
అరెస్టు చేసిన పాత నేరస్తులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీసీపీ రాజకుమారి
విజయవాడ : నగరంలో దొంగతనాలకు పాల్పడే నలుగురు పాత నేరస్తులను సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.74 లక్షలు విలువ చేసే బంగారు గొలుసు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులకు సంబంధించి బందర్ రోడ్డులోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ బి. రాజకుమారి వివరాలను వెల్లడించారు. సీసీఎస్ పోలీసులు కంకిపాడు మండలం పునాదిపాడులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నలుగురు పట్టుబడ్డారు. వారిని సీసీఎస్ సిబ్బంది విచారించారు. గతంలో వారు పాత నేరస్తులుగా గుర్తించారు. మొత్తం ఏడుగురు బృందంగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిలో సత్యనారాయణపురానికి చెందిన తుమ్మల మనోజ్కుమార్, తుమ్మల రాజేశ్, అజిత్సింగ్నగర్కు చెందిన గోవిందరాజులు అలియాస్ రాజాసాయి, రామవరప్పాడుకు చెందిన తుమ్మల విఘ్నేశ్వరరావులుగా గుర్తించి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
వీరి స్నేహితులైన షేక్ బాషా, రెహమతుల్లా అలిĶæహహ్ అక్తర్, అఫ్జల్ పరారీలో ఉన్నారు. వీరందరు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు ఓ ముఠాగా ఏర్పడి విశాఖపట్నం, నర్సీపట్నం దగ్గర మారుమూల గ్రామంలో గంజాయి కొని విజయవాడకు తీసుకువచ్చి చుట్టపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నిందితులు కంకిపాడు పోలీసు స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, సత్యనారాయణపురం ఏరియా మధురానగర్లో మరొక గొలుసు దొంగతనం, అజిత్ సింగ్నగర్ ఏరియాలో ఒక మోటారు సైకిల్, నూజివీడు ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లిలో ఒక చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు క్రైం డీసీపీ రాజకుమారి చెప్పారు. ఈ కేసును సీసీఎస్ ఏసీపీ కె. ప్రకాశరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బి. బాలమురళీ, ఎస్ఐ మోహన్కుమార్, కంకిపాడు ఎస్ఐ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment