
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్కు భారీ గిఫ్ట్ ఇచ్చింది. వార్షిక పనితీరు ఆధారంగా ఉద్యోగులకు అందించే స్టాక్ ప్రోత్సాహకాల్లో 10 కోట్ల రూపాయల మార్కెట్ విలువున్న పరిమిత స్టాక్ యూనిట్లు(ఆర్ఎస్యూ)ను ఆయనకు కేటాయించింది. మరో కీలక ఎగ్జిక్యూటివ్ సీవోవో యూబీ ప్రవీణ్ రావుకు రూ. 4 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. అలాగే సుమారు రూ.5 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలు వాటాదారుల ఆమోదం పొందాల్సి వుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఆర్ఎస్యూ కేటాయింపు ఉద్యోగుల పనితీరు ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ ఓనర్షిప్ 2019 పథకం విస్తరణలో భాగంగా ఈ కేటాయింపులని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఐటీ పరిశ్రమలో అనేక అంశాల్లో ఇన్ఫోసిస్ మార్గదర్శిగా ఉందని, ముఖ్యంగా ఆర్ఎస్యూ కేటాయింపులు కీలక మైలురాయి లాంటిదని ఇన్ఫీ సీఈవో వ్యాఖ్యానించారు. ఉద్యోగులే తమకు పెద్ద ఎసెట్ అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నిరంతర, స్థిరమైన పనితీరుతో విలువైన సేవలందించిన తమ సీనియర్ ఉద్యోగులను గుర్తించి, గౌరవించడం తమ లక్ష్యమని చెప్పారు. అలాగే కంపెనీ దీర్ఘకాల విజయానికి పాటుపడిన ఉద్యోగులను యజమానులను చేయడం ద్వారా వారి శ్రమకు, నిబద్ధతకు ప్రతిఫలం లభిస్తుందని పరేఖ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment