
సాక్షి, ముంబై: ఆర్థిక ఫలితాల నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మరో రికార్డును సొంతం చేసుకుంది. 2017-18 క్యూ4లో పటిష్ట ఫలితాల్లో అంచనాలకు మించి రాణించడంతోపాటు వాటాదారులకు 1:1 బోనస్ బొనాంజాతో నిమిషాల్లో ఇన్వెస్టర్ల సంపదను భారీగా రూ. 30వేలకోట్ల మేర పుంజుకుంది. శుక్రవారం టీసీఎస్ షేరు 6శాతానికిపైగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. అంతేకాదు 100బిలియన్ డాలర్ల క్లబ్లో చేరేందుకు సమీపంలో ఉంది.
దేశీ స్టాక్ మార్కెట్లలో తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్(విలువ)ను సాధించిన దిగ్గజ సంస్థగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ తాజాగా ఈ సరికొత్త రికార్డును సాధించింది. టీసీఎస్ షేర్ రూ. 3400 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడంతో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ విలువలో దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి కంపెనీ టీసీఎస్. అంతేకాదు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్తో (38 బిలియన్ డాలర్లు) పోలిస్తే ఇది రెండున్నరెట్లు ఎక్కువ.
కాగా క్యూ4(జనవరి-మార్చి)లో త్రైమాసిక ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం 5.7 శాతం పెరిగి రూ. 6904 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 32,075 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించింది. దీంతోపాటు వాటాదారులకు షేరుకి రూ. 29 తుది డివిడెండ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment