భక్తులకు ఏ లోటు రాకూడదు
విజయవాడ సెంట్రల్ :
పుష్కరనగర్లకు వచ్చే భక్తులకు రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ మంత్రి పి.నారాయణ సూచించారు. మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్తో కలిసి మంగళవారం రాత్రి బస్టాండ్ సమీపంలోని పుష్కరనగర్ను మంత్రి పరిశీలించారు. పుష్కరనగర్లలో వసతులకు లోటు రానీయొద్దని చెప్పారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పుష్కరసెల్ నుంచి తాను ఎప్పటికప్పుడు ఘాట్లు, పుష్కరనగర్లలో ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. భోజన, వసతి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటివరకు నగరంలోని పుష్కరనగర్లలో ఏర్పాటుచేసిన వసతుల గురించి మేయర్ వివరించారు. ఈఈలు ధనుంజయ, టి.రంగారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.