
సాక్షి, విజయవాడ: సాంకేతిక పరిజ్ఞానం,పోలీసుల చాకచాక్యంతో కిడ్నాప్ కేసును 48 గంటల్లోనే ఛేదించామని డీసీపీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. అప్పు తీర్చలేదనే కారణంతో 8 నెలల బాలుడు అకీస్ని చాంద్, షహనాజ్ అపహరించారని తెలిపారు. రాజస్థాన్కు చెందిన పూలుభాయ్ ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తారని.. అప్పు విషయంలో చాంద్, పూలుభాయ్ల మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. ఈ క్రమంలో పూలుభాయ్ కుమారుడిని.. చాంద్ కిడ్నాప్ చేశాడని తెలిపారు. పోలీసులకు సమాచారం వచ్చే సమయానికి నిందితులు రైలులో పారిపోతున్నారని.. తమ బృందం వేగంగా స్పందించి ముందుగానే జైపూర్కు చేరుకుని, స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నామన్నారు. కేసును ఛేదించిన గన్నవరం పోలీసులను డీసీపీ అభినందించారు.