వేర్వేరు ఘటనల్లో నలుగురి ఆత్మహత్య | Warangal Crime News Yesterday | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో నలుగురి ఆత్మహత్య

Sep 20 2018 11:29 AM | Updated on Nov 6 2018 8:08 PM

Warangal Crime News Yesterday - Sakshi

రమేష్‌(ఫైల్‌), బిక్కు మృతదేహం

భీమారం(వరంగల్‌): అనారోగ్య కారణంతో ఓ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే... వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లికి చెందిన కంచె రమేష్‌ (21) భీమారంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే పక్కనే ఉన్న ఓప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. కొంతకాలం రమేష్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం తీసుకున్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతోపాటు చదువులో కూడా వెనుకబడి ఉన్నట్లుపోలీసులు తెలిపారు. ఈనెల 17వ తేదీన ఉదయం హాస్టల్‌ నుంచి రమేష్‌ అదృశ్యమయ్యాడు. ఈమేరకు హాస్టల్‌ నిర్వాహకులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, బుధవారం రమేష్‌ మృతదేహం భీమారం చెరువులో లభ్యమైంది. అయితే  అనారోగ్యంతోనే రమేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి సదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భీమేష్‌ తెలిపారు.

పురుగుల మందు తాగి రైతు..
మొగుళ్లపల్లి(భూపాలపల్లి): పురుగుల మందు తాగి రైతు మృతి చెందిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామ శివారు బద్ధంపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బధ్ధంపల్లి గ్రామానికి చెందిన సామల జయపాల్‌ (40)కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో పత్తి పంటను సాగు చేసుకుంటున్నాడు. కాగా, గత సంవత్సరం దిగుబడి సరిగా రాలేదు. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా పత్తి వేసి సాగు చేశాడు. వర్షాలకు పత్తి పంట ఎర్రబడడంతో సరైన దిగుబడి రాదేమోనని మనస్తాపానికి గురైన జయపాల్‌ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సారయ్య తెలిపాడు.

తాళ్లపూసపల్లిలో..
కేసముద్రం: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని తాళ్లపూసపలిలో చోటుచేసుకుంది. ఎస్సై సతీష్‌ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గువ్వ యాకయ్య(45) భార్య కొంతకాలం క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని భరించలేక మద్యానికి బానిసయ్యాడు, మంగళవారం మద్యం తో పాటు పురుగుల మందు తాగాడు. గమనిం చిన కుటుంబ సభ్యులు అతడిని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ రాత్రి మృతిచెందాడు. మృతుడికి ఇద్ద రు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మద్యానికి బానిసై..
నర్మెట: మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  మాన్‌సింగ్‌తండా పరిధిలోని కొత్త తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన భూక్య బిక్కు (36) కొద్ది కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఆలస్యంగా ఇంటికి చేరుకుని భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. దీంతో భార్య లక్ష్మి ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి నిద్రకు పొరుగింటికెళ్లింది. కాగా, తెల్లవారి లక్ష్మి ఇంటికి చేరుకునే సరికే బిక్కు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వడిచర్ల గోవర్ధన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement