
మావోయిస్టులు హత్య చేసిన బంజమ సుజడ
జయపురం : ఒడిశా–ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులలో మావోయిస్టులు వారి కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి కాదు, మందుపాతరలు పెట్టి భద్రతా దళాలను ముఖ్యంగా బీఎస్ఎఫ్ జవాన్లను మావోయిస్టులు టార్గెట్ చేస్తూ పులువురిని హత మారుస్తుండగా కూంబింగ్ ఆపరేషన్లు, ఎన్కౌంటర్ల ద్వారా జవాన్లు మావోలను మట్టుపెడుతున్నారు.
ఇటీవల ఆ రాష్ట్రంలో మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఫారెస్టు డిపోలను తగుల బెట్టడం, రోడ్లు వేయకుండా నిరోధించడంతో పాటు పోలీస్ ఇన్ఫార్మర్లుగా అనుమానించి ప్రజలను చంపుతున్నారు. అటువంటి సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమ జిల్లా దోరణపాయి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది.
పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒక యువకుడిని మావోయిస్టులు కొట్టి చంపారు. హత్యకు గురైన వ్యక్తిని దొరణపాయి పోలీస్స్టేషన్ పరిధి పూనమపల్లి గ్రామవాసి బంజమ సుజడగా గుర్తించారు. దాదాసు 15మంది నుంచి 20 మంది మావోయిస్టులు ఆ గ్రామానికి వచ్చి బంజమ సుజడను ఇంటినుంచి పిలిపించి ప్రజల సమక్షంలో పెట్టారు.
అనంతరం పోలీస్ఇన్ఫార్మర్ అని ఆరోపించి కొట్టి చంపారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ముఖ్యంగా పోలీస్ఇన్ఫార్మర్లకు ఇదే గతి పడుతుందని గ్రామస్తులను మావోయిస్టులు హెచ్చంచినట్లు సమాచారం. ఈ సంఘటనతో ఆ గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల ప్రజలు భయభ్రాంతులవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment