
సుల్తాన్బజార్: బైక్ రైడింగ్పై మోజుతో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఓ యువకుడిని సుల్తాన్బజార్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి రూ. 15.20 లక్షల విలువైన 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సుల్తాన్బజార్ పోలీసుస్టేషన్లో ఈస్ట్జోన్ అదనపు డీసీపీ గోవింద్రెడ్డి, సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి, డీఐ లక్ష్మణ్తో కలిసి వివరాలు వెల్లడించారు. మౌలాలీకి చెందిన మహ్మద్ మహ్మద్ అబ్దుల్ అబుబకార్ అష్రాఫి అలియాస్ అషు పని లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. బైక్ రైడింగ్ మోజుతో అతను నగరంలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలోని విలువైన బైక్లు చోరీ చేస్తూ వాటిపై నెక్లెస్ రోడ్లో రేసింగ్లకు పాల్పడుతూ సోషల్మీడియాలో అప్లోడ్ చేసేవాడు.
చోరీ చేసిన బైక్లో పెట్రోల్ అయితే అక్కడే దానిని వదిలేసి మరో బైక్ను చోరీ చేసేవాడు. గురువారం రాంకోఠిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సుల్తాన్బజార్ పోలీసులు పల్సర్పై వస్తున్న అష్రాఫీపై అనుమానంతో అతడిని అడ్డుకున్నారు. వాహనానికి ధృవపత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిపై మల్కాజ్గిరి, గోల్కొండ, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి పరిధిలో బంగారు అభరణల చోరీ కేసు నమోదై ఉంది. రెండు సార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లివచ్చినా పాతపంథానే అనుసరిస్తూ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి నుంచి 12 బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. డీసీపీ రమేశ్ పర్యవేక్షణలో డీఎస్ఐ నరేశ్కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment