
ఊర్మిళ
యాచారం (రంగారెడ్డి) : చింతుల్లలో తప్పిపోయిన చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతి పట్ల తల్లిదండ్రులపైనే అనుమానం వ్యక్తమవుతోంది. యాచారం సీఐ కృష్ణంరాజు తెలిపిన వివరాలు... మండల పరిధిలోని చింతుల్ల గ్రామంలోని బీఎన్సీ ఇటుక బట్టీల్లో ఒడిశాకు చెందిన హేతురాం చత్రియ, తులసి చత్రియలు పనులు చేసుకుంటూ తన ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు.
హేతురాం చత్రియ, తులసి చత్రియల రెండో కుమార్తె ఊర్మిళ(7) ఈనెల 26న అదృశ్యమైంది. రెండు రోజుల పాటు వెతికినా జాడలేకపోవడంతో యజమాని రాజేందర్రెడ్డి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం ఇటుక బట్టీ సమీపంలోని పొలాల్లో వెతికారు. అంతకుముందే ఊర్మిళ తల్లి తులసి చిన్నారి మృతిచెంది ఉన్న స్థలం వద్ద ఉండి ఏడవడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి అదే స్థలంలో చూడగా చిన్నారి మృతదేహం లభ్యమైంది.
పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ ఎంవీరావు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వివరాలు సేకరించారు. తల్లిదండ్రులు చిన్నారి మృతిపై అనుమానంగా మాట్లాడుతుండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, చిన్నారి మృతికి గల కారణాల కోసం విచారణ చేస్తున్నట్లు సీఐ కృష్ణంరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment