పోలీస్‌ స్టేషన్‌ నుంచి లాక్కొచ్చి మరీ చంపేశారు | Mob Lynch Two Rape Accused in Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ఘటన : రేప్‌ నిందితులను కొట్టి చంపేశారు

Published Tue, Feb 20 2018 10:18 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

Mob Lynch Two Rape Accused in Arunachal Pradesh  - Sakshi

ఇటానగర్‌ : చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ ఇద్దరిని ప్రజలు కొట్టి చంపిన షాకింగ్‌ ఘటన అరుణాచల్‌ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీస్‌ స్టేషన్‌ నుంచి లాక్కొచ్చి మరీ ప్రజలు ఈ ఘటనకు పాల్పడ్డారు. సుమారు 400 నుంచి 1000 మంది ప‍్రజలు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

వాక్రో సర్కిల్‌లోని నామ్‌గో గ్రామంలో ఓ చిన్నారి(12) ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఐదురోజుల తర్వాత సమీపంలోని టీ గార్డెన్‌లో నగ్నంగా చిన్నారి శవం లభ్యమైంది. పోస్టుమార్టంలో బాలిక పైశాచికంగా అత్యాచారానికి గురైనట్లు తేలింది. ఘటనపై ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అస్సాంకు చెందిన వలస కూలీలు సంజయ్‌ సబర్(30)‌, జగదీశ్‌ లోహర్‌(25)లుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. 

ఈ ఘటనపై ఆగ్రహాంతో ఉన్న నామ్‌గో గ్రామస్థులు నిందితులు తేజూ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న విషయం తెలుసుకున్నారు. కర్రలతో ఒక్కసారిగా స్టేషన్‌పై దాడి చేశారు. వారిని అడ్డుకోవటానికి పోలీసులు చేసిన యత్నం ఫలించలేదు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి నగ్నంగా మార్చారు. ఆపై రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. కాగా, ఘటనపై ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ ఖండించారు. ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసిన పోలీస్‌ శాఖ.. ఎస్పీని బదిలీ చేసింది. ఖండూ ప్రభుత్వం ఘటనపై మెజిస్టేరియల్‌ విచారణకు ఆదేశించింది. ఈశాన్య రాష్ట్రాల్లో గత మూడేళ్లలో జరిగిన రెండో ఉదంతం ఇది. 2015లో దిమాపూర్‌(నాగాలాండ్‌)లో ఇలాగే ఓ రేప్‌ నిందితుడిని జనాలు కొట్టి చంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement