ఖండించింది. లారీల సమ్మెకు సంఘీభావం ప్రకటించే అంశంపై ఇంత వరకు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. టమాట రైతులకు రూ.20 కోట్ల నష్టం చిత్తూరు: లారీల సమ్మె టమాటా రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో నిత్యం జరిగే రూ.2.5 కోట్ల లావాదేవీలపై ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిబెంగాల్ తదితర రాష్ట్రాలకు టమాట, క్యాబేజీ, ఇతర కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతి అవుతుంటాయి. ఇతర రాష్ట్రాలకు రోజూ 4 వేల టన్నుల టమాటాలు ఎగుమతి చేస్తారు. సమ్మె వల్ల టమాటా రైతులకు ఇప్పటివరకూ సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. చిత్తూరు పరిసరాల్లోని బెల్లం తయారీ రైతులు కూడా రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తిలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు కడప, ఒడిశా నుంచి రావాల్సిన ముడిసరుకు ఆగిపోయింది. సమ్మెతో కృష్ణపట్నం, ఎన్నూర్ ఓడరేవుల నుంచి ఎరువుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగం ఇబ్బందుల్లో పడింది. ‘తూర్పు’న ఆగిన 35 వేల లారీలు రాయవరం (తూర్పుగోదావరి జిల్లా): సమ్మె కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో 35,000 లారీలు కదలడం లేదు. బియ్యం, కోడిగుడ్లు, కొబ్బరి, అరటితోపాటు ఇటుక తదితరాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళాదుంప, క్యారెట్తోపాటు సిమెంట్, ఐరన్ దిగుమతులు ఆగిపోయాయి. జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన రావులపాలెం, రాజమహేంద్రవరం, మండపేట, తుని, కాకినాడ, అనపర్తి, పిఠాపురం, కత్తిపూడి, ఏలేశ్వరం, జగ్గంపేటలో సమ్మె ప్రభావం స్పష్టంగా ఉంది. గత వారం రోజులుగా లారీలు నిలిచిపోవడంతో రూ.70 కోట్ల దాకా నష్టపోయినట్లు లారీ యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు. -
వేరే కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండేలా అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత క్రియాశీలకంగా లేవంటూ దేశంలోని పలు కంపెనీలను రద్దు చేస్తూ కేంద్ర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వాటిల్లోని డైరెక్టర్లు ఐదేళ్ల పాటు మరే ఇతర కంపెనీలో నూ డైరెక్టర్లుగా ఉండేందుకు వీల్లేదంటూ వారి డైరెక్టర్ గుర్తిం పు సంఖ్య(డిన్)ను సైతం డీయాక్టివ్ చేశారని పిటిషన్లో తెలి పారు. డీయాక్టివేట్ చేసిన తమ డిన్లను క్రియాశీలకం చేసే లా ఆదేశాలివ్వాలని యోహాన్ దూంజీ మిస్త్రీ, దనేశ్ దూంజీ మిస్త్రీ, దూంజీ జహంఘీర్ మిస్త్రీ, రచ్నా దూంజీ మిస్త్రీలు కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది దూళిపాళ్ల వీఏఎస్ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు యోధన్ ఇన్ ఫ్రా, ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారని, ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసరం వారి డిన్, సిన్ను యాక్టివ్ చేయాలని కేంద్రా న్ని ఆదేశించింది. పిటిషనర్లను వేరే కంపెనీల్లో డైరెక్టర్లుగా కొనసాగేందుకు అనుమతివ్వాలని తెలిపింది. డిన్ను క్రియాశీలకం చేశాక వార్షిక రిటర్న్స్ను సమర్పించాలని పిటిషనర్ల ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వివరాలతో కౌంటర్లు దాఖలు చేయా లని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖను ఆదేశించారు. -
నాడు ఇటుకల వ్యాపారి..నేడు అంతర్ రాష్ట్ర స్మగ్లర్
కడప అర్బన్ : అతను ఒకప్పుడు ఇటుకల వ్యాపారి.. ఆ తర్వాత రూటు మార్చి ఎర్రచందనం స్మగ్లర్ అవతారమెత్తాడు. అంతర్రాష్ట్ర స్మగ్లర్గా పేరుమోసి చివరకు పోలీసుల చేత చిక్కి కటకటాలపాలయ్యాడు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా ఆరణి పట్టణానికి చెందిన సత్యనారాయణ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సునీల్ అలియాస్ ఆర్కాట్భాయ్కి ప్రధాన అనుచరుడిగా చలామణి అయ్యాడు. జిల్లాలోని రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె ప్రాంతాల్లో స్మగ్లర్ల ద్వారా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను చాకచక్యంగా తీసుకెళ్లడంలో ఘనాపాటి. తమిళనాడులోని ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని ఉడ్ కట్టర్లను రాయలసీమ జిల్లాల్లోని శేషాచలం, లంకమల్ల, నల్లమల అటవీ ప్రాంతాల్లోకి పంపించి వారి ద్వారా ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాకు ప్పాడినట్లు విచారణలో తేలింది. నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు సత్యనారాయణ దాదాపు 500 టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటివరకు ఇతనిపై 25 కేసులు నమోదయ్యాయి. ఇతనికి దుబాయికి చెందిన పేరుమోసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అలీభాయ్, షాజిలతో సంబంధాలు ఉన్నాయి. నిందితుడు పట్టుబడిన వైనం ఇటీవల ఆర్కాట్భాయ్ని రైల్వేకోడూరు పోలీసులు అరెస్టు చేసి విచారించగా, ప్రస్తుతం పట్టుబడిన నిందితుడు సత్యనారాయణ ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు వ్యూహాత్మకంగా రెండు స్పెషల్ పార్టీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అతని కదలికలపై నిఘా ఉంచి ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలోని అరణి పట్టణంలో వలపన్ని అరెస్టు చేశారు. అతని వాంగ్మూలం మేరకు రైల్వేకోడూరు పోలీసుస్టేషన్ పరిధిలో వాగేటికోన సమీపంలో శేషాచలం అటవీ ప్రాంతంలో గతంలో దాచి ఉంచిన టన్ను (1035 కిలోలు) బరువుగల 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం అస్మి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ పద్మనాభన్, ఎస్ఐలు బి.హేమకుమార్, కొండారెడ్డి, కానిస్టేబుళ్లు ఎస్.శివరామనాయుడు, జి.వెంకట రమణ, సి.కొండయ్య, బి.గోపినాయక్, ఎస్.ప్రసాద్బాబు, కిరణ్కుమార్, సుబ్రమణ్యం, పి.రాకేష్లను ఎస్పీ బాబూజీ అట్టాడ అభినందించారు.అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ (ఇన్సెట్)అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సత్యనారాయణ -
అమ్మో ...రూ.10 నాణెమా..!
టేక్మాల్(మెదక్): పది రూపాయాల కాయిన్ దీనికోసం బ్యాంకుల చుట్టూ జనం తిరుగుతారు. కష్టం మీద ఎదోలా సంపాదించి భద్రంగా ఇంట్లో దాచుకుంటున్నారు. ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పదిరూపాయల బిల్ల పట్టుకోవడానికి భయపడుతున్నారు. వ్యాపారులైతే తీసుకోవడానికి వణుకుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెల్లవని పుకార్లు రావడమే. గత కొన్ని నెలల రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది. పది రూపాయల కాయిన్ చెల్లుతుందని ఎలాంటి భయం అనుమానం అవసరం లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పది రూపాయల కాయిన్లు వచ్చిన కొత్తలో ఆ తరువాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదిరూపాయాల కాయిన్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. ఇన్నాళ్లు దాచుకున్న వాటిని వదిలించుకోవడానికి బయటకు తీస్తున్నా రు. అయితే చాలా మంది వ్యాపారులు తీసుకోవడానికి ఇష్టత చూపడంలేదు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న వాటిని ప్రజలకు అంటకట్టడానికి చూస్తున్నారు. దీంతో చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లె వారికి కండక్టర్ చిల్లర రూ.10 కాయిన్ ఇస్తే ప్రయాణికులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. చివరికి బ్యాంకుల్లో కూడా తీసుకోవడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోహలు వదలండి.. ఆర్బీఐ నిబందనల ప్రకారం రూ.10 కాయిన్ చెల్లుబాటు అవుతుంది. పదిరూపాయాల బిల్ల రద్దు కాలేదు. రూ.10కాయిన్ చెల్లుబాటుపై ప్రజలు వ్యాపారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. వ్యాపారులు, ప్రజలు ఇచ్చుపుచ్చుకోవడం చేయాలి. -
అరచేతిలో జీఎస్టీ!
సాక్షి, వరంగల్ రూరల్: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వచ్చిన తర్వాత ఏ వస్తువుకు ఎంత పన్ను పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యాపారి ఎంత అంటే అంత జీఎస్టీని చెల్లించేవారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా జీఎస్టీ వేయడంతో వినియోగదారులు మోసపోతుండటంతో కేంద్రం జీఎస్టీ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. వ్యాపారులు ఇష్టారా జ్యంగా చెప్పే జీఎస్టీలకు వినియోగదారులు ఈ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. రాష్ట్రంలో 12 వాణిజ్య పన్నుల డివిజన్లు ఉండగా.. అందులో జీఎస్టీ డీలర్లు 1,63,059 ఉన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రతి వస్తువు పన్నుపైనా స్పష్టత వచ్చేలా ఈ యాప్ను రూపొందించారు. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువు ధర, పన్నుల వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీలలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోని వస్తువుల ఐచ్ఛికాన్ని ఎంచుకున్న వెంటనే తెరపై 0,3,5,12, 18,25,28 శాతం తదితర పన్నుల జాబితా కనిపిస్తుంది. దీని ద్వారా ఏయే వస్తువులకు ఎంత శాతం పన్ను విధించారో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వస్తుసేవలు 5% అంశంపై నొక్కగానే ఆ పన్ను చెల్లించాల్సిన సరుకుల వివరాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. సేవల వివరాలు.. ప్రభుత్వం కల్పించే సేవలకు విధించిన పన్ను వివరాలను ఐచ్ఛికం ద్వారా తెలుసుకునే అవకాశముంటుంది. మొబైల్లో అంశాన్ని ఎంచుకుంటే తెరపై సమగ్ర వివరాలు ప్రత్యక్షమవుతాయి. యాప్లో సమాచారం అనే అంశం ప్రెస్ చేయగానే జీఎస్టీకి సంబంధించిన వివరాలు లభిస్తాయి. జీఎస్టీ ఎందుకు అమలులోకి తెచ్చారు, దీనివల్ల కలిగే ప్రభావం, ప్రయోజనాలు, పర్యవసనాలు తదితర వివరాలు అందుబాటులోకి వస్తాయి. డౌన్లోడ్ చేసుకోండిలా... గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి మొదట జీఎస్టీ రేట్ ఫైండర్ అని టైప్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. వెంటనే మొబైల్ తెరపై పలు యాప్లు కనిపిస్తాయి. వీటిలో జీఎస్టీ రేట్ ఫైండర్ ఇంగ్లిష్, హిందీ ఎంచుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ అవగానే స్క్రీన్పై వస్తువులు, పన్నులు, సేవలు, సమాచారం తదితర వివరాలతో నాలుగు ఆప్షన్లు కన్పిస్తాయి. అందులో అవసరమైన ఆప్షన్ను ఎంచుకుంటే తగిన సమాచారాన్ని పొందవచ్చు. -
ధర గుట్టు రట్టు..
ఖమ్మం వ్యవసాయం : మిర్చి కొనుగోళ్లలో మాయ జరుగుతోంది. పంటకు ఉన్న డిమాండ్నుబట్టి ధర పెట్టకుండా వ్యాపారులు దగాకు పాల్పడుతున్న వ్యవహారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం బట్టబయలైంది. జెండా పాటకన్నా కొందరు వ్యాపారులు మిర్చికి ధర అధికంగా పెట్టడంతో ఈ విషయం బయటపడింది. పొరుగు రాష్ట్రాలకు చెందిన మిర్చి వ్యాపారులు ఖమ్మం మార్కెట్కు వచ్చి మిర్చి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వటంతో నిత్యం మార్కెట్లో జరుగుతున్న ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు నిత్యం 12 నుంచి 15 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వస్తుంది. మార్కెట్కు వచ్చే మిర్చిని స్థానిక వ్యాపారులు, అంతర్జాతీయంగా ఎగుమతు లు చేసే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకాలం వీరు సిండికేటుగా ఉంటూ నిర్ణయించుకున్న ధరకు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పంటకు డిమాండ్ పెరగటం, ఎగుమతిదారులకు సరుకు అవసరం కావటంతో అసలు వ్యవహారం బయటపడింది. రోజు మాదిరిగా నే మార్కెట్ ఉద్యోగులు గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో మిర్చికి జెండా పాట నిర్వహించారు. ఇందులో గరిష్టంగా ఓ వ్యాపారి క్వింటాకు రూ.9,230 పాడాడు. ఈ ధరకు కొంత అటు ఇటుగా(నాణ్యతనుబట్టి) అమ్మకానికి వచ్చిన మిర్చిని మిగతా వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే ఇద్దరు వ్యాపారులు ఎగుమతిదారుల సలహాతో కొందరు రైతుల వద్ద క్వింటాకు రూ. రూ.9,400 నుంచి రూ.9,500 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో మిర్చికి మరికొంత ధర ఉన్నట్లు బయటపడటంతో విషయం తెలిసిన రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి యార్డు గేటు వద్ద కొందరు రైతులు మార్కెట్ ఉద్యోగులు, వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. సరుకు రవాణా చేసే వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులు పసిగట్టడంతో.. జెండా పాటకన్నా ఇద్దరు వ్యాపారులు ధర అధికంగా పెట్టి కొనుగోలు చేయటాన్ని కొందరు రైతులు పసిగట్టారు. తమ పంట నాణ్యంగా ఉన్నా.. తక్కువ ధర పట్టడం ఏమిటని రైతులు కమీషన్ వ్యాపారులను నిలదీశారు. దీంతో మిర్చికి డిమాండ్ ఉన్న విషయం బయటపడింది. ఇది మార్కెట్ అంతా పొక్కడంతో రైతులు తాము పంట విక్రయించమని, తమ పంటకు కూడా ధర పెట్టాలని డిమాండ్ చేశారు. రెండోసారి జెండాపాట మొదటి జెండా పాటకన్నా కొందరు వ్యాపారులు రైతుల నుంచి అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారని, మరోసారి జెండాపాట నిర్వహిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ప్రకటించారు. పాటలో వ్యాపారులు క్వింటాల్కు రూ.700 అదనంగా ధర పెట్టారు. క్వింటాల్కు రూ.9,900 ధర పెట్టారు. రైతులందరూ తమ పంటకు ధర పెంచాలని కమీషన్ వ్యాపారులపై వత్తిడి తెచ్చారు. దీంతో మళ్లీ వ్యాపారులను పిలిచి.. పంటను పరిశీలించి నాణ్యత మేరకు ప్రస్తుతం ఉన్న డిమాండ్తో ధర పెట్టాలని కోరారు. వ్యాపారులు క్వింటాల్కు రూ.300 నుంచి రూ.500 వరకు ధర పెంచి కొనుగోలు చేశారు. ‘సిండికేటు’గా దోపిడీ.. వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి మిర్చిలో ధర దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర నిర్ణయించకపోవటంతో పంటకు ధర ఎంత పలుకుతుందనే విషయం రైతులకు తెలియటం లేదు. దీంతో వ్యాపారులు కూడపలుక్కొని ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఇలాగే తగ ఏడాది మిర్చి సీజన్లో ధర దోపిడీకి పాల్పడ్డారు. నిత్యం రూ.లక్షల్లో దోపిడీ గురువారం ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలో వచ్చిన తేడాను పరిశీలిస్తే.. నిత్యం రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మార్కెట్కు 15వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. ఇది దాదాపు 7వేల క్వింటాళ్ల వరకు ఉంటుంది. పంట కొనుగోళ్ల ధరలో వచ్చిన తేడా వ్యవహారం బయటపడకపోతే రైతులు రూ.15లక్షల మేర దగాకు గురయ్యేవారు. ఈ లెక్కన నిత్యం మిర్చి ధరలో రైతులు రూ.లక్షల్లో దోపిడీకి గురవుతున్నట్లు విదితమవుతోంది. మరీ ఇంత దగానా.. మిర్చికి ధర ఉన్నా తక్కువ ధర పెట్టారు. 22 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. మొదట క్వింటాల్కు రూ.9,230 చొప్పున కొనుగోలు చేశారు. తరువాత ధర పెరిగిందని తెలిసింది. మొదటి ధరకు ఒప్పుకోలేదు. దీంతో మరో రూ.200 ధర పెంచారు. ఇంత దగా చేస్తారనుకోలేదు. – మాలోత్ సామ్యా, రైతు, సాతానిగూడెం, కామేపల్లి మండలం క్వింటాల్కు రూ.300 పెంచారు.. 21 బస్తాల మిర్చి అమ్మకానికి తెచ్చా. మొదట క్వింటాల్కు రూ.9,200 ధర పెట్టారు. ధర పెరిగిందని అంతా చెప్పటంతో కమీషన్ వ్యాపారిని ప్రశ్నించా. దీంతో మరో రూ.300 పెంచి క్వింటాల్కు రూ.9,500 చొప్పున ధర పెట్టాంచారు. మిర్చికి ధర ఉన్నా అన్యాయం చేస్తున్నారు. – నంద్యాల వెంకన్న, గట్టుసింగారం, కూసుమంచి మండలం ధర ఘటనపై విచారిస్తాం.. మిర్చికి ధర ఉన్న విషయం తెలిసి మరోసారి జెండాపాట నిర్వహించాం. జెండాపాటలో ఖరీదుదారులంతా పాల్గొనలేదు. వ్యాపారులు జెండాపాటలో పాల్గొనకుండా రైతుల నుంచి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం. – రత్నం సంతోష్కుమార్, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి -
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాదర్, ఆలీపై కత్తులలో దాడి
-
రూ.100 కోట్లపైనే జీఎస్టీకి టోకరా!
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో ఇప్పటికే ఆదాయాన్ని కోల్పోతున్న సర్కారుకు చాలా మంది వ్యాపారులు మరింత నష్టాన్ని కలగజేస్తున్నారు. పండుగల సీజన్ లావాదేవీల్లో మాయాజాలం ప్రదర్శిస్తూ యథే చ్ఛగా పన్ను ఎగ్గొడుతున్నారు. ఇంత జరుగు తున్నా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారు లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస పర్యవేక్షణ కూడా లేకుండా చోద్యం చూస్తున్నారు. ఇందుకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో ఈ పండుగల సీజన్లో బట్టల వ్యాపారం కనీసం రూ. 1,200 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఈ లెక్కన కనీసం రూ. 100 కోట్లకుపైగానే జీఎస్టీ సర్కారు ఖజానాకు చేరాల్సి ఉన్నా ఆ మేరకు వ్యాపారులు ఎగవేసినట్లు తెలుస్తోంది. కేంద్రం భయం.. రాష్ట్రాలకు అశనిపాతం వాస్తవానికి జీఎస్టీ అమల్లోకి వచ్చాక కనీసం 3 నెలలపాటు వ్యాపారుల జోలికి వెళ్లవద్దని.. తనిఖీలు, పన్ను వసూళ్ల పేరుతో వేధించొద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే రాష్ట్రాలు వ్యాపారులను ఇబ్బంది పెడితే వారు ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచేస్తారని, దాని వల్ల ప్రజలపై భారం పడుతుందని పేర్కొంది. అయితే వ్యాపారుల నుంచి జీఎస్టీని ముక్కు పిండి వసూలు చేస్తే వ్యాపార వర్గాల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే భయం తోనే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని మండిప డుతున్నాయి. ఇప్పుడు ఇదే నిర్ణయం తమకు అశనిపాతంగా మారిపోతోందని వాపో తున్నాయి. కనీసం చెక్పోస్టులు లేకపోవడంతో ఏ సరుకులు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయి.. ఏ గోదాముల్లో పెడుతున్నారు.. సరుకులు వస్తున్నాయా లేదా అనే విషయాలు కూడా రాష్ట్ర పన్నులశాఖతోపాటు సెంట్రల్ ఎక్సైజ్కు తెలియడం లేదు. దీంతోపాటు వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి ఏం జరుగుతుందని పరిశీలించే అవకాశం కూడా పన్నులశాఖ అధికారులకు లేకుండా పోయింది. బిల్లుల్లో పన్నుల ప్రస్తావన మాయం... దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రాష్ట్రంలో ఏటా పెద్ద ఎత్తున బట్టల కొనుగోళ్లు జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని బడా బట్టల దుకాణాలు, షాపింగ్ మాల్స్ గత వారం రోజులుగా కిటకిటలాడుతూనే ఉన్నాయి. జీఎస్టీ ప్రకారం ప్రతి రూ. 1,000లోపు కొనుగోళ్లపై 5 శాతం, ఆపైన జరిపే కొనుగోళ్లపై వినియోగదారులు 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వ్యాపారులు ప్రతి లావాదేవీకీ బిల్లు ఇచ్చి అందులోనే పన్నులను కూడా ప్రస్తావించాలి. కానీ చాలా మంది వ్యాపారులు ‘తెలివి’గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో జరిగే వ్యాపార లావాదేవీలకు బిల్లులిచ్చినా చాలా చోట్ల పన్ను అంశాన్నే ప్రస్తావించడం లేదు. కొన్ని షాపింగ్ మాల్స్ మాత్రం బిల్లు కింది భాగంలో ‘దిసీజ్ ఎస్టిమేషన్.. ప్యాకింగ్ స్లిప్.. నాట్ ఫైనల్ ఇన్వాయిస్’ అని రాయడం ద్వారా బిల్లుపై జీఎస్టీ ఎందుకు ప్రస్తావించలేదనే ప్రశ్న కూడా తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే బిల్లుల్లేవు, జీఎస్టీ లేదన్న రీతిలోనే వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. ఇలా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ అందులో పదో, పరకో ప్రభుత్వానికి పన్ను చెల్లిద్దామనే కోణంలో వ్యాపారులు వ్యవహరిస్తున్నా కనీసం పట్టించుకునే నాథుడు కూడా లేకపోవడం గమనార్హం. ఇంకా వ్యాట్ పనుల్లోనే సిబ్బంది... జీఎస్టీ వ్యవహారాలకన్నా అంతకుముందు వరకు అమల్లో ఉన్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్)లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో పన్నులశాఖలోని కిందిస్థాయి సిబ్బంది వ్యాట్ డీలర్ల ఆడిటింగ్, స్క్రూటినీ లాంటి పనులకే పరిమితమయ్యారు. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న వ్యాపారులు జీరో దందాకు తెరలేపుతున్నారని పన్నులశాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ దశలోనూ వ్యాపారులను అడిగే అవకాశం కాదు కదా... కనీసం సమన్వయం చేసే పరిస్థితి కూడా లేకపోవడం దారుణమని, గతంలో ఎప్పుడూ ఇంత విచ్చలవిడి వ్యాపార లావాదేవీలు జరగలేదని వాణిజ్య పన్నులశాఖలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. సరైన పరిస్థితులుంటే దసరా, దీపావళి పండుగల సీజన్లో కనీసం రూ. 200 కోట్ల పన్నులు జమ అయ్యేవని వ్యాఖ్యానించారు. -
భీమ్ క్యాష్బ్యాక్ స్కీమ్ గడువు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ కింద వర్తకులకు అందించే ఆఫర్ల గడువును కేంద్రప్రభుత్వం పొడిగించింది. భీమ్ అప్లికేషన్ ద్వారా పేమెంట్లను అంగీకరించే వర్తకులకు ఈ స్కీమ్ కింద 1000 రూపాయల వరకు ప్రోత్సహకాలను కేంద్రం అందిస్తోంది. ప్రస్తుతం 2018 మార్చి 31 వరకు భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ కింద వర్తకులు తమ కార్యకలాపాలు సాగించవచ్చని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. భీమ్ యాప్ ద్వారా నగదు రహిత పేమెంట్లను ప్రోత్సహించడానికి ఆరు నెలల గడువుతో ఈ స్కీమ్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 14న లాంచ్చేశారు. ఈ స్కీమ్ కింద 20-50 లావాదేవీలకు రూ.50 క్యాష్బ్యాక్ను వర్తకులకు అందిస్తారు. అంటే ప్రతి లావాదేవీ రెండు రూపాయలన్నమాట. భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ నెలవారీ పరిమితి వెయ్యి రూపాయలు. ఈ క్యాష్బ్యాక్ ప్రయోజనాలను వర్తకులు పొందడానికి, భీమ్ యూనిక్ యూజర్ల నుంచి వర్తకులు ప్రతి నెలా కనీసం 20 లావాదేవీలు జరుపాల్సి ఉంటుంది. ప్రతిదీ కనీసం 25 రూపాయలు అయి ఉండాలి. కాగ, భీమ్ యాప్, ఇతర మొబైల్ వాలెట్ల లాగా నగదును నిల్వ ఉంచదు. -
‘చెత్త’ ఐడియా
శ్రీశైలం: శ్రీశైలంలో వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందుతూ దేవస్థానం క్వాటర్స్లో నివాసం ఉంటున్న కొందరు దుకాణాదారులు తమ నివాసిత గృహాలను ఖాళీ చేయకపోవడంతో మంగళవారం ఇలా చెత్తసేకరించే వాహనాలను షాపుల ముందు అడ్డంగా పెట్టేశారు. దేవస్థానం సిబ్బంది కోసం వసతి గృహాలు అవసరం కావడంతో ఖాళీ చేయాలని ఈఓ నారాయణ భరత్ గుప్త అనేకమార్లు ఆదేశించినా ఫలితం లేకపోవడంతో తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఏఈఓ ధనుంజయ్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం తొలిఏకాదశి రోజున షాపులు తెరిచిన వెంటనే చెత్తసేకరించుకొని వచ్చిన వాహనాలను సంబంధిత దుకాణాలకు అడ్డంగా పెట్టించేశారు. దీంతో ఆయా దుకాణాదారులు ఈఓను కలవగా వారికి కేటాయించిన దేవస్థానం వసతిగృహాలను ఖాళీ చేయాల్సిందిగా సూచించారు. అందుకు వారు సమ్మతించడంతో దుకాణాలకు అడ్డంగా నిలిపివేసిన వాహనాలను తొలగించారు. -
దుకాణం బంద్
జీఎస్టీ ఎఫెక్ట్ వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళనబాట స్తంభించిన లావాదేవీలు తణుకు :వస్తు, సేవల పన్ను (జీఎస్టీకి) నిరసనగా వ్యాపారులు ఆందోళనబాట పట్టారు. ప్రధానంగా వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. వస్త్రవ్యాపారులు మంగళవారం నుంచి నాలుగురోజులపాటు బంద్ చేపట్టనుండగా, ఫర్నిచర్ వ్యాపారులు రెండురోజులపాటు దుకాణాలు మూయనున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే రూ.కోట్లలో లావాదేవీలు స్తంభించినట్టు సమాచారం. జీఎస్టీని తొలి నుంచి వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం వల్ల వ్యాపారాలు దెబ్బతిని దుకాణాలు మూతపడే దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆలిండియా టెక్స్టైల్స్ ఫెడరేషన్, ఫర్నిచర్ వ్యాపారుల అసోసియేషన్ పిలుపు మేరకు వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. తక్షణమే వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో వస్త్ర, ఫర్నిచర్ దుకాణాలు మూత పడ్డాయి. మూడు వేల వస్త్ర దుకాణాల మూత జిల్లా వ్యాప్తంగా క్లాత్ మర్చంట్స్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు వేల దుకాణాలు మూతపడినట్టు సమాచారం. దీనివల్ల రూ. 400 కోట్ల లావాదేవీలు నిలిచినట్టు అంచనా. భారం పెరగడం వల్లే.. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇటీవల నూలు, రంగులు, పట్టు ధరలు పెరగడంతో వస్త్రాల అమ్మకాలు తగ్గాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూలుపై ప్రకటించిన జీఎస్టీ చేనేత పరిశ్రమకు మరింత భారం కానుంది. ఇంతవరకు రెడీమేడ్ వస్త్రాలపై ఐదు శాతం పన్ను అమల్లో ఉంది. వస్తు సేవల పన్ను వల్ల ఇది 12 శాతానికి పెరగనుంది. ఇంతవరకు చేనేత, సాధారణ వస్త్రాలపై ఎలాంటి పన్నూ లేదు. జీఎస్టీ రాకతో ఐదు శాతం వసూలు చేయనున్నారు. ఈ విధానాల వల్ల కొనుగోలు దారులపై భారీగా భారం పడుతుందని వస్త్ర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నుంచి ఏడు శాతం వరకు ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 18 శాతానికి పెంచారు. ఈ ప్రభావంతో మార్కెట్లో వస్త్రాలపై 10 నుంచి 15 శాతం వరకు భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీఎస్టీకి వ్యతిరేకంగా ఈనెల 15న ఓ దఫా ఆందోళన చేసిన వస్త్రవ్యాపారులు తాజాగా నాలుగురోజుల బంద్కు పిలుపునిచ్చారు. ఉభయులకూ భారమే జీఎస్టీ వల్ల వస్త్రవ్యాపారులకూ, వినియోగదారులకూ భారమనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం కేంద్రాలుగా వస్త్రవ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారంపై ఆధారపడి ఎంతో మంది చిన్నవ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులు ఎక్కువగా చితికిపోతారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి జరిగిన వ్యాపారంపై లెక్కలు చూపించి వివరాలను అందించాలని కేంద్రం సూచించడం వీరికి మరింత భారంగా మారింది. గతంలో వ్యాట్ తొలగించాలని కోరుతూ వ్యాపారులు చేసిన ఆందోళనలతో ఆ విధానాన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారాలంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి నెలా బిల్లులు జీఎస్టీ సాఫ్ట్వేర్లో ఆన్లైన్ చేయాలంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించుకోవాల్సి ఉంటుందని, ఇదంతా పెద్దస్థాయి షాపింగ్మాల్స్కు మాత్రమే సాధ్యమవుతుందే తప్ప చిన్న వ్యాపారులకు సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో వస్త్ర దుకాణాలపై 12 శాతం వరకు పన్ను పడనుంది. ఈ భారం వినియోగదారులు భరించాల్సి వస్తోంది. రూ.వెయ్యిలోపు ఐదు శాతం, ఆ మొత్తం దాటితే 12 శాతం వరకు పన్ను విధించనున్నారు. ఇవి కాకుండా మేకింగ్, వర్కింగ్, డైయింగ్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయనున్నారు. ఇది వినియోగదారులకు భారంగా మారనుంది. ఫర్నిచర్ షాపుల బంద్ ఇదిలా ఉంటే ఫర్నిచర్ వ్యాపారులూ రెండురోజుల బంద్కు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1500 షాపులు ఉంటాయని అంచనా. ఈ దుకాణాలన్నీ బుధవారం కూడా మూతపడనున్నాయి. తదుపరి కేంద్రం స్పందనను బట్టి ఆందోళన తీవ్రతరం చేయాలనే యోచనలో ఫర్నిచర్ వ్యాపారులు ఉన్నారు. -
జీఎస్టీ.. బిజీబిజీ
♦ అమలుకు వాణిజ్య పన్నుల శాఖ సమాయత్తం హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు కేవలం రెండ్రోజులే (జూలై 1) గడు వున్న నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో హడావుడి కనిపిస్తోంది. పన్ను చెల్లించే డీలర్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతోపాటు కొత్త విధానం అమలు బాధ్యతలను కేంద్ర అధికారు లతో (సెంట్రల్ ఎక్సైజ్) పంచుకోవడం, పని విభజన వంటి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ అధీనంలోని 19 సరిహద్దు చెక్పోస్టులను జూన్ 30 తర్వాత ఎత్తివేయాలని అధికారులు నిర్ణ యించారు. ఈ చెక్పోస్టుల స్థానంలో మొబైల్ బృందాలతో తనిఖీలు చేపట్టాలని ప్రతిపాదిం చారు. చెక్పోస్టుల ఎత్తివేత కార్యక్రమం దేశ వ్యాప్త విధానం కావడంతో మొబైల్ తనిఖీ బృందాల ఏర్పాటు కోసం జీఎస్టీ కౌన్సిల్ మార్గ దర్శకాలను అమలు చేయనున్నారు. బాధ్యతలు పంచుకున్నారిలా... పెట్రోల్, మద్యం మినహా అన్ని వస్తువులపై జీఎస్టీ అమలు చేయాల్సిన నేపథ్యంలో ఈ అమలు బాధ్యతలను సెంట్రల్ ఎక్సైజ్, వాణి జ్య పన్నుల శాఖ అధికారులు పంచుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ కేవలం వస్తు పన్ను మాత్రమే వసూలు చేస్తోంది. జీఎస్టీ అమలుతో వస్తు పన్నుతో పాటు సేవల పన్నును కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏడాదికి రూ.1.50 కోట్ల టర్నోవర్ కన్నా ఎక్కువ ఉండే డీలర్లను వాణిజ్య పన్నుల శాఖ, సెంట్రల్ ఎక్సై జ్ అధికారులు చెరి సగం పంచుకుని జీఎస్టీ అమలును పర్యవేక్షించనున్నారు. రూ.1.50 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉండే డీలర్లలో 90% మంది వాణిజ్య పన్నుల శాఖ కిందకు రాగా..10% సెంట్రల్ ఎక్సైజ్ అధికారుల పరి ధిలోకి వెళ్లారు. ఏ శాఖ పరిధిలోకి వచ్చే డీలర్లకు సంబంధించిన పన్ను వసూలు, పర్యవేక్షణ బాధ్యతలను ఆ శాఖ అధికారులే చూడను న్నారు. చెక్పోస్టుల స్థానంలో రానున్న మొబైల్ తనిఖీ బృందాల విషయంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర అధికారుల నిఘా ఉంటుంది. డీలర్లు ఏం చేయాలంటే... జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలనుకునే డీలర్లు తొలుత పాత పన్నుల విధానం నుంచి జీఎస్టీ పరిధిలోకి రావాలి. అంటే.. ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకుని, సర్టిఫికెట్ పొందిన తర్వాత సదరు డీలర్కు ఆ శాఖ అధికారులు 15 అంకెల జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్లు తెలంగాణ కోడ్ (36)తో ప్రారంభం కానున్నాయి. 36 తర్వాత ఆ డీలర్ పాన్ నంబర్, ఇతర కోడ్లు ఉంటాయి. ఈ నంబర్తో లాగిన్ అయితేనే వ్యాపార లావాదేవీలకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణలో దాదాపు 86 శాతం మంది జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ పొందారని, మిగిలినవి కూడా మరో మూడ్రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ కింద వ్యాపార లావాదేవీల కోసం డీలర్లు తమ ఇన్వాయిస్లను కూడా పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. అధికారుల కోసం ప్రత్యేక సిగ్నేచర్ జీఎస్టీ అమలు కోసం వాణిజ్య పన్నుల శాఖ పని విధానంలో కూ డా మార్పులు జరగబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ము ఖ్యంగా ఏసీటీవో స్థాయి నుంచి కమిషనర్ స్థాయి వరకు అందరు అధి కారులకు డిజిటల్ సిగ్నేచర్లు ఇస్తున్నారు. వీరికి పెన్డ్రైవ్ తరహాలో ఉండే ప్రత్యేక ‘కీ’ కూడా ఇవ్వనున్నారు. ఈ కీతోపాటు డిజిటల్ సిగ్నే చర్ ద్వారా లాగిన్ అయితేనే సదరు అధికారి అటెండెన్స్ నమోదవు తుందని చెబుతున్నారు. అలా నమోదైన అధికారికి ఆ రోజు నిర్వర్తిం చాల్సిన ముఖ్య విధులను కూడా సూచించేలా సాఫ్ట్వేర్ రూపొందిం చారని తెలుస్తోంది. ఆ విధులను సదరు అధికారి నిర్వర్తించని పక్షంలో ఉన్నతాధికారికి ఆ విషయాన్ని చేరవేసే వ్యవస్థ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే జీఎస్టీ అమలు నేపథ్యంలో తమపై పని ఒత్తిడి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతినెలా రాష్ట్రంలో జరిగే వ్యాపార లావాదేవీలకు సంబంధించి 2 కోట్లకు పైగా ఇన్వాయిస్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, గతంలో మాదిరిగానే రిటర్న్స్ స్క్రూటినీ, ఆడిట్, అసెస్మెంట్, రిటర్న్ డిఫాల్టర్ల పర్యవేక్షణ, మిస్మ్యాచ్ రిపోర్టులు వంటివి నిర్వర్తించాల్సి రావడం, వస్తు పన్నుకు సంబంధించిన డీలర్లు తగ్గినా, సేవల పన్ను చెల్లించే డీలర్లు తమ పరిధిలోనికి రావడంతో అదనపు పనిభారం పడుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ శాఖలో పని ఉండదనేందుకు అవకాశం లేదని, ఆన్లైన్ ద్వారా అంతా జరిగినా దాని పర్యవేక్షణ చూడాల్సింది తామేనని చెబుతున్నారు. నేడు కమిషనర్తో జేఏసీ భేటీ జీఎస్టీ అమలు తేదీ దగ్గరకొస్తున్నా.. ఉద్యోగుల్లో దీనిపై భయాలు అలానే కొనసాగుతున్నాయి. క్యాడర్ను దీనికి అనుగుణంగా పునర్వ్యవస్థీక రించాలని, ఆన్లైన్ అమలుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించాలని కమర్షియల్ ట్యాక్స్ విభాగం కోరినా ఇంతవరకూ స్పందన లేదు. ఉద్యోగులకు జాబ్చార్ట్ కూడా రాలేదని తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వాపోయింది. దీనిపై తాము బుధవారం ఉదయం 11.30 గంటలకు కమి షనర్ను కలవనున్నామని, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రికి కూడా తమ డిమాండ్లను అంద జేస్తామని తెలియజేసింది. భవిష్యత్ కార్యాచ రణను నిర్ణయిస్తామని తెలంగాణ వాణిజ్య పన్నుల గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీజీ టీఓఏ) అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి తెలిపారు. -
వచ్చేస్తోంది జీఎస్టీ
► మరో రెండ్రోజుల్లో అమల్లోకి.. ♦ తయారీదారుల నుంచి రిటైల్ వ్యాపారుల వరకు అందరిపై పన్ను ♦ సాధారణ చెల్లింపుదారులు నెలనెలా.. ♦ కాంపోజిషన్ ట్రేడర్లు మూడు నెలలకోసారి.. ♦ వసూలు చేసే పన్నులో కేంద్రం–రాష్ట్రానికి చెరిసగం ♦ సేవా పన్నుతో రాబడి పెరిగే అవకాశం హైదరాబాద్: హరియాణాలో ఓ కారు తయారైంది. తయారీదారుడి వద్ద ఆ కారు విలువ రూ.10 లక్షలు. జూలై 1 నుంచి అమ ల్లోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రకారం కారు విలువలో 28 శాతం అంటే రూ.2.80 లక్షలు తయారీదారుడు హరియాణా ప్రభుత్వా నికి పన్ను చెల్లించాలి. అయితే కారు ఆ రాష్ట్రం లో అమ్ముకుంటేనే పన్ను హరియాణా ప్రభు త్వానికి వెళ్తుంది. అదే కారును తెలంగాణలో విక్రయిస్తే మాత్రం ఆ పన్ను మొత్తం తెలం గాణ ఖజానాకు చేరుతుంది. వినియోగదారు డికి కారును అమ్మే ఇక్కడి డీలర్లు చెల్లించే పన్ను కూడా తెలంగాణకే చెందుతుంది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోనూ అమల్లోకి రానున్న నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించిన మరికొన్ని అంశాలను ఓసారి చూద్దాం.. ♦ జీఎస్టీ పరిధిలోనికి వచ్చే ప్రతి వస్తువుపై విధించే పన్నులో 50 శాతం కేంద్రానికి వెళ్తుంది. ఇది కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ). మరో 50 శాతం రాష్ట్రానికి చెందుతుంది. అది రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ). ♦ ఏదైనా వస్తువు.. తయారైన రాష్ట్రంలోనే వినియోగించినప్పుడే ఈ రెండు పన్నులుంటాయి. అలాకాకుండా వస్తువు ఒక రాష్ట్రంలో తయారై, మరో రాష్ట్రంలో వినియోగిస్తే మాత్రం ఆ పన్ను కేంద్రానికి వెళ్తుంది. దీన్ని ఐజీఎస్టీగా వ్యవహరిస్తారు. అయితే ఆ పన్నును వస్తువు వినియోగం జరిగిన రాష్ట్రానికి కేంద్రం పంపిస్తుంది. ♦ పన్ను చెల్లింపుదారులను రెండు రకాలుగా విభజించారు. మొదటిది.. కాంపోజిషన్ ట్రేడర్లు. రెండవది సాధారణ చెల్లింపుదారులు. కాంపోజిషన్ ట్రేడర్ల వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుంది. వీరు ప్రతి మూడు నెలలకోసారివారి టర్నోవర్లో 1 శాతం మొత్తాన్ని జీఎస్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. అదే తయారీదారులయితే 2 శాతం కట్టాలి. ♦ ఏడాదికి రూ.75 లక్షలకు పైగా టర్నోవర్ ఉంటే సాధారణ చెల్లింపుదారులుగా గుర్తిస్తారు. వీరు జీఎస్టీ కింద ప్రతినెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ♦ తయారీదారుడి నుంచి హోల్సేల్ డీలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైల్ డీలర్ వరకు అందరూ జీఎస్టీ కింద పన్ను చెల్లించాల్సిందే. వీరి నుంచి జీఎస్టీ వసూలు చేసే బాధ్యత సెంట్రల్ ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలపై ఉంటుంది. ♦ పరోక్ష పన్నులన్నింటినీ కలిపి జీఎస్టీ ప్రతిపాదించినందున సర్వీస్ ట్యాక్స్ కింద ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెపుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ దుకాణం యజమాని తాను అమ్మే ఆభరణాలకు మాత్రమే పన్ను చెల్లిస్తున్నాడు. అయితే ఆ దుకాణం ఉన్న భవనానికి నెలకు లక్షల్లో అద్దె చెల్లిస్తుంటే.. ఇకపై ఈ అద్దెకు కూడా సర్వీసు ట్యాక్స్ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ ద్వారానే హైదరాబాద్లోని వాణిజ్య సముదాయాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. -
వస్త్ర వ్యాపారం బంద్
నిలిచిన రూ.5 కోట్ల మేర వ్యాపారం మరో మూడు రోజుల పాటు మూత రాజమహేంద్రవరం సిటీ : వస్తు,సేవల పన్ను చట్టం నుంచి వస్త్ర వ్యాపారాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హోల్సేల్, రిటైల్ వస్త్ర వ్యాపారులు చేపట్టిన నాలుగు రోజుల బంద్ మంగళవారం ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో వస్తుసేవల పన్ను కలవడం వలన సామాన్యులు సైతం ఇబ్బంది పడే పరిస్ధితి ఏర్పడుతుందని తద్వారా వ్యాపారులపై అ«ధికారులు వత్తిడి లంచగొండి తనం ఎక్కువైపోతుందని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నగరంలో మహాత్మాగాంధీ హోల్ సేల్ మార్కెట్లో 600 షాపులు, మెయిన్రోడ్లు 15 పెద్దషోరూమ్లు, మిగిలిన షాపులు వెరసి సుమారు 700 షాపుల వరకూ వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాయి. జీఎస్టీ ప్రమేయాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన నాలుగురోజుల పాటు వస్త్ర వ్యాపారాన్ని నిలుపుదల చేస్తూ బంద్ పాటించేందుకు సిద్ధమయ్యాయి. ఈ బంద్తో మొదటి రోజు రూ.5 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించాయని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల మేర వ్యాపార లావాదేవీలకు అవాంతరం ఏర్పడనుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ వస్త్ర సమాఖ్య ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలో జీఎస్టీ ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేంది లేదన్నారు. జీఎస్టీతో వస్త్ర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వస్త్ర వ్యాపారులు పన్నులకు వ్యతిరేకం కాదని, కేవలం జీఎస్టీ ప్రవేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు 30వ తేదీ వరకూ వ్యాపారాలు బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందన లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు వస్త్ర హోల్సేల్ వర్తకుల సంఘం అధ్యక్షులు బిళ్లా రాజు పేర్కోన్నారు. ఈ బంద్లో పలు వస్త్ర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు స్థానిక మహాత్మాగాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించారు. -
వస్త్రాలపై జీఎస్టీని అనుమతించబోం
27 నుంచి 30 వరకూ వస్త్రవాపార సంస్ధలు నిరవధిక బంద్ ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బొమ్మనరాజ్కుమార్ జీఎస్టీ రద్దు చేసే వరకూ పోరాటం– వ్యాపారులు రాజమహేంద్రవరం సిటీ : వస్త్ర వ్యాపారంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని, జీఎస్టీని నిరశిస్తూ మంగళవారం నుంచి శుక్రవారం (27 నుంచి 30) వరకూ వస్త్ర వ్యాపారాలను నిరవధిక బంద్ చేస్తున్నట్టు ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్కుమార్ ప్రకటించారు. ఆదివారం తాడితోట మహాత్మాగాంధీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉభయ జిల్లాలకు చెందిన వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. బొమ్మన రాజ్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 18న ఢిల్లీలో జాతీయ వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశమై 24 లోపు జీఎస్టీ అమలు విషయంపై ప్రభుత్వానికి గడువు ఇచ్చారని, సమయం దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదన్నారు. జీఎస్టీతో వస్త్ర వ్యాపారులు ఎదుర్కొనే విపత్తును దృష్టిలో ఉంచుకుని మంగళవారం నుంచి 30 వరకూ వస్త్ర వ్యాపారాలను నిరవధిక బంద్ పాటిస్తున్నట్టు ప్రకటించారు. జీఎస్టీతో అధికారుల వేధింపులు ఎక్కువై పోతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులపై అధికారులు పెత్తనం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు వ్యాపారులు సమష్టిగా ముందుకు రావాలన్నారు. పోకల సీతయ్య, బిళ్లారాజు, కాలేపు రామచంద్రరావు, తుమ్మిడి విజయకుమార్ ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు పాల్గొన్నారు. -
పినరాయ్ విజయన్పైనే వారి ఆశలు
తిరువనంతపురం: కబేళాలకు తరలించేవారికి పశువులను విక్రయించరాదంటూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల ప్రభావం కేరళ మార్కెట్పై అప్పుడే కనిపించింది. కేంద్రం ఆంక్షలు ఇంకా అమల్లోకి రానప్పటికీ కేరళలోని మల్లప్పురం జిల్లా చెలేరి పశువుల సంత మంగళవారం బోసి పోయింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రతి వారం చెలేరి సంతకు 50 ట్రక్కులకుపైగా పశువులను తరలించుకు వచ్చేవారు వ్యాపారులు. పశువుల్లో బర్రెలు, ఎద్దులే ఎక్కువగా ఉండేవి. నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఓ ప్రైవేటు మైదానంలో జరిగే ఈ సంతకు ఎప్పుడూ ఎంతో డిమాండ్ ఉండేది. మొన్న 20 ట్రక్కులు ఖాళీగా సంత స్థలంలోనే ఉండిపోయాయి. ఈ వాహనాలు ఊరూరా తిరిగి విక్రయించే పశువులను సంతకు తీసుకొచ్చేవి. ప్రతి వారం ఈ సంతలో వెయ్యి పశువులకు డిమాండ్ ఉంటుందట. మొన్న 300 పశువులకు కూడా డిమాండ్ లేదు. పరిస్థితులను ముందే ఊహించిన రైతులు పశువులను సంతకు తరలించలేదు. 'నేను ప్రతివారం 50 పశువులను సంతకు తీసుకొచ్చి అమ్ముతాను. ఈ సారి 20 పశువులను కూడా అమ్మలేక పోయాను' వెంగరలో గొడ్ల శాలను కలిగిన బవుట్టి తెలిపారు. ఈ వ్యాపారాన్ని ఇంతటితో ఆపేయాల్సి వస్తుందా ? అని పశువుల వ్యాపారులు ఒకరినొకరు పలకరించుకోవడం కనిపించింది. ఉపాధి కోసం మరే వ్యాపారం చేయాలో అంతుచిక్కడం లేదని కొంత మంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారం దెబ్బతినకుండా తమ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న విశ్వాసం ఎక్కువ మందిలో కనిపించింది. కేంద్రం విధించిన ఆంక్షలను అమలు చేయమని, సుప్రీం కోర్టు వరకు వెళతానని విజయన్ హెచ్చరించిన విషయం తెల్సిందే. నాలుగు టన్నుల బర్రె లక్ష రూపాయలకు, టన్ను బరువుండే బర్రెలు 20వేలకు, ఎద్దులు 20 వేల రూపాయల నుంచి 60 వేలకు ఈ సంతలో అమ్ముడు పోయేవి. -
రూ.10 నాణేలపై ఆగని వదంతులు
కడప అగ్రికల్చర్: పది రూపాయల నాణేలు (బిళ్లలు) చెల్లవనే వదంతులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉన్నా... వారం రోజులుగా మరీ ఘోరంగా తయారైంది. అయితే పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని ఎలాంటి భయం, అనుమానం అవసరం లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు లేఖ రాశానని, అది రాగానే జిల్లా ప్రజలకు వివరణ ఇస్తామని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ లేవాకు రఘునా««థ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నోట్ల రద్దు నుంచి.. కష్టాలే: గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ప్రజలు తీవ్రమైన కరెన్సీ కష్టాలను ఎదుర్కొన్నారు. దాదాపు 135 రోజులుగా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ నగదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల బిళ్లలు చెల్లవని ఆటోవాలాలు, చిల్లర అంగళ్లవారు, పండ్లు, కూరగాయలు, పాల పాకెట్ల విక్రయదారులు ఇలా ఒకరేమిటి దుకాణాల వారందరూ తిరస్కరిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రూ.10 బిళ్లలు వచ్చిన కొత్తలో, ఆ తరువాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా మంది వ్యాపారులు మూటలు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల నాణేలు చెల్లవనే ప్రచారం జరుగుతుండటంతో ఇన్నాళ్లూ దాచుకున్న వాటిని వదిలించుకోవడానికి బయటకు తీస్తున్నారు. దీంతో చాలా మంది వ్యాపారులు వీటిని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు సరి కదా.. తమ వద్ద ఉన్న వాటిని వినియోగదారులకు అంటగట్టడానికి చూస్తున్నారు. దీనివల్ల చిన్న చిన్న తగాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి చిల్లరగా కండక్టర్లు 10 రూపాయల నాణేలు ఇస్తే ప్రయాణికులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అపోహలు వద్దు: పది రూపాయల నాణేలు చెల్లవనే అపోహలను ప్రజలు, వ్యాపారులు పెట్టుకోవద్దని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన పలు సమావేశాల్లో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు 10 రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని చెప్పారు. ఈ సమస్య ఒక్క వైఎస్సార్ జిల్లాలో మాత్రమే ఉందని, మరే ఇతర జిల్లాల్లో లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు, ప్రజలు, వ్యాపారులకు 10 రూపాయల నాణేలపై ఉన్న అపోహలు తొలగించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశానని, అక్కడి నుంచి సమాధానం రాగానే వివరణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అంత వరకు లేనిపోని అపోహలు వద్దని అన్నారు. పది రూపాయల నాణేలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదని అన్నారు. భవిష్యత్తులో కూడా రద్దు కావన్నారు. ప్రజలు సందేహాలు, అపోహలకు పోవద్దన్నారు. పది రూపాయల బిళ్లలు తీసుకోకపోతే వారిపై కేసులు పెట్టవచ్చని కలెక్టర్ ప్రకటించిన విషయం విదితమే. -
మాయ!
‘హలో..సార్ మేము కర్ణాటకలోని బల్లారి నుంచి మాట్లాడుతున్నం..మా ఊరి దగ్గర పల్లెటూరిలో పాత ఇల్లు తవ్వకాల్లో ఐదు కిలోల బంగారం దొరికింది..ఇక్కడ అమ్మితే అనుమానం వస్తది..మీకు తక్కువ ధరకే ఇస్తాం..కావాలంటే వచ్చి శాంపిల్ చూసుకోండి..ఆ తరువాతే డబ్బులు తీసుకుని వచ్చి బంగారం తీసుకెళ్లండి’..ఇలా వరుస కాల్స్తో బంగారు మాయలో పడేసి నగదు కాజేసే మోసగాళ్ల ముఠా జిల్లాపై కన్నేసింది. ఒకరు ఇద్దరు కాదు..పదుల సంఖ్యలో వ్యక్తులకు ఫోన్కాల్స్ వస్తున్నాయి. బంగారం తక్కువ ధరకు దొరుకుతుందని అత్యాశకు పోతే మిగిలేది..ఇత్తడి మాత్రమే. – కోరుట్ల జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వెంకటేశ్వర్రావుకు రెండు నెలల క్రితం ఓ వ్యక్తి కర్ణాటకలోని బల్లారి నుంచి మాట్లాడుతున్నామని బంగారం పేరిట మభ్యపెట్టారు. ఫోన్కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి బంగారం తక్కువ ధరకు వస్తోందని నమ్మి కర్ణాటకలోని బల్లారికి వెళ్లి రూ.10 లక్షలు గుర్తుతెలియని అగంతకులకు ఇచ్చి బంగారం బిల్లలు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తరువాత చూసుకుంటే ఆ బిల్లలు ఇత్తడివి అని తేలింది. లబోదిబోమంటూ పోలీసులకు íఫిర్యాదు చేయగా నెల క్రితం పోలీసులు జగిత్యాలలో కర్ణాటకకు చెందిన రవిచంద్ర, శ్రీకాంత్ను అరెస్టు చేశారు. అయినా బంగారం పేరిట మోసాలు ఆగలేదు. ఆరు నెలల క్రితం కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్టకు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఈ విధంగానే రూ.10 లక్షలు మోసపోయాడు. రెండు నెలల క్రితం కోరుట్ల పట్టణంలోని 20 వార్డుకు చెందిన ఓ వ్యక్తి రూ.12 లక్షలకు మోసపోయినట్లు తెలిసింది. మోసపోయినవారు పోలీసులకు íఫిర్యాదు చేయడానికి పరువు తక్కువ వ్యవహారంగా భావిస్తుండటంతో మోసగాళ్లు ఆడిందే ఆటగా సాగుతోంది. ఆగని ఫోన్కాల్స్.. బంగారం పేరిట మాయ చేస్తున్న కర్ణాటక ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు నెల రోజుల క్రితం అరెస్టు చేసినప్పటికీ ఫోన్కాల్స్ ఆగలేదు. ఇదే ముఠాలోని ఇతర సభ్యులు కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి పట్టణాల్లోని వ్యాపారులకు ఫోన్లు చేస్తూ బంగారం పేరిట వల వేస్తున్నారు. ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచుతున్న వ్యాపారులు చివరి వరకు తాము మోసపోయామన్న విషయాన్ని గుర్తించి ఆందోళన చెందుతున్నారు. బంగారం పేరిట మోసగించి దొరికిపోయిన నిందితులను పూర్తిస్థాయిలో విచారిస్తే ఇంకా ఈ ముఠా సభ్యులు ఎంత మంది ఉన్నారో తేల్చే అవకాశముంటుంది.ఈ దిశలో పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటే బంగారం పేరిట వల వేసి మోసగిస్తున్న వారి ఆగడాలకు చెక్ పెట్టవచ్చు. సమాచారం ఇవ్వండి : రాజశేఖర్రాజు, సీఐ కోరుట్ల కర్ణాటకలో బంగారం దొరికింది..తక్కువ ధరకు ఇస్తామని ఫోన్కాల్స్ వస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. ఫోన్కాల్స్ ఆధారంగా మోసగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం. ప్రజలు అత్యాశకు పోకుండా అప్రమత్తంగా ఉండటం అవసరం. -
పత్తి ధర పైపైకి
క్వింటాల్కు రూ.5,350 నాలుగేళ్ల గరిష్ట ధరకు చేరువ పక్క రాష్ట్రాల్లో ధరను చూసి.. పెంచుతున్న జిల్లా వ్యాపారులు ఇప్పటికే 60 శాతం అమ్ముకున్న రైతులు మంచిర్యాల అగ్రికల్చర్ : పత్తి ధరలు రైతులను మరోసారి ఆందోళనలో పడేశాయి. అదునుదాటాక.. ఉన్నది అమ్ముకున్నాక వ్యాపారులు పెద్దఎత్తున ధరలు పెంచుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లు, గింజలకు డిమాండు పెరగడంతోపాటు పక్క మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం జిల్లాపై చూపుతోంది. దీంతో తప్పని పరిస్థితిలో వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. బుధవారం జిల్లాలోని జిన్నింగ్ వ్యాపారులు క్వింటాలకు రూ.5,350 ధరతో కొనుగోలు చేశారు. జిల్లాలో నాలుగేళ్ల క్రితం గరిష్టంగా రూ.5,500 చేరుకున్న ధరలు ఇప్పుడు చేరువులో ఉన్నాయి. జిల్లాలోని రైతులు ఇప్పటికే 60 శాతం పత్తిని అమ్ముకున్నారు. పెరుగుతున్న ధరలు రైతుల కన్న వ్యాపారులకే ఎక్కువగా మేలు చేస్తున్నాయి. ఈసారి 47 వేల హెక్టార్లలో సాగు.. జిల్లాలో ఈ ఏడాది 47 వేల హెక్టార్లలో పత్తి సాగైంది. ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవడంతో మంచి దిగుబడి వచ్చింది. సెప్టెంబర్ నుంచి దిగుబడి వస్తున్న పంటను ఇప్పటికే రైతులు 60 శాతం అమ్ముకున్నారు. రెండేళ్లు అప్పుల పాలైన రైతులు ఈ ఏడాది కురిసిన వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ధరలు పెరుగుతుండటంతో రెండు నెలలుగా దళారులు గ్రామాల్లో తి రుగుతూ మద్దతు ధర రూ.4,160 కంటే ఎక్కువగా రూ. 4,600 నుంచి రూ.4,900 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. రెండేళ్లు నష్టాలు ఎదుర్కొన్న రైతులు ప్రభుత్వ మద్దతు ధర కంటే రూ.450 నుంచి రూ.800 అధికంగా వస్తుండటంతో దళారులకే పత్తిని ముట్టజెప్పారు. పెరుగుతున్న డిమాండ్.. రెండేళ్ల కాలంలో పత్తి క్వింటాల్కు కనిష్టంగా రూ. 3,600, గరిష్టంగా రూ.4,500 ధరలు పలుకాయి. ఈ ఏ డాది ఆరంభంలో వ్యాపారులు గరిష్ట ధర రూ.4,450తో కొనుగోలు ప్రారంభించారు. రెండు నెలల్లో వంద రెండు వందలు పెంచుతూ తగ్గిస్తూ వస్తున్నారు. దీనికి కారణం గత సీజన్ «అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర పెరుగుతుండడమే. అందుకే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు జిల్లాలోకి ప్రవేశించి గ్రామాల్లో జీరో కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిసింది. డిసెంబర్ 2 నుంచి క్వింటాల్కు గరిష్టంగా రూ.5 వేలకు పైగా చెల్లిస్తున్నారు. అమ్మిన రైతులు ఆవేదనకు గురువుతుంటే ఇన్ని రోజులు నిల్వచేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు సున్నా.. రైతులు పండించిన పంటలు నష్టపోకుండా ఉండేందు కు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెల్లబోతోంది. ఒక్కరంటే ఒక్క పత్తి రైతు కూడా ఈ ఏడాది సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లలేదు. జిల్లాలో ఆరు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ పత్తిని కూడా అమ్మలేదు. కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.4,160 నిర్ణయించడం, తేమ, పింజ పొడువు, తదితర నిబంధనలు దగ్గరకు రానివ్వకుండ చేశాయి. దీంతో రైతులంతా ప్రైవేటుగానే విక్రయించా రు. గతేడాది ఇదే సమయానికి లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ.. ఈసారి మాత్రం ఒక్క క్వింటా పత్తిని కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ‘పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోం ది. దీంతో జిల్లాలో జిన్నింగ్ వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. సీసీఐ ఒక్క క్వింటాల్ కూడా కొనలేదు’ అని మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్ తెలిపారు. -
ఐసీఐసీఐ బ్యాంకు ఏం చేసిందంటే...
ముంబై : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు ఒక కొత్త మొబైల్ యాప్ ను మంగళవారం లాంచ్ చేసింది. డిజిటల్ చెల్లింపులకు మద్దతునిస్తూ వ్యాపారుల కోసం 'ఈజీ పే' పేరుతో మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వ్యాపారులు ఎంత మొత్తమైనా డిజిటల్ పద్ధతిలో స్వీకరించవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా క్రెడిట్, డెబిట్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఐసీసీఐ డిజిటల్ వాలెట్ 'పాకెట్' నుంచి చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కరెంట్ అకౌంట్ ఖాతాదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ సేవలను పొందవచ్చు. ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్ ఫోన్లపై ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో ఐఓఎస్ ఫోన్లకు ప్రవేశపెట్టనున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి సర్వీస్ అని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్ విజయవంతంలో తమ బ్యాంకు తీసుకున్న మరో ప్రోత్సాహకర అడుగు అని బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ వ్యాఖ్యానించారు. ఒక వ్యాపారికి సంబంధించి 30 మంది ఉద్యోగులు ఒకేసారి ఈ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలో చెల్లింపులను స్వీకరించవచ్చని చెప్పారు. -
ష్.. గప్చుప్
టపాసుల జీరో దందాకు బ్రేక్ దుకాణాలకు తాళాలు వేసిన వ్యాపారులు రహస్య ప్రాంతాలకు బాణసంచా తరలింపు ‘సాక్షి’ కథనంతో అప్రమత్తం బేరసారాల కోసం ప్రయత్నాలు సాక్షి, జనగామ : జనగామ జిల్లా కేంద్రంగా సాగుతున్న టపాసుల జీరో దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నిన్న మొన్నటి దాకా దర్జాగా విక్రయాలు జరిపి ఇతర ప్రాంతాలకు బాణసంచాను రవాణా చేసిన వ్యాపారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జనావాసాల మధ్య నిర్వహిస్తున్న దుకాణాలకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించి జిల్లా కేంద్రంగా సాగిస్తున్న టపాసుల విక్రయాలపై సోమవారం ‘సాక్షి’లో ‘దర్జాగా దందా’ శీర్షికతో జిల్లా మొదటి పేజీలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తారనే భయంతో టపాసుల విక్రయాలను వ్యాపారులు అర్థంతరంగా నిలిపివేశారు. అలాగే జనగామ, బచ్చన్నపేట, కళ్లెం రోడ్లతోపాటు కుర్మవాడలో ఏర్పాటు చేసిన గోదాంలో నిల్వ ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే టపాసులను గుట్టుచప్పుడు హైదరాబాద్ శివారు, హుస్నాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు తరలించారు. బేరసారాలకు యత్నాలు.. దీపావళి పండుగ సమయంలోనే టపాసులు అధికంగా విక్రయిస్తారు. అయితే ఇప్పుడే అ మ్మకాలను నిలిపివేస్తే దందా దివాలా తీస్తుం దనే భయంతో కొందరు వ్యాపారులు బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యాపారులతోపాటు వారికి అనుబంధంగా పెద్ద, చిన్న 300 మంది వరకు ఉన్నారు. అయితే అధికారులకు నయానో.. భయానో చెల్లించి యధావిధిగా వి క్రయాలు చేసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైన ట పాసుల విక్రయాలకు బ్రేక్ పడడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు. -
నో‘ట మాట’రాని రైతు
మార్కెట్లో పతనమైన టమాట ధరలు రూ.1000నుంచి రూ.100కు పడిన ధర స్థానికంగా భారీగా పెరిగిన సరుకు ధరలు మరింత తగ్గుతాయంటున్నవ్యాపారులు అయోమయంలో రైతులు టమాట ధరలు భారీగా తగ్గి సామాన్య జనానికి ఆనందం కలిగించినా రైతులను మాత్రం నట్టేట ముంచాయి. పది రోజుల క్రితం పలమనేరు టమాట మార్కెట్లో బాక్సు (14కేజీలు) ధర రూ.1000 లకు పైగా పలికి రికార్డు సృష్టించింది. అలాంటిది మంగళవారం స్థానిక మార్కెట్లో బాక్సు రూ.100 కు పడిపోయింది. స్థానికంగా సరకు పెరిగిపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పలమనేరు: మదనపల్లె మార్కెట్ తర్వాత టమాటకు పలమనేరు మార్కెట్ పెద్దది. ఇక్కడికి సరాసరిన రోజుకు 30 లోడ్ల టమాటాలు వస్తాయి. అలాంటిది ప్రస్తుతం 40కి పైగా లోడ్లు వస్తున్నాయి. సరకు ఎక్కువ కావడంతో స్థానిక మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. అటు అనంతపూర్ జిల్లాలో, ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ టమాట దిగుబడులు పెరిగాయి. దీంతో అక్కడి మార్కెట్లలో లోకల్ సరకు సరిపోయేంతగా వస్తోంది. దీంతో స్థానిక మార్కెట్నుంచి సరకును కొనేందుకు బయటి వ్యాపారులు ఆసక్తిని చూపడం లేదు. ఫలితంగా లోకల్ వ్యాపారులు మాత్రమే ఇక్కడి సరకును కొనాల్సిరావడంతో ధరలు అమాంతం పడిపోయినట్టు తెలుస్తోంది. గత నెలలో భారీగా ధరలు పలకడంతో స్థానిక రైతులు ధరలు ఇలాగే ఉంటాయనే ఆశతో భారీగానే టమాట సాగుచేశారు. ప్రస్తుతం 80శాతం తోటలు కోతదశలో ఉన్నాయి. ఇలా సరకు విపరీతం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టేందుకు ఓ కారణమైంది. పంట పెట్టుబడి కూడా అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరా పొలంలో పంట సాగుచేయాలంటే రూ.50వేలు అవుతోంది. ఇలాంటి తరుణంలో బాక్సు రూ.200 పలికితేగానీ పంటకు పట్టిన పెట్టుబడి మిగిలేలా లేదు. ధరలు ఇలాగే మరింత తగ్గుముఖం పడితే రైతుకు తీరని నష్టం తప్పేలా లేదు. టమాట పంటను సాగుచేస్తున్నా కోత ఇప్పుడే ప్రారంభమైంది. మంగళవారం 60 బాక్సులు మార్కెట్కు తీసుకెళ్ళా. బాక్సు ధర రూ.110 దాకా పలికింది. ఎప్పుడు ధరలుంటాయో అర్థం కాని పరిస్థితి. అంతా లాటరీగా మారింది. రైతులంతా ఒకేసారి టమోటాను సాగుచేయడంతో సప్లయ్ పెరిగి అడిగే వారు లేకుండా పోతున్నారు. -వెంకటమునిరెడ్డి, నక్కపల్లె మార్కెట్కు అనుగుణంగా టమోటాను సాగుచేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో పంటసాగుకు ఖర్చులు పెరిగిపోయాయి. సప్లయ్ భారీగా ఉంది. ఇలాంటి పరిస్థితులో ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలి. ధరలు ఉన్నాయని ఒకే పంటను సాగుచేస్తే సప్లయి పెరిగి డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి మార్కెట్ అనుకూలిత వ్యవసాయం చేయాలి. అప్పుడే రైతులు ఆర్థికంగా గిట్టుబాటుఅవుతుంది. -లక్ష్మీప్రసన్న, హెచ్వో, పలమనేరు డివిజన్ -
పల్లెల్లో ఉచిత యుధ్దాలు
జుత్తాడలో ఇసుక లారీలను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు మూడు ట్రాక్టర్లు..ఆరు లారీలుగా వెలిగిపోతున్న వ్యాపారులు చోడవరం: ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం గ్రామాల్లో చిచ్చురేపుతోం ది. జిల్లాలో ప్రధాన నదులు, పెద్ద ఎత్తున తవ్వకాలతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు ఇప్పుడు ఇసుక యుద్ధాలతో అట్టుడుకుతున్నాయి. పెట్టుబడి లేకుండా కొందరికి రూ.లక్షలు ఆదా యం సమకూర్చిన ఈ వ్యాపారం జనాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రభుత్వం రోజుకో పాలసీతో వర్గ విబేధాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వరీచ్లు, ఆలైన్ అమ్మకాలన్నారు. ఇప్పుడేమో ఉచిత ఇసుక పాలసీ అధికారులను సైతం కలవరపెడుతోంది. పెద్దేరు, శారదా నదులను అనుసంధానం చేస్తూ చోడవ రం మండలం గౌరీపట్నం, జత్తా డ, లక్కవరంల్లో ఉచిత ఇసుక తవ్వకాలకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆన్లైన్లో ఇసుక అమ్మకాలప్పుడే జుత్తాడ, గౌరీపట్నంలలో అనేక గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు గ్రామాల్లో సర్పం చ్లు, గ్రామస్తులు వేర్వేరుగా మామూళ్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉచిత ఇసుక పాలసీతో ఈ గొడవలు మరింత ముదిరాయి. ఇదీ పరిస్థితి ఆన్లైన్లో ఇసుక అమ్మకంతో తమకు రావలసిన కమీషన్ ఇప్పటికీ రాలేదంటూ జుత్తాడ డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పొలిమేర వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ర్యాంప్ నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీలను అడ్డుకుని ధర్నా చేశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పినా వినలేదు. తమకు రావలసిన పావలా వాటా కమీషన్ మొత్తం తమ సంఘాల ఖాతాల్లో జమచేసే వరకు ఇసుక తవ్వకాలు చేపట్టనీయమంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ వివాదం తారాస్థాయి చేరడంతో స్థానిక అధికార పార్టీ నాయకులను సైతం నిలదీశారు. మహిళా పోలీసులను రంగంలోకి దింపినప్పటికీ సాయంత్రానికి కూడా ఇక్కడ పరిస్థితి సద్దుమణగలేదు. గౌరీపట్నంలో లారీలు నేరుగా నదిలోకి వచ్చి ఇసుకను తవ్వేస్తుండడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే లోతుగా తవ్వకాలతో భూగర్భ లాలు ఇంకిపోయి గ్రామంలో బోర్లు నుంచి నీరు రావడం లేదని, నదిలో ఇసుక కూడా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ యజమానులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటచేసుకుంది. లక్కవరం రీచ్కు కె.కోటపాడు మండలం మల్లంపేట నుంచి నేరుగా దారి ఉండటంతో అటుగా ఇసుక తవ్వకాలు జోరందుకున్నాయి. గ్రోయిన్కు సమీపంలోతవ్వకాలను రైతులు అడ్డుకోవడంతో ఇక్కడ వివాదం చోటుచేసుకుంది. ఇలా గ్రామాలన్నీ ఇసుక కుమ్ములాటలతో రచ్చరచ్చగా ఉన్నాయి. అధికారులకూ తలనొప్పి... అధికారులకూ ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. కొత్త పాలసీలో కేటాయించిన రీచ్ల్లో ఇళ్లకు, ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక తవ్వుకోవచ్చని, ప్రభుత్వ నిర్మాణాలకు అధికారుల అనుమతి పత్రం ఉండాలనే నిబంధన ఉంది. గుర్తింపు రీచ్ల పర్యవేక్షణకు ఒక్కో అధికారిక బృందాన్ని నియమించారు. సాయంత్రం 5 గంటల వరకే తవ్వకాలు చేపట్టాలని, సెలువు దినాల్లో చేయకూడదని కొత్త జీవోలో పేర్కొన్నారు. కానీ ఆదివారం కూడా ఈ రీచ్లలో యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీ ఇళ్లనిర్మాణానికే అని చెబుతుండటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా ఇసుక వ్యాపారులు మూడుట్రాక్టర్లు, ఆరు లారీలుగా వెలిగిపోతున్నారు. కమీషన్ పైసా ఇవ్వలేదు మా జుత్తాడ ఇసుక ర్యాంప్ నుంచి అధికారికంగా 20వేల క్యుబిక్మీటర్లకు పైగా ఇసుక తవ్వారు. వెలుగు అధికారుల పర్యవేక్షణలో రసీదులు ఇచ్చాం. ఇందుకు పావలా వాటా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం చెప్పింది. పైసా కూడా జమకాలేదు. ఇప్పుడు ఉచిత ఇసుక అంటూ ఇష్టమొచ్చినట్టు తవ్వేసి పట్టుకుపోతున్నారు. అందుకే అడ్డుకున్నాం.అధికారులు,ఎమ్మెల్యేను నిలదీస్తాం. -బుద్ద తులసి, దుర్గాభవానీ డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు,జుత్తాడ. రూ. 25 లక్షలు ఇవ్వాలి డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.25లక్షలు వరకు జమ కావాల్సి ఉంది. అధికారికంగా ఇసుక రీచ్లు నిర్వహించినప్పుడు 33 సంఘాల్లోని 450 మంది ఎంతో కష్టపడ్డాం. మాకు ఆ డబ్బులు జమచేయకుండానే ఇప్పుడు ఉచిత ఇసుక అంటూ ఇష్టమొచ్చినట్టు తవ్వేసి పట్టుకుపోతున్నారు. మాకు రావలసిన డబ్బులు జమచేసేవరకు ఇక్కడ నుంచి ఒక్క లారీ ఇసుక కూడా తీసుకెళ్లనీయం. -రమాదేవి, డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు, జుత్తాడ. -
ఆన్లైన్లో లోకల్ మార్కెట్
ఇప్పుడు యువకుల నుంచి పెద్దల వరకూ నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ వైపు చూస్తున్నారు. సెల్ చార్జర్ నుంచి కంప్యూటర్ వరకు ప్రతి వస్తువునూ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఉండడం సహజం. అరుుతే స్థానికంగా ఉండే వ్యాపారాలను కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే way2bazar. జిల్లాలోని ప్రధాన నగరాల్లో షాపులను కూడా ఆన్లైన్ మార్కెటింగ్ పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో పందలపాకకు చెందిన పడాల మురళీవెంకటకృష్ణారెడ్డి వెబ్సైట్కు రూపకల్పన చేశారు. ఎం.ఫార్మసీ, ఎంబీఏ చదివిన వెంకటకృష్ణారెడ్డి తన మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ మార్కెటింగ్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. - పందలపాక (బిక్కవోలు) * ఆకట్టుకుంటున్న way2bazar వెబ్సైట్ * రూపొందించిన వెంకటకృష్ణారెడ్డి * ఆదరణ బాగుందంటున్న వ్యాపారులు స్థానిక ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేస్తారంటే.. ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ప్రధాన పట్టణాల్లో షాపులను way2bazarలో నమోదు చేస్తారు. నమోదైన షాపులు స్థానికంగా మార్కెటింగ్ చేసే వస్తువులపై వారు ఇచ్చే డిస్కౌంట్లను, షాపులో లభ్యమయ్యే వస్తువుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈ సైట్ చూసే వారికి ఏ షాపులో ఏ వస్తువులు లభిస్తాయి, ఎంత రిబేటు లభిస్తుంది తదితర వివరాలు తెలుస్తాయి. ఈ సైట్లో లాగిన్ అయిన వారికి ఒక కూపన్ కూడా ఇస్తారు. ఈ కూపన్ తీసుకు వెళ్తే అదనంగా షాపు వారు రిబేట్ ఇస్తారు. ఇప్పుడు జిల్లాలో ఈ వెబ్సైట్కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పోటీ కారణంగా దెబ్బతింటున్న స్థానిక వ్యాపారాలను నిలబెట్టేందుకు ఈ తరహా వెబ్సైట్ను ప్రారంభించినట్లు వెంకటకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలలో ఈ వెబ్సైట్ను విశాఖపట్నంలో కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారం పెరిగింది.. ఈ వెబ్సైట్ లో రిజిస్టరయ్యాను. వెబ్సైట్ చూసి షాపునకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సంక్రాంతికి వ్యాపారం బాగా సాగింది. - మహేష్, సోనా షాపింగ్మాల్, కాకినాడ స్థానిక వ్యాపారులకు మంచి అవకాశం.. స్థానిక వ్యాపారులకు ఈ వెబ్సైట్ చక్కటి అవకాశం. ఇప్పుడందరూ ఇంటర్నెట్ ఎక్కువగా చూస్తున్నారు. ఈ వెబ్సైట్ చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. - శివ, ఫ్యాషన్మాల్, రాజమండ్రి త్వరలో శాఖల విస్తరణ స్థానిక వ్యాపారాలకు వెబ్సైట్ ప్రారంభించాలన్న ఆలోచననే ఆచరణలో పెట్టాను. వ్యాపారులతో పాటు ప్రజల నుంచీ ఆదరణ లభిస్తోంది. త్వరలో శాఖలు విస్తరిస్తా. - పడాల మురళీవెంకటకృష్ణారెడ్డి, వెబ్సైట్ రూపకర్త -
చిరు వ్యాపారులకు వరం.. ముద్ర రుణం
ఆర్థిక భరోసా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం అందిపుచ్చుకుంటే వ్యాపార ప్రగతికి అవకాశం గురజాల : ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అప్పులు చేయడం.. ఆనక అధిక వడ్డీలు చెల్లించలేక అష్టకష్టాలు పడటం.. ఈ పరిస్థితి నిరుపేదల బతుకుల్లో షరా మామూలే. చిరు వ్యాపారులకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా వారికి ఆర్థిక అండనిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర రుణపథకం. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది ఏప్రిల్ 8న ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం ద్వారా చిన్న వ్యాపార కార్యకలాపాలకు అంటే తయారీ, సేవా రంగాలకు రుణా లు అందిస్తారు. దీనిని అందిపుచ్చుకొని తమ వ్యాపార విస్తర ణ చేసుకునే అవకాశం ఉంది. అన్ని జాతీయ బ్యాంకుల్లో ఈ పథకం కింద రుణం పొందొచ్చు. నిరంతర ప్రక్రియ.. పీఎంఎంవై పథకానికి ఒక గడువు లేదు. చేసే వ్యాపారంపై సంపూర్ణ అవగాహన, ఆర్జించే మొత్తం అంచనాలతో దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే బ్యాంకర్లు పరిశీలించి, రుణ ఎగవేతదారుడు కానట్లయితే రుణం మంజూరు చేస్తారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులైన వారందరికీ రుణాలు అందిస్తారు. మూడు దశల్లో రుణం... చిన్న వ్యాపార కార్యకలాపాలు, తయారీ, సేవారంగం, చిరు వ్యాపారులు, వాణిజ్య రంగాలకు రుణాలు అందివ్వడమే ముద్ర బ్యాంకు లక్ష్యం. ఇందులో మూడు రకాల రుణ పరిమితులు ఉన్నాయి. అర్హులు వీరే.. ఈ పథకం ఎలాంటి వాహన కొనుగోళ్లకు వర్తించదు. వ్యాపారం అంటే కొని అమ్మితే కూడా ఈ రుణాలు ఇవ్వరు. సేవా రంగం అంటే బ్యూటీపార్లర్, హోటల్, ఇంటర్నెట్, టెంట్హౌస్, చేతివృత్తులు, కళాకారులు, రిఫ్రిజిరేటర్ ఏసీ, టీవీ, సెల్ఫోన్ మరమ్మతులు, ఆయా రంగాల్లో ప్రగతికి రుణలిస్తారు. ఉత్పాదక రంగం అంటే ముడిసరుకులు కొనుగోలు చేసి వస్తువులను ఉత్తత్తి చేయడం, కర్రలతో వస్తువులు, టైలరింగ్, వెల్డింగ్, ఫొటోస్టూడియో, ఆహార పదార్థాల తయారీ, ఉత్పత్తి, ప్లాస్టిక్ విస్తర్లు, టీ-కప్పులు తయారీవంటివి ఇందులోకి వస్తాయి. గేదెలు, గొర్రెలు పెంపకం, డెయిరీ ఇవి ఈ పథకం కిందకు రావు, వీటికి వ్యవసాయ రంగం ప్రత్యేక రుణాలు ఇస్తుంది. కిశోర విభాగం రూ.50వేలు పైబడి రూ.5 లక్షల వరకు రుణం లభిస్తుంది. అప్పటికే వ్యాపారాలు ప్రారంభించిన వారు విస్తరణ దిశగా అడుగులు వేసేందు కు ఈ మెత్తాన్ని అందిస్తారు. వీటిలో క్షౌరశాల(మంగళి షాపు), బ్యూటీ పార్లర్, ఆటో, ట్రక్కులు తదితర స్థి ర వ్యాపారాలకు రుణం అందిస్తారు. తరుణ్ విభాగం రూ.5 లక్షలు పైబడి రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది. వీటిని ఇప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించి అందులో చక్కటి ప్రతిభ కనబర్చిన వారికి, గతంలో నిర్వహించిన వ్యా పార నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ మెత్తాన్ని అందిస్తా రు. మెదటి ప్రాధాన్యం కింద మం జూరు చేసే శిశు విభాగం రుణాల విషయంలో హామీ అవసరం లేదు. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు..రాయితీ వుండదు. రుణవడ్డీ రేటు నెలకు ఒక్క శాతం. శిశు విభాగం ఇందులో రూ. 50వేల వరకు రుణం లభిస్తుంది. ఇవి చిన్న వ్యాపారులు, తొలిసారి వ్యాపార రంగంలో అడుగుపెడుతున్న వారికి వర్తిస్తుంది. దీని కింద వీధి వర్తకులు, తోపుడబండ్లు వస్తాయి. వీరికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు రుణాన్ని అందిస్తారు. దరఖాస్తు చేయడం ఇలా... = రుణ అవసరం గల ఖాతాదారులు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో అడిగిన సమాచారాన్ని క్లుప్తంగా వివరించాలి. = దాదాపుగా అన్ని జాతీయ బ్యాంకుల్లో ముద్ర దరఖాస్తులు లభ్యమవుతాయి. = గుర్తింపు కోసం ఓటరుకార్డు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్కార్డు, ఆధార్కార్డు, పాస్పోర్టు తదితర కార్డుల్లో ఏదైన ఒకటి లేదా రెండు జిరాక్స్లు సమర్పించాలి. = నివాస గుర్తింపు కోసం ఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తిపన్ను రశీదు, బ్యాంకు పాస్ పుస్తకం, వీటిలో ఏదైన ఒకటి జిరాక్స్ పత్రాన్ని జతపర్చాలి. = ప్రస్తుతం దిగిన రెండు పాసుపోర్టు సైజు ఫొటోలు = వ్యాపారానికి కావాల్సిన కోటేషన్(నివేదిక) తప్పనిసరిగా వుండాలి. = ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ కుల ద్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. = బ్యాంకు పుస్తకం జిరాక్సును దరఖాస్తు పత్రానికి జతచేయాలి. -
పత్తి రైతు చిత్తు!
తేమశాతం ఉందంటూ వెనక్కు పంపుతున్న సీసీఐ పదిరోజులైనా కేజీ పత్తి కొన ని వైనం బయట మార్కెట్లో రేటు తగ్గించిన వ్యాపారులు వారంలో రూ.300 తగ్గిన పత్తి ధర ఆందోళనలో అన్నదాతలు పత్తి రేటు పడిపోతోంది. వారం కిందట క్విటా రూ.3,800 పలికిన పత్తి ధర ఇప్పుడు రూ.300 తగ్గింది. సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. బయ్యర్లు ముందు రాకపోవడం, వచ్చినా తేమ శాతం తగ్గిందనే సాకు చూపి కొనుగోలు చేయకపోవడంతో రైతులు వెనుతిరుగుతున్నారు. ఇప్పుడు దళారులు ప్రవేశించి అయినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు నష్టపోతున్నా వ్యవసాయ శాఖామంత్రి స్పందించకపోవడంపై విమర్మలు వినిపిస్తున్నాయి. నరసరావుపేటరూరల్ నరసరావుపేట వ్వవసాయ మార్కెట్ యార్డులో ఈనెల 3వ తేదీన సీసీఐ పత్తి కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బయ్యర్లకు మిల్లులు కేటాయించకపోవడంతో రెండ్రోజుల తర్వాత కోనుగోలు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత పలు గ్రామాల నుంచి రైతులు తీసుకువచ్చిన పత్తిని పరిశీలించిన బయ్యర్లు తేమశాతం ఎక్కువుగా ఉందంటూ వెనక్కు పంపారు. గిట్టుబాటు ధర వస్తుందని ఆశతో వచ్చిన రైతులకు నిరాశతో వెనుతిరిగారు. ఏఏ రోజుల్లో కేంద్రానికి రానున్నామో బయ్యర్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. అసలు వస్తారో, రారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఒక్క కేజీ పత్తి కూడా ఈ కేంద్రంలో కొనుగోలు జరగలేదు. దీంతో ఈ సీజన్లో పత్తితో నిండి ఉండాల్సిన మార్కెట్ బోసిపోయి కనిపిస్తోంది. తగ్గిన ధరలు.. వారం క్రితం వరకు పత్తి వ్యాపారులు గ్రామాల్లో క్వింటా రూ.3,800 వరకు కొనుగోలు చేశారు. తేమశాతం పేరుతో మార్కెట్ యార్డులో బయ్యర్లు పత్తిని వెనక్కు పంపడంతో గ్రామాల్లో వ్యాపారులు రేటు తగ్గించారు. ప్రస్తుతం గ్రామాల్లో క్వింటా రూ.3,500 నుంచి రూ.3,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు కూడా రావని ఆందోళనలో ఉన్న అన్నదాతలకు గిట్టుబాటు ధర లేకపోవడం భారంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పప్పు...నిప్పు!
భగ్గుమంటున్న పప్పుల ధరలు మండుతున్న వంటనూనెలు పండుగ గిరాకీపై వ్యాపారుల కన్ను కృత్రిమ కొరతకు పక్కాగా ఎత్తులు సిటీబ్యూరో: మహా నగరంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ గిరాకీని సొమ్ము చేసుకొనేందుకు వ్యాపారులు పక్కాగా పావులు కదిపారు. కొన్ని రకాల నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచేసి... మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా ధరలు పెంచేందుకు ఎత్తులు వేశారు. దీనికి రిటైల్ వ్యాపారుల అత్యాశ తోడవ్వడంతో ధరలు అదుపు తప్పాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల బతుకులు భారంగా మారాయి. ఏం తినాలో... దసరా పండుగకు పిండివంటలు కాదు కదా... కనీసం పప్పన్నం తినే అదృష్టం కూడా లేద ంటూ నిరుపేదలు పెదవి విరుస్తున్నారు. గడచిన 10 రోజులుగా మినపపప్పు, కందిపప్పు ధరలు పోటీపడి పెరుగుతుండడం ప్రజలను కలవర పెడుతోంది. సోమవారం ఉదయం కేజీ రూ.180 ఉన్న కందిపప్పు ధర సాయంత్రానికి రూ.185కు ఎగబాకింది. నగర మార్కెట్లో కందిపప్పుకు కొరత ఎదురైందని చెబుతూ రిటైల్ వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే వివిధ రకాల పప్పులు, వంట నూనెలు, పంచదార, బెల్లం, బియ్యం ధరలు కేజీకి రూ.8-30 వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.46 వెచ్చించనిదే కిలో ఫైన్ రకం బియ్యం లభించట్లేదు. గత నెలలో సోనా మసూరి బియ్యం క్వింటాల్ ధర రూ.3,800 ఉండగా... ఇప్పుడు రూ.4,500కు చేరింది. కొందరు రిటైల్ వ్యాపారులు బెస్ట్ క్వాలిటీ పేరుతో ఇదే బియ్యాన్ని క్వింటాల్కు రూ.4,600 వసూలు చేస్తున్నారు. నూనెలూ అంతే... ఇక వంట నూనెల ధరలైతే మంట పుట్టిస్తున్నాయి. అన్ని రకాల నూనెల ధరలు రూ.5-8 వరకు పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో పల్లీ నూనె ధర లీటర్ రూ.100కు చేరింది. అదే రిటైల్ మార్కెట్లో లీటర్కు రూ.105-107 వసూలు చేస్తున్నారు. పామాయిల్ ధర కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆయిల్ పంట, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండటం కూడా ఈ పరిస్థితి కారణంగా కనిపిపిస్తోంది. కొన్నిరకాల సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటుండటంతో వ్యాపారులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నెల బడ్జెట్లో అధికభాగం బియ్యం, వంటనూనె, పప్పులకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. గోదాముల్లో సరుకు పండుగ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు వేసిన ఎత్తులు వినియోగదారుల జేబుకు కన్నం పెడుతున్నాయి. వంట నూనె, వివిధ రకాల పప్పుల దిగుమతికి రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని చెబుతూ ధరలకు పురిపెట్టారు. పప్పులు, వంటనూనె, కొబ్బరి, మసాలాలు వంటివాటిని గోదాములకు తరలించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ధర పెరుగుదలకు బాటలు వేశారు. నగరంలోని మెహబూబ్ మేన్షన్, సిద్ధిఅంబర్ బజార్, బేగం బజార్, ముక్తియార్గంజి వంటి హోల్సేల్ మార్కెట్లలో వ్యాపారులు నిత్యావసర వస్తువులను గోదాములలో దాచి పెట్టినట్లు సోమవారం గుప్పుమంది. వీటిని పండుగకు మూడు నాలుగు రోజుల ముందు మార్కెట్లోకి విడుదల చేసి లాభాలు ఆర్జించేందుకు ఎత్తులు వేశారని తెలుస్తోంది. అక్రమ వ్యాపారులను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. -
వ్యాపారులూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి!
ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి న్యూఢిల్లీ: మరింత మందిని పన్ను పరిధిలోనికి తెచ్చే వ్యూహాంలో భాగంగా ఆదాయపు పన్ను విభాగం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోనిరి కొత్తగా కోటిమందిని తీసుకురావాలని ఐటీ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం ట్రేడర్లు, వ్యాపారులు వార్షిక రిటర్న్లు కాకుండా ముందస్తుగా పన్నులు చెల్లించాలని, ఇలా చేయడం వల్ల వారిని అసెస్సీలుగా పరిగణిస్తామని, తమ లక్ష్యం కూడా నెరవేరే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదాయపు పన్ను సంబంధిత అపోహలను తొలగించడానికి పరిశ్రమ, వాణిజ్యవేత్తలతో సీదా సంవాద్(నేరుగా సంభాషణ) కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కు మించి పన్ను బాధ్యత ఉండే ప్రతీ వ్యక్తి మందస్తుగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. -
రంగురాళ్ల క్వారీలపై కన్ను!
- తవ్వకందారులకు అనుకూలిస్తున్న వర్షాలు - సాలికమల్లవరం క్వారీపై వ్యాపారుల దృష్టి - అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు - బేస్ క్యాంపులు ఏర్పాటు గొలుగొండ: రంగురాళ్ల తవ్వకాలు అడపాదడపా జరుగుతున్నాయి. కరక, పప్పుశెట్టిపాలెం, సాలికమల్లవరం ప్రాంతాల్లో సుమారు 30కి పైగా రంగురాళ్ల క్వారీలు ఉన్నాయి. వీటిలో రెండేళ్లుగా నిలిచిపోయిన అక్రమతవ్వకాలు మళ్లీ అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలం కావడంతో తవ్వకందారులు మళ్లీ రంగురాళ్ల క్వారీలపై దృష్టి సారించారు. కరక ప్రాంతంలో కాపలా పటిష్టంగా ఉన్నందున తవ్వకందారుల కళ్లు సాలిక మల్లవరంపై పడింది. పప్పుశెట్టిపాలెంలో కూడా తవ్వకాలు ఊపందుకున్నాయి. రెండు రోజులక్రితం వరకు ప్రశాంతంగా ఉన్న సాలిక మల్లవరం క్వారీపై తవ్వకందారులు దృష్టి సారించడం అటవీ, పోలీసు అధికారులకు తలనొప్పిగా మారింది. తవ్వకాలకు పాల్పడిన, సహకరించిన వ్యాపారులపై వారు నిఘా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలం కావడంతోతవ్వకాలను కొంతమంది వ్యాపారులు ప్రోత్సహిస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ ప్రాంతంలో తవ్వకందారులతోపాటు వ్యాపారులను ఎస్ఐ జోగారావు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మళ్లీ తవ్వకాలపై అక్రమార్కుల దృష్టి మరలడంతో అటవీ, పోలీసు అధికారులు దృష్టి సారించారు. దీనిపై అటవీశాఖ నర్సీపట్నం రేంజర్ మస్తాన్వల్లీని వివరణ కోరగా కరక, దోనిపాలెం,సాలికమల్లవరం ప్రాంతాల్లో తవ్వకాలు నిరోధించేందుకు బేస్ క్యాంప్లు ఏర్పాటుచేశామని తెలిపారు. తవ్వకాలను ప్రోత్సహించిన వారిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. వర్షాకాలంలో తవ్వకాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ మూడు నెలలు మొబైల్ పార్టీలు ఏర్పాటుచేస్తున్నామని ఆయన వివరించారు. -
కొందామా.. వద్దా!
ప్రొద్దుటూరు కల్చరల్ : ఏదైనా వస్తువు ధర తగ్గిందంటే ప్రజలు కొనడానికి క్యూ కడతారు. అయితే బంగారం విషయంలో మాత్రం విచి త్రమైన పరిస్థితి నెలకొంది. రెండు వారాలుగా పుత్తడి ధరలు పతనమవుతున్నా కొనేవాళ్లు మాత్రం ముందుకు రావ డం లేదు. వీటి ధరలు మరింత తగ్గుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారని ఇక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన బంగారం ధరలు దిగివస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2545, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2352, వెండి కిలో రూ.34300గా ఉంది. అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆశించిన రీతిలో కొనుగోళ్లు లేవని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత ధర తగ్గితే తాము భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది దాదాపు 2 నుంచి 3 వేలకు పైగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర 2010- 2011 మధ్య కాలంలో అత్యధికంగా దాదాపు రూ.7,900దాకా పెరిగింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.2660 ఉండగా జూన్ 1వ తేదీన రూ.2778, జూలై 1వ తేదీన రూ.2665 పలికి.. 11 రోజులుగా తగ్గుతూ వస్తోంది. ఈ నెల 13న 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.26350, 22 క్యారెట్ల ధర రూ.24,450, వెండి కిలో రూ.35700 పలికిన ధర 14వ తేదీన రూ.26330, రూ.24420, రూ.35500లకు చేరుకుంది. 24వ తేదీన 10 గ్రాములు బంగారం 24 క్యారెట్ల ధర రూ. 25200, 22 క్యారెట్లు రూ. 23240, వెండి రూ.34200 ఉంది. ధరలు మరింత తగ్గుతాయని మీడియాలో కథనాలు వస్తుండటంతో కొనుగోలుకు ముందుకు ఎవరూ రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. అయితే మరింతగా ధర తగ్గే అవకాశాలు తక్కువని, కొనుగోలుకు ఇదే మంచి తరుణమని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని ప్యూరిటి తక్కువ గల ఆభరణాలను కొనకుండా బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ హోల్ మార్కు ఉన్న వాటినే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కొనేందుకు మంచి అవకాశం : బుశెట్టి రామ్మెహన్ రావు, బులియన్ మార్కెట్ అసోసియేషన్ మెంబర్ అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బాగా తగ్గాయి. పుత్తడి కొనేందుకు ఇది మంచి తరుణం. మరింత తగ్గుతుందా.. లేదా అనేది చెప్పలేం. మార్కెట్ను అంచనా వేయలేం : నిదీష్, రితి జ్యువెలర్స్ షోరూం మేనేజరు మార్కెట్ను అంచనా వేయలేము. బంగారం నిల్వలను విక్రయిస్తుండటం, పుత్తడిపై పెట్టుబడులను విరమించుకుంటుండటంతో ధరలు తగ్గుతున్నాయి. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ధరల తగ్గుదల, పెరుగుదలపై కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. హాల్ మార్కుగల ఆభరణాలను కొనాలి : వెంకటేష్, మార్కెటింగ్ మేనేజర్ బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ 916 హోల్ మార్కు (బిస్) గల ఆభరణాలను మాత్రమే కొనాలి. తక్కువ ప్యూరిటి గల ఆభరణాలను కొని నష్టపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 2004 రూ.5850 2005 రూ.7000 2006 రూ.8400 2007 రూ.10,800 2008 రూ.12500 2009 రూ.14500 2010 రూ.18500 2011 రూ.26400 2012 రూ.29500 2013 రూ.31200 2014 రూ.27800 -
వార సంతలకు ‘మావోల’ బ్రేక్!
సంతలకు రావొద్దని వ్యాపారులకు హెచ్చరిక దుమ్ముగూడెం: తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలో నిర్వహిస్తున్న వార సంతలను ఆపివేయాలని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని అటవీ ప్రాంతంలోగల గొల్లపల్లి, కిష్టారం పోలీస్స్టేషన్ పరిధి దండకారణ్యంలో నిర్వహిస్తున్న ఈ సంతల్లోకి వ్యాపారులు అడుగుపెట్టొద్దంటూ హెచ్చరించారు. దీంతోపాటు అటవీ ప్రాంతంలోని రహదారులను దిగ్బంధించడానికి వెయ్యి మంది మిలీషియా సభ్యులను రంగంలోకి దింపి కందకాలు తవ్వడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు సమాచారం. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పోలీసు బలగాలను దింపడంతోపాటు బేస్ క్యాంపుల ఏర్పాటు చేస్తోంది. జనవరిలో సరిహ ద్దులో ఉన్న ధర్మపేటలో బేస్క్యాంపు ఏర్పాటు చేసిన పోలీసులు తర్వాత గొల్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఎలకనగూడ వద్ద మరో బేస్ క్యాంపు ఏర్పాటుచేసి ముందడుగు వేశారు. మావోలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందిస్తున్నారనే నెపంతో వారిని సంతలకు రావద్దని బుధవారం సాయంత్రం హెచ్చరించినట్లు తెలిసింది. ధర్మపేట, గొల్లపల్లి, కిష్టారం, ఎలకనగూడ, బూరుగులంక సంతలను పూర్తిగా నిలిపివేయాలని హెచ్చరిస్తూ కొందరు వ్యాపారుల వద్ద ఉన్న సరుకులను మావోలు గ్రామాల్లో దింపినట్లు తెలిసింది. దండకారణ్యంలోని ఖనిజ సంపదను, వన సంపదను లూటీ చేయడానికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బేస్క్యాంపులు ఏర్పాటుచేసి దమనకాండ సృష్టించడానికి ప్రయత్నిస్తోందని సీపీఐ(మావోయిస్టు) కిష్టారం ఏరియా పేరుతో లేఖ విడుదల చేశారు. -
రైతుల పొట్టకొడుతున్నారు
- పొగాకు బోర్డు చైర్మన్ - వ్యాపారుల మధ్య పోరులో అన్నదాతలు నలిగిపోతున్నారు - వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఒంగోలు టౌన్ : పొగాకు బోర్డు చైర్మన్, వ్యాపారుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతూ నష్టపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయని విమర్శించారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది వేలం ప్రారంభమై నాలుగు నెలలైనా ఇప్పటివరకు కేవలం 46 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. గత ఏడాది ఈ సమయానికి పొగాకు కొనుగోళ్లు పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన తరువాత వ్యాపారులు పొగాకు ధరలను మరింత తగ్గించేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులకు పోటీగా పొగాకు బోర్డును కొనుగోలు రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై నాలుగు నెలలైనా సగటు ధర కిలో 106 రూపాయలు మాత్రమే వచ్చిందన్నారు. రైతులు వేలం కేంద్రాలకు తీసుకువస్తున్న పొగాకులో 30 నుంచి 40 శాతం నోబిడ్ పేరుతో వ్యాపారులు వెనక్కు పంపుతున్నారన్నారు. ఈ నెల 4వ తేదీ విజయవాడలో కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు రాయబారం వెళుతున్నామని, పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కావాలని ఆయన కోరారు. రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీ హనుమారెడ్డి, రైతు కూలీ సంఘ జిల్లా నాయకురాలు ఎస్.లలితకుమారి, పొగాకు బోర్డు మాజీ సభ్యుడు మారెళ్ల బంగారుబాబు, కిసాన్మోర్చా రాష్ట్ర కార్యదర్శి రావి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘ నాయకులు కృష్ణారావు, పి.కోటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ మండవ శ్రీనివాసరావు, కౌలు రైతుల సంఘ నాయకుడు పెంట్యాల హనుమంతరావు, రైతు సంఘ నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీనివాసరావు, అయినాబత్తిన బ్రహ్మయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
పొగాకు రైతుల రాస్తారోకో
గిట్టుబాటు ధరల కోసం ఆందోళన నాయకులు, వ్యాపారుల కుమ్మక్కుపై విమర్శలు కొండపి : గిట్టుబాటు ధర లేదని పొగాకు రైతులు శనివారం రాస్తారోకో చేశారు. వ్యాపారులు ధరలు దిగకోసి పొగాకు కొంటున్నా రైతు నాయకులు వ్యాపారులకు వంత పలకడంపై ఆగ్రహం చెందారు. వేలం కేంద్రం అధికారి సైతం చోద్యం చూడటం తప్ప వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి రైతుల పక్షం వహించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ పొగాకు రైతులు కొండపి పొగాకు వేలంకేంద్రంలో వేలాన్ని అడ్డుకున్నారు. గిట్టుబాటు ధరల కోసం రెండు గంటలకు పైగా శనివారం రాస్తారోకో నిర్వహించారు. వివరాలు .. వేలంకేంద్రం పరిధిలోని నరసరాజుపాలెం, పీరాపురం గ్రామానికి చెందిన రైతులు 336 బేళ్లను వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. కేంద్రం అధికారి మురళీధర్ వేలాన్ని ప్రారంభించారు. రెండు లైన్లు కొనుగోలు చేసిన తరువాత మూడవ లైన్లోకి పాట రాగా పొగాకుకు గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు గ్రహించారు. వెంటనే రైతులు వేలాన్ని అడ్డుకుని వేలం కేంద్రం ముందు రోడ్డు మీద రాస్తారోకోకు దిగారు. రోడ్డుకు అటుఇటు ముళ్ల కంచెలు, విద్యుత్ స్తంభాలు వేసి రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత ఏడాది మేలిమి పొగాకు క్వింటా 12 వేల రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయగా ఇప్పుడు అదే పొగాకు 9 వేల రూపాయల నుంచి 8 వేలకు దిగకోశారని ఆవేదన చెందారు. ధరల గురించి బోర్డు చైర్మన్ పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎస్ఐ ఆంజనేయులు రైతులకు సర్ది చెప్పడంతో ఇంత తక్కువగా ధరలు మరొకసారి రాకూడదని చెబుతూ రాస్తారోకో విరమించారు. ధరల్లేవు మాది ఐటిసి ఎన్పిఏ గ్రామం. అయినా ధరలకు దిక్కులేదు. ట్రేలలో మెక్కలు పెంచమన్నారు. పట్టలు వేసి మరీ గ్రేడ్ చేసి చెక్కులు వేయమన్నారు. ధరలు మాత్రం పెంచకుండా దిగ కోస్తున్నారు. దీంతో మాకు దిక్కుతోచడం లేదు. కె.బ్రహ్మయ్య, నరసరాజుపాలెం మేలిమి పొగాకుకు తక్కువ ధరలా ! రూ. 12 వేలకు కొనుగోలు చేయాల్సిన మేలిమి పొగాకు రూ.9 వేల లేపే కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అయితే పొగాకు రైతు బతికి బట్ట కట్టేది ఎట్టా. పొటాష్ వేస్తే మంచిదని అధికారులు సలహా ఇస్తే మూట 28 వందలు పెట్టి ఎకరాకు బస్తా వేశాం. ఖర్చు తడిసి మోపెడు అయింది. బండి భాస్కర్రెడ్డి , పీరాపురం వ్యాపారులకే నాయకుల వంత వ్యాపారులకే అధికారులు , కొంతమంది రైతు నాయకులు వంత పలుకుతున్నారు. రైతును పట్టించుకునేవారు ఏరి. ఇంత దారుణమైన ధరల పతనం ఆగకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోక గత్యంతరం లేదు. జి సుబ్బరాయుడు -
నాసిరకం వస్తువులతో టోకరా..!
చిత్తూరు: లాటరీ పద్ధతిలో ప్రజలకు నాసిరకం హోమ్ నీడ్స్ అమ్ముతూ ఓ వ్యాపారి దొరికి పోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్తికేయ హోంనీడ్స్ పేరుతో లాటరీల్లో వస్తువులు అమ్మేవాడు. రోజూలాగే గురువారం కూడా వ్యాపారం చేయడానికి వచ్చాడు. అయితే నాసిరకం వస్తువులు అమ్ముతున్నాడని గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. -
ఎరువు.. కరువు
నెల్లూరు(అగ్రికల్చర్): రైతన్నకు ఎరువు కరువైంది. ఆందోళన అవసరం లేదు.. అవసరానికి తగ్గట్లు ఎరువులు సిద్ధమంటూ పాలకులు చేసిన ప్రకటనలు నెలకే గాల్లో కలిసిపోయాయి. పర్యవేక్షణ లేకపోవడటంతో అన్నదాతలకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను కొందరు వ్యాపారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఈ అక్రమ దందాను అడ్డుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులకే వంత పాడుతున్నారు. సహకార పరపతి సంఘాల (సొసైటీల) ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను కొందరు అక్రమార్కులు బినామీల పేరుతో తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటీవల నాయుడుపేట, సంగంలోని సొసైటీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తుండగా అధికారులు దాడులు నిర్వహించి ఆరుకాణాలను సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో పలుచోట్ల యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తూ వ్యాపారులకే సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఆలస్యంగా వర్షాలు పడటంతో సాగు అలస్యమైందని ఆవేదన చెందుతున్న రైతులపై ఎరువుల ధరలు మరింతభారంగా మారాయి. బినామీ పాసుపుస్తకాలతో.. కోరమాండల్, ఇఫ్కో, క్రిబ్కో కంపెనీలు యూరియాను సొసైటీలు, ఆథరైజ్డ్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాయి. మార్కె ట్ ధర కంటే తక్కువగా రైతులకు అందిస్తున్నాయి. ఒక్కో రైతుకు పాస్ పుస్తకం ఆధారంగా మూడు బస్తాలు చొప్పున అంది స్తారు. ఇదే అదునుగా వ్యాపారులు బినామీ పాసు పుస్తకాలతో ప్రతి రోజు 100 నుంచి 200 బస్తాలు బ్లాక్కు తరలిస్తున్నారు. అక్రమదందా సాగుతోంది ఇలా.... జిల్లాకు రబీ సీజన్కు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 41,000 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇందులో 50 శాతం జిల్లాలోని 95 సొసైటీలకు, మిగిలిన 50 శాతం ప్రైవేటు డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే అధికారులు అందుకు భిన్నంగా ప్రైవేటు డీలర్లకే అధిక మొత్తంలో యూరియాను కేటాయించారని డీసీసీబీ డెరైక్టర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో ఫెర్టిలైజర్స్ దుకాణాలు ఉన్నాయి. ఆయా మండలకేంద్రాల్లో ఉన్న ఎరువుల దుకాణాల యజమానులు కొంతమంది రైతుల పాస్ పుస్తకాలను సేకరించి బినామీ పేర్లతో రోజుకు 50 నుంచి 100 బస్తాల యూరియాను తీసుకెళ్తున్నారు. వీరికి ఆయా సొసైటీ డెరైక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారుల అండ ఉండటంతో వీరి దందాకు అడ్డు, అదుపులేకుండా పోయింది. పదిరోజుల క్రితం నాయుడుపేటలోని ఒక ప్రైవేటు దుకాణంలో సొసైటీ ఎరువులు విక్రయిస్తుండగా అధికారులు దాడులు నిర్వహించి ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. జిల్లాలో రబీ సీజన్లో 2.76,425 హెక్టార్లలో వరి, మినుము, వేరుశనగ, చెరకు, పత్తి పంటలను ఈ రబీ సీజన్లో సాగుచేస్తారని అధికారులు తేల్చారు. పెరిగిన ఎరువుల ధరలు ప్రధానంగా దుక్కిలో హెక్టార్కు రెండున్నర బస్తాల డీఏపీని కచ్చితంగా వేయాలి. డీఏపీ బస్తా రూ.1,181 ఉండగా, ఈ ధర ప్రస్తుతం రూ.1,249కు చేరింది. డీఏపీ బస్తాపై రూ.68 పెరిగింది. 14:35:14 ధర రూ.1,120 నుంచి రూ.1,207కు చేరింది. బస్తాపై రూ.127 పెరిగింది. అదేవిధంగా 10: 26: 26 ధర రూ.1,083 ఉండగా, రూ.1,139 అయింది. 20:20:0:13 ధర రూ.919 నుంచి రూ.956 పెరిగింది. ఒక్కో హెక్టారుకు రైతుపై రూ.200 నుంచి 300 అదనపు భారం పడింది. యూరియా బస్తా కు రూ.284లకు విక్రయించాల్సి ఉండగా రూ.380 వరకు విక్రయిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు : బహిరంగ మార్కెట్లో యూరియా బస్తాపై వ్యాపారులు రూ.80 నుంచి 100 పెంచి అమ్ముతున్నా అధికారులు పట్టించు కోవడం లేదు. కట్టడి చేయాల్సిన వారు వ్యాపారుల ప్రలోభాలకు లొంగి రైతులకు తీవ్ర అన్యా యం చేస్తున్నారు. అధిక రేట్లకు విక్రయించే దుకాణాలపై జిల్లా అధికారులైనా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి. - అల్లంపాటి హజరత్రెడ్డి, రైతు, నరసాపురం బ్లాక్మార్కెట్లో సొసైటీ ఎరువులు : సొసైటీలకు సరఫరా చేసిన యూరియా ను అధికారులు వారి బంధువులకు, బినామీ రైతుల పేరుతో బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారు. వ్యవసాయాధికారులు చిత్తశుద్ధితో దుకాణాల్లో స్టాకు రిజిష్టరును పరిశీలిస్తే వ్యాపారుల దందా బయటపడుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఈ అక్రమదందాను అరికట్టాలి. - కొప్పోలు వెంకటేశ్వర్లు, రైతు, ఆత్మకూరు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు : కృత్రిమ కొరత సృష్టించి ఎరువుల బస్తా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించి సీజ్ చేశాం. సొసెటీలకు కేటాయించిన ఎరువులు బ్లాక్మార్కెట్లో విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. రబీ సీజన్కు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. - కేవీ.సుబ్బారావు, జేడీ, వ్యవసాయశాఖ -
వ్యాపారులకే కిక్కు!
మార్కెట్లోకి జోరుగా కల్తీ మద్యం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పెగ్గు మీద పెగ్గు కొడితే...! నిషా నింగినంటాలే... చుక్కలు నేలకు దిగి రావాలే. మందుబాబులు మబ్బులో విహరించాలి. ఇదీ మద్యం మహత్యం. అదేంటో ఈ మధ్య ఏ మందుబాబును కదిపినా ‘ఫుల్లు కొట్టినా కిక్కు ఎక్కుత లేదు గురూ’ అంటూ నిట్టూరుస్తున్నారు. తేడా ఎక్కడొస్తుందో తెలియక తలలు గోక్కుంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోందంటే....లిక్కర్ వ్యాపారుల చేతివాటంతోనే మద్యంలో తేడా వచ్చి.. మందుప్రియులకు మత్తెక్కడం లేదని ఇటీవలి సంఘటనలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాలు తగ్గాయట! జిల్లాలో ఉన్నట్టుండి మద్యం సేల్స్ 18 శాతం తగ్గినట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి. గత ఏడాది ఈ నెలతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా 3 వేల కేసుల లిక్కర్ (ఐఎంఎల్) తక్కువగా అమ్ముడు పోయింది. నిజానికి ప్రతి ఏడాది కనీసం 10 శాతం లిక్కర్ అమ్మకాలు పెరగాలి. కానీ జిల్లాలో అనూహ్యంగా లిక్కర్ విక్రయాలు పడిపోవడం చర్చనీయంగా మారింది. అధికారులు ఇచ్చిన అలుసే... జిల్లాలో మద్యానికి మంచి డిమాండ్ ఉంది. రోజుకు సగటున రూ.33 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే ఇటీవల ఇది రూ.31 కోట్లకు పడిపోయిందని ఎక్సైజ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పక్క రాష్ట్రం నుంచి అక్రమ మద్యం (ఎన్డీపీల్ )గానీ, దుకాణ దారులు చేతి వాటం ప్రదర్శించడం గానీ జరిగి ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణంలో సీసాలవారీగా మినహాయించి, విడి మద్యం (లూజ్సేల్) అమ్మకూడదు. అయితే ఎక్సైజ్ అధికారులు అక్రమంగా కల్పించిన వెసులు బాటుతో దుకాణదారులు విడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు జిల్లాలో నమోదు కాకపోవడం గమనార్హం. మూతలు తీసి...నీళ్లు పోసి. ఎకై ్సజ్ అధికారులు వేసిన లేబుల్ చెదిరిపోకుండా దుకాణం యాజమాన్యం సీసాపై మూతను తొలగిస్తున్నారు. సీసాలోంచి 100 నుంచి 150 మిల్లీ లీటర్ల లిక్కర్ తీసివేసి అంతే మొత్తంలో నీళ్లు పోస్తున్నారు. అనుమానం రాకుండా తిరిగి యథాతధంగా లేబుల్ అతికించి విక్రయిస్తున్నారు. లేబులింగ్ విభాగంలో పనిచేసే ఎకై ్సజ్ అధికారులు తప్ప సాధారణ విధులు నిర్వర్తించే ఎక్సైజ్ సిబ్బంది గుర్తు పట్టలేరు. ఇలాంటి మోసాలు గతంలో మొట్రొపాలిటన్ సీటీలోని మద్యం దుకాణాల్లో మాత్రమే జరిగేవి. వేసిన లేబుల్ పోకుండా సీసాపై మూతలు తొలగించ గల నిపుణులు గతంలో చాలా కొద్ది మంది మాత్ర మే ఉండేవారు. ఇప్పుడు మాత్రం గల్లీకొకరు పుట్టుకొచ్చారు. అంతేకాదు వీరు ఆసక్తి ఉన్న వాళ్లకు మూతలు తీయడంలో తర్ఫీదు నిస్తున్నారు. మద్యం దుకాణం యాజమాన్యాలు తమకు నమ్మకస్తుడైన వ్యక్తికి ఇలాంటి తర్ఫీదు ఇస్తారు. మండలాల్లో కూడా మద్యం కల్తీ జరుగుతోంది. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో దుకాణంలో పనివాళ్లు మద్యం సీసాల మూత లు తీసి నీళ్లు పోస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఆ తర్వాత జరిగిన తతంగంతో సదరు అధికారులు మద్యం దుకాణం మీద ఎలాంటి కేసులు నమోదు చేయకుండ వదిలేశారు. వ్యాపారుల, కిక్కు, మద్యం, Merchants, kick, alcohol -
‘స్కీం’లతో జర భద్రం
సాక్షి, మంచిర్యాల : ‘మీకు బంగారు ఆభరణం కావాలా..? ఖరీదు చేసే ఆర్థిక స్థోమత లేదా..? ఏం పర్వాలేదు.. మా దగ్గర ఓ స్కీం ఉంది. ప్రతినెలా మీకు తోచినంత (రూ.వెయ్యిపైనే) డబ్బు చెల్లించండి. ఆ ఆభరణం ఖరీదంతా డబ్బు మీరు చెల్లించిన తర్వాత.. కోరిన నక్లెస్ మీకు అందజేస్తాం. నమ్మండి.. రండి.. మా స్కీంలో చేరండి...’ ఇప్పుడు జిల్లాలో ఎక్కడ విన్నా ఇలాంటి ప్రకటనలే. వ్యాపారులకు డబ్బే డబ్బు జిల్లాలో జోరుగా కొనసాగుతున్న ‘స్కీం’లు వ్యాపారులపై కనకవర్షం కురిపిస్తున్నాయి. బిజినెస్లో ‘ట్రెండ్’ మార్చిన వ్యాపారులు నయాపైసా పెట్టుబడి లేకుండా కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అమాయక, ప్రజల అవసరాలను ఆసరా చేసుకుంటూ కొందరు మార్కెట్లో సరికొత్త స్కీంలు ప్రవేశపెడుతున్నారు. నెలకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లిస్తే కొన్ని నెలల తర్వాత వాయిదాల్లో వారు చెల్లించిన డబ్బులు విలువ చేసే ఆభరణం, భూమి ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును తమ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. వ్యాపారం బాగా జరిగి లాభం చేకూరితేనే ప్రజలకు ‘స్కీం’లో చెప్పినట్టుగా వస్తువులు అందజేస్తున్నారు. లేకపోతే జెండా ఎత్తేస్తున్నారు. ఇటీవల మంచిర్యాలలో నామమాత్రం గా ప్రారంభమైన జువెల్లరీ షాపుల్లో వ్యాపారులు స్కీం పేరిట వసూలు చేసిన డబ్బు మొ త్తాన్ని పెట్టుబడిగా పెట్టడం చర్చనీయాంశమైం ది. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ వంటి ప్రధాన పట్టణాల్లో ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోంది. నమ్మి.. మోసపోతున్న జనం సాధారణంగా వ్యాపారులు నిర్వహిస్తున్న ఇలా ంటి ‘స్కీం’లకు పోలీసుల అనుమతి అవసరం ఉండదు. వ్యాపారులెవరైనా నమ్మించి మోసం చేసినా వ్యాపారులపై బాధితులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. స్కీంలను ఎలా నమ్మావని పోలీసులు ప్రశ్నిస్తారనే భయమే బాధితుల వెనకడుగు వేసేలా చేస్తోంది. బాధితుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని జిల్లాలో వ్యాపారులు కూడా ఇష్టారాజ్యంగా స్కీంలు నిర్వహిస్తున్నారు. కేవలం మంచిర్యాల పట్టణంలోనే 60కి పైగా షాపుల్లో రకరకాల స్కీంలు అమలవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బంగారు ఆభరణం, ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్, ఏసీ, ఎల్ఈడీ టీవీ, మోటారు బైక్ (షోరూంలలో కాదు), వస్త్రాలు, సెల్ఫోన్లు, కిరాణం షాపులతోపాటు రియల్ ఎస్టేట్స్ రంగాల్లో అమలవుతోన్న స్కీంలు ‘ఔరా’ అనిపిస్తున్నాయి. మచ్చుకు కొన్ని..! - ఆరు నెలల క్రితం మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ జువెల్లర్ షాపు యజమాని వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లిస్తే ఆభరణాలు ఇస్తానని నమ్మించాడు. ప్రతి నెలా ప్రజల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయలు రియల్ ఎస్టేట్స్లో పెట్టుబడి పెట్టాడు. వ్యాపారంలో నష్టం రావడంతో భార్య, ఇద్దరు పిల్లలతోపాటు తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. - 2011లో ‘ఎన్మార్ట్’ కంపెనీ పేరుతో మంచిర్యాలలో విస్తృత ప్రచారం చేసిన వ్యక్తి ప్రతి నెలా రూ.1,500 కిరాణం సరుకులు ఇంటికి సరఫరా చేస్తానని నమ్మించాడు. మంచిర్యాల పట్టణంలో 8 వేల మంది నుంచి రూ.5,500 డిపాజిట్ తీసుకుని ఉడాయించాడు. - 20012లో మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తానని నమ్మించిన హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ బిల్డర్.. మెంబర్ షిప్ కింద ప్రతి వ్యక్తి నుంచి రూ.10 వేలు వసూలు చేసి పరారయ్యాడు. మంచిర్యాలకు చెందిన బాధితులే రెండొందలకు పైగా ఉన్నారు. - 2012లో స్థానికంగా పేరున్న ఓ వ స్త్ర వ్యాపారి సంబంధీకుడొకరు స్కీం పేరిట మంచిర్యాలలో ప్రజల నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి వ్రస్త్ర వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. వ్యాపారంలో నష్టం వచ్చి ఉడాయించాడు. -
యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే
కావలి : ఒక ఎరువు బస్తా కావాలంటే మరో రెండు రకాల ఎరువులు బస్తాలు కొనుగోలు చేయాలంటూ వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పలు దుకాణాల యజమానులు రైతులను లింకు ఎరువుల పేరిట పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ విషయం వ్యవసాయ శాఖ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాదారుల వద్ద నెలనెలా ముడుపు తీసుకుంటూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక ఏ రైతు లిఖిత పూర్వంగా ఫి ర్యాదు చేయలేదంటూ సాకు చూపుతున్నారని రైతులు మండిపడుతున్నారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 1.12 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరి అత్యధిక స్థాయిలో సాగవుతోంది. నియోజకవర్గంలో 76 వరకు ఎరువుల దుకాణాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎప్పుడూ ఎమ్మార్పీకి అమ్మలేదు.. యూరియా బస్తాను ఎమ్మార్పీకి అమ్మడాన్ని వ్యాపారులు ఎప్పుడో మరచి పోయారు. ఎరువుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రతి రకం ఎరువుకు సుమారు రూ.వంద అధిక ధరకు విక్రయిస్తున్నారు. యూరియా ఎమ్మార్పీ రూ. 285 ఉండగా రూ.370 నుంచి రూ.400 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. యూరియాతో పాటు రూ.1250 పెట్టి డీఏపీ, రూ.950లకు 20-20 ఎరువులను తప్పనిసరిగా కొనుగోలు చేయక తప్పడం లేదు. లేకుంటే వ్యాపారులు యరియాను విక్రయించడం లేదు. యూరియా లేకుంటే బయో ఫెర్టిలైజర్ను అయినా అంత ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దుకాణదారులు లాభార్జన ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నారు. తుమ్మలపెంటకు చెందిన ఓ రైతు కావలిలోని ఓ ఎరువుల దుకాణానికి వచ్చి యూరియా బస్తాను అడిగారు. దాని ఎమ్మార్పీ రూ.285. స్టాక్ లేదు..అయితే రూ.370లకే ఇస్తాం, కానీ దానితో పాటు డీఏపీ, 20-20 బస్తాలను కొనుగోలు చేయాలని వ్యాపారి చెప్పాడు. గత్యంతరం లేక రైతు ఎమ్మార్పీ కన్నా అధిక ధర పెట్టి యూరియాతో పాటు ఆ బస్తాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. గౌరవరానికి చెందిన ఓ రైతు యూరియా కోసం కావలిలోని ఓ దుకాణానికి వెళ్లాడు. ఆ యూరియాతో పాటు మరో రెండు కంపెనీల ఎరువుల బస్తాలు కొనుగోలు చేయాలని దుకాణదారుడు చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో రైతు వాటిని కొనుగోలు చేశాడు. ఒక ఎరువును కొనాలంటే మరొక దానిని కొనుగోలు చేయాలి : యూరియా కొనాలంటూ మరో రెండు ఎరువులను కొనాల్సి వస్తోంది. మా అవసరం దృష్ట్యా వారు చెప్పిన ధరకు చెప్పిన విధంగా మేము కొనుగోలు చేయాల్సి వస్తుంది. - ఈశ్వర్రెడ్డి, రైతు, గౌరవరం లింక్ ఎరువులు అమ్మితే దుకాణాలపై చర్యలు : లింక్ ఎరువుల నిబంధనలు పెట్టిన దుకాణదారులపై చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి రైతులు నోటి మాటగా చెబుతున్నారే తప్ప లిఖిత పూర్వకంగా ఫిర్యాదును చేయాలి. అప్పుడే వారిపై చర్యలు తీసుకునే వీలుంటుంది. దీనిపై రైతులు స్పందించాలి. -బాలాజీనాయక్, ఏడీఏ, కావలి -
దళారులదే హవా
ఏళ్లు గడుస్తున్నా.. పాలకులు మారుతున్నా.. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరుతున్నా.. కర్షకుల కష్టాలు మాత్రం తీరడం లేదు. నిత్యం వ్యయప్రయాసాల కోర్చి.. దిగుబడి వస్తున్నా.. రాకున్నా.. సాగు పోరాటంలో దిగుతున్న అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. సాగు సమయంలో ప్రకృతి పగబడితే.. ధాన్యం చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఆసరానివ్వలేకపోతున్నాయి. కొద్దోగొప్పో వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేకపాయె. అరకొరగా ప్రారంభిస్తుండడంతో చివరికి ధాన్యం దళారులకే అమ్ముకోవాల్సి వస్తోం ది. దళారులేమో మద్దతు ధర చెల్లించక పోగా.. కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. క్వింటాల్కు 10 నుంచి 20 కిలోల వరకు చిలక్కొట్టుడు కొడుతున్నారు. ఫలితంగా రైతన్న నిలువునా దగాకు గురవుతున్నాడు. - ఆదిలాబాద్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో వరి సాగు తగ్గింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 60 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. కానీ.. అది 27 హెక్టార్లకే పరిమితమైంది. ఆలస్యంగానైనా కురిసిన కొద్దిపాటి వర్షాలతో ఈ కొద్ది మేర వరినాట్లు వేశారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 92,500 మెట్రిక్ టన్నుల ధాన్య దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం కూడా గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.1,400, మధ్యరకం ధాన్యానికి రూ.1,360 ధర నిర్ణయించింది. ప్రస్తుత దిగుబడి ధాన్యం చేతికి వస్తోంది. ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఈసారీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. దీంతో దిగుబడి వస్తున్నా.. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవాల్సి వస్తోంది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 194 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. చివరికి 71 కేంద్రాలకే పరిమితమయ్యారు. ఐకేపీ 50, పీఏసీఎస్ 18, డీసీఎమ్మెస్ కొన్ని మండలాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించాయి. ఇప్పటివరకు వీటన్నింటి పరిధిలో 13,304 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది సుమారుగా ఇంకా 34 వేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది 52 వేల క్వింటాళ్ల వరిధాన్యాన్ని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేశారు. తూకాల్లో మోసాలు.. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో.. కొనుగోలు కేంద్రాలు లేని ఏరియాలను దళారులు ఎంచుకున్నారు. దీంతో వ్యాపారులు రైతుల పంట పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని జైపూర్, నెన్నెల, వేమనపల్లి, లక్ష్మణచాంద, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, బెల్లంపల్లి, కౌటాల తదితర మండలాల్లో రైతులు దళారులకే విక్రయిస్తున్నారు. కాగా.. దళారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు చెల్లిస్తున్నా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు మధ్య రకం ధాన్యానికి రూ. 1,300, సన్నరకం ధాన్యానికి రూ.1,700 వరకు చెల్లిస్తున్నారు. తూకాల్లో మాత్రం క్వింటాల్కు 10 నుంచి 20 కిలోల వరకు మోసం చేస్తున్నారు. దీన్ని కనిపెట్టిన వారు నిలదీస్తే తేమ శాతం చూడకుండానే కొనుగోలు చేస్తున్నందునా బరువు ఎక్కువగా వ స్తుందని, అందుకే ధర ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అసలే కరువు నేపథ్యంలో జిల్లాలో అంతంత మాత్రంగానే వరిధాన్యం సాగైంది. దీంతో రానున్న రోజుల్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో దళారులు జోరుగా తమ దందాను కొనసాగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.. - చరణ్దాస్, డీఆర్డీఏ ఏపీడీ జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేసి 13,304 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. కొన్ని మండలాల్లో ఆలస్యంగా వరినాట్లు వేయడంతో దిగుబడి రాక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వారం రోజుల్లో కడెం, ఖానాపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, మామడ, జన్నారం, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి తదితర మండలాల్లో ఏర్పాటు చేస్తాం. మరో 35 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తున్నాం. -
తగ్గిన కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం కొన్ని కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా టమాటా ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడం అదేవిధంగా ఇతర కారణాల వల్ల గత రెండు నెలలుగా కూరగాయల ధరలలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ సంతృప్తి కరంగా కురవడంతో గత నెలలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రానికి (ఏపీఎంసీ) కూరగాయల సరఫరా కూడా పెరిగింది. దీంతో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ సందర్భంగా సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల కూరగాయలు ఈ మార్కెట్కు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఇది చాలా ఎక్కువన్నారు. గతంలో రోజుకు కేవలం 350- 400 ట్రక్కుల కూరగాయలు మాత్రమే సరఫరా అయ్యేవని తెలిపారు. ఇప్పుడు సరఫరా పెరగడంతో టమాటాల ధరలు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర కిలోకు రూ.8 నుంచి 10 వరకు పలుకుతోంది. కాగా, మరికొన్ని వారాల వరకు కూరగాయల ధరల్లో తగ్గుదల కనిపిస్తుందని కూరగాయల వ్యాపారి రామ్దాస్ పవాలే తెలిపారు. కాగా, క్యారెట్, క్యాబేజీ, దొండకాయలు, పచ్చి బఠాణీ, పచ్చి మిరప ధరలు కూడా గణనీయంగా తగ్గగా గోరుచిక్కుడు, గోబి పువ్వు, బెండకాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. -
నో స్టాక్
రైతులను వేధిస్తున్న యూరియా కొరత కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు వరినాట్లు వేసే తరుణంలో స్టాకు లేదంటూ ప్రచారం జిల్లాకు 35.500 టన్నుల యూరియా అవసరం మచిలీపట్నం : ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎరువుల వ్యాపారుల లాభాపేక్ష రైతులకు మరో కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టాయి. వర్షాభావం, సాగునీటి విడుదలలో జాప్యం వల్ల ఆలస్యంగా అయినా వరినాట్లు పూర్తి చేస్తున్న రైతులను యూరియా కొరత రూపంలో మరో సమస్య వేధిస్తోంది. వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో గ్రామాల్లోని పీఏసీఎస్, పట్టణ ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాల వద్దకు యూరియా కోసం వెళితే స్టాకు లేదనే సమాధానం ఎదురవుతోంది. దీంతో రైతులు కంగుతింటున్నారు. అసలే వరినాట్లు ఆలస్యంగా వేస్తున్నామని, నాటు వేసే సమయంలో ఎకరానికి కనీసం 25 కిలోల యూరియా తప్పనిసరిగా అవసరమని రైతులు చెబుతున్నారు. మొక్కల ఎదుగుదలకు యూరియా కచ్చితంగా అవసరమని, ఈ తరుణంలో అందుబాటులో లేకపోతే నష్టాలు తప్పవని పలువురు వాపోతున్నారు. వ్యాపారుల మాయాజాలం! యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, అధిక ధరకు విక్రయించేందుకు పావులు కదుపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరినాట్లు నెల రోజుల పాటు ఆలస్యం కావడంతో మొక్కల ఎదుగుదల కోసం యూరియాను అధికంగా వినియోగిస్తామని, కాబట్టి కొరత లేకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు. 35,500 టన్నులు అవసరం ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. సాగునీటి విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబరు నెలలోనూ వరి నాట్లు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4.40 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మరో రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని మండలాల్లో వరి నాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక్కసారిగా అన్ని ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకోవడంతో యూరియా వాడకం పెరిగింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు తమ వద్ద యూరియా స్టాకు లేదని రైతులను తిప్పి పంపుతున్నారు. ఒకటి, రెండు రోజుల తర్వాత అధిక ధరకు యూరియా విక్రయాలు జరిపేందుకే వ్యాపారులు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించకుండా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 18వేల టన్నుల సరఫరా ఇప్పటి వరకు జిల్లాలోని పీఎసీఎస్లకు, హోల్సేల్ వ్యాపారులకు, రిటైల్వ్యారులకు 18వేల టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ నరసింహులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 35,500 టన్నుల యూరియా దిగుమతి కావాల్సి ఉందని ఆయన చెప్పారు. కొద్ది రోజుల్లో యూరియా వస్తుందని వివరించారు. -
హాస్టళ్లకు సరుకులు ఫుల్
ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లపై ఆంక్షలు అక్రమాల నిరోధానికి అధికారుల చర్యలు పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయి నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచుతున్నారు. టెండర్లు పొందిన వ్యాపారులు జీసీసీకి సక్రమంగా సరుకులను సరఫరా చేయకపోవడం, అక్కడ నుంచి జీసీసీ ద్వారా ఆశ్రమాలకు పూర్తిస్థాయిలో పంపిణీ జరగడం లేదనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. హాస్టల్ వార్డెన్లు కూడా నెలకు సరిపడా పూర్తిస్థాయి సరుకులకు ఇండెంట్లను జీసీసీకి పంపడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో సరుకుల నిల్వలకు ఐటీడీఏ పీఓ వినయ్చంద్, గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు భోజన అవసరాలకు సంబంధించిన అన్ని నిత్యవసర సరుకులను జీసీసీ నుంచే పంపిణీ చేయాలని, ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లు తగ్గించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమాలకు చెక్ పడింది. టెండరుదారులంతా జీసీసీ ఇండెంట్ల ప్రకారం సరుకులను సరఫరా చేస్తున్నారు. అక్కడ నుంచి విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా సరుకులు పూర్తిస్థాయిలో ఆశ్రమ పాఠశాలలకు చేరుతున్నాయి. గతంలో వార్డెన్లు కొద్ది మొత్తంలోనే సరుకులను పొందేవారు. కొంత మంది వార్డెన్లు బయట ప్రైవేటు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామంటూ బిల్లులు పెట్టేవారు. దీనివల్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆంక్షలు విధించారు. సరుకులు పక్కదారి పట్టకుండా ఏటీడబ్ల్యుఓల పర్యవేక్షణలోనే అన్ని సరుకులను ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. దీనికితోడు రోజువారీ సరుకుల నిల్వల రికార్డుల తనిఖీ బాధ్యత కూడా ఏటీడబ్ల్యుఓలకే అప్పగించారు. ఆశ్రమ పాఠశాలల్లో రోజువారీ విద్యార్థుల సంఖ్యను కూడా ఆన్లైన్ చేయాలనే నిబంధనలు కూడా ఆశ్రమాల్లో అక్రమాలకు చెక్ పెట్టేదిగా ఉంది. విద్యార్థులు సెలవు దినాల్లో ఇళ్లకు పోయినా రోజు వారీ నివేదికను గిరిజన సంక్షేమ అధికారులు సేకరిస్తున్నారు. -
చిరు వ్యాపారులపై ‘ట్రేడ్’ కొరడా
చిన్న షాపులకు, బడా సంస్థలకు ఒకేలా ట్రేడ్ లెసైన్సు ఫీజు సంస్థ ఉండే ప్రాంతం, స్థాయి, ఆదాయం పట్టించుకోని వైనం రూ.10 వేలు వచ్చేవారికి.. రూ.లక్ష ఆర్జించే వారికీ ఒకే ఫీజు ఆస్తిపన్ను తరహాలో ఫీజుంటే మేలంటున్న వ్యాపారులు చాంద్రాయణగుట్టలో 400 చ.అ.ల విస్తీర్ణంలో స్వీటు షాపు నిర్వహిస్తున్న సులేమాన్కు జీహెచ్ఎంసీ అధికారులు చ.అ.కు రూ.ఐదు వంతున రూ.2000 ట్రేడ్ లెసైన్సు ఫీజుగా విధించారు. బంజారాహిల్స్లో 400 చ.అ.ల విస్తీర్ణంలో స్వీటు షాపు నిర్వహిస్తున్న అప్పారావుకు కూడా అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు చ.అ.కు రూ. ఐదు వంతున రూ.2000 ట్రేడ్ లెసైన్సు ఫీజుగా విధించారు. బంజారాహిల్స్లో స్వీటు షాపు నిర్వహిస్తున్న అప్పారావుకు అది పెద్ద భారంగా కనిపించలేదు. తనకు జరిగే రోజువారీ వ్యాపారం.. వచ్చే ఆదాయం తదితరమైనవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ చాంద్రాయణగుట్టలోని సులేమాన్ మాత్రం అంతటి భారం తాను మోయలేనంటూ లబోదిబోమంటున్నాడు. కారణం.. తనకు జరిగే వ్యాపారం.. పనివాళ్ల జీతాలు.. తదితరమైనవన్నీ పరిగణనలోకి తీసుకుంటే వచ్చే అంతంతమాత్రం ఆదాయానికి అది చాలా భారమన్నాడు. ట్రేడ్ లెసైన్సుల ఫీజు విధింపులో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన కొత్త పద్ధతి సులేమాన్ లాగే ఎందరో వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ట్రేడ్ లెసైన్సు ఫీజు సరళీకరణ పేరిట అధికారులకు తాము చేసింది సబబుగానే కనిపించినా.. పలువురు చిరు వ్యాపారులకు అది మోయలేని భారంగా మారింది. నెలకు రూ. 10 వేల ఆదాయం వచ్చేవారికి.. లక్ష రూపాయల ఆదాయం వచ్చేవారికి ఒకేవిధంగా ట్రేడ్లెసైన్సుల ఫీజులు విధించడమే ఇందుకు కారణం. ఆదాయాన్ని బట్టి కాకుండా.. గతంలో ఆయా వ్యాపారులకు వచ్చే ఆదాయాన్ని అంచనా వేసి ట్రేడ్లెసైన్సు ఫీజు ఖరారు చేసేవారు. పలువురు వ్యాపారులు ట్రేడ్ లెసైన్సు విభాగం అధికారులతో కుమ్మక్కవుతూ వాస్తవ ఆదాయం కంటే తక్కువ ఆదాయం పేర్కొంటూ చెల్లించాల్సిన ఫీజు కంటే తక్కువే చెల్లిస్తున్నారంటూ కొత్త విధానాన్ని ఈ సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చారు. దుకాణం/ సంస్థ/ ఆస్పత్రి/హోటల్/ ఇతరత్రా వ్యాపారాలన్నింటికీ ఇదే విధానాన్ని అమల్లోకి తేవడంతో వేల సంఖ్యలోని చిరు, మధ్యస్థాయి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సంస్థ స్థాయి.. జరిగే వ్యాపారాన్ని బట్టి ఫీజు వసూలు చేసేవారు. ఉదాహరణకు 30 పడకల ఆస్పత్రికి ఒక రకమైన ఫీజు.. 100 పడకల ఆస్పత్రికి అంతకంటే ఎక్కువ ఫీజు ఉండేవి. ఇప్పుడలా కాకుండా పడకలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా ఫీజు విధించడంతో చిరు వ్యాపారులు.. చిన్న సంస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రాంతాన్ని పట్టించుకోకుంటే ఎలా? ఆస్తిపన్ను విధింపులకు ప్లింత్ ఏరియానే ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ.. ఆయా ప్రాంతాల డిమాండ్.. అక్కడి సదుపాయాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని.. ఏ, బీ, సీ గ్రేడ్లుగా ప్రాంతాలను విభజించి రేట్లు నిర్ణయించారు. అదే విధానాన్ని ట్రేడ్ లెసైన్సుల ఫీజులోనూ విధిస్తే సమంజసంగా ఉండేది. కానీ.. సంపన్న ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని వారికి.. పేద బస్తీలైన బతుకమ్మ కుంట, పురానాపూల్ వంటి ప్రాంతాల్లోనూ ఒకే రకమైన వ్యాపారాలకు ఒకే విధంగా ట్రేడ్ లెసైన్సు ఫీజు విధించడం దారుణమని పలువురు చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కొత్తవారికి వెంటనే సర్టిఫికెట్ కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ప్రొవిజనల్ ట్రేడ్ లెసైన్సు సర్టిఫికెట్ను వెంటనే జారీ చేస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 15 లోగా రెన్యువల్ చేయించుకుంటే పెనాల్టీ ఉండదని, ఆ తర్వాత నెలకు 2 శాతం వంతున పెనాల్టీ ఉంటుం దన్నారు. ఇప్పటిదాకా లెసైన్సు పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రేడ్ లెసైన్సులు లేకున్నా.. రెన్యువల్ చేయించుకోకున్నా సదరు సంస్థల్ని సీజ్ చేసే, అవి విక్రయించే సామాగ్రిని సీజ్ చేసే అధికారం తమకు ఉంటుందన్నారు. జూన్ 15 లోగా ఫీజు చెల్లించండి: కమిషనర్ గ్రేటర్ పరిధిలో వ్యాపారాలు చేసేవారంతా ట్రేడ్ లెసైన్సుల్ని రెన్యువల్ చేయించుకోవాలని, ఇప్పటికీ ట్రేడ్ లెసైన్సులు లేనివారు వాటిని పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ పేర్కొన్నారు. ఈసేవా సెంటర్లు.. సీఎస్సీల ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కొత్త లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఇందుకోసం గతం కంటే భిన్నంగా సరళమైన విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. తద్వారా సెల్ఫ్ అసెస్మెంట్తో ట్రేడ్ లెసైన్సు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. వ్యాపార రకం (కేటగిరీ).. ప్లింత్ఏరియాను బట్టి ట్రేడ్ లెసైన్సు ఫీజులు.. వాటితోపాటు గార్బేజి చార్జీలు నిర్ణయించామన్నారు. మొత్తం వ్యాపార సంస్థలన్నింటినీ ఐదు కేటగిరీలుగా విభజించినట్లు పేర్కొన్నారు. ఒక్కో కేటగిరీలో మళ్లీ సబ్ కేటగిరీలున్నాయన్నారు. ఉదాహరణకు ఎ కేటగిరీలో ఆహారపదార్థాలుండగా, అందులోని సబ్ కేటగిరీల్లో రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీ ఉత్పత్తులు, ఐస్క్రీమ్లు విక్రయించే సంస్థలు తదితరమైనవి ఉన్నాయని వివరించారు. ఇలా సబ్ కేటగిరీలను బట్టి కొన్నింటికి చ.అ.కు రూ. మూడు ఉండగా, మరి కొన్నింటికి చ.అ.కు రూ. ఏడు వరకు ఉందన్నారు. వెరసి ఒక్కో కేటగిరీలో చ.అ.కు రూ.మూడు నుంచి రూ. ఏడు వరకు ఫీజులున్నాయని తెలిపారు. -
పత్తి రైతు..చిత్తు
గజ్వేల్, న్యూస్లైన్: అతివృష్టితో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను వ్యాపారులు నిండా ముంచేస్తున్నారు. కాస్తోకూస్తో మిగిలిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకువెళ్తున్న కర్షకులపై కనీస కనికరం లేకుండా ‘బీట్’ విధానం పేరిట దోచుకుంటున్నారు. అంతా సిండికేట్గా మారి గంటల్లోనే ధరను తగ్గించేస్తున్నారు. గజ్వేల్ మార్కెట్లో సోమవారం ఉదయం ధరను కొద్ది గంటల వ్యవధిలోనే వ్యాపారులంతా ఏకమై రూ.400 తగ్గించారు. ఇదేమిటని అడిగిన రైతులకు ‘ఇష్టముంటే అమ్మండి లేకుంటే వదు’ అని దబాయించారు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు మార్కెట్ కమిటీ అధికారులను ఘెరావ్ చేశారు. చివరకు వ్యాపారులు దిగిరావడంతో ఆందోళన సద్దుమణిగింది. భారీగా తరలివస్తోన్న రైతులు ఇటీవల పత్తి ధర పెరిగింది. గజ్వేల్ యార్డులో క్వింటాలుకు రూ.4,300కుపైగా పలకడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు ఇక్కడికి భారీగా తరలివస్తున్నారు. యార్డులో సోమవారం పత్తి కొనుగోలు చేయడానికి ‘బీట్’ నిర్వహించారు. ఉదయం 10గంటల ప్రాంతంలో క్వింటాలు పత్తికి రూ.4,000 నుంచి రూ.4,300 వరకు ధర చెల్లించిన వ్యాపారులు, కొద్దిసేపటికే ధరను తగ్గించేశారు. వ్యాపారులంతా ఏకమై క్వింటా పత్తికి రూ.3,900 మాత్రమే చెల్లిస్తామని తెగేసి చెప్పడంతో ఆగ్రహించిన రైతులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా గంటకుపైగా యార్డులో లావాదేవీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వీర్శెట్టి తదితరులను ఘెరావ్ చేశారు. ఈ సంఘటనతో యార్డులో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు జోక్యం చేసుకుని వ్యాపారులతో మాట్లాడి క్వింటాలు పత్తికి రూ.4,000నుంచి రూ.4,300 వరకు ధర చెల్లించాలని సూచించడంతో రైతులు తమ ఆందోలన విరమించారు. -
పేదల బియ్యం.. పెద్దల పరం
=శ్రీకాళహస్తి కేంద్రంగా చౌకబియ్యం అక్రమ వాప్యారం =గిడ్డంగి నుంచే నేరుగా కర్ణాటకకు తరలిస్తున్న వైనం =కమీషన్ల కక్కుర్తిలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు శ్రీకాళహస్తి, న్యూస్లైన్: మూడు పూటలా పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చౌకబియ్యాన్ని కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకు పోతున్నారు. చాలా సంవత్సరాలుగా శ్రీకాళహస్తి కేంద్రంగా బడాబాబులు చౌకబియ్యాన్ని అక్రమంగా బొక్కేస్తూ లక్షలు గడిస్తున్నారు. దీనిపై గతంలో అనేక అక్రమాలు వెలుగుచూడడంతో 10 మందికి పైగా గిడ్డంగి అధికారులు సస్పెండ్కు గురయ్యారు. రెండేళ్లలో ఆరుగురు గిడ్డంగి డీటీలను మార్పు చేశారు. ఆరు నెలల క్రితం శ్రీకాళహస్తి ప్రాంతంలో వెయ్యి బస్తాలకు పైగా చౌకబియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు బడా వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం ఆగినట్టు కనిపించినా తిరిగి 40 రోజులుగా చౌకబియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి బియ్యం తరలిపోతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కర్ణాటకకు తరలుతున్న చౌకబియ్యం శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్నగర్ కాలనీ కేంద్రంగా చౌకబియ్యం అక్రమ వ్యాపారం సాగుతోంది. చౌకదుకాణం డీలర్లు, గిడ్డంగి నుంచి కిలో బియ్యం రూ.13కు కొనుగోలు చేస్తున్నారు. రవాణా చార్జీలకు రూ.2 చెల్లిస్తున్నారు. కర్ణాటకలో కిలో రూ.25కు విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు కిలో బియ్యంపై రూ.10 ఆదాయం పొందుతున్నారు. ఒక్కసారి ఓ లారీలో 15 టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఒక లోడును గమ్యానికి చేరిస్తే ఖర్చులు పోగా రూ.1.5లక్షలు మిగులుతుంది. ఈ ప్రాంతం నుంచి నెలకు 40నుంచి 50 లోడ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు అదేస్థాయిలో కమీషన్లు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏరియా ఆస్పత్రి వద్ద 300 బస్తాలతో వెళుతున్న ఓ బియ్యంలారీని పోలీసులు పట్టుకుని రెవెన్యూ శాఖాధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరేలోపే కమీషన్లు తీసుకుని లారీని వదిలిపెట్టేశారు. గిడ్డంగి నుంచే నేరుగా.. కేవీబీపురం మండలంలోని పెరిందేశం సమీపంలో మరో స్టాక్పాయింట్ను ఏర్పాటు చేసుకుని నకిలీ ఆర్వోలతో శ్రీకాళహస్తిలోని గిడ్డంగి నుంచే నేరుగా చౌకబియ్యాన్ని అక్కడకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడి నుంచి పిచ్చాటూరు, నగరి మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారని తెలిసింది. ఇప్పటికైనా నిరుపేదల కడుపులు నింపే చౌకబియ్యం అక్రమార్కుల పరం కాకుండా జిల్లా అధికారులు కాపాడాల్సి ఉంది. వ్యాపారులతో సంబంధంలేదు చౌకబియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నకిలీ ఆర్వోలతో బియ్యాన్ని తరలించడం వాస్తవం కాదు. పట్టణంతోపాటు మా పరిధిలోని ఐదు మండలాల డీలర్లకు అందాల్సిన మొత్తం బియ్యాన్ని ఆర్వోల ద్వారానే పంపుతున్నాం. - రమేష్బాబు, గిడ్డంగి డీటీ, శ్రీకాళహస్తి చౌకబియ్యం తరలిస్తే ఊరుకోం పేదలకు అందాల్సిన చౌకబియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఊరుకోం. రెవెన్యూ అధికారులు వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. బియ్యాన్ని కార్డుదారులకు ఇవ్వకుండా డీలర్లు వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. -వీరాస్వామి, తహశీల్దార్ సమాచారం అందితే చర్యలు చౌకబియాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. చిన్నచిన్న పొరబాట్లు ఉంటే సరిచేస్తాం. అక్రమ రవాణాపై ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం. అక్రమ రవాణాను అడ్డుకుంటాం. -సంజీవ్కుమార్, రూరల్ ఎస్ఐ -
టపాసుల పంచాయితీ
అనంతపురం క్రైం, న్యూస్లైన్: టపాకాయల దుకాణాల ఏర్పాటులో తప్పనిసరిగా నిబంధనలు పాటించకపోతే అనుమతించేది లేదని త్రీటౌన్ సీఐ దేవానంద్ హెచ్చరించడంతో వ్యాపారులు ఆందోళనలో పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. దీపావళి పండుగకు రెండు రోజులు మాత్రమే ఉండడంతో నగరంలోని వ్యాపారులు 40 దుకాణాల ఏర్పాటు రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులతో అనుమతులు పొంది స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఆ ప్రాంగణంలో 48 స్టాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు, పోలీసులు సూచించిన మేరకు దుకాణాల ఏర్పాటు లేకపోవడంతో త్రీటౌన్ సీఐ వారిని హెచ్చరించారు. నిబంధనలు అనుసరించకపోతే, స్టాళ్లన్నింటినీ తొలగిస్తామని చెప్పారు. దీంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజులుగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు, వాణిజ్యపన్నులు, అగ్నిమాపక శాఖ అధికారుల దాడులతో విసిగి వేసారిపోయామని, ప్రస్తుతం దుకాణాల ఏర్పాటులో సైతం నిబంధనలు అడ్డుగా నిలుస్తుండడంతో, ఈ ఏడాది టపాకాయల విక్రయాలు ఎలా సాగించాలని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని లెసైన్సుదారుల్లో 38 మందిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు బనాయించి రూ. కోటి పైగా విలువైన సరుకును సీజ్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ముట్టజెబుతామని రూ.25లక్షలు వసూలు నిబంధనల పేరుతో ఎలాంటి ఒత్తిళ్లు రాకుండా చేస్తానంటూ ఓ వ్యక్తి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు వారు ఆరోపించారు. ఇప్పటికే ఓ ఉన్నతాధికారికి రూ.2 లక్షలు ఇచ్చినట్లు ఆయన చెప్పాడని అంటున్నారు. మిగిలిన మొత్తాన్ని ఆయన వద్దే ఉంచుకోవడం వల్లే అందరూ తమపై ఆంక్షలు విధిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి స్టాళ్ల ఏర్పాటుకు సహకరించాలని వారు కోరుతున్నారు. -
ముడుపుల ‘బాంబులు’
దీపావళి వస్తోందంటే ప్రజలకే కాదు.. టపాసుల వ్యాపారులకు.. ఆ దుకాణాలకు అనుమతిలిచ్చే అధికారులకు పండగే. ఎందుకంటే వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేసి అధిక ధరలకు బాణాసంచా విక్రయిస్తుంటారు. ఈ తతంగమంతా కళ్లముందే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినందుకు వారికీ కొంత ‘ప్రతిఫలం’ దక్కుతుంది. ఇలా వ్యాపారులు, అధికారుల వైఖరి పుణ్యమాని మోసపోయేది ప్రజలేనన్నది ఏటా జరుగుతున్న తంతే. సిరిసిల్ల/మంథని/జగిత్యాల, న్యూస్లైన్ : దీపావళి టపాసుల వ్యాపారులు నిబంధనల ప్రకారం అగ్నిప్రమాదాలు జరగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా దుకాణాలను ప్రారంభించాలి. ఒక్కో దుకాణం అనుమతికి రెవెన్యూ, మున్సిపాలిటీ, మేజర్ గ్రామపంచాయతీ, పోలీసు, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు కావాలి. దుకాణదారులు అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా అన్ని శాఖల అధికారులు డబ్బులు తీసుకుంటూ కళ్లు మూసుకొని అనుమతులిస్తున్నారు. దీపావళి పండగకు టపాసులు అమ్ముకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలన్న వ్యాపారుల మధ్య పోటీ ముడుపులకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే లక్షలాది రూపాయల టపాసులను కొనుగోలు చేసిన వ్యాపారులు లెసైన్స్ రాకుంటే నష్టపోతామని పోటాపోటీగా అధికారులకు డబ్బులిస్తూ లెసైన్స్ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అన్నీ సక్రమంగా ఉన్నా అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేకుంటే ఏదో ఒక సాకుతో దుకాణాల లెసైన్స్లు ఇవ్వకుండా సతాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లావ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, హుస్నాబాద్, సుల్తానాబాద్, ధర్మపురి, రాయికల్, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, మంథని, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో 475 దుకాణాల అనుమతికి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ముడుపులే ఎక్కువ.. నిబంధనల ప్రకారం రెవెన్యూ, అగ్నిమాప క, పోలీసు, మున్సిపల్ అధికారులకు నిర్దిష్ట రుసుమును వ్యాపారులు ఎస్టీవోల్లో చలాన చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ, ఫైర్, మున్సిపాలిటీలకు రూ.500 చొప్పున, పోలీసు శా ఖకు రూ.1500 ప్రభుత్వానికి పన్ను చెల్లిం చాల్సి ఉండగా, వ్యాపారుల నుంచి ముడుపులే ఎక్కువ దండుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు తాత్కాలిక అనుమతి కోసం రూ.3000, మున్సిపల్ అధికారులు రూ. 2000, అగ్నిమాపక అధికారులు ఒక్కో లెసైన్స్కు రూ.2000, అందరికంటే ఎక్కువగా పోలీసుశాఖ రూ.3000 చొప్పున వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. టపాసులపై ఎమ్మార్పీ లేకపోవడం, ఎక్కడ తయారయ్యాయో ముద్రించకపోవడంతో దీన్ని సాకుగా చూపుతూ తూనికలు, కొలతల అధికారులు దుకాణం తెరచిన రోజు వచ్చి వేధిస్తారని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఒక్కో లెసైన్స్కు రూ.5000 వరకు ఖర్చయితే ఈసారి రూ.10 వేలవుతోందని వ్యాపారులు వాపోతున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా రూ.47.50 లక్షల మేరకు అధికార యంత్రాంగం దీపావళి అవినీతి ధమాకాను మోగించారు. ‘హోల్సేల్’ లాభాలు టపాసులను నిల్వ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. నిబంధనల మేరకు గోదాముల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కోరుట్లతోపాటు మరో రెండు పట్టణాల్లో టపాసులు నిల్వ చేయడానికి వ్యాపారులకు అనుమతి ఉంది. వీరు గోదాముల సామర్థ్యానికి మించి టపాసులను నిల్వ ఉంచి అమ్మకాలు చేపట్టి లాభాలు గడిస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు ఆయా పట్టణాల్లో ఒక దుకాణానికి అనుమతి తీసుకుని రెండు దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తారు. మరికొందరు పట్టణాల్లో తమ గృహాల్లో అక్రమంగా నిల్వ చేసి రిటేల్ వ్యాపారులకు అమ్ముతారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేది అధికారులకే తెలియాలి. భారీగా పెరిగిన ధరలు ప్రతి సంవత్సరం అన్ని ముడిసరుకుల రీతిలో టపాసులకు సంబంధించిన ముడిసరుకుల ధరలు, లేబర్ చార్జీలు పెరుగడంతో టపాసుల ధరలు 20-30 శాతం పెరుగుతాయని హోల్సేల్ వ్యాపారులు అంటున్నారు. గతంలో కిలో టపాసులు రూ.240 ఉండగా, ఈసారి రూ.300కు పైగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా రూ.5కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. -
‘అవినీతి టపాకాయ్’
సాక్షి, అనంతపురం: ఈ దీపావళికి నగరంలో టపాకాయలు పేలడం సంగతి ఎలాగున్నా... ఓ కాంగ్రెస్ నాయకుడి దెబ్బకు మాత్రం టపాసుల వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో టపాసులు విక్రయించాలంటే ఒక్కొక్కరు రూ.50 వేలు ఇవ్వాల్సిందేనంటూ ఆ నాయకుడు హుకుం జారీ చేయడంపై మండిపడుతున్నారు. పైగా ఆ సొమ్ము తనకు కాదని, వివిధ శాఖల అధికారులను ‘మేనేజ్’ చేయడానికేనంటూ ఆ నాయకుడు సాకులు చెబుతున్నాడు. నగరంలో టపాసులు విక్రయించడానికి 47 మంది లెసైన్స్ కలిగి ఉన్నారు. దీపావళి సందర్భంగా కొన్ని రూ.కోట్ల విలువైన టపాసులు విక్రయిస్తుంటారు. గతంలో ఎవరి దుకాణాల్లో వారు అమ్మేవారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఐదేళ్ల నుంచి టపాసుల విక్రయాలను న్యూటౌన్ జూనియర్ కళాశాల మైదానానికి మార్చారు. రెవెన్యూ అధికారులే స్టాళ్లు ఏర్పాటు చేసి సీనియారిటీ ప్రకారం వ్యాపారులకు కేటాయిస్తుంటారు. ఇందుకు కొంత రుసుం వసూలు చేస్తారు. ఇక టపాసుల వ్యాపారులు పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక, వాణిజ్య పన్నులు తదితర శాఖల అధికారులకు ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోందన్న విమర్శలున్నాయి. గత ఏడాది ప్రతి వ్యాపారి ముడుపుల రూపంలో రూ.14 వేల దాకా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఆయా శాఖల సిబ్బందికి టపాసులు కూడా ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. వ్యాపారులు మాత్రం ప్రతి యేటా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అయితే... ఈసారి వ్యాపారుల్లోనే ఒకరైన కాంగ్రెస్ నాయకుడి దెబ్బకు మిగతా వారు హడలెత్తుతున్నారు. వ్యాపారులు ఒక్కొక్కరు రూ.50 వేలు ఇవ్వకపోతే వ్యాపారం చేయడానికి వీలు లేదని ఆ నాయకుడు తెగేసి చెప్పడంతో వారు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది మామూళ్లు అన్ని శాఖలకు కలుపుకుని ఒక్కో షాపునకు రూ.14 వేలకు మించలేదని, ఇప్పుడు అంత మొత్తం ఎందుకని వారు సదరు నాయకుడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెబుతున్న వ్యావారులకు సదరు వ్యాపారి.. ధరలు పెంచుదామంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారట. -
పట్టిందే పరీక్ష.. చెప్పిందే ధర
జమ్మికుంట, న్యూస్లైన్ : రైతులు తాము మొదటిసారి తెంపిన పత్తిని జమ్మికుంట మార్కెట్కు బుధవారం నుంచి తీసుకొస్తున్నారు. అయితే వ్యాపారులు చేతులతో తేమ పరీక్షలు చేస్తూ రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. ‘తక్కువ తేమ ఉంది.. నీ పత్తికి ఇంతే ధర’ అంటూ తమకు తోచింది ఇస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు సరే అనాల్సి వస్తోంది. దీంతో క్వింటాలుకు రూ.500 నుంచి రూ.1000 వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఇదంతా తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మద్దతు ధర ఇయ్యలే క్వింటాలు పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.4 వేలు ఉంది. జమ్మికుంట వ్యవసా య మార్కెట్కు గురువారం మూడు వే ల క్వింటాళ్ల పత్తి వచ్చింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్టం గా ఒక్కో క్వింటాలుకు రూ.3500లు పలికిం ది. వ్యాపారులు చేతులతో తేమ పరీక్షలు చేస్తూ కొనుగోళ్లు చేశారు. ధర మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత వారి గుమస్తాలు రైతుల చేతిలో చీటీలు ఉంచారు. దానిలో చూసిన రైతులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. మద్దతు ధర కంటే రూ.400 నుంచి రూ.500 వరకు తగ్గించి ఇచ్చారు. అక్కడ డిమాండ్... ఇక్కడ తగ్గింపు అంతర్జాతీయ మార్కెట్లో పత్తి క్యాండీకి ప్రస్తుతం రూ.42 వేల నెంచి రూ.45వేలు పలుకుతోంది. జమ్మికుంట మార్కెట్లో మాత్రం క్వింటాలుకు రూ.3000 నుంచి రూ.3700 మాత్రమే ఇస్తున్నారు. వ్యాపారులు, అధికారులు ఒక్కటవడంతోనే తాము నష్టపోతున్నట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరికరాలేవి ? పత్తిని కొనేటప్పుడు పరికరాలతో తేమను పరీక్షించాలి. గ్రేడింగ్ కోసం మార్కెట్లోని ల్యాబ్కు పంపించాలి. కానీ ల్యాబ్లో ఉద్యోగి లేకపోవడంతో అది మూతపడింది. ఇదే అదనుగా వ్యాపారులు చేతులతో తాకి నాణ్యతను నిర్ధారిస్తున్నారు. తేమ ఉందని మెలికపెడుతూ ధరల్లో కోత విధిస్తున్నారు. ఈ తతంగం అంతా మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ మార్కెట్ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుంటున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు వేడుకుంటున్నారు. -
వ్యాపారులే అతని టార్గెట్
ఒంగోలు, న్యూస్లైన్ : బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వారిని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాలనుకున్న మోసగాడి వ్యూహం ఫలించలేదు. పోలీసులకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకోవడంతో బాధితులు ఆర్థికంగా నష్టపోలేదు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా ఆర్ వెల్లూరు గ్రామానికి చెందిన క్రిష్ణం సతీష్ అలియాస్ భద్రాచలం వ్యాపారులను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పెళ్లూరులో అరెస్టు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాసన్ తన చాంబర్లో శుక్రవారం సాయంత్రం మీడియాకు వివరించారు. ఇదీ..జరిగింది క్రిష్టం సతీష్ ఆర్వల్లూరు గ్రామంలో 2001లో ఇంటర్ పూర్తిచేశాడు. ఓ ఫైనాన్స్ వ్యాపారి వద్ద పనిచేస్తూ * 4 లక్షలతో ఉడాయించాడు. అక్కడి నుంచి సేలం సమీపంలోని మేటూరు చేరుకున్నాడు. అక్కడ ఫైనాన్స్ వ్యాపారిగా పరిచయం చేసుకొని *40 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. అక్కడ పోలీసుస్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది. ఈసారి నెల్లూరు వచ్చాడు. అక్కడ మూడు నెలల పాటు నివాసం ఉన్నాడు. లాభం లేదనుకుని ప్రకాశం జిల్లా న్యూ పెళ్లూరు కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానికి కేటీఆర్ అండ్ సీఎంఎల్ ఫైనాన్స్, కెమికల్ కంపెనీ అని బోర్డు తగిలిచ్చాడు. కేఆర్టీ, సీఎంఎల్ అనే ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు ఇప్పిస్తుంటానని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను కలిశాడు. విదేశాల్లో చదువుకునేందుకు రుణం ఇప్పించమని కొందరు ఇతడిని వేడుకున్నారు. వారికి ఎంత రుణం కావాలో అడిగి తెలుసుకున్నాడు. వాటికి హామీగా అవసరమైన ఆస్తుల తాలూకా బాండ్లు, ఫైనాన్స్ కంపెనీలకు రాసిచ్చే ఒప్పంద పత్రాలు తీసుకున్నాడు. రుణం మంజూరు కావాలంటే ముందుగా తీసుకునే మొత్తానికి కనీసం రెండు ఇన్స్టాల్మెంట్లు అడ్వాన్సుగా చెక్కులు ఇవ్వాలని నమ్మించాడు. ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని సంస్థ నిర్ణయిస్తుందంటూ ఖాళీ చెక్కులు తీసుకున్నాడు. ఇలా ఇతని వలలో చిక్కుకున్నవారిలో జిల్లాకు చెందిన ఒక టీడీపీ నేత, రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఓ హాస్పిటల్ డెరైక్టర్, తూర్పుగోదావరి జిల్లాలోని ఓ విద్యాసంస్థ యజమాని ఇలా అనేక మంది ఉన్నారు. తమ ఫైనాన్స్ కంపెనీలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తాలూకా బ్లాక్మనీ ఉందంటూ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బిగ్షాట్స్కు వివరించేవాడు. గుట్టురట్టు ఇలా.. నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడం, తమ పత్రాలన్నీ అతని చేతిలో ఇరుక్కుపోవడంతో ఏం చేయాలో పాలుపోని పలువురు తాలూకా సీఐని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సీఐ శ్రీనివాసన్ పెళ్లూరులోని సతీష్ ఇంటిపై తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ పలువురికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 10 సూట్కేసుల్లోని పత్రాలను సీజ్ చేశారు. ఖాళీ చెక్కులు కూడా లభ్యమయ్యాయి. అనంతరం నిందితుడిని విచారించగా అసలు విషయాలు బహిర్గతమయ్యాయి. గతంలో కేసులతో పాటు తాను ఏం చేయాలనుకున్నది వివరించాడు. రుణాలు కావాలనుకున్నవారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు కింద రుణాన్ని బట్టి * 2 నుంచి * 10 లక్షలు చొప్పున వసూలు చేసుకోవాలనే అతని పన్నాగం బయటపడింది. వారం రోజుల్లో కనీసం పదిమంది నుంచి * 50 లక్షలు వసూలు చేసుకొని పరారీ కావాలనేది నిందితుని ఉద్దేశం. అదృష్టవశాత్తు ఇంతవరకు నిందితుని చేతికి ఒక్క రూపాయి కూడా చేరలేదని సీఐ స్పష్టం చేశారు. కేసును ఛేదించి ప్రజల్లో పోలీసుశాఖకు మంచి పేరు తీసుకొచ్చారంటూ సీఐతో పాటు ఆయన సిబ్బందిని ఒంగోలు టౌన్ డీఎస్పీ పల్లె జాషువా అభినందించారు. ఈ సందర్భంగా బాధితులు పలువురు తాలూకా సీఐ వద్దకు చేరుకుని తమ పేర్లను బయటపెట్టొద్దంటూ వేడుకోవడం గమనార్హం. పోలీసులు స్పందించకుంటే.. పోలీసులు సకాలంలో స్పందించకుంటే కొంతకాలం తరువాత బాధితులే నిందితులుగా మారేవారని కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఖాళీ చెక్కులపై తన ఇష్టం వచ్చినట్లుగా నగదు రాసుకొని నిందితుడు జిల్లా మార్చి ఎక్కడో ఒకచోట క్యాష్ చేసుకునేందుకు యత్నించేవాడు. చెక్కులు బౌన్స్ అయితే బాధితుల మీదే పోలీసులకు ఫిర్యాదు చేసేవాడు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను పరిశీలించిన పోలీసులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
అసలు రేటొకటి... అమ్మేదొకటి!
సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి కొరత సాకుతో నగర మార్కెట్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. వ్యాపారులు ఎవరికి తోచిన రీతిలో వారు అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.60-65లకు విక్రయించే ఉల్లిలో వ్యాపారులకు మహా అయితే కేజీకి రూ.5-6ల లాభం ఉంటుందనుకొంటాం. అయితే... కేజీకి రూ.18-23ల వరకు అదనంగా పిండుకొంటున్న విషయం వినియోగదారులకు తెలియదు. నిజానికి హోల్సేల్ మార్కెట్లో గ్రేడ్-1 రకం ఉల్లి ధర కేజీ రూ.42, గ్రేడ్-2 రకం రూ.32లకే లభిస్తోంది. కానీ రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి వ్యాపారులు ధర భారీగా పెంచేస్తున్నారు. ఆ లాభం సరిపోదన్నట్లు గ్రేడ్-1 రకం ఉల్లిలో గ్రేడ్-2 ఉల్లిని కూడా కలిపేసి నాణ్యమైన సరుకు పేరుతో వినియోగదారుడికి అంటగడుతున్నారు. వీటిని ఇంటికి తీసుకె ళ్లిన రెండోరోజే అందులో సగం సరుకు డ్యామేజ్ అవుతోంది. ఇక తోపుడు బండ్ల వ్యాపారులు మరో అడుగు ముందుకేసి ఇళ్ల వద్దకే సరుకు తీసుకెళ్లి సామన్య మధ్యతరగతి వర్గాల జేబుకు పెద్ద కన్నమే వేస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లో గ్రేడ్-2 ఉల్లిని క్వింటాల్ రూ.32వేల ప్రకారం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాక వాటిని గ్రేడింగ్ చేసి రెండు రకాల ధరల్లో విక్రయిస్తున్నారు. కాస్త పెద్దసైజ్లో ఉన్న ఉల్లిని కేజీ రూ.50-55లకు, చిన్నసైజ్ ఉల్లిని కేజీ రూ.40-45ల ప్రకారం అమ్ముతున్నారు. నిజానికి హోల్సేల్ మార్కెట్లో వారికిపడ్డ ధర కేజీ రూ.32లు మాత్రమే. ఇతర రవాణా, హమాలీ ఖర్చులన్నీ వేసుకున్నా కేజీ రూ.35-36ల చొప్పున అమ్మాలి. అయితే... ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి కొరతను సొమ్ము చేసుకునేందుకు ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల నగరానికి సరుకు రావ ట్లేదన్న సాకుతో వ్యాపారులు ధరలు పెంచి దగా చేస్తున్నారు. సరఫరా అరకొరే... నగర అవసరాలకు తగినంత సరుకు దిగుమతి చేసుకునే విషయంలో మార్కెటింగ్ శాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. నగర రోజూవారీ అవసరాల్లో నాలుగో వంతు మాత్రమే సరుకు దిగుమతి అవుతోంది. శనివారం హోల్సేల్ మార్కెట్కు మొత్తం 7వేల క్వింటాళ్ల ఉల్లి మాత్రమే దిగుమతైంది. ఇందులో గ్రేడ్-1 రకం 3వేల క్వింటాళ్లు, గ్రేడ్-2 రకం 4వేల క్వింటాళ్లు సరుకు వచ్చింది. గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్ రూ.42వేలు, గ్రేడ్-2 రకానికి రూ.32వేలు కనీస మద్దతు ధర పలికింది. ఈ ప్రకారం చూస్తే హోల్సేల్గా మొదటి రకం ఉల్లి కేజీ రూ.42, రెండో రకం రూ.32లు మాత్రమే. అయితే... రవాణా, హమాలీ, డ్యామేజ్, లాభం వంటివి కలుపుకొని హోల్సేల్ ధరకంటే మరో రూ.4-5లు అదనంగా వేసుకొని అమ్మాలి. కానీ వ్యాపారులు మాత్రం గ్రేడ్-1 ఉల్లిని కేజీ రూ.60-65, గ్రేడ్-2 రకాన్ని రూ.50-55ల ప్రకారం అమ్ముతుండటం గమనార్హం. రైతుబజార్లలోని సబ్సిడీ కౌంటర్లలో ఉల్లి కేజీ రూ.32లకు విక్రయిస్తున్నా... అవి అందరికీ అందని పరిస్థితి. ఏదో నామ మాత్రంగా ఒక్కో రైతుబజార్కు 8-10 క్వింటాళ్ల ఉల్లిని అధికారులు సరఫరా చేస్తుండటంతో అవి ఏ మూలకూ సరిపోవట్లేదు. నిల్వలపై నిర్లక్ష్యం మార్కెట్లో మరింత కొరతను సృష్టించి... ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు ఎత్తుగడ వే సి పెద్దమొత్తంలో ఉల్లిని నిల్వ చేసినట్లు సమాచారం. ఈ విషయం మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలిసినా దాడులు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హోల్సేల్ మార్కెట్ వరకు తాము పర్యవేక్షిస్తామే తప్ప, బహిరంగ మార్కెట్లో ధరలను నియంత్రించడం తమ చేతుల్లో లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పలు గోదాముల్లో దాచేసిన ఉల్లి నిల్వలను వెలికితీస్తే ధరలు వాటంతట అవే దిగివస్తాయని మార్కెటింగ్ విశ్లేషకులు సూచిస్తున్నారు. -
పాక్ నుంచి ఉల్లి దిగుమతులు కోరుతున్నాం: వ్యాపారులు
చండీగఢ్: దేశంలో ఉల్లిపాయల కొరత తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునే దిశగా చర్యలు చేపట్టినట్టు అమృత్సర్కు చెందిన వ్యాపారులు తెలిపారు. దీనిలో భాగంగా పాకిస్థాన్ వ్యాపారులు భారత్కు ఉల్లిపాయలను ఎగుమతి చేసుకునేందుకు గాను అక్కడి ప్రభుత్వాన్ని అనుమతి కోరాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అట్టారీ-వాఘా రహదారి మార్గం ద్వారా భారత్కు ఉల్లిపాయలను ఎగుమతి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పాక్ వ్యాపారులను కోరినట్టు రాజ్దీప్ ఉప్పల్ అనే వ్యాపారి తెలిపారు. సాధారణంగా ఈ మార్గంలో ఉల్లిపాయల ఎగుమతికి పాక్ అనుమతించదని, అయితే, ఈ దారిగుండా ఉల్లిపాయలు భారత్కు చేరుకునేందుకు తక్కువ ఖర్చవుతుందని, ఈ విషయాన్ని త్వరగా పరిశీలించి అమల్లోకి వచ్చేలా చూడాలని లాహోర్ ఉల్లి వ్యాపారులను అడిగామని రాజ్దీప్ వివరించారు. ప్రస్తుతం భారత్లో కిలో ఉల్లి రూ. 70 నుంచి 80 మధ్య పలుకుతోందని పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటే దీని ధర రూ.40కి పడిపోతుందని ఆయన చెప్పారు.