కోటా : రాజస్తాన్లోని బరన్ జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. బంధువుల ఇంటికెళుతున్న ఓ మహిళ(40)పై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. ఈ వీడియోను నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. రాజస్తాన్లోని కోటాలో ఓ డాబాలో పనిచేస్తున్న బాధితురాలు ఫిబ్రవరిలో బంధువుల్ని కలుసుకునేందుకు బరన్కు చేరుకున్నారు.
అక్కడ బాధితురాలికి పరిచయమున్న చేతన్(21) ఆమెను బంధువుల ఇంటి దగ్గర దింపుతానని చెప్పి బైక్పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం చేతన్ ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురు యువకులు అక్కడకు చేరుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని నిందితులు మొబైల్ ఫోన్లో వీడియో తీశారు.
అనంతరం మరుసటి రోజు బాధితురాలిని బంధువుల ఇంటి వద్ద వదిలిన యువకులు.. ఈ సంగతి ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు బరన్లోని మహిళా పోలీస్స్టేషన్లో ఈనెల 5న ఫిర్యాదు చేశారు. దీంతో దుండగులపై ఐపీసీ సెక్షన్ 376తో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరికోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment