వివరాలు వెల్లడిస్తున్న రాచకొడ సీపీ మహేష్భగవత్ ,నిందితుడు సౌమన్ బెనర్జీ
నేరేడ్మెట్: కస్టమ్స్, ఏసీబీ అధికారి ముసుగులో నాలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతూ దాదాపు మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని రాచకొండ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ కమిషనర్ మహేష్భగవత్ వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, ఉలుబెరియా జిల్లా, అంతిలా గ్రామానికి చెందిన సౌమన్ బెనర్జీ సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. 2013లో అతను తన గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా డబ్బులు దండుకొని మోసం చేశాడు. స్థానికుల నుంచి ఒత్తిడి పెరగడంతో అక్కడి నుంచి తన భార్య సుపర్ణ బెనర్జీ, కుమారుడు సుసోవన్ కలిసి పారిపోయాడు. అక్కడ అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మేడిపల్లి ఠాణా పరిధిలోని చెంగిచెర్లకు చేరుకున్న అతను విశాఖపట్నం హార్బర్లో కస్టమ్స్ అధికారిగా పని చేస్తున్నట్లు స్థానికులతో పరిచయం చేసుకున్నాడు.
ఎలాంటి అనుమతులు, రసీదులు లేకుండా తనిఖీల్లో ప్రయాణీకుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్లు, నాణెలు సగం ధరకు అందిస్తానని చెప్పడంతో అతడి వల్లో పడిన పలువురు డబ్బులు చెల్లించారు. మొదట వారి నమ్మకం పొందటానికి బంగారు నాణెలు ఇస్తూ వచ్చాడు. అనంతరం పలువురి నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. అనంతరం రుణాల కోసం బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశంతో చెంగిచెర్ల, మారేడుపల్లి ప్రాంతాల్లో రెండు కిరాణా సంస్థలను ఏర్పాటు చేసిన అతను పలు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు. ఈ సొమ్ముతో రూ.60లక్షల విలువ చేసే రెండు విల్లాలు, రెండు కార్లు, మూడు బైక్లు కొనుగోలు చేశాడు. ఇందులో భాగంగా తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని, ఇందుకు 30శాతం వడ్డీ చెల్లిస్తానని ప్రచారం చేయడంతో పలువురు పెట్టుబడులు పెట్టారు. తన మోసాలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో అతను చెంగిచెర్లలోని తన ఇంట్లో పెట్టుబడిదారులకు విలాసవంతమైన విందులు ఏర్పాటు చేసేవాడు. ఫ్లయిట్ టికెట్లు, ఖరీదైన గదులను సమకూర్చడం ఇతర ఖర్చులూ భరిస్తూ విహార యాత్రలు ఏర్పాటు చేయడమేగాక, వారికి ఖరీదైన సెల్ఫోన్లు కానుకగా ఇచ్చేవాడు. ఇలా పలువురి నుంచి రూ.5కోట్ల వరకు వసూలు చేశాడు.
చెంగిచెర్ల నుంచి పరారీ...
2017–జనవరి 31న తన వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెంగిచెర్ల నుంచి బిచాణ ఎత్తేశాడు. సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి, ఇంట్లో విలువైన వస్తు లన్నీ తీసుకొని మారుతి ఎర్టిగా వాహనంలో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం...
సీపీ మహేష్భగవత్ ఆదేశాలతో మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ బృందాలు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. పెట్టుబడిదారులను నిందితుడు తరచూ షిర్డీ, నాగ్పూర్, ఢిల్లీ,పూణె, ముంబై, గోవా,బెంగాల్ తదితర ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకువెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఆరా తీయగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అమృత్సర్లోనూ మోసాలు..
ఇందులో భాగంగా నాగ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడి మారుతి ఎర్టిగా వాహనం ఉన్నట్లు ఎస్ఓటీ బృందానికి సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకునేలోగా అతను అక్కడి నుంచి అమృత్సర్కు వెళ్లినట్లు తెలియడంతో వారు అమృత్సర్కు వెళ్లారు. అమృత్సర్లో ఆరు నెలలు ఉన్న నిందితుడు అక్కడ ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసి పారిపోయినట్లు గుర్తించారు. అక్కడి ఛాత్రా ఠాణాలో కేసు నమోదైంది. అమృత్సర్లో జ్యోత్ప్రీత్కౌర్, హరినాథ్రెడ్డి ఆధార్కార్డుల ద్వారా కొనుగోలు చేసిన సిమ్ కార్డులను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు అతను జార్ఘండ్లో ఉన్నట్లు గుర్తించి అక్కడి వెళ్లలోపే అక్కడినుంచి మాయమయ్యాడు. అనంతరం అతను ఒడిశా రాష్ట్రం, భువనేశ్వర్ పరిధిలో ని ధౌలి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పుబససనా –కౌసల్య గంగ వద్ద ఓ ఇంట్లో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్య, కొడుకు సహకారం
నిందితుడు సౌమన్ బెనర్జీ మోసాల్లో భార్య, కుమారుడి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని నుంచి నకిలీ కస్టమ్స్, ఏసీబీ ఇన్స్టిగేషన్ అధికారి, జీఎం సీహాక్ సెక్యూరిటీ సర్వీసెస్, నకిలీ ఓటరు గుర్తింపు కార్డు, 25 రకాల నకిలీ రబ్బర్స్టాంప్లతోపాటు పెద్ద కంపెనీల్లో పలుహోదాల్లో నకిలీ గుర్తింపు కార్డులతోపాటు కుమారుడు, భార్య నకిలీ ఆధార్కార్డులను, జార్ఘండ్లో కొడుకు ఇంటర్ చదివినట్లు నకిలీ ప్రొవిజనల్ను, కారు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమను ఎలా మోసచేశాడో వివరించారు. మేడిపల్లి, కుషాయిగూడ పీఎస్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసును చేధించిన ఎస్ఓటీ సీఐ నవీన్కుమార్, సిబ్బందిని సీపీ నగదు అవార్డులతో సత్కరించారు. సమావేశంలో అదనపు సీపీ సుధీర్బాబు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్రెడ్డి, ఎస్ఓటీ సీఐ నవీన్కుమార్, మేడపల్లి సీఐ అంజిరెడ్డి,ఎస్ఐలు అవినాష్బాబు, రత్నం, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు.
ఆధారాలు లభించకుండా జాగ్రత్త
నిందితుడు తన ఆధారాలు లభించకుండా మొదటి నుంచి జాగ్రత్త తీసుకుంటున్నాడు. తన పేరు మీద సెల్సిమ్లు తీసుకోకుండా, స్థానికుల ఆధార్కార్డులో రెండుమూడు సిమ్కార్డులను పొంది వాటినే ఉపయోగించేవాడు. 20 బ్యాంకుల్లో తన పేరున ఖాతాలు తెరిచిన అతను పోలీసులకు తన ఆచూకీ తెలుస్తుందని ఏటీఎంల ద్వారా, నేరుగా డబ్బులు డ్రా చేయకుండా జాగ్రత్త పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment